Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తురుష్కరహిత భారత్ సంఘ్ లక్ష్యం. జాతీయ పౌర పట్టిక, జమ్మూ కాశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతాలుగా చీల్చటం, ప్రత్యేక హౌదా, పౌరసత్వ రద్దుల ఉద్దేశమదే. మోడీ ప్రభుత్వ కాశ్మీర్ దిగ్బంధం ఐక్యరాజ్య సమితి స్థిరాభివృద్ధి గమ్యాల మానవ హక్కులను ధిక్కరిస్తోంది. ఈ అమానవీయ అణచివేత హింసకు ఆజ్యం పోస్తుందని, ఉగ్రవాదాన్ని పెంచుతుందని విజ్ఞుల విశ్లేషణ.
కాశ్మీర్ ముస్లింలను ద్వితీయశ్రేణి పౌరులను చేసి సంఘీయ హైందవ జనాభాను పెంచుకోటానికి, అక్కడి భూములను కార్పొరేట్లకు కట్టబెట్టటానికి మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని ఎగతాళిచేసి రాజ్యాంగ నిబంధనలు 370, 35ఎ లను రద్దుచేసింది. ప్రజలపై పలు శిక్షా పద్ధతులు-మూక నిర్బంధాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభన, పోలీసు పాశువికత, వేధింపులూ కొనసాగుతున్నాయి. ఈ అణచివేతలు ఆగగానే నిరసనోద్యమాలు పెల్లుబుకుతాయని అనుమానాలున్నాయి. సంఫ్ు ఏకత్వ సిద్ధాంతాలకు ధీటుగా 'ఒకే పరిష్కారం - తుపాకీ పరిష్కారం' నినాదాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆగస్ట్ 5-27 మధ్య 4000మంది సామాజిక కార్యకర్తలను, 1350మందిని రాళ్ళు రువ్వుతున్నారన్న నెపంతో నిర్బంధించారు. 2000మంది నిర్బంధిత పౌరహక్కుల కార్యకర్తల జాడలేదు. 500 నిరసన ఘటనలు జరిగాయి. భద్రతా దళాలు వేలసంఖ్యలో ప్రజలను బంధించాయి. పిల్లలు, పెద్దలను అపరాత్రుల్లో పట్టుకుపోతున్నారు. ఉగ్రవాదుల, వారి సహకారుల ఆచూకీ తెలపమని హింసిస్తున్నారు. తమ మతస్తులపై గూఢచర్యం నిరాకరించినందుకు తనను బాధించారని 24ఏండ్ల పట్టభద్రుడు రషీద్ తెలిపాడు. ''మా తరఫు గూఢచర్యలకు అంగీకరించకపోతే ప్రజా భద్రత చట్టం కింద కేసు పెడతామని బెదిరించారు. ఈ హింస కొనసాగితే ఆత్మరక్షణకు ఉగ్రవాదుల్లో కలిసి తుపాకీ పట్టుకోటమే మార్గం'' అని రషీద్ వాపోయాడు.
ఆగస్టు 5కు ముందే వేలసంఖ్యలో అదనపు సైనిక దళాలను మోహరించారు. 80లక్షల కాశ్మీరీలను 10లక్షల సైన్యం ''రక్షిస్తున్నది.'' శాశ్వత అజ్ఞాతానికి పంపుతున్నది. ముస్లింల ప్రత్యేక ప్రార్థన దినాలు శుక్రవారాల్లో నిరసన ఘటనలు జరుగుతాయి. అదనపు కాపలా, అనుమాన అరెస్టులు పెరుగుతాయి. శ్రీనగర్కు 40కి.మీ. దూరంలోని పుల్వామా జిల్లా పట్టణం త్రాల్లో గత 3వారాల్లో పలువురు ''సమస్యల సృష్టికర్తలను'' అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వందల మందిని, 12ఏండ్ల పిల్లలతో సహా బంధించి పట్టుకెళ్లారని అక్కడి ప్రజలు చెప్పారు. ఈ భయానక అనుభవాలు పిల్లలను, యువకులను హింసా మార్గాలకు మళ్లిస్తాయని భయంగా ఉందని త్రాల్ నివాసి తారీఖ్ దార్ బాధపడ్డారు. కారణం చెప్పకుండా పట్టుకుపోయి కట్టేసి ఇనుప కడ్డీలతో స్పృహపోయిందాకా కొట్టి స్పృహ తెప్పించటానికి విద్యుత్తు షాక్ ఇస్తున్నారు. ఏడ్వకుండా నోట్లో మట్టి కుక్కుతున్నారు. గడ్డాలకు నిప్పు పెడుతున్నారు. నరకయాతన భరించలేక బాధితులు ఒకేసారి చంపండని కేకలేస్తున్నారు. గాయాలకు ఆయుధాల మందు వెతుక్కుంటున్నారు. అంతర్జాతీయ పత్రికలు, మానవ హక్కుల వేదికలు ఈ ఘోర మానవ హక్కుల ఉల్లంఘనలను ఘోషిస్తున్నాయి. సంఘీయులు ఇది అంతర్గతమని నోర్లు నొక్కుతున్నారు. పాక్ ప్రేమికులే ఇలా మాట్లాడుతున్నారని ఎగతాళి చేస్తున్నారు. ''ప్రత్యేక హౌదా రద్దుతో భారత ప్రభుత్వం మా ఉనికినే ప్రశ్నార్థకం చేసింది. బురాన్ వని లాగా సాయుధ తిరుగుబాటు మార్గం చేపడితే అవమానాలకు ప్రతీకారం తీర్చుకున్నామన్న తృప్తి మిగులుతుంది'' అని త్రాల్ ప్రాంతీయుడు 18ఏండ్ల సమీర్ ఆక్రోశించాడు. ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉల్ ముజాహిదీన్తో చేతులు కలిపినావని 2016లో చంపేశారు. నెలల తరబడి భారత వ్యతిరేక నిరసనలు జరిగాయి. వందల సంఖ్యలో నిరసనకారులను చంపారు. బురాన్ తండ్రి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ముజఫర్వని శాంతి మార్గం బోధించారు. ఉగ్రవాద దళాల్లో చేరవద్దని విద్యార్థులను, యువకులను హెచ్చరించారు. ''70ఏండ్ల నుంచి హింస మాకు అలవాటయింది. ఈ తరం పిల్లలకు హింసను భరించే శక్తి లేదు. ఇప్పుడు అందరూ నిశ్శబ్దంలోకి నెట్టబడ్డారు. ఈ విరామం తర్వాత నిద్రలేచిన పిల్లల, యువకుల ప్రతిక్రియ తెలుస్తుంది'' అని ముజఫర్ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వ పాశవికతకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు, ప్రశాంత ప్రదర్శనలే మార్గమని వేర్పాటువాద నాయకుడు, అఖిలపక్షాల హురియత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సయద్ అలీ షా జీలాని అహింసా పద్ధతులనే సమర్థించారు. ''ఆయుధాలు ధరించి శత్రువు మనలను చంపటానికి సిద్ధంగా ఉన్నాడు. అతనికి మన ప్రాణాలను, ఆస్తులను హరించే అవకాశం ఇవ్వరాదు. ఉక్కు క్రమశిక్షణతో శాంతియుత నిరసన ప్రదర్శనలు మాత్రమే చేయాలి. అప్పుడే మరింతమంది మనతో కలువగలరు. భారత సైనిక దళాలు మనపై దాడిచేస్తే ప్రాణ, ఆస్తుల నష్టాల బాధ్యత వారిదే. ప్రపంచం వారి దుష్కృత్యాలకు సాక్షిగా నిలుస్తుంది'' అని జీలాని హితవు పలికారు. ''నిర్బంధం నిరంతర చర్య. బంధిస్తాం. వదిలిపెడతాం. ఎవరైనా ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్నట్టు నిఘా నివేదిక అందగానే వని, మూసాల లాగా మీ కొడుకు కుక్క చావు చస్తాడని వాళ్ళ తల్లిదండ్రులను హెచ్చరిస్తాం. ఈ ఏడు 70మంది ఉగ్రవాదుల్లో చేరారు. గతేడాది ఇదే కాలంలో 120మంది ఉగ్రవాదులయ్యారు. ఈ ఏడాది 127మంది ఉగ్రవాదులను చంపాం'' అని జమ్మూ-కాశ్మీర్ పోలీసు డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింఫ్ు వివరించారు. జాకీర్ మూసాగా పిలవబడే జాకీర్ రషీద్ భట్ అల్-ఖాయిదాతో సంబంధాలున్న త్రాల్ ప్రాంత ఉగ్రవాద కమాండర్. ఈ ఏడాది మేలో పోలీసు దాడిలో చనిపోయాడు.
