Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ మిగులు నిధుల నుంచి 1.76 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వ ఖర్చుల నిమిత్తం ఇవ్వడానికి అంగీకరించిన మరుసటి రోజే 10 ప్రభుత్వరంగ బ్యాంకులను నాలుగు ప్రభుత్వరంగ బ్యాంకులలో విలీనం చేయాలన్న కీలకమైన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విలీనాలతో ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు తగ్గుతుంది. ఈ ఏడాది మొదట్లో దేనా బ్యాంక్, విజయ బ్యాంకులను బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం చేశారు. అంతకు ముందు 5అసోసియేట్ స్టేట్ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిపేశారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన విలీన ప్రణాళిక ప్రకారం యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనమవుతాయి. విలీనం తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎస్బీఐ తర్వాత రెండవ అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది. ఎస్బీఐ వ్యాపార పరిమాణం (డిపాజిట్లు, రుణాలతో కలిపి) 52.05లక్షల కోట్లు ఉంటే విలీనం తర్వాత పిఎన్బి పరిమాణం 17.94లక్షల కోట్లుగా ఉండబోతున్నది. సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంకులో విలీనం కానుంది. విలీనం తర్వాత 15.2లక్షల కోట్ల వ్యాపారంతో కెనరా బ్యాంకు నాల్గవ పెద్ద బ్యాంకుగా అవతరించనుంది. ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనం కానున్నాయి. విలీనం తర్వాత 14.59లక్షల కోట్ల వ్యాపారంతో యూనియన్ బ్యాంకు ఐదవ పెద్ద బ్యాంకుగా అవతరించనుంది. ఇండియన్ బ్యాంకులో అలహాబాద్ బ్యాంకు కలిసిపోయిన తరువాత 8.08 లక్షల కోట్ల వ్యాపారంతో ఇండియన్ బ్యాంకు ఏడవ పెద్ద బ్యాంకుగా అవతరించనుంది. దేనా, విజయ బ్యాంకులను విలీనం చేసుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా 16.13లక్షల కోట్ల వ్యాపారంతో మూడవ అతిపెద్ద బ్యాంకుగా ఉన్నది.
ప్రభుత్వ బ్యాంకుల విలీనం వల్ల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెపుతున్నారు.. విలీనాలు తర్వాత బ్యాంకులు పెద్ద, గొప్ప బ్యాంకులుగా మారతాయని అంటున్నారు. బ్యాంకుల రుణాలు ఇచ్చే సామర్థ్యం విలీనాల వల్ల పెరుగుతుందని, అవి ప్రపంచంలోని మేటి బ్యాంకులతో పోటీ పడగల సామర్థ్యం తెచ్చుకుంటాయని విలీనాలను సమర్ధిస్తున్న వారంటున్నారు. వాటి పనితీరు, సమర్థత పెరుగుతుందని, రుణాలివ్వడానికి అయ్యే ఖర్చులు తగ్గి బ్యాంకుల ఆర్థిక పుష్టి పెరుగుతుందని ప్రభుత్వం విలీనాలను సమర్థించు కుంటున్నది.
