Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెప్టెంబర్ 17 గురించి బీజేపీ, ఆరెస్సెస్ లాంటి సంఫ్ు పరివారానికి ఎక్కడలేని ప్రేమ ఉట్టిపడుతున్నది. ఈ రాష్ట్రంలో ఇంకెవరికీ దేశభక్తి లేనట్టూ.. నిజాం రాజ్యం భారతదేశంలో విలీనం కావటంతో తెలంగాణ ప్రజలకు విముక్తి లభించినట్టూ హడావుడి చేస్తున్నారు. ఈ తతంగమంతా ఎవరి ప్రయోజనం కోసం? దేశ స్వాతంత్య్ర పోరాటానికి దూరంగా ఉన్న శక్తి ఈ పరివారం. గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశభక్తుడని బరితెగించి మాట్లాడుతున్నవారే గాంధీ పేరునూ వాడుకుంటున్నారు. నిజాం రాచరికం పునాదులు కదిలించిన మహౌజ్వల పోరాటపు అంచులు కూడా అంటుకోనివారు విమోచన పేరుతో వీరంగం సృష్టిస్తున్నారు. ఈ చిందుల రహస్యమేమిటో కూడా పరిశీలించాలి. కాశ్మీర్ విలీనం గురించి గొప్పలు చెప్పుకుంటున్న ఈ శక్తులే, 1947లో, నెహ్రూ, సర్దార్ పటేల్ లాంటివారు విలీనం ప్రతిపాదన చేసిననాడు వ్యతిరేకించారు. ఆనాటి జమ్ము-కాశ్మీర్ రాజు హరిసింగ,్ తాము స్వతంత్ర రాజ్యంగానే కొనసాగుతామన్నప్పుడు ఆయనకే మద్దతునిచ్చారు. ఇప్పుడు పొంగి పొర్లుతున్న దేశభక్తి అప్పటికింకా పుట్టినట్టు లేదు. అక్కడ రాచరికానికి భజన చేసిన ఈ శక్తులే ఇక్కడ రాచరికం నుంచి విమోచన గురించి మాట్లాడుతున్నాయి. ప్రజలను పక్కదారులు పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆనాడు తెలంగాణ రైతాంగం భూస్వాములూ, జమీందార్ల దోపిడీ నుంచి విముక్తి కోరుకున్నారు. జమీందార్ల అణచివేత నుంచి విమోచన కోసం పోరాడారు. ఇవేవీ ఈ 'దేశభక్తుల'కు నచ్చలేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దురాక్రమణకు వ్యతిరేకంగా జనం పోరుబాట నడిచారు. తెల్లదొరల దౌర్జన్యాల నుంచీ, దోపిడీ నుంచీ విమోచన కోసం లక్షలాదిగా కదిలి త్యాగధనులయ్యారు. ఇవేవీ వీరికి రుచించలేదు. వీరి గురుతుల్యులు అండమాన్ జైలు నుంచి తెల్లదొరల క్రమాభిక్ష కోరుకుని, బయటి ప్రపంచంలో తిరుగాడనిస్తే వారి సేవలో తరిస్తామని మాట ఇచ్చి బయటపడ్డారు. దేశ ప్రజలంతా సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా పోరాడుతుంటే, వీరు మాత్రం స్వాగతం పలికారు. తెల్లదొరల పాలన నుంచీ, వారి దోపిడీ నుంచీ విమోచన కోరుకున్న కోట్లాది జనం గుండె ఘోష వీరికి వినిపించలేదు. అంతేనా..! జమ్మూ కాశ్మీర్లో భూములు భూస్వాముల చేతుల్లో ఉన్నంత కాలం మొదట అది స్వతంత్ర రాజ్యంగానే ఉండాలనీ, ఆ తర్వాత విలీనమైనా వారి ఆస్తులకు రక్షణలుండాలన్న వీరే ఆ రాష్ట్ర ప్రభుత్వం భూసంస్కరణలు ప్రారంభించటంతో స్వరం మార్చారు. ఇంతెందుకు? గత నెల ఐదున కేంద్రం ఒక వైపు ఆర్టికల్ 35(ఎ) రద్దు చేసింది. మరోవైపు జమ్మూ బీజేపీ అధ్యక్షుడు మాత్రం ''జమ్ము ఆస్తులు జమ్మూ ప్రజలవే''నని ప్రకటించాడు. నాటినుంచి నేటి వరకు ఈ ఘటనలన్నీ తేల్చుతున్నదేమిటీ? ప్రజల మీదా, ప్రజల విమోచన మీద కాదు వీరి భక్తి. ఇంకేవో తెరవెనుక ప్రణాళికలున్నాయని ఎవరికైనా ప్రశ్న తలెత్తకమానదు. ప్రజలు ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నప్పుడు లేని ప్రేమ ఇప్పుడే ఎందుకింత పెద్ద ఎత్తున ఉట్టిపడుతున్నదన్న సందేహం రాక మానదు.
