Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆగస్టు 17న ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్ట మీద సుమారు ఏడు నుంచి ఎనిమిది గంటలు గడిపారు. ఇంత తీరిక ఎట్లా దొరికిందని కొందరికి డౌటొచ్చింది. భక్తి ప్రపత్తులే కారణమని మరి కొందరు భావించారు. ఇప్పుడు తీరా చూస్తే సారూ, కారు బొమ్మలు చెక్కించారని బయటపడ్డది. ఇది ముఖ్యమంత్రికి సంబంధం లేదంటారు దేవస్థానం వైస్ఛైర్మన్, ఆర్ట్ డైరెక్టర్లు. రాజుల కాలంలో చేయలేదా? అంటున్నారు. శిల్పులకు స్వేచ్ఛనిచ్చామన్నారు. శిల్పులు కేసీఆర్ను దేవుడిగా భావించారన్నారు. అందుకే చెక్కారనీ.. అన్నారు. వారు దేవుడిగా భావిస్తే వారి సొంత ఖర్చులతో గొప్పశిల్పం చెక్కి సీఎంకు బహూకరించవచ్చు. ప్రజల సొమ్ముతో వారి నమ్మకానికి అనుగుణంగా సీఎం శిల్పం చెక్కి గుడిలో పెట్టే హక్కువారికెవరిచ్చారు? ఏడెనిమిది గంటలపాటు గుట్టమీద గడిపి అణువణువూ పరిశీలించిన ముఖ్యమంత్రికి తన శిల్పం, తమ ఎన్నికల గుర్తు కారు చెక్కిన విషయం గమనించలేదనుకోగలమా? గమనించలేదనే అనుకుందాం. రెండు రోజులుగా ఇంత వివాదం చెలరేగినప్పటికీ, సారూ, కారూ శిల్పాలు తొలగించాలని ముఖ్యమంత్రి ఎందుకు ఆదేశించలేదు. అవి చెక్కడానికి బాధ్యులైన వారి మీద చర్యలెందుకు తీసుకోలేదు? ఇప్పుడే కాదు, ప్రభుత్వ ఖజానా నుంచి తన మొక్కులు తీర్చుకున్న విషయం తెల్సిందే. కారణాలేమి చెప్పినా... వాస్తు కోసమే ఏకంగా సచివాలయాన్నే కూల్చివేస్తున్న విషయం కూడా గమనిస్తున్నాం కదా! గుడులూ, గోపురాలూ, సచివాలయ నిర్మాణం మీద ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల మీద లేదన్నదే ఇప్పటిదాకా విమర్శ. ఇప్పుడు గుడిలో, ప్రజల డబ్బుతో తన శిల్పం, తన పార్టీ గుర్తు చెక్కించటం మరింత ఆశ్చర్యకరం. పైగా రాజాస్థానంలో భజనపరులలాగా దేవస్థానం వైస్ ఛైర్మన్, ఆర్ట్ డైరెక్టర్లు వింతవాదనలు ముందుకు తెచ్చారు. ఈ కాలంలో పాలకులు, ప్రజలు వాడే వస్తువులు చెక్కటంలో తప్పేముందన్నారు. అదే నిజమైతే ఇప్పటి పాలకులందరి బొమ్మలు, అన్ని పార్టీల చిహ్నాలు, అన్ని రకాల వస్తువులెందుకు చెక్కలేదు? చరిత్రలో నేటి గుర్తులుగా మిగిలిపోతాయను కున్నప్పుడు, ఇవన్నీ నేటి పరిస్థితులకు దర్పణం పడతాయి కదా! అసలిది రాచరికం అనుకుంటున్నారా? లేక ప్రజాస్వామ్యమా? ఇవన్నీ ఒక భాగం. భజన పరులు ఎన్నైనా మాట్లాడవచ్చు. లాభం పొందినవారు కాళ్ళు కూడా ఒత్తవచ్చు. అసలు ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదన్నదే అసలు సమస్య.