తిరుగుబాటుదార్లను తుడిచేయటానికి 2017లో హిందూ జాతీయవాద బీజేపీ ప్రభుత్వం 'ఆపరేషన్ ఆల్ అవుట్' పేరుతో కఠిన అణచివేత అవలంబించింది. ''కాశ్మీర్ నిరసనల అణచివేతకు అధిక సాయుధ బలాల ప్రయోగం వికటిస్తుంది. కాశ్మీర్ ప్రజానీకం కోపంతో ఉంది. ప్రజా ప్రతిఘటన పెరుగుతుంది'' అని ఢిల్లీ రక్షణరంగ నిపుణులు ఎ.ఎస్. దులాత్ విశ్లేషించారు. ''చారిత్రక రాజకీయ తప్పులు కాశ్మీర్లో అధిక హింసలకు దారితీశాయి. నేటి ఘటన ఇంకో అడుగు ముందుకు పోయింది. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హౌదాను కత్తిరించింది. రాష్ట్రేతరులకు ఆస్తి పొందే అవకాశం కల్పించింది. రాష్ట్ర స్థాయిని కేంద్రపాలిత ప్రాంతాలుగా దిగజార్చింది. ప్రధాన స్రవంతి రాజకీయ నాయకుల ప్రాసంగికతను తెంచేసింది. పూర్వ ముఖ్యమంత్రులను, శాసనసభ్యులను, ప్రతిపక్ష నాయకులను, పౌరసమాజ కార్యకర్తలను గృహనిర్బంధంలో ఉంచారు. విమర్శలకు తట్టుకోలేక ఒక శ్రీనగర్ హౌటల్లో మాధ్యమ కేంద్రం ప్రారంభించారు. అందులో అస్మదీయులతో అబద్ధాల ప్రచారానికి ఆస్కారం కల్పించారు. తస్మదీయ వాస్తవ సమాచారాన్ని అడ్డుకున్నారు. వాళ్ళ కెమెరాలకు, ప్రాణాలకు భద్రత లేదు. భవిష్యత్తులో ఇవన్నీ హింసను శిఖరాలకు చేర్చగలవు'' అని జాతీయ భద్రతా విశ్లేషకులు హ్యాపిమన్ జాకొబ్ అభిప్రాయపడ్డారు.
కేంద్ర సంఘ్ ప్రభుత్వం హిందూయేతర కాశ్మీరీలనందరినీ ఉగ్రవాదులుగా ముద్రవేసింది. ఈ నిర్బంధం, అణచివేతలు కొనసాగితే వారి అభాండం నిజమవుతుందేమో! మానవత్వ హత్యతో అభివృద్ధి సాధ్యమా? గవర్నర్ ఉద్యోగ ప్రకటన ముందెందుకు చేయలేదు? అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న మోడీ ప్రభుత్వం అంతర్గత తీవ్రవాదానికి దారిచూపుతున్నది. దీర్ఘకాలిక అణచివేత, బలప్రయోగం ప్రతిఫలన దుష్ఫలితాలకు దారితీస్తాయి. ఉగ్రవాద పూర్వ సమర్థకులు, విజ్ఞులు స్వీయ అనుభవంతో చెప్పిన మాటలు, ఇచ్చిన సలహాలు కాశ్మీర్ యువత పరిగణించాలి. శాంతి సంఘీ భావసమన్వయ మైత్రీ మార్గాన్ని అనుసరించాలి. మోడీ-షాలు తాము సర్వమతస్తులకు, సంపూర్ణ భారతానికి బాధ్యులమని గుర్తెరగాలి. ప్రజల భయాందోళనలను, అనుమానాలను తొలగించాలి.
- సంగిరెడ్డి హనుమంతరెడ్డి
సెల్: 9490204545