జమ్మూ కాశ్మీర్లో మెజారిటీ ప్రజలు ముస్లింలు. కానీ ఆనాటి రాజు హిందువైన హరిసింగ్. ఆ రాచరికం వద్దనీ, ప్రజాస్వామ్యమే కావాలనీ, భూస్వామ్య విధానం రద్దు చేసి భూమి పంచాలన్న కాశ్మీర్ ప్రజా ఉద్యమం వీరికి గిట్టలేదు. అందుకే ఆనాడు జమ్మూ కాశ్మీర్ రాచరికమే వీరికి బాగా నచ్చింది. ఇక్కడ హైదరాబాద్ రాజ్యంలో మెజారిటీ ప్రజలు హిందువులు. పాలకులు మాత్రం ముస్లిం రాజు. అందువల్ల వీరికి నిజాం రాజు పాలన ఇష్టంలేదు. కానీ తెలంగాణ రైతాంగం జమీందార్ల దోపిడీకి వ్యతిరేకంగా తిరగబడ్డారు. జమీందార్ల రక్షకుడుగా నిజాం పాలకులు ప్రజల మీద విరుచుకుపడ్డారు. అందుకే నిజాం పాలనకూ, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన సాయుధ రైతాంగ పోరాటం వీరికి నచ్చలేదు.
తెలంగాణ రైతాంగం గానీ, జమ్మూ కాశ్మీర్ ప్రజలు గానీ ఆనాడు మతపరమైన ధోరణి ప్రదర్శించలేదు. తెలంగాణలో ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటం నడిచింది. రాచరికపు పునాదులు కదిలించింది. కాశ్మీర్ ప్రజలు షేక్ అబ్దుల్లా నాయకత్వంలో భూమికోసం, ప్రజాస్వామ్యం కోసం తిరగబడ్డారు. రాచరికానికి చెమటలు పుట్టించారు. తెలంగాణ రైతాంగం హిందూ జమీందార్ల దోపిడీని ప్రతిఘటించారు. భూస్వామ్య, పెత్తందారీ దౌర్జన్యాలపైన తిరగబడ్డారు. భూస్వాములనూ జమీందార్లను రక్షించేందుకు నిజాం బలగాలను, రజాకార్లను రంగంలోకి దించారు. హిందూ జమీందార్ల దోపిడీకి అండగా, పెత్తందార్లకు రక్షణగా నిజాం రాజు రంగంలోకి దిగాడు. ఇక్కడ భూస్వామ్య వర్గ ప్రయోజనమే తప్ప మతపరమైన కోణం లేదు. హిందూ జమీందార్లకు ముస్లిం రాజు అండ, భూస్వామ్య దోపిడీకీ, నిజాం నిరంకుశ పాలనకూ వ్యతిరేకంగా రగిలిన హిందూ, ముస్లిం సాధారణ ప్రజల సమైక్య పోరాటమే తెలంగాణ నుదుట నెత్తుటి తిలకమైంది. నిజాం రాజును రాజ ప్రముఖ్గా తెలంగాణ మీద బలవంతంగా రుద్దిన వారు హిందువులైన జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభారుపటేల్! ఇక్కడ కూడా మతం సమస్యే కాదు. శ్రామికులకు వ్యతిరేకంగా దొరల ప్రయోజనాల పరిరక్షలుగానే వీరంతా చేతులు కలిపారు.