గుట్టమీది భజనపరులు మరో విషయం బయటపెట్టారు. యాదాద్రి నిర్మాణ విషయాలు ముఖ్యమంత్రి దాదాపు ప్రతిరోజూ సమీక్షిస్తున్నారన్నారు. అంటే.. రాష్ట్రంలో అంతకన్నా ముఖ్యమైన సమస్యలేమీ లేవన్నమాట. యాదగిరిగుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న పాలకులు రైతులకు యూరియా తక్షణం అవసరమన్న విషయం మరిచారు. వ్యవసాయరంగంలో అవసరాలేమిటో, రైతులకేమి కావాలో ముందస్తు జాగ్రత్తలు తీసుకునే తీరిక పాలకులకు లేదు. అధికారులూ గోళ్ళు గిల్లుకుంటున్నారు. ఇప్పుడు రైతులు యూరియాకోసం బారులు తీరి గంటల కొద్దీ ఎదురుచూడవల్సి వస్తున్నది. దుబ్బాకలో రైతు కుప్పకూలి మరణించాడు. ఇందల్వాయిలో మహిళా రైతు నాలుగు గంటలపాటు నిలబడి సొమ్ముసిల్లి పడిపోయింది. అయినా యూరియా కొరత లేదని మంత్రి అంటున్నారు. నాలుగు రోజుల్లో డైరెక్టుగా గ్రామాలకే పంపుతామంటున్నారు ముఖ్యమంత్రి. రాష్ట్రానికవసరమైనంత యూరియా పంపించామంటున్నది కేంద్రం. ఇదంతా దాహం వేస్తున్నదంటే బావి తవ్వటం ప్రారంభించినట్టున్నది. ఇంతకాలం రైతుల అవసరాలు పట్టలేదు పాలకులకు.
ఇప్పటికే ఖరీఫ్ రెండు మాసాలు ఆలస్యంగా మొదలైంది. మరోవైపు గోదావరిలో 100 టీఎంసీలు, కృష్ణానదిలో 70 టీఎంసీల వరదనీరు వృధాగా సముద్రంలో కలిసిపోయింది. రాష్ట్రమంతా కరువు బారిన పడ్డది. అయినా కరువు గురించి సమీక్షించి, తగు చర్యలు తీసుకునే తీరికలేదు ప్రభుత్వానికి. ఆలస్యంగానైనా వర్షాలు మొదలైనాయన్న ఊరటకు కూడా రైతులు నోచుకోలేదు. సమయానికి యూరియా అందుబాటులో లేదు. వందలాదిగా రైతులు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టవల్సి వస్తున్నది.
రాష్ట్రమంతా విషజ్వరాలు విజృంభించాయి. హైదరాబాద్ మహానగరం జ్వరపీడితుల రాజధానిగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రులలో కనీస సౌకర్యాలు లేవు. వేల సంఖ్యలో డాక్టర్లూ, నర్సులూ, ఇతర స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్న సిబ్బంది సెలవులు మానుకుని సేవలు చేసినా అందుకోలేని స్థితి దాపురించింది. జ్వరపీడితుల తాకిడి అనేక రెట్లు పెరిగింది. పైగా ప్రభుత్వ దవాఖానాలలో గానీ, ఈఎస్ఐ ఆస్పత్రులలో గానీ కనీసం మందులు కూడా అందుబాటులో లేవు. మెడికల్ షాపులలో అధిక ధరలు పెట్టి కొనవల్సి వస్తున్నది. ఈఎస్ఐలలో చేసేది ఉచితవైద్యం కూడా కాదు. ఏండ్లతరబడి కార్మికుల జీతాల నుంచి కొంత, యాజమాన్యాల వాటా కొంతా జమచేసుకుంటూ ఉన్నతాధికారులు కొల్లగొట్టడం మీదనే దృష్టిపెట్టారు. రాష్ట్రమంతా జ్వర పీడితులతో అల్లాడుతున్నా పాలకులకు గానీ, వైద్యాధికారులకు గానీ చీమకుట్టినట్టు కూడా లేదు. దిక్కులేక ప్రయివేటు ఆస్పత్రికి పోతే ప్రతిదానికీ డెంగ్యూ అని బెదరగొట్టి కనీసం ముప్పైవేలకు తగ్గకుండా బిల్లు గుంజుతున్నారు. రోగుల అజ్ఞానాన్నీ, భయాన్నీ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు మాత్రం పట్టించుకోలేదు. పైగా ఉన్నట్టుండి దోమలు విజృంభించాయి. 