Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వామ్మో డెంగ్యూ.. వైరల్ఫీవర్, టైఫాయిడ్.. ఈ రోజు ఎవరిని కదిలించినా వీటిల్లో ఏదోఒకటి తనకో.. తన బిడ్డో, భార్యో మంచపట్టారని చెబుతున్నారు. ఓవైపు జనం ఒళ్లు, మరో వైపు ఇండ్లు గుల్లవుతున్నాయి. రక్త పరీక్షలు, మందులతో ప్రతి ఇల్లూ ప్రయోగశాలగా మారుతున్నాయి.జ్వరం తగ్గిన తరువాత కూడా మరో నెల రోజులు కోలుకోని స్థితిలోకి నెట్టబడ్డారు. గురువారం హైదరాబాద్లోని ఓ కమ్యూనిటీ ఆసుపత్రిని పరిశీలిస్తే నెల కిందట వాళ్లు రోజుకు 20 మంది రోగులను పరీక్షిస్తే నేడు ఆ సంఖ్య 150కి చేరిందంటున్నారు. ప్రధాన ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, పీహెచ్సీలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే ఇంచుమించు రాష్ట్రమంతా రోగగ్రస్తమైంది. ముఖ్యంగా డెంగ్యూ, వైరల్ ఫీవర్ మహమ్మారిలా వ్యాపించాయి.
గతేడాది వరకు పదుల సంఖ్యలోనే నమోదయ్యే ప్రాణాంతక డెంగ్యూ కేసులు రికార్డు స్థాయికి చేరాయి. హైదరాబాద్లో కేవలం వారంలోనే సుమారు 1200 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో కలిపితే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష దాటే ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే పదుల సంఖ్యలో డెంగ్యూతో చనిపోయారు. ముఖ్యంగా ఇది చిన్నారులను పీడిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. హైదరాబాద్లో గురువారం ఒక్క రోజే నలుగురు చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ, మారుమూల అత్యంత వెనకబడ్డ గ్రామాల్లో పరిస్థితి చేయిదాటుతోంది. ఇదో విపత్తు అని చెప్పడానికి ఇంతకన్నా ఆధారాలు అక్కర్లేదు. ఈ ప్రమాదకర స్థితిలోకి రాష్ట్రం నెట్టివేయబడుతున్నదని మీడియా, వైద్యరంగ నిపుణులు నెల రోజుల క్రితమే హెచ్చరించారు. కానీ ఈ సర్కారు మాత్రం చేతులు కాలినా.. ఆకులు పట్టడంలేదన్నది జనం మాట. ఓపీ సమయాన్ని పెంచడం, సెలవులేకుండా డాక్టర్లు పనిచేయడానికి ఆదేశాలీయడం మినహా చేసిందేమీ లేదు. అరకొర సిబ్బంది, వైద్యులు రాత్రింబవళ్లు పనిచేసినా అందుకోలేని స్థితే ఉంది. రాష్ట్ర ఉన్నత ధర్మాసనం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. పెరుగుతున్న రోగులకు సరిపడా వైద్య సదుపాయాలు, పడకలు, డాక్టర్లు, వైద్య సిబ్బంది లేరని ఆక్షేపించింది. రోగుల సంఖ్యతో పోలిస్తే పదో వంతు కూడా సౌకర్యాలు లేవని అభిప్రాయపడింది. దాహమేసినప్పుడే బావి తవ్వినట్టు.. ఔట్సోర్సింగ్పై సిబ్బందిని నియమించాలని, హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి నిన్నమొన్నే ఆదేశాలిచ్చారు. అవి అమలయ్యే సరికి పుణ్యకాలం కాస్త గడిచి పోతుంది.
