Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమ నటిస్తూనే ధృతరాష్ట్రుడు భీముణ్ణి కౌగిట్లో నలిపి చంపాలనుకున్నాడు. సమయస్ఫూర్తితో కృష్ణుడు కాపాడాడు. మోడీ ఇస్రో అధ్యక్షుడు శివన్ను రాజకీయలబ్దితో వాటేసుకున్నారు. వీపు నిమిరి ఓదార్చారు. ఇది సంఘ్ గరళ కౌగిలి. రెండు నెల్లముందే ఇస్రో ఇంజినీర్ల, శాస్త్రవేత్తల భత్యాలు కోయించారు.
సరిహద్దుల్లో సైన్యంతో మీరిక్కడున్నారు కాబట్టి మేమక్కడ దీపావళి జరుపుకోగలుగుతున్నామంటారు ప్రధాని. ఇక్కడికొచ్చి సైన్యం సౌకర్యాలు కోసేస్తారు. 2014 ఎన్నికల వాగ్దానం 'ఒక పదవి ఒక పింఛను' పథకాన్ని ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదు. ఇస్రో ప్రచారకర్తగా 2019 ఎన్నికల లబ్ది పొందారు. ఇప్పుడు చంద్రయాన్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలను కున్నారు. విఫలంతో ఖాతాకు గండిపడిందని కోపంతో లేచివెళ్లారు. భావోద్వేగాలతో ప్రజలు సమస్యలు మరిచిపోతారని 2019 ఎన్నికలు రుజువు చేశాయి. తెల్లారి మనసు మార్చుకొని ఉద్వేగ లబ్దికి శివన్ను వాటేసుకొని లోకం కండ్లుగప్పారు. మరునాటి హర్యానా ఎన్నికల ప్రచారంలో ఇస్రోను మరోలా వాడుకున్నారు. ''ఇస్రో శాస్త్రవేత్తల కృషికి దేశం గర్విస్తోంది. ఏ దేశం శోధించని చంద్రుని దక్షిణ ధృవం చేరటం చంద్రయాన్-2 లక్ష్యం. చివరి క్షణంలో సందిగ్ధం ఏర్పడింది. మన దక్షిణ ధృవ ప్రయత్నమే పెద్ద విజయమని నిపుణులు, విద్యావేత్తలు అన్నారు.'' ఏ సంఘ నాయకుడు సాధించని దక్షిణ భారత ఎన్నికల విజయ యత్నం విఘ్నమైందని మోడీ బాధ. పాలనలో, సైన్స్ సమావేశాల్లో పుక్కిటిపురాణ ఊహాగాథల్ని విజ్ఞాన శాస్త్రాంశాలుగా ప్రచారం చేసిన మోడీ శాస్త్రీయ జ్ఞానం పొందారా?
ఇస్రోను ప్రపంచమంతా పొగుడుతోంది. నిద్రాహారాలు మాని పనిచేసే మోడీ చంద్రయాన్-2 ప్రణాళికల్లో తలమునకలుగా ఉన్న ఇస్రో ఇంజినీర్ల జీతాలు కోశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నాటి ప్రభుత్వం ఇస్రో ఇంజినీర్లకు 1996 జనవరి నుంచి 2 ఇంక్రిమెంట్లు మంజూరుచేసింది. ఇస్రోలో క్రింది స్థాయి ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు పరీక్షలు రాసి పై గ్రేడ్ అందుకుంటారు. అమెరికా డాలర్లు, సాఫ్ట్ వేర్ ఉద్యోగాల వైపు పరుగులు తీస్తున్న యువ ఇంజినీర్లను ఆకర్షించటానికి, ఉన్నవారిని నిలుపుకోటానికి, ఈ ప్రోత్సాహక ఇంక్రిమెంట్లు ప్రేరకాలుగా పనిచేశాయి. మోడీ ప్రభుత్వం ఈ ఇంక్రిమెంట్లను జులై 1 నుంచి ఆపేసింది. దీనితో 90శాతం సిబ్బందికి నెలకు రూ.10,000 తగ్గింది. 6వ కేంద్ర వేతన సంఘం అంతరిక్ష విభాగ శాస్త్ర సాంకేతిక నిపుణులకు పనితీరు సంబంధ ప్రోత్సాహకాలను 40శాతం వరకు తగ్గించాలని నివేదించిందని ప్రభుత్వ వివరణ. ఈ కోత భవిష్యత్తులో జీతంలో 40శాతం వరకు ఉంటుంది. 1996 అదనపు ఇంక్రిమెంట్లు కొనసాగించాలని 6వ వేతన సంఘం సిఫారసు చేసింది. ఐనా కోత విధించింది. ఇస్రో సిబ్బందిపై మోడీ కురిపించిన ప్రశంసల వర్షం ముఖస్తుతికేనా? వాళ్ళు పనిచేయనిదే ఇస్రోకు ప్రపంచ ఖ్యాతి వచ్చిందా? 7వ వేతన సంఘ నివేదిక జనవరి 2016 నుంచి అమలైంది. ఇప్పుడు 6వ వేతన సంఘ నివేదిక గుర్తొచ్చిందా? ఐనా ఈ ఇంక్రిమెంట్లు ప్రోత్సాహకాలు కావు. జీతంలో భాగం. ఈ ప్రోత్సాహక ఇంక్రిమెంట్లను జీతంలో భాగంగా పరిగణించాలని సుప్రీంకోర్టు తన ఆదేశంలో పేర్కొంది. ఈ కోత సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కింది. స్పేస్ ఇంజినీర్ల అసోసియేషన్ మొరపెట్టుకున్నా, రాజ్యసభలో అభ్యంతరం తెలిపినా కోత ఆగలేదు.