80శాతం జ్వరాలు దోమల ద్వారానే వస్తున్నాయని డాక్టర్లు నిర్ధారిస్తున్నారు. 'స్వచ్ఛ హైదరాబాద్' గురించి ప్రచారం చేసి బిల్లులు ఎత్తుకున్న తర్వాతనే దోమలు విజృంభించాయి. మూసీలో ఒక్కొక్క దోమగుడ్డుకు రూ.300 ఖర్చుచేసి దోమగుడ్లు ధ్వంసం చేసామని ప్రభుత్వం చెప్పుకున్న తర్వాతనే నగరాన్ని దోమలు చుట్టుముట్టాయి. ఇప్పుడు హుస్సేన్సాగర్ దోమల రాజధాని అయ్యింది. చెత్తకుప్పలు దోమల పెంపక కేంద్రాలుగా వర్థిల్లుతున్నాయి. దోమల నివారణ పేరుమీద నిధులు మాత్రం కొందరి బొజ్జల్లో చేరుతూనే ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్యం కార్మికుల గోడు వినే నాథుడే లేడు.
ప్రతిరోజూ యాదాద్రి నిర్మాణం పనులు సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి యూరియా కొరత, విషజ్వరాలూ, వర్షాభావంతో రాష్ట్రవ్యాపిత కరువు పరిస్థితులు మాత్రం సమీక్షించలేకపోతున్నారు. పాలకుల ప్రాధాన్యతల్లో ఇవి లేవు. పాలకులు దేనిమీద దృష్టిసారిస్తే, ఆ పనులే వేగంగా సాగుతాయి. అందుకేనేమో... ఇప్పుడు యాదాద్రి నిర్మాణం పనులూ, సచివాలయం కూల్చివేత పనులే వేగంగా కదులుతున్నాయి. మరి ఓటు వేసిన జనం ఏం కావాలి? వారి గోడు ఎవరు వినాలి?
ప్రభుత్వం పథకం ప్రకారం చేసిన 'భూమి ప్రక్షాళన' కొత్త సమస్యలు సృష్టించింది. సాగుచేసుకుంటున్న లక్షలాది పేద రైతులు తమ భూమి మీద హక్కు కోల్పోయారు. సాగుచేస్తున్నదొకరైతే పాస్బుక్ మరొకరి పేరుతో ఇచ్చారు. పేదల భూములు పెద్దల పరం చేయడమే 'ప్రక్షాళన' అసలు రహస్యమని తేలుతున్నది. లక్షలాది మందికి పాస్బుక్స్ అందలేదు. ధరణి వెబ్సైట్ కనీసం పరిజ్ఞానం లేని కొందరికి ఔట్సోర్స్ చేసిన ఫలితంగా భూమి రికార్డులన్నీ గందరగోళమవుతున్నాయి. పందొమ్మిది లక్షలమంది రైతులకు మొదటి దఫా రైతుబంధు అందుకున్నప్పటికీ రెండవ దఫా అందలేదు. ఓట్ల పండుగవరకు పనిచేసిన సంక్షేమ పథకాలు ఆ తర్వాత కుంటుతున్నాయి. కేసీఆర్ కిట్టుగానీ, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఆడపిల్లను కంటే ఇచ్చే ఇరవైవేలుగానీ నెలల తరబడి పడకేసాయి. సామాజిక పింఛన్లు కూడా రెండు మూడు మాసాలు తిరిగితే తప్ప అందటం లేదు. 2019లో ముఖ్యమంత్రి ధనిక రాష్ట్రం ఊసెత్తలేదు. బడ్జెట్ను తొమ్మిది మాసాలు వాయిదావేసి దాన్నొక విలువలేని క్రతువు స్థాయికి దిగజార్చారు. ఆయా తరగతుల, రంగాల ప్రజలలో అసంతృప్తులు రగులు కుంటున్నాయి.
