Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్మూ కాశ్మీర్లో డోగ్రా పాలకుల దాష్టీకం, భూస్వామ్య దోపిడీ తీవ్రత గురించి గత రెండు శీర్షికల్లో చర్చించుకున్నాం. ఈ శీర్షికలో ముస్లిం కాన్ఫరెన్స్గా మొదలై నేషనల్ కాన్ఫరెన్స్గా పరిణితి చెందిన జమ్మూ కాశ్మీర్ ప్రజాతంత్ర ఉద్యమ గమనం గురించి తెలుసుకుందాం. ఈ కాలంలోనే అంతో ఇంతో విద్యావంతులైన యువకులు శ్రీనగర్ కేంద్రంగా ముస్లిం అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించారు. వాళ్ల లక్ష్యమంతా జమ్మూ కాశ్మీర్లో ప్రజాతంత్ర ప్రభుత్వం, కనీసం ప్రజలకు జవాబుదారీ అయిన ప్రభుత్వం కోసం ప్రయత్నం చేయటమే. షేక్ అబ్దుల్లా, మీర్వాయిజ్ల నాయకత్వంలో నడిచిన ఈ అధ్యయన కేంద్రం 1932 నాటికి నిర్దిష్ట రాజకీయ ఆందోళన కేంద్రంగా రూపాంతరం చెందింది. అప్పటి వరకు ముస్లిం అధ్యయన కేంద్రంగా ఉన్న ఈ వేదిక 1932 నాటికి అఖిల జమ్మూ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్గా మారింది. వ్యవస్థాపక నేత షేక్ అబ్దుల్లా. 1930-32 మధ్యకాలంలో డోగ్రా భూస్వామ్య రాచరికానికి వ్యతిరేకంగా ఆందోళన సాగిస్తున్న ముస్లిం నాయకుల ఊచకోత జరిగే వరకు ఈ ప్రాంతంలో ముస్లిం రాజకీయాలను అవిభక్త పంజాబ్కు చెందిన ముస్లిం నేతలే ప్రభావితం చేసేవారు. 1932లో అఖిల జమ్మూ కాశ్మీర్ ముస్లిం మహాసభ వార్షిక సమావేశాలకు షేక్ అబ్దుల్లా అధ్యక్షత వహించే వరకు ఈ ప్రాంత రాజకీయాలు హిందూ డోగ్రాల పాలకులకు వ్యతిరేకంగా ముస్లిం ప్రజల ఉద్యమంగా మతం రంగు కప్పుకునే సాగింది. కాశ్మీర్ లోయ ప్రజలు ఎదుర్కొనే సమస్యలను హిందూ-ముస్లిం సమస్యలుగా ప్రతిబింబించటం ప్రజలకు న్యాయం చేయటానికి దోహదం చేయదని షేక్ అబ్దుల్లా గుర్తించటానికి ఎంతోకాలం పట్టలేదు.
జన సమీకరణకు, జనాన్ని చైతన్యపర్చటానికీ షేక్ అబ్దుల్లా మసీదులు, దర్గాలను వేదికలుగా మార్చుకున్నప్పటికీ ముస్లిం కాన్ఫరెన్స్ నాయకత్వం లౌకిక విలువలు, లౌకిక స్ఫూర్తే తమ మౌలిక విధానంగా వ్యవహరించింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వం అన్న భావనను ముందుకు తెచ్చిన అబ్దుల్లా ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న భూభాగంలోని ప్రజలందరికీ బాధ్యత వహించేదిగా ఉండాలన్న సాధారణ సూత్రమే ప్రచారంలో పెట్టారు. సంస్థానంలో ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించటం అంటే ముస్లింలకు కూడా ఇతరులతో పాటు సమాన హక్కులు, అవకాశాలు కల్పించటమే. ఈ నినాదాన్ని కాశ్మీరీ పండిట్లు పూర్తిగా వ్యతిరేకించారు. దీనికి రెండు కారణాలు. ముస్లింలకు కూడా సమాన హక్కులు అవకాశాలు అంటే అప్పటి వరకు రాజ్యాంగయంత్రంలో కాశ్మీరీ పండిట్లు, డోగ్రాలు సాగిస్తున్న ఏకఛత్రాధిపత్యం అంతమవుతుంది. ప్రభుత్వ పదవుల్లో ఇతర సామాజిక తరగతులకు కూడా అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. ఇక రెండో కారణం పూర్తిగా ఆర్థికపరమైనది. రాజకీయ విద్యా సాంస్కృతిక రంగాల్లో సమానత్వం అన్న నినాదాన్ని అంగీకరిస్తే ఆర్థిక రంగంలో కూడా అటువంటి సమానత్వం కోరతారని రాష్ట్రంలో భూమితో సహా అన్ని రకాల ప్రకృతివనరులపై గుత్తాధిపత్యం చలాయిస్తున్న కాశ్మీరీ పండిట్లు ఈ నినాదాన్ని వ్యతిరేకించారు. అన్ని సామాజిక తరగతుల్లో ఉన్నట్టే కాశ్మీరీ పండిట్లలో కూడా చిన్నదే అయినా ప్రజాతంత్ర స్వభావం కలిగిన ఓ తరగతి ఉంది. మొత్తం సమాజం యావత్తూ తేలిగ్గా విశ్వసించే నినాదాల హౌరులో కొట్టుకుపోవటం, దాన్ని వ్యతిరేకంగా హేతుబద్ధంగా ఆలోచించి వ్యవహరించే ఓ చిన్న సమూహం నిలబడటం ఏ సమాజంలోనైనా జరుగుతూ వచ్చిన పరిణామమే. ఈ పరిణామమే సమకాలీన భారతదేశంలో కూడా కనిపిస్తుంది.
