Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆగస్టు 5, 2019న రాష్ట్రపతి ఆదేశాల మేరకు రాజ్యాంగంలోని 370 అధికరణం రద్దయ్యింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో లఢక్కు ప్రాతినిధ్యం వహించే బీజేపీ ఎంపీ ఉపన్యాసానికి విపరీతంగా ప్రాచుర్యం లభించింది. లఢక్ ఎంపీ ఉపన్యాసంలో జమ్ము కాశ్మీర్లో బౌద్ధులను రెండో శ్రేణి పౌరులుగా చూస్తున్నారని, 370 రద్దు వల్ల కేవలం రాష్ట్రంలో మూడు కుటుంబాలు మాత్రమే నిరుద్యోగు లవుతారని చెపుతుంటే మోడీ, అమిత్షాలు బల్లలు చరుస్తూనే ఉన్నారు. ఆ ఉపన్యాసం విన్నవారికి ఎవ్వరికైనా లఢక్పై ముస్లింల ఆధిపత్యం ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. జమ్ము కాశ్మీర్ రాష్ట్రం యావత్తూ ముస్లింల ఆధిపత్యంలో ఉందన్న భ్రమ కలుగుతుంది. రాష్ట్రాన్ని ఏకం చేసింది ముస్లింలేనని, ఈ ప్రయత్నానికి 370 రక్షణ కవచంగా పని చేసిందనీ, 370 రద్దు చేస్తే రాష్ట్రంపై ముస్లిం ఆధిపత్యం రద్దు అవుతుందన్న కుహనా తర్కమే దీనికి పునాది. ఈ కారణంగానే సామాజిక సాంస్కృతిక ఉద్యమంగా ప్రారంభమైన కాశ్మీరియత్ చివరికి ముస్లిం అస్థిత్వంగా అపప్రధకు లోనైంది. ఈ నేపథ్యంలో అసలు జమ్ముకాశ్మీర్, లఢక్లు విలీనం కావటానికి దారి తీసిన చారిత్రక పరిణామాలు పరిశీలించటం అవసరం. ఈ పరిశీలన వలసపాలనలో ఆధునిక భూస్వామ్య వ్యవస్థ ఎలా వేళ్లూనుకుందో కూడా తెలుసుకునేందుకు ఓ సందర్భం.
వాట్సప్ యూనివర్శిటీల్లో ప్రచారంలో ఉన్నట్టు ఏ ముస్లిం రాజవంశమో, లేదా ఆ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసిన షేక్ అబ్దుల్లా వల్లనో జమ్ము, కాశ్మీర్, లఢక్లు నేడు మనం పిలుచుకుంటున్న జమ్ము కాశ్మీర్ రాష్ట్రంగా విలీనం కాలేదు. 1846లో అమృతసర్ ఒప్పందం పర్యవసానంగా గద్దెనెక్కిన రాజా గులాబ్ సింగ్ హయాంలోనే ఈ మూడు ప్రాంతాలను విలీనం చేసి ఒక రాజకీయ పరిపాలనా యూనిట్గా మారింది. ఇందులో ఏ ముస్లిం రాజు ప్రయోజనమూ లేదు. కేవలం హిందూ రాజు ప్రయోజనం కోసం సాగిన విలీనమే నాటి విలీనం. గులాబ్సింగ్ పాలన కాలంలోనే రాష్ట్రంలో ఆధునిక భూస్వామ్య వ్యవస్థ వేళ్లూనుకుంది. అమృతసర్ ఒప్పందాన్ని వ్యాఖ్యానిస్తూ ''కాశ్మీర్ ప్రాంతంలోని భూములపై కేవలం రాజపరివారానికి మాత్రమే హక్కు ఉందన్న విషయం మీకు తెలుసు. ఈ ప్రాంతంలో రాజు అనుమతి లేకుండా భూముల కొనుగోళ్లు అమ్మకాలు అమృతసర్ ఒప్పందం రీత్యా నేరం'' అని గులాబ్సింగ్ మనుమడు ప్రతాప్సింగ్ నాటి ముఖ్యమంత్రికి రాసిన లేఖలో హెచ్చరిస్తాడు.