యాజమాన్య దౌర్జన్యాలు కార్మికులు ఎదుర్కోలేరని పూర్వ ప్రభుత్వాలు శ్రామికుల జీతభత్యాల రక్షణకు 44 కార్మిక చట్టాలు చేశాయి. వీటిని మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా రద్దుచేసింది. వాటి స్థానంలో కార్పొరేట్ల అనుకూల 2చట్టాలు చేసింది. మరో 2 బిల్లులు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఆదర్శ యజమానిగా ఉండాలని కోర్టులు తీర్పులిచ్చాయి. ఇస్రో మానవసహిత అంతరిక్షనౌక పథకం గగనయాన్ రూపొందిస్తోంది. దీనికి 86మంది సిబ్బంది నియామకానికి ప్రకటన ఇచ్చింది. అభ్యర్థులు ప్రోత్సాహకరంగా లేరని తెలుస్తోంది. ఇస్రోలో ఇంజినీర్ల వార్షిక వేతనాలు రూ.1.5 - 6.12 లక్షలు. ఇప్పుడు 10వేల తాజా కోత. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కూడా ఐఐటీ ఇంజినీర్ల వార్షిక జీతం రూ.9 - 12లక్షలు. అమెరికా స్వతంత్ర అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వార్షిక బడ్జెట్ 21.5 బిలియన్ (100కోట్లు) డాలర్లు. ప్రభుత్వాధీన భారత ఇస్రో వార్షిక బడ్జెట్ కేవలం 1.8బిలియన్ డాలర్లు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు అసత్య వాణిజ్య ప్రకటనల వార్షికాదాయం రూ.35కోట్లు. నటుడు అక్షరు ఖన్నా గతేడాది సంపాదన రూ.444కోట్లు. స్ఫూర్తిరహిత క్రీడాకారుల, వినోదవినాశక నటుల ఆదాయాలు అంతరిక్ష ఇంజినీర్ల, శాస్త్రజ్ఞుల జీతభత్యాల కంటే ఎక్కువ!
నెహ్రూను అపకీర్తి పాలు చేయటానికి మోడీ ఏమైనా చేస్తారు. సంఫ్ు ఆయనకు తందానా అంటుంది. ఇస్రో నెహ్రూ దార్శనికత ఫలితమని మోడీయులు గుర్తించాలి. ప్రధాని సమస్యల పరిష్కారాలు మాని ప్రజల ఉద్రేకాలు, ఉద్విగతలతో ఓట్లు తెచ్చుకోవచ్చు. దేశాన్ని అధోగతి పాలు చేయటం ఖాయం. టీవీలలో ఇస్రో చంద్రయాన్ యానాన్ని తిలకించిన లక్షలాది యువత ప్రభుత్వ శాస్త్రవిరుద్ధతను, శ్రామికవిరోధాన్ని, కార్పొరేట్ పక్షపాతాన్ని అర్థంచేసుకోవాలి. ప్రజాహిత సిద్ధాంత నియమనిబద్ధ విజ్ఞానదాయక, భవిష్యత్తు దార్శనిక నాయకులు మనకు అవసరం. పౌరసామాజికులా? సామ్యవాదులా? వామపక్షీయులా? ప్రజలు తేల్చుకోవాలి.
- ఎస్.హెచ్
సెల్: 9490204545