ఈ వైరుధ్యంతోనే ముస్లిం కాన్ఫరెన్స్ ఆందోళన వెనక ఉన్న రాజకీయ ఆర్థిక నినాదాలను మరుగున పెట్టి కేవలం ఇది ముస్లింల అస్థిత్వ నినాదమేనని శ్రీనగర్ కేంద్రంగా వెలువడే మార్తాండ్ పత్రిక ప్రచారం ప్రారంభించింది. ఈ పత్రిక యాజమాన్యం అవిభక్త పంజాబ్ కేంద్రంగా ఉన్న ముస్లింలదే. బ్రిటిష్ పాలన అనుసరించిన విభజించు పాలించు సూత్రం కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజల సమస్యను మతపరమైన కళ్లద్దాలతోనే చూడటాన్ని మరింతగా ప్రోత్సహించింది. దీనికి భిన్నంగా ప్రేమ్నాధ్ బజాజ్, గవాష్ లాల్ కౌల్, కశ్యప్ బంధు వంటి కాశ్మీరీ పండిట్ల ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రికలు మధ్యేవాదంగా హిందూ ముస్లింల మధ్య ఐక్యత సాధించి మొత్తం ప్రజానీకాన్ని డోగ్రా రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిలబెట్టే వేదిక కావాలన్న నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఇటువంటి ఉమ్మడి లక్ష్యం, ఉమ్మడి దిశ, ఉమ్మడి కార్యక్రమం, ఉమ్మడి జండా నినాదాన్ని ప్రజాదరణ పొందిన నినాదంగా మార్చటంలో కీలక పాత్ర పోషించిన పత్రిక ది కాశ్మీరీ టైమ్స్. ఈ పత్రిక 1937 ఆగస్టు ఏడో తేదీ రాసిన సంపాదకీయంలో ''కాశ్మీరీ ప్రజలు బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని డిమాండ్ చేస్తున్నారు. సంస్థానంలో అల్పసంఖ్యాకులుగా ఉన్న ప్రజలు కూడా ఈ నినాదాన్ని వ్యతిరేకించటం లేదు. కాకపోతే కొన్ని రక్షణలు కావాలని కోరుతున్నారు. ఈ కోర్కెలను పాలకులు ఎక్కువకాలం వాయిదా వేయలేరు. ఏ బడికి చెందిన దేశభక్తి అయినా ఈ నినాదాలను తిరస్కరించలేదు. అలా తిరస్కరించిన చోట్ల దేశమూ అభివృద్ధి చెందలేదు. ఈ పరిస్థితుల్లో కాశ్మీరు రాజ్యంలో అన్ని తరగతులకు చెందిన ప్రజానీకమూ తమ మధ్య విభేదాలు పరిష్కరించుకుని, లేదా తగ్గించుకుని ఐక్యమవటం ద్వారా భారతదేశంలోని మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శిగా మారవల్సిన సమయం దగ్గరకు వచ్చింది'' అని స్పష్టం చేసింది.
ఈ సందేశాన్ని అందుకున్న షేక్ అబ్దుల్లా 1939 జూలైలో ముస్లిం కాన్ఫరెన్స్ను తన లౌకిక లక్ష్యాలు, ఆదర్శాలకు అనుగుణంగా నేషనల్ కాన్ఫరెన్స్ అని మార్చారు. ఏడేండ్ల తర్వాత 1946లో ఈ సందర్భం యొక్క చారిత్రక ప్రాధాన్యతను విశ్లేషిస్తూ కలకత్తా కేంద్రంగా అచ్చయ్యే ది స్టేట్స్మన్ పత్రిక తన సంపాదకీయంలో ''ఈ నిర్ణయం (జమ్ము కాశ్మీర్లోని) ప్రజా ఉద్యమానికి కొత్త ఊపునిచ్చింది. ఇది ఓ చారిత్రక సన్నివేశం. దేశంలో అంతకు మునుపెన్నడూ ఏ మతపరమైన సంస్థ ఈ విధంగా తనను తాను (లౌకిక స్ఫూర్తికి అనుగుణంగా) మార్చుకున్న సందర్భం లేదు. ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవటానికి (అల్పసంఖ్యాకుల పట్ల) విశాల హృదయం ఒక్కటే సరిపోదు. దూరదృష్టి కూడా అవసరం'' అని వ్యాఖ్యానించింది.