రాజకీయ పరిపాలన యూనిట్గా సంక్రమించిన హక్కులను గులాబ్సింగ్ కుటుంబం ఈ ప్రాంతంలో భూములపై వంశపారంపర్యకు హక్కుగా మార్చుకుంది. దీన్ని నాడుకానీ నేడుకానీ దేశభక్తులమని చెప్పుకుంటున్న ఏ బూర్జువా పార్టీ కూడా ప్రశ్నించటం లేదు. అమృతసర్ ఒప్పందం ప్రకారం గులాబ్సింగ్కు ఈ ప్రాంతంలోని భూమ్యాకాశాలు, జలచరాదులపై హక్కులు సంక్రమించినట్టు వ్యాఖ్యానించారు. నాటి కాలానికి చెందిన ప్రముఖ కవి అల్లామా మొహ్మద్ ఇక్బాల్ ఓ పద్యంలో ''ఓ మేఘమా, నవ్వు జెనీవా వైపు పయనిస్తే ఇక్కడ ప్రజలు, భూములు, నదులు, అడవులూ అన్నీ అమ్ముడయ్యాయి. నిజానికి మొత్తం జాతిని మా రాజు కారు చౌకగా కొనేశాడు అన్న కబురు ప్రపంచానికి చేరవేయి'' అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయాలు గమనిస్తే ఓ విషయం స్పష్టమవుతుంది. వలస పాలకులు జమ్ము కాశ్మీర్పై హక్కులు గులాబ్సింగ్కు బదలాయించేంత వరకు ఈ ప్రాంతంలో సహజవనరులు రాజు వ్యక్తిగత హక్కుగా కాక సామూహిక సంపదగా ఉండేవి. ప్రజలకు గానీ పాలకులకు గానీ వినియోగపు హక్కులే ఉండేవి. కానీ గులాబ్సింగ్ జాగీరుగా మారాక ఈ ప్రాంతంలో కాశ్మీరీ పండిట్లు, డోగ్రా రాజపుత్ కుటుంబాలు భూస్వాములుగా పరిణామం చెందాయి. కొద్ది కుటుంబాలు మొత్తం రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల భూములపై గుత్తాధిపత్యం సంపాదించటమే కాక రాజ్యాంగ యంత్రంలో భాగస్వాములయ్యారు. ఈ విధంగా పాలకవర్గంలో పాత్రధారులైన కుటుంబాలు భూస్వాములుగా మారటానికి అనుసరించిన పద్ధతి జాగీర్లు కేటాయింపు. ఈ జాగీర్ల ద్వారా గులాబ్సింగ్ కుటుంబం భూమి శిస్తు వసూలు చేసింది. ఈ పరిణామాలన్నీ వెరసి సమీకృత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ (స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ) రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ శిస్తు వసూళ్లు ఎంత అమానుషంగా ఉండేవో గత రెండు వారాల్లో చర్చించుకున్నాం.
భూ సంబంధాల్లో వచ్చిన మార్పులు స్వయం పోషక తరహా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాదులు వేస్తే డోగ్రా పాలకులు అనుసరించిన ఆర్థిక, వాణిజ్య విధనాలు రాష్ట్రంలోని ఆర్థిక వ్యవస్థను కుంగదీశాయి. పదేపదే కరెన్సీ, పన్నుల విధానాన్ని మారుస్తూ పోవటంతో ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. ఫలితంగా మెజారిటీ ప్రజలకు భూమ్మీద శ్రమే ప్రధాన జీవనాధారంగా మారింది. ప్రజానీకం మొత్తం భూస్వామ్య దోపిడీకి బలైంది. ఈ దోపిడీ నుంచి విముక్తి పొందే లక్ష్యంతో మొదలైందే జమ్ము కాశ్మీర్లో రాజకీయ ఉద్యమం. ఈ ఉద్యమానికి దోపిడీకి గురవుతున్న ముస్లిం రైతాంగ కుటుంబాల నుండే నాయకత్వం వచ్చింది.
భూమ్మీద పూర్తిస్థాయి గుత్తాధిపత్యం కాశ్మీరీ పండిట్లకు, డోగ్రా రాజ్పుత్లకు పరిమితం కావటంతో రాష్ట్రంలోని మిగిలిన ప్రజానీకం యావత్తూ కట్టుబానిసల్లా పని చేయాల్సి వచ్చేది. దానికి సిద్ధం కాని వాళ్లు పొరుగు రాష్ట్రాలకు పొట్టపట్టుకుని పారిపోయిన సందర్భాలను చరిత్ర నమోదు చేసింది. ఇలా పారిపోయే వారిని ఖైదుచేసి సరిహద్దు ప్రాంతాల్లో సైన్యంగా వినియోగించారు. ఈ పరిస్థితుల్లో భూమిపై రైతాంగానికి ఉన్న సాగు హక్కులు రద్దు, బేదఖళ్లు, రైతాంగాన్ని కట్టుబానిసల స్థాయికి దిగజార్చటం స్వాతంత్య్రానికి పూర్వం ఉన్న జమ్ము కాశ్మీర్ భూసంబంధాల్లో రెండు మౌలిక లక్షణాలుగా కనిపిస్తాయి.