అయితే బ్యాంకుల విలీనాలు నూతన ఆర్థిక విధానాలలో భాగంగా జరుగుతున్నాయి. 1992లో బ్యాంకుల సంస్కరణలపై నరసింహన్ కమిటీని నియమించారు. ప్రభుత్వ బ్యాంకుల సంఖ్యను 5-6కు తగ్గించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులో ప్రభుత్వ వాటాను 33శాతానికి తగ్గించాలని కూడా కమిటీ 1992 లోనే సిఫారసు చేసింది. 1998లో రెండవ నరసింహన్ కమిటీ ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనాలనే కాకుండా, బలంగా ఉన్న ప్రభుత్వ, ప్రయివేటురంగ బ్యాంకుల విలీనాన్ని కూడా సిఫారసు చేసింది. విలీనాలను కేబినెట్ స్థాయిలో నిర్ణయాలు తీసుకొని అమలు చేస్తున్నారు. అయితే విలీనాలకు పార్లమెంట్ ఆమోదం కూడా అవసరమని కొందరి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విలీనాల వల్ల పారు బకాయిలు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతున్నది. అయితే బ్యాంకులకు సంబంధించిన వ్యవస్థాగత లోపాలను సవరించకుండా, సవాళ్లను అధిగమించకుండా విలీనం మాత్రమే బ్యాంకుల సమర్థత పెంచుతుందని బాకీలను తగ్గిస్తుందని చెప్పడం అర్థరహితం. నిజం చెప్పాలంటే మొండి బాకీల సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి విలీనాలను ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారని చెప్పాలి. మొండి బకాయిలకు కారణం బ్యాంకుల అసమర్థత కాదు. కారణం ప్రభుత్వ విధానాలనే చెప్పాలి. సాధారణంగా డెవలప్మెంట్ బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలు ఇస్తాయి. వాణిజ్య బ్యాంకులను కుడా దీర్ఘకాలిక రుణాలు ఇవ్వమన్నారు. వాణిజ్య బ్యాంకులు, రుణాలు ఇవ్వాల్సింది సామాన్య మధ్యతరగతి, రైతులకు, చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకు, అలాగే వ్యాపార సంస్థలకు, డెవలప్మెంట్ బ్యాంకులు ఇచ్చే రుణాలను వాణిజ్య బ్యాంకులు కూడా ఇవ్వడంతో రుణాలలో కార్పొరేట్ రుణాల శాతం పెరిగింది. చివరకు వ్యవసాయ రుణాలలో కూడా అగ్రి బిజినెస్ పేరుమీద పెద్ద కార్పొరేట్ సంస్థలకు రుణాలు ఇవ్వాల్సిన పరిస్థితి బ్యాంకులకు వచ్చింది. సామాన్యులు పొదుపు చేసుకుంటే ఆ సొమ్మును రుణాల పేరుమీద వాడుకుంటున్నది కార్పొరేట్ సంస్థలు మాత్రమే. మధ్యతరగతికి, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, మహిళలకు ఇచ్చే రుణాల సంఖ్య తగ్గింది. చిన్న రుణాల సంఖ్య తగ్గింది. పెద్ద మొత్తాలలో ఇచ్చే రుణాల సంఖ్య పెరిగింది. మధ్య తరహా పరిశ్రమలు, సంస్థలకు ఇచ్చే రుణాలు తగ్గాయి. కుటీర పరిశ్రమలకు ఇచ్చే రుణాలు పడిపోయాయి. వసూలు కాని బాకీలలో 85శాతం కార్పొరేట్ రుణాలే. కొన్ని వందల సంఖ్యలో ఉండే పెద్ద రుణగ్రహీతల నుంచి బాకీలను వసూలు చేసుకోరు. ఈ మధ్య కాలంలో వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని వాటిని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన మాల్యాలు, నీరవ్ మోడీల వంటి ఎగవేతదారుల సంఖ్య కూడా పెరుగుతున్నది. పేదలు, మధ్య తరగతి వర్గాలు రుణాలను తిరిగి చెల్లించలేనప్పుడు వారికున్న కొద్దిపాటి ఆస్తులను కూడా నిర్దాక్షిణ్యంగా జప్తు చేసే బ్యాంకులు కార్పొరేట్ ఎగవేతదారులను ఏమీ చేయలేక పోతున్నాయి.
బ్యాంకుల మొండి బకాయిలను తగ్గించడానికిగాను ప్రభుత్వం కొన్నాళ్ల క్రితం ×అరశీశ్రీఙవఅషy దీaఅసతీబజ్ూషy కోడ్ తీసుకువచ్చింది. దీని వల్ల లాభపడుతున్నది కార్పొరేట్ సంస్థలే కానీ బ్యాంకులు కావు. మొండి బకాయిలకు సంబంధించిన చట్టాలు సరిగ్గా లేనందున వాటిని కార్పొరేట్ సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఈ మధ్యనే ఐబీసీలో కొన్ని సవరణలు తీసుకొచ్చారు. ఇది వివాదాల పరిష్కారంలో కాలపరిమితి, చెల్లించాల్సిన కనీస మొత్తాలకు సంబంధించినవిగా ఉన్నాయి. ఇవి కీలకమైన అంశాలే అయినప్పటికీ, వీటికన్నా ముఖ్యమైన రికవరీ రేటు, ఐబీసీ ద్వారా కాక ఇతర మార్గాల ద్వారా రుణ వివాదాన్ని పరిష్కరించుకోవడం, అలాగే పెద్ద సంఖ్యలో జరుగుతున్న కార్పొరేట్ మొండి బకాయిల రద్దు గురించి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బ్యాంకుల మొండి బకాయిలను మరింతగా పెంచుతాయి. మార్చి 31 నాటికి 1857 కేసులు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ కోసం ఐబీసీ కోడ్ కింద స్వీకరించాయి. ఇందులో 94 కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయి. ఈ 94 కేసులలో 1.75 లక్షల కోట్లు రావాల్సి ఉండగా, బ్యాంకులకు వచ్చింది 75000 కోట్ల మాత్రమే. అంటే మొత్తం బాకీలో రికవరీ అయ్యింది కేవలం 43శాతం మాత్రమే. కార్పొరేట్ సంస్థ మాత్రం రుణం విముక్తి పొందుతుంది. బ్యాంకులకు టోపీ పెడుతున్న ఇలాంటి ఐబీసీ కోడ్ ద్వారా బ్యాంకులకు జరుగుతున్న భారీ నష్టాలను ముద్దుగా హెయిర్ కట్ అని పిలుస్తున్నారు. ఇలా హెయిర్కట్ చేసి ఎన్పీఏల శాతాన్ని తగ్గించామని ప్రభుత్వం బీరాలు పలుకుతున్నది. ఐబీసీ కింద అప్పు ఎగవేతదారు, దాన్ని కొనుగోలు చేసిన కార్పొరేట్ సంస్థలు లాభపడుతున్నాయి. బ్యాంకులు, ప్రజలు మాత్రం నష్టపోతున్నారు.
మొండి బకాయిల ప్రక్షాళన పేరు మీద జరుగుతున్న బ్యాంకుల విలీనాలు నిజానికి బ్యాంకుల ప్రయివేటీకరణకు కోసం అన్నది స్పష్టం. బ్యాంకుల విలీనం సాధారణ ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి దూరం చేస్తుంది. ఇప్పటికే చాలా మంది గ్రామీణ ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థ అందుబాటులో లేదు. ఈ పరిస్థితులలో చాలా మంది సామాన్యులు వడ్డీ వ్యాపారులను, చిట్ ఫండ్ కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వరంగ బ్యాంకుల సంక్షోభానికి కారణం కార్పొరేట్ సంస్థలు తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించ కపోవడమే. దీనికి పరిష్కారం ఈ రుణాలను నిష్కర్షగా వసూలు చేసుకోవడంలోనే ఉంది. రుణాలు వసూలు చేసుకోవడానికి బ్యాంకులకు పూర్తి అధికారం ఇచ్చేట్టుగా చట్టాలు చేయాలి. ఇది చేయకుండా విలీనం పేరుమీద సమస్యను పరిష్కరించుకోవచ్చని చెపుతూ మళ్లీ కార్పొరేట్ సంస్థలకే ప్రయోజనాలను అందించాలని చూస్తున్నారు. బ్యాంకు బోర్డుల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా విలీనం చేస్తున్నారు. బ్యాంకు బోర్డులలో అధికారులు, ఉద్యోగుల ప్రతినిధులు బోర్డు సభ్యులుగా ఉండాలన్న హైకోర్టు ఉత్తర్వులను పక్కన పెడుతున్నారు. విలీనం తర్వాత ఎస్బీఐలో కానీ బ్యాంక్ ఆఫ్ బరోడాలో కానీ పరిస్థితులు మెరుగుపడలేదు. ఉద్యోగుల మీద ఒత్తిడి మరింత పెరిగింది. ఎస్బీఐలో 1000 శాఖలు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 800 బ్రాంచీలుమూత పడనున్నాయి. నూతన వ్యాపారం తగ్గింది. బాకీలు తగ్గలేదు. ఉద్యోగుల సంఖ్య తగ్గింది. నిర్ణయాలు తీసుకోవడంలో చురుకుదనం తగ్గింది. విలీనమవుతున్న బ్యాంకుల టెక్నాలజీ, కోర్ బ్యాంకింగ్ ప్లాట్ ఫార్మ్లు భిన్నంగా ఉంటాయి. దీని వల్ల వచ్చే చిక్కులను పరిష్కరించుకోవడానికే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తుంది. బ్యాంకింగ్ ఆపరేషన్లలో సమస్యలు వస్తాయి. వినియోగదారులు ఇబ్బందులకు గురవుతారు. విలీనాల తర్వాత కూడా సమస్యలు కొనసాగుతాయి. వీటికి పరిష్కారం బ్యాంకులను ప్రయివేటీకరించడమే అన్న వాదన ముందుకు వస్తుంది. కాబట్టి విలీన ప్రక్రియ ప్రయివేటీకరణకు నాంది అని చెప్పాలి. పబ్లిక్రంగ బ్యాంకింగ్ వ్యవస్థను సమర్థించే వారందరూ బ్యాంకుల విలీనాలను వ్యతిరేకిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగులు, యూనియన్లు, ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలను సమర్థించే వారందరూ పబ్లిక్ రంగ బ్యాంకు విలీనాలను వ్యతిరేకిస్తున్నారు.