ముస్లిం కాన్ఫరెన్స్ కాస్తా కాశ్మీర్ సమాజంలోని అన్ని సామాజిక తరగతులకు ప్రాతినిధ్యం వహించేదిగా మారటంతో పాటు వివిధ సామాజిక తరగతుల అభివృద్ధికి, రక్షణలకు భరోసా ఇచ్చే రీతిలో నేషనల్ కాన్ఫరెన్స్గా మారటంతో రాష్ట్రంలోని పత్రికారంగం మరింత క్రియాశీలకంగా మారింది. హమ్దర్ద్, ఖాలిద్, కేసరి, ఖుద్మత్, దేష్ వంటి పత్రికలు నేషనల్ కాన్ఫరెన్స్ ఆదర్శాలకు అనుగుణంగా ప్రజల రాజకీయ ఆలోచనలు మలిచేందుకు పూనుకున్నాయి. అదే సమయంలో నాటి ముస్లిం లీగ్లో జాతీయ స్థాయి నాయకత్వం నేషనల్ కాన్ఫరెన్స్ రాజకీయ ఆదర్శాలను వ్యతిరేకిస్తూ దానికి మూలపునాదిగా ఉన్న షేక్ అబ్దుల్లాపై కత్తి కట్టారు. ముస్లిం లీగ్ అవగాహనకు అనుగుణంగానే పలు ఉర్దూపత్రికలు అబ్దుల్లాపై దుమ్మెత్తి పోయటం ప్రారంభించాయి. మెజారిటీ పత్రికలు నేషనల్ కాన్ఫరెన్స్ రాజకీయ ఆదర్శాలను ఆమోదించినా మార్తాండ్ పత్రిక మాత్రం షేక్ అబ్దుల్లా ప్రతిపాదించిన భూసంస్కరణల ఎజెండాను పూర్తిగా వ్యతిరేకిస్తూ వచ్చింది.
కాశ్మీరీ ప్రజలకు ప్రత్యేక గుర్తింపు, ఈ రాష్ట్రం పరిధిలోని అల్పసంఖ్యాక తరగతులకు ప్రత్యేక రక్షణలు అన్న నినాదమే తర్వాతి కాలంలో జమ్మూ కాశ్మీర్ స్వయంప్రతిపత్తి, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి నినాదంగా ముందుకొచ్చింది. ఈ స్వయం ప్రతిపత్తి నినాదానికి అక్షరరూపమే రాజ్యాంగంలోని 370 అధికరణం. పై సంపాదకీయ వ్యాఖ్యను గమనించినా, రాజ్యాంగంలో 370 అధికరణాన్ని గమనించినా ఓ విషయం స్పష్టమవుతుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ఆచరణ సాధ్యమైనప్పుడు మాత్రమే ఈ రాష్ట్రం పరిధిలో అల్పసంఖ్యాక వర్గాలుగా ఉన్న హిందువులు, బౌద్ధులు నివసించే ప్రాంతాల్లో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఆచరణ సాధ్యమవుతుంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి రాజ్యాంగం కల్పించిన స్వయంప్రతిపత్తి హౌదాను రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్రం పరిధిలో నివసిస్తున్న మిగిలిన సామాజిక తరగతుల హక్కులు, అవకాశాలు, అధికారాలకు ప్రత్యేక రక్షణలు అమలు జరుగుతాయని విశ్వసించటం హేతురాహిత్యమే అవుతుంది.
పై చరిత్రను గమనించినప్పుడు మనకు కొన్ని విషయాలు స్పష్టమవుతాయి. ఓ పార్టీ లేదా సామాజిక శక్తి తన సంకుచితమైన లేదా పరిమితమైన సామాజిక తరగతులకు ప్రాతినిధ్యం వహించేదిగా ఉన్నంత కాలం రాజకీయ ఆదర్శాలు ఎంత ఉదాత్తమైనవైనా ప్రజాదరణ పొందలేదన్నది మొదటి గుణపాఠం. రాజకీయ చర్చను ముందుకు నడిపించే పత్రికా రంగానికి కూడా నిర్దిష్టమైన వర్గ దృక్ఫథం ఉంటుందన్నది రెండో గుణపాఠం. ఎవరు ఏ సామాజిక తరగతి నుంచి వచ్చినా వాళ్లు ఏ ఆదర్శాల కోసం జీవితం అంకితం చేస్తారో ఆ ఆదర్శాలు సదరు సామాజిక తరగతిలోని కులీన వర్గ ప్రయోజనాలకు భంగం కలిగించేవి అయితే అటువంటి ఆదర్శాలపై సొంత సామాజిక తరగతికి చెందిన వాళ్లే దాడి చేస్తారనటానికి షేక్ అబ్దుల్లా రాజకీయ జీవితమే పెద్ద ఉదాహరణ.
- కొండూరి వీరయ్య
సెల్: 9871794037