ఈ పరిణామాలు 1920 దశకం వరకు ముస్లింలను రాజకీయంగా నిష్క్రియాపరులుగా మార్చింది. సంఘాలు పెట్టడం, పత్రికలు నడపటంపై ఉన్న నిషేధాలు కూడా కాశ్మీర్లోయలో ముస్లిం ప్రజల్లో పరాయీకరణ భావననకు పునాదులు వేసింది. 1921లో తొలిసారిగా డోగ్రా పాలకులు ఖురాన్ పఠనానికి సమావేశాలు ఏర్పాటు చేసుకునే హక్కు కల్పించారు. ఈ సందర్భంగా జరిగే అంజుమన్ కమిటీ సమావేశాల్లో రాజకీయ చర్చలకు అవకాశం లేకుండా పహరా కాయటానికి డోగ్రా ప్రభుత్వం పెద్దఎత్తున నిఘా సిబ్బందిని నియమించింది. ఈ రకమైన సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక అణచివేత కారణంగానే కాశ్మీర్ లోయలోని ముస్లిం ప్రజల్లో ధార్మిక పిడివాదం వేళ్లూనుకోవటానికి పునాదులు వేసింది. దేశంలో పెరుగుతున్న ఇస్లామిక్ తీవ్రవాదాన్ని కాశ్మీర్ చరిత్ర నేపథ్యంలో పరిశీలిస్తే ముస్లిం సమాజంపై సాగుతున్న అణచివేతను ప్రతిఘటించే రాజకీయ రూపాలు వ్యవస్థలు అందుబాటులో లేకపోవటంతో ఈ సమాజం మతోన్మాదం, మతచాంధసం వైపు మళ్లిందన్న నిర్ధారణకు రావల్సి ఉంటుంది. అయితే హిందూత్వ మతోన్మాదానికి ఈ కారణాలు, పరిస్థితులు వర్తించవన్నది సుస్పష్టం.
ఈ అణచివేత నేపథ్యంలో కాశ్మీరీ ప్రజలు అనుసరించిన ఆందోళన రూపాలు ఇలా ఉన్నాయి. అధిక పన్నుల భారం నుంచి శాలువా పరిశ్రమను కాపాడాలంటూ ఆ పరిశ్రమల్లో పని చేసే కార్మికులు, యజమానులు 1847లో తొలిసారి ఆందోళనకు దిగారు. ఇదే నినాదంతో 1865లో శ్రీనగర్ వీధులు దద్దరిల్లాయి. భూస్వాముల దాష్టీకానికి, దమనకాండకు వ్యతిరేకంగా 1877లో కాశ్మీర్ రైతాంగ పోరాటం చరిత్రకెక్కింది. ఈ నేపధ్యంలో డోగ్రా పాలకులు పన్ను విధానంపై అజమాయిషీ కోసం సెటిల్మెంట్ ఆఫీసరును నియమించాలని 1886లో రెండుసార్లు వలస ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. దేశీయ దోపిడీ దారుల పీడన ముందు దేశాన్ని దోచుకోవటానికి వచ్చిన పాలకులే మెరుగ్గా కనిపించే పరిస్థితి తలెత్తిందంటే దేశీయ భూస్వామ్య వర్గపు దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరకు 1906, 1907లో ముస్లిం ప్రజల్లో విద్యాబుద్ధులు చెప్పించటానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ బ్రిటిష్ ప్రభువు లార్డ్ రీడింగ్కు 1924లో దరఖాస్తుల వెల్లువెత్తాయి. జమ్ము కాశ్మీర్ సమాజంలో నెలకొన్న సామాజిక రాజకీయ ఉద్రిక్తతలకు 1924 నాటి పట్టు తయారీ ఫ్యాక్టరీ కార్మికుల తిరుగుబాటు పరాకాష్ట.
ఈ దారుణాలకు చలించిన జమ్ము కాశ్మీర్ రాష్ట్ర రాజకీయ విదేశీ వ్యవహారాల మంత్రి సర్ అలిబోన్ బెనర్జీ 1929 మార్చి 15న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ''జమ్ము కాశ్మీర్ అనేక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. మెజారిటీ గా ఉన్న ముస్లిం జనాభా నిరక్షరాస్యత, దారిద్య్రంతో పశువుల మందలా మారారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సంబంధం లేదు. కనీస అవసరాలు తీర్చటానికి కూడా ప్రభుత్వం సిద్ధం కావటం లేదు... ప్రజ భిప్రాయం అన్నది ఏ కోశాన లేదు. పత్రికా రంగం లేదనే చెప్పాలి'' అని ధ్వజమెత్తారు. ఈ స్థాయిలో దోపిడీకి అణచివేతకు గురైన కాశ్మీరీ ప్రజలు జాతీయోద్యమ స్పూర్తితో డోగ్రా పాలనను అంత మొదించేందుకు ఉద్యమించారు. మనకు నేడు కనిపి స్తున్నట్టు ఇది మతాధిపత్యం కోసం సాగిన పోరాటం కాదు. రాజకీయ విముక్తి కోసం సాగిన పోరాటమే అన్నది తేటతెల్లం.
- కొండూరి వీరయ్య
సెల్: 9871794037