Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ నేతృత్వంలో ఎన్డీఏ రెండవసారి అధికారంలోకొచ్చి వందరోజులు గడుస్తున్నా మన ఆర్థిక వ్యవస్థ ఇంకా మందగ మనంలోనే కొనసాగు తున్నది. అయినా ప్రధాని మాత్రం ఒకవైపు దేశం ముందుకే దూసుకుపోతోందని సెలవిస్తూనే మరోవైపు ఈ దుస్థితికి గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకాలే కారణమని నిందిస్తున్నారు. కాంగ్రెస్ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టుపట్టించిందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలపై ప్రధాని ఆరోపణల పట్ల ఎవరికీ ఏ అభ్యంతరాలూ లేవు. కానీ ఆ వైఫల్యాల కారణంగానే ప్రజలు కాంగ్రెస్ను కాదని తమకు పట్టం కట్టారన్న విషయాన్ని విస్మరించడమే ఆక్షేపణీయం. అధికారం చేపట్టి ఇన్నేండ్లయినా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శలతోనే కాలం గడపడం తమ వైఫల్యా లను కప్పిపుచ్చుకోవడమేనన్నది రాజకీయ, ఆర్థిక విశ్లేషణలు తేల్చి చెపుతున్న మాట!
హర్యానాలో ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ప్రధాని తమ పాలన వందరోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా గత 60ఏండ్ల పార్లమెంటరీ చరిత్రలో ఎన్నడూలేని విధంగా కేవలం 100 రోజుల్లో అత్యధిక బిల్లులు ఆమోదం పొందడం తమ ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు. గత బడ్జెట్ సమావేశాల్లో 39బిల్లులు ప్రవేశపెట్టి 28బిల్లులను ఆమోదింపజేసుకున్న మాట వాస్తవమే గానీ.. ఈ బిల్లుల ఆమోదానికి తాము అనుసరించిన పద్ధతులు అప్రజాస్వామికమైనవన్న విషయాన్ని మరిచారు. వీటిలో ఏ ఒక్క బిల్లును కూడా సెలక్ట్ కమిటీ, స్టాండింగ్ కమిటీల పరిశీలనకు పంపకపోవడమే ఇందుకు నిదర్శనం. కాగా భిన్నాభిప్రాయాలను, రాజకీయ వైరుధ్యాలను సైతం పక్కనబెట్టి, వామపక్షాలు మినహా దాదాపు అన్ని ప్రతిపక్షపార్టీలు ఏ చర్చాలేకుండా ఈ బిల్లుల ఆమోదానికి గుడ్డిగా చేతులెత్తడం మరో ఉదాహరణ. ఈ చేతులెత్తడం వెనుక నీతి ఏమిటన్నది అందరికీ తెలిసిన విషయమే! ఈ వందరోజుల్లో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పిన ఏలికల వ్యూహాలూ బహిరంగ రహస్యాలే!!
సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి ఆమోదింపజేసుకున్న ఈ బిల్లులన్నీ ప్రజల భవిష్యత్తుకూ, ప్రజాస్వామ్య వ్యవస్థకూ అత్యంత ప్రమాదకరమైనవి కావడం అన్నిటికీ మించిన విషాదం. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కాలరాసే ఆర్టికల్ 370 రద్దు, ఎన్ఆర్సీ బిల్లులు దేశంలో ఎంతటి అనిశ్చితిని సృష్టిస్తున్నాయో, ప్రజాజీవితాన్ని ఎంతటి సంక్షోభానికి గురిచేస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. తమను తాము ముస్లిం మహిళోద్ధారకులుగా వర్ణించుకుంటూ తెచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లు వారి సమస్యను పరిష్కరించకపోగా మరింత సంక్లిష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు తీర్పునిచ్చాక కూడా దానిని క్రిమినలైజ్ చేస్తూ చట్టం చేయడంలోని కుతంత్రం తెలియనిదేమీ కాదు. కార్మికచట్టాల సవరణ బిల్లు, వాహనరంగ బిల్లులు ప్రభుత్వరంగాన్ని దివాలా తీయించి ప్రయివేటు రంగానికి పట్టం కట్టేవే. ఇలా చెప్పుకుంటూ పోతే మోడీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఈ బిల్లులన్నిటిలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికీ, లేదంటే కాకుల్ని కొట్టి గద్దలకు వేసిన చందాన ఉత్పత్తికి చెమటను ధారపోస్తున్న కష్టజీవుల రక్తమాంసాలను కార్పొరేట్లకు ధారపోయడానికి మించిన ప్రయోజనమేమీ కనిపించకపోవడం ఓ వైచిత్రి!
ఇంకోవైపున దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా మారింది. పెట్టుబడుల ప్రవాహం ఎంత ఎక్కువగా ఉంటే ఆర్థిక వ్యవస్థ అంత కళకళలాడుతుందన్నది ప్రభుత్వం చెపుతున్న మాటే. కానీ ప్రధాని కాలికి బలపం కట్టుకుని ప్రపంచమంతా తిరుగుతున్నా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయే తప్ప పెట్టుబడులు వచ్చిందీ లేదు, ఆర్థిక వ్యవస్థ హెచ్చిందీ లేదు. ఇప్పటికే ఆటోమొబైల్రంగం తిరోగమనంలో ఉందనీ, 3.50లక్షల మంది ఉపాధి కోల్పోయారనీ, ఉత్పత్తి, నిర్మాణ రంగాలలో వృద్ధిరేటు పతనావస్థకు చేరిందనీ ప్రభుత్వ గణాంకాలే చెపుతున్నాయి. ప్రజల కొనుగోలుశక్తి హరించుకుపోవడంతో మార్కెట్లో సరుకుల డిమాండ్ తగ్గిపోయింది. అమ్మకాలు క్షీణించడంతో పన్ను వసూళ్లూ సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ వసూళ్ల నమోదు అత్యంత కనిష్టానికి పడిపోయింది. మొత్తంగా జీడీపీ వృద్ధిరేటు రోజురోజుకూ దిగజారుతోంది. తొలి త్రైమాసికంలో ఎనిమిది శాతంగా ఉన్న జీడీపీ వృద్ధిరేటు ఇప్పుడు ఐదుశాతానికి పడిపోయింది. ఇందుకు ముంచు కొస్తున్న మాంద్యమే కారణమన్నది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దేశాన్ని ఇంత తీవ్రస్థాయిలో మాంద్యం చుట్టుముట్టడానికి కారణాలేమిటన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద ఏ సమాధానమూ లేదు. అయినా దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లకు చేరుస్తామంటున్న ఉత్తరకుమార ప్రగర్బాలు ఎవరిని మభ్యపెట్టడానికి!? దేశంలో ఇప్పటి వరకూ కనీవినీ ఎరుగని పెనుమార్పులు ఈ వందరోజుల పాలన ప్రత్యేకత అని ప్రధాని చెప్పడంలోని పరమార్థం ఇదేనా..?!
- రాంపల్లి రమేష్