సర్కారు ముందస్తు చర్యలు లేని ఫలితంగానే ఈ ముప్పు సంభవించిందనేది కాదనలేని సత్యం. సహజంగానే ప్రజల ఆకలి తీర్చడం, ఆరోగ్యం కాపాడ్డం పాలకుల బాధ్యత. అలాంటిది స్వయంగా చేసిన పాపం, తీవ్ర నిర్లక్ష్యం వల్ల తలెత్తిన ఈ విపత్తు నుంచి రక్షించే పని పూర్తిగా పాలకులదే. అయినా సర్కారు నిద్రమత్తులోనే ఉంది. 'నగరానికి డెంగ్యూ' 'దోమల రాజధానిగా హుస్సేన్సాగర్' 'వ్యాధుల గుప్పిట్లో రాష్ట్రం' వంటి శీర్షికలతో మీడియా హెచ్చరిస్తున్నా.. హైదరాబాద్లోనూ ఇప్పటి వరకు చేసింది శూన్యం. నగర వీధుల్లో నజర్ పెడితే స్వచ్ఛభారత్ చక్కదనం కనిపిస్తుంది.
సాధారణ రోజుల్లో ఈపని ఆరోగ్యశాఖ మాత్రమే చేస్తుంది. కానీ ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖలు, సిబ్బంది ఈ పనిలో దిగబడాలి. అన్ని స్థాయిల అధికారులు, మంత్రిత్వ శాఖలతో సంబంధం లేకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులందరూ కదలాలి. పనివిభజన చేసుకొని మరీ జనం బాట పట్టాలి. ఇప్పటి వరకు ఈ పని తమకెవరికీ సంబంధం లేనట్టుగానే సాగుతున్నది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సమస్యగానే చూస్తున్నారు. మంత్రి ఈటెల ఒక్కరే గ్రామాలు సందర్శించినట్టు వచ్చిన వార్తలే అందుకు నిదర్శనం. ఆయన రెండు రోజుల్లోనే ఆరు గ్రామాలు సందర్శించారు. సొంత నియోజకవర్గంలో ఓ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. కానీ ఇది సరిపోదు. సమస్య జఠిలమైంది. ఇలాంటి సందర్భాల్లో జిల్లా కేంద్రాల్లో రోజువారీ సమీక్షలు జరగాలి. వ్యాధుల ప్రభావిత గ్రామాలను ఎక్కడికక్కడ గుర్తించి నోటిఫై చేయాలి. ఒక ఊర్లో 10కి పైగా కుటుంబాలు జబ్బుపడితే వెంటనే ఆ గ్రామం మొత్తాన్ని అప్రమత్తం చేయాలి. మురికి కుంటలు, దోమల ఉత్పత్తి కేంద్రాలన్నింటా గంబూజియా చేపలు వేయాలి. ఇవి లార్వా స్టేజిలోనే తినడం వల్ల దోమలు పుట్టవు. ఆయా కేంద్రాల్లో కిరోసిన్ స్ప్రే చేయాలి. ఊరూరా, వాడ వాడలా కిరోసిన్, మలాథియా కలిపిన ఫాగింగ్ చేపట్టాలి. అందుకు అవసరమైన యంత్రాలను పెద్ద ఎత్తున తెప్పించాలి. ప్రభావిత గ్రామాలు, నిరంతరం దోమలకు ఆవాసాలుగా ఉంటున్న అటవీ, నీటి నిల్వ ప్రాంతాల్లో దోమతెరలు పంపిణీ చేయాలి. దోమల నివారణ కాయల్స్ తయారీకి వినియోగిస్తున్న సెంటుగడ్డిని ప్రతి ఇంటా పెంచుకునేలా చర్యలు చేపట్టాలి. ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించే చర్యలు తక్షణం చేపట్టాలి. పెరుగుతున్న ప్రమాద స్థితిని ఏరోజుకారోజు అంచనా వేయాలి. లైయింగ్ డిపార్ట్మెంట్స్(పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, గ్రామీణ నీటిపారుదల శాఖ, విద్యుత్) మధ్య సమన్వయం, అధికారుల్లో జవాబుదారీతనం పెంచాలి. రాత్రిళ్లు దోమల నుండి రక్షణ కల్పించేందుకు కరెంటు కోతలు అరికట్టాలి. సచివాలయం కేంద్రంగా కూడా ఈ పనుల్ని సమన్వయం చేసే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి సహా అందరూ అప్రమత్తం కావాలి. సీఎం స్వయంగా రంగంలోకి దిగాలి రోజువారీగా ఈ పరిస్థితిని ఆరా తీయాలి. ఒకట్రెండు ప్రాంతాలైనా ఇప్పటికే సందర్శించి ఉండాలి. ఇప్పటికైనా వెళ్లాలి. ప్రతి రోజూ కనీసం ఓ గంట సేపు పరిస్థితిని సమీక్షించాలి. ప్రజలు, స్వచ్చంద సంస్థలూ, ప్రయివేటు ఆసుపత్రులనూ భాగస్వాములను చేయాలి. అవగాహనా కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలి. సంచార ఆరోగ్య కేంద్రాలను వాడవాడకూ తీసుకెళ్లాలి. వ్యక్తిగత పరిశుభ్రత, వచ్చాక తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు వివరించాలి. అన్ని విధాలా జనాన్ని అప్రమత్తం చేయాలి. సర్కారు దగ్గర సరిపడా యంత్రాంగం, వసతులు లేని ఈ దశలో రక్త పరీక్షలు, కొన్ని రకాల చికిత్సలు కూడా ఉచితంగా చేసే విధంగా ప్రయివేటు ఆసుపత్రులనూ సర్కారు ఆదేశించాలి. డెంగ్యూ వ్యాధి నిర్ధారణ సహా, చికిత్సలు రాష్ట్రంలోని ఎక్కడైనా ఉచితంగానే అందజేయాలి. ఈ విపత్కర పరిస్థితుల్లో జనాన్ని ఆదుకోవాలని చెప్పాలి. రైతులు కరువులో, ప్రజలంతా మాంద్యంలో చిక్కుకున్నారు. ఈ స్థితిలో ప్రజలు తిండిగింజలకు కూడా తిప్పలు పడుతున్నారు. అయినా బతికితే చాలు అనుకుంటూ వేలకు వేలు అప్పో సప్పో చేసి మరీ ప్రయివేటు ఆసుపత్రులకు ధనం ధారపోస్తున్నారు.
ఎపడమిక్(వ్యాధుల ముప్పు) దృష్టితో ప్రీమాన్సూన్ యాక్షన్స్ కింద ఇందులో సగం పనులైనా మూడు నెలల క్రితం చేసి ఉంటే ఈ రోజు ఈ దుస్థితి వచ్చేది కాదు. ఆ రోజు అసలే పట్టని సర్కారు ఈ రోజైనా పట్టించుకోకపోవడం ఎంత మాత్రం క్షమార్హం కాదు. ఇప్పటికే మాంద్యం సాకుతో సంక్షేమం నుంచి సర్కారు తప్పుకున్నది. నిజాయితీ, నిబద్ధతను, ప్రజల పట్ల బాధ్యతను చాటుకోవాల్సిన దశలో ప్రజల దృష్టిని రాజకీయాలవైపు మళ్లిస్తున్నారు. ఇంటిపోరుపైనే దృష్టిపెట్టారు. ఈ స్థితిలో మీడియా కూడా అటువైపు మళ్లింది. ప్రస్తుతం ప్రజల ప్రాణాలకు ముప్పువచ్చింది. ఇప్పటికైనా సర్కారు నిద్రమత్తు వీడాలి. వ్యాధులు అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ప్రజల ప్రాణాలను కాపాడాలి. అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి పరిస్థితిని సమీక్షిం చాలి. అవసరమైన సలహాలూ సూచ నలూ తీసుకోవాలి. కలిసికట్టుగా ఎదుర్కోవాలి. 'ఆరోగ్య అత్యవసర స్థితి' ప్రకటించాల్సిన అవసరమున్న దశలో కనీసం ఈ పనులైనా బాధ్యతగా స్వీకరించాలి.
- కొలిపాక నాందేవ్
సెల్: 9490099387