ప్రజలలో పేరుకుపోతున్న ఆర్థిక, సామాజిక సమస్యలు రాజకీయ రంగంలో కుంపట్లు రాజుకునేందుకు దారితీస్తున్నాయి. తిరుగులేని నాయకత్వంగా భావించిన టీఆర్ఎస్ అధినేతకు కూడా చికాకులు మొదలైనాయి. టీఆర్ఎస్ శ్రేణులలో అసంతృప్తులు రాజుకుంటున్నాయి. మంత్రులు, శాసనసభ్యులలో సైతం గూడుకట్టుకున్న అసంతృప్తి ఎప్పుడైనా బద్దలు కావచ్చునన్నట్టున్నది. సీనియర్ మంత్రి ఈటల ప్రయోగించిన ఈటెలు టీఆర్ఎస్ శ్రేణులలో కదలికకు కారణమయ్యాయి. గులాబీ జెండాకు ఓనర్లమన్నారు. మంత్రిపదవి ఒకరిస్తే వచ్చిన భిక్ష కాదన్నారు. చరిత్ర నిర్మాతలు నాయకులు కాదు... ప్రజలే చరిత్ర నిర్మాతలన్నారు. ఇవి మాటలు కాదు. తూటాలుగా పేలాయి. దీనికి ఎర్రబెల్లి దయాకర్రావుతో కౌంటర్ ఇప్పించటం పుండుమీద కారం చల్లినట్టయ్యింది. పైగా గులాబీ జెండాకు ఓనరు కేసీఆర్ మాత్రమేనని చెప్పటం, ఈటల వివాదం ముగిసిందనీ, ఆయన మంత్రిపదవికి ప్రమాదం లేదని ఆయన భరోసా ఇవ్వటమే భగ్గున మంటలు రేపినట్టయ్యింది. మొదటి నుంచీ ఉద్యమంలో ఉండి, సీనియర్ మంత్రిగా ఉన్న తనకు 'బీటీ' బ్యాచ్లోని మంత్రి భరోసా ఇవ్వటమేమిటని ఈటల లోలోపల భగ్గుమంటున్నారు. మొదటి నుంచీ టీఆర్ఎస్లో లేకుండా 'బంగారు తెలంగాణ కోసం' అనే పేరుతో చేరి మంత్రులైనవారిని 'బీట' (బంగారు తెలంగాణ) బ్యాచ్ అంటున్నారు. దీని ఫలితమేనేమో ఉపాధ్యాయ దినోత్సవం రోజు మళ్ళీ రసమయి బాలకిషన్ బహిరంగ సభలోనే సమస్య ప్రస్తావించారు. వారించిన ఈటల తన ప్రసంగంలో కూడా మళ్ళీ సమస్యను నర్మగర్భంగా తడిమారు. మొదట ఈటల స్పందించిన వెంటనే కేటీఆర్ జోక్యంతో తమ నాయకుడు కేసీఆరేనని ఈటల ప్రత్యేకంగా ప్రకటన చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అంతర్గత సమావేశంలో కూడా ''పదవులు రాగానే కొందరు ఎక్కువగా మాట్లాడుతున్నార''ని కేటీఆర్ పరోక్షంగా హెచ్చరించారు. ఆ తర్వాతే రసమయి బహిరంగ ప్రస్తావన ఇక్కడ గమనించాల్సిన విషయం. ముదురుతున్న ప్రజాసమస్యలు ఒకవైపూ, రగులుతున్న అంతర్గత సమస్యలు మరోవైపూ పాలకుల తలకు చుట్టుకుంటున్నాయి. అయినా.. ఇవేవీ పట్టనట్టు నాయకత్వం మేకపోతు గాంభీర్యంగా వ్యవహరిస్తున్నది. యాదాద్రి, సచివాలయం తప్ప పాలకులకు ఇంకేవీ సమస్యలుగా తోచటం లేదు. నీరో చక్రవర్తిని మరిపిస్తున్నాయి ఈ పరిణామాలు. ఆలోచించవల్సిందిక ప్రజలే!
- ఎస్. వీరయ్య