విలీనాలు బ్యాంకులను బలోపేతం చేస్తుందని, పెద్ద బలమైన బ్యాంకులు ఏర్పడుతాయన్స ప్రభుత్వ వాదనలో పసలేదు. విలీనాల తర్వాత బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను సులభంగా ఉపసంహరించి ప్రభుత్వ వాటాను 50శాతం వరకు తగ్గించుకోవాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. భారత దేశానికి కావాల్సింది పెద్ద బ్యాంకులు కాదు. సాధారణ ప్రజలకు చక్కని బ్యాంకింగ్ సేవలను అందించగల మంచి బ్యాంకులు. బ్యాంకులు పెద్దగా ఉంటే అవి చక్కగా పనిచేస్తాయని అంటున్నారు. కానీ 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఫెయిల్ అయిన లెమాన్ బ్రదర్స్, ఫోర్టిస్ లాంటి బ్యాంకులన్నీ పెద్ద బ్యాంకులే. అప్పుడు భారతదేశానికి సంక్షోభం రాకుండా ఆపింది ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపనీలే. విలీనాల తర్వాత మన బ్యాంకులు ప్రపంచ బ్యాంకుల స్థాయికి చేరుకుంటాయని చెప్పడం కూడా పూర్తిగా తప్పుడు వాదన. ప్రభుత్వరంగ బ్యాంకుల న్నింటిని విలీనం చేసిన తర్వాత కూడా అవి గ్లోబల్ బ్యాంకుల వ్యాపార పరిమాణాలకు సరితూగ లేవు. కాబట్టి మనదేశ అవసరాలకు అనుగుణంగా మన బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలి. గ్లోబల్ బ్యాంకులతో మనం పోటీ పడనవసరంలేదు. వాటిని అనుకరించి బోల్తా పడాల్సిన అవసరం లేదు.
పబ్లిక్ రంగ బ్యాంకులను విలీనం చేస్తున్న ప్రభుత్వం, ప్రయివేటు రంగంలో చిన్న బ్యాంకులను ప్రోత్సహిస్తున్నది. చిన్న బ్యాంకులకు, పేమెంట్ బ్యాంకులకు లైసెన్సులు ఇస్తున్నారు. పబ్లిక్రంగ బ్యాంకుల సమస్యలకు విలీనం మాత్రమే పరిష్కరించగలదని అనుకోవడం పొరపాటు. పబ్లిక్రంగ బ్యాంకులకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం ద్వారా వాటిని రక్షించుకోవచ్చు. మొండి బకాయిలను వసూలు చేసుకోవడానికి బ్యాంకులకు చట్ట బద్ధమైన అధికారాలు ఇవ్వాలి. బ్యాంకుల దృష్టి కార్పొరేట్ బ్యాంకింగ్ నుంచి సోషల్ బ్యాంకింగ్ వైపు మళ్లించాలి. మౌలిక వసతుల కోసం డెవలప్మెంట్ బ్యాంకులను బలోపేతం చేయాలి. ప్రాధాన్యతా రంగాలకు రుణాలను పెంచడం, చిన్న రుణాల సంఖ్యా పెంచాలి. ఎఫ్ఆర్డీఐ బిల్లులోని బెయిల్ ఇన్ నిబంధనలకు వ్యతిరేకంగా పోరాడి ఆ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకోవడంలో ప్రజలు విజయం సాధించారు. బ్యాంకుల జాతీయికరణ అయ్యి 50ఏండ్లు పూర్తి అవుతున్నది. ఈ యాభై ఏండ్లలో పబ్లిక్రంగ బ్యాంకులు ఎన్నో విజయాలను సాధించాయి. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. ఇది కొనసాగాలంటే బ్యాంకు ఉద్యోగుల మద్దతుగా ప్రజలు నిలవాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రజలే కాపాడుకోవాలి.
- కె. వేణుగోపాల్
సెల్: 9440244277