Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొందరు చేసే పనులను కథల్లోనుంచో, పురాణాల్లోనుంచో, రామాయణంలోనుంచో, భారతంనుంచో కొన్ని నానుడులను తీసుకొని వాటిని అన్వయించి చెప్పడం వల్ల చాలా తేలికగా అవతలి వారికి అర్థమవుతాయి. మహాకవులు కూడా ఆ పనే చేశారు. ఇంతకీ ఇప్పుడు చెప్పుకునే ధృతరాష్ట్ర కౌగిలి గురించి తెలుసుకుందాం. నిజానికి మనం అంటే తెలుగు వాళ్లం దుర్యోధనుడి వైపు ఉండి మహాభారత యుధ్ధంలో పాల్గొన్నట్టు చరిత్ర ఆధారాలు కొన్ని చెబుతున్నాయి. కాబట్టి ఆయననే బలపరచాలని మనకేమీ రూలు లేదు. అలాగని అతణ్ణి చెడ్డవాడుగా చూడాల్సిన పనే లేదు. నాస్తికులంతా రాక్షసులు, దేవుణ్ణి నమ్మిన వాళ్లు దేవుళ్ళయిపోయారు. అదీ సంగతి.
కురుక్షేత్ర ముగిసింది. పాండవులతో యుధ్ధం చేసిన కౌరవులంతా చనిపోయారు. ధృతరాష్ట్రుడు, గాంధారి బాధపడుతున్నారు. వాళ్లను పరామర్శించడానికి పాండవులు, కృష్ణుడు, కుంతి, ద్రౌపది పోయారు. బాధపడుతూనే గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు భీముణ్ణి దగ్గరికి పిలిచాడు. ఏది నాన్నా ఒక్కసారి నిన్ను కౌగిలించుకోవాలని ఉంది అంటాడు. అన్న రామారావు కృష్ణుడి పాత్రలో ఉంటాడు కాబట్టి ఒక ఉక్కు భీముణ్ణి రెడీగా పెట్టింటాడు. దాన్ని ఆ ముసలాయన ముందు ఉంచుతారు. ప్రేమతో కౌగిలించుకున్నట్టే గట్టిగా ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేస్తాడు. అదీ సంగతి.
ఇక ఇప్పటి భారతానికి వస్తే మన దేశ ప్రధానో, రాష్ట్రపతో పాకిస్థాన్, చైనా వెళ్లి, లేదా అంతర్జాతీయ వేదికలో కలిసి వారితో కరచాలనం చేసి, కౌగిలించుకున్నట్టు ఫోటోలు ఉంటే వెంటనే మన దిన పత్రికల్లో కార్టూనొకటి రెడీగా ఉంటుంది. అదేమంటే కౌగిలించుకున్నా చైనా, పాకిస్థాన్ నాయకుడి చేతిలో ఒక కత్తి ఉంటుంది, దాంతో మన నాయకుణ్ణి స్నేహం నటిస్తూనే పొడుస్తున్నారని అర్థమొచ్చేలా ఉంటుంది ఆ కార్టూను. ఇదీ పైన చెప్పుకున్న కౌగిళ్ల కోవలోకే వస్తుంది. ఇక అమెరికా, ఇంగ్లండ్ మనకు తేడాలు లేకుండా అంతా ప్రపంచీకరణ వైపు ప్రయాణిస్తూన్న ఈ సమయంలో హగ్ చేసుకోవడం అంటే కౌగిలించుకోవడం అన్నది మామూలు విషయం. దానికి మగ, ఆడ అన్న తేడాలు ఉండవు. సినిమా వేదికలపై, అవార్డు కార్యక్రమాల్లో నాయకులు, నాయికలు స్నేహపూర్వకంగా ఈ హగ్ చేసుకోవడం చూడొచ్చు. అందులో తప్పును వెదకాల్సిన అవసరమే లేదు.
మొన్న చంద్రయాన్ ఓ రెండు కిలో మీటర్ల దగ్గర మనల్ని నిరాశ పరిచింది. ఎన్నో దేవుళ్లకు మొక్కి, ఎన్నో హారతులిచ్చి, ఎన్నో ముహూర్తాలు పెట్టినా సైన్సు పరమైన కారణాల వల్ల అది విఫలమైంది. ఐతే ఇంకోసారి ఆ తప్పు చేయకుండా మనం పంపించి విజయం సాధిస్తాం. అది మన శాస్త్రజ్ఞులపై మనకున్న నమ్మకం. ఈ సమయంలోనే ఇస్రో చైర్మన్, ఎంతో కింది స్థాయి నుంచి జీవితంలో పైకొచ్చిన శివన్ను అందరమూ ఓదార్చాం. మన సంఘీభావం ప్రకటించాం. ఈసారి విజయం మనదే అని ప్రకటించాం. ధైర్యం చెప్పాం. ఆయనను ఎందరో కౌగిలించుకొని మరీ ఓదార్చారు. ఐనా వాటిల్లో హై లైట్గా నిలిచింది ఒక్కటే. అది అందరికీ తెలుసు. ఒక ప్రభుత్వ సంస్థ ద్వారా ఇంతటి ప్రగతి సాధించడం, అమెరికా, రష్యా, చైనా కంటే తక్కువ ఖర్చుతో దాన్ని సాధించడం చిన్న మాట కాదు. ఎందరో శాస్త్రవేత్తలు రాత్రీ పగలు కష్టపడి పనిచేస్తుంటారు. అలాంటి సంస్థ ఇస్రో.
కానీ ఈ ధృతరాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులను, బీమా కంపెనీలను, బీఎస్ఎన్ఎల్ లాంటి నవరత్నాలను నష్టాల పాలు చేసి వాటిని చవగ్గా అమ్మే అలవాటుని కొనసాగిస్తున్నాయి. ఒకపక్క మంచిగా మాట్లాడుతూనే వెనకనుంచి కత్తితో పొడిచే ఆ కార్టూన్లను మనమిప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ ధృతరాష్ట్ర కౌగిలిలో ప్రేమ లేదన్న విషయం, కసి మాత్రమే ఉందన్న విషయం ఇప్పుడందరూ తెలుసుకోవాలి. మనల్ని మనం రక్షించుకోవాలి. ఏది ప్రేమపూర్వక కౌగిలి ఏది ధృతరాష్ట్ర కౌగిలి అని కనుక్కునే విషయంలో జాగ్రత్త వహించాలి. ఉక్కు భీముడు మనదగ్గర లేకపోయినా ఉక్కు సంకల్పంతో ముందుకు సాగాలి. కపట ప్రేమ చూపించే, మనుషులందరినీ విడగొట్టే విష కౌగిళ్ళేవో తెలుసుకోవాలి. నిజమైన దేశ భక్తులెవరో, దొంగ దేశ భక్తులెవరో అందరూ తెలుసుకొనేలా చేయాలి. అలాంటి దొంగ కౌగిళ్లకు పడిపోరాదు.
- జంధ్యాల రఘుబాబు
సెల్: 9849753298