ఇవి చారిత్రాత్మక పోరాటాలు. రైతులు శ్రమదోపిడీ మీద పోరాడారు. భూమి కోసం భగ్గుమన్నారు. అణగారిన తరగతులు బానిస చాకిరీ మీద పోరాడారు. వృత్తిదారుల కష్టం కాజేసిన దొరతనం మీద తిరగబడ్డారు. బాంచెనన్న బతుకులే బందూకులు పట్టిన పోరాటమది. మహిళలు బందూకులై సత్తా చూపిన మహత్తర సమరం అది. ఒక బందగీ.. ఒక కొమరయ్య.. ఒక షోయబుల్లాఖాన్.. ఒక దాశరథి.. ఒక అయిలమ్మ.. ఒక సుద్దాల హనుమంతు.. ఎందరెందరో కులం, మతం విడిచి, కలం, 'ఖడ్గం' పట్టి తిరగబడ్డారు. మట్టి నుంచి పుట్టిన మాణిక్యాలై.. గుండుకెదురు గుండె నిలిపిన యోధులయ్యారు. ఇలాంటి మహత్తర పోరాట చరిత్రను వక్రీకరించేందుకు ఇప్పుడు బీజేపీ, సంఫ్ు పరివార్ శక్తులు సకల ప్రయత్నాలూ చేస్తున్నారు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నిజాం పాలనను తుదముట్టించేందుకే వస్తున్నామని చెప్పి సైన్యాన్ని పంపిన నెహ్రూ, పటేల్ నాయకత్వం.. ఆ నిజాం ప్రభువుతోనే కుమ్మక్కయ్యింది. రాచరికం మీద యుద్ధానికే నెహ్రూ పటేల్ సైన్యాలు వస్తున్నాయని నమ్మి స్వాగతం పలికిన రైతాంగం మీదనే తమ తుపాకులు గురిపెట్టారు. ఇదీ చరిత్ర. భూస్వాముల దత్తపుత్రులుగా వ్యవహరించిన హిందూ, ముస్లిం మతోన్మాద సంస్థలు, వారి రాజకీయ ప్రతినిధులు ఇప్పుడీ పోరాటం మీద మతం రంగుపులిమి తమ అసలు రంగును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ గద్దెనెక్కిన బీజేపీ.. దక్షిణ భారత దేశంలో కర్నాటక సరిహద్దులు దాటి విస్తరించాలని ఉవ్విళ్ళూరుతున్నది. అందుకోసం తెలంగాణలో చిచ్చుపెట్టాలను కుంటున్నది. వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మతపరమైన పోరాటంగా చిత్రీకరించి, భావోద్వేగాలను ఉసిగొల్పే ఎత్తుగడలు వేస్తున్నది. ప్రజలను మతపరంగా విభజించి, శ్రామికుల మధ్య అనైక్యత సృష్టించి రాజకీయ లబ్ది పొందేందుకు కుయుక్తులు పన్నుతున్నది. అందుకే సెప్టెంబరు 17ను సాధనంగా వాడుకుంటున్నది. ముస్లిం ప్రభువుల నుంచి హిందూ ప్రజలు విమోచన పొందిన రోజుగా చిత్రీకరించి పబ్బం గడుపుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నది. హైదరాబాద్ రాజ్యం, అందులో భాగంగా తెలంగాణ ప్రాంతం భారతదేశంలో విలీనమైన రోజు అది. అదొక చారిత్రక ఘట్టం. తద్వారా రాచరికం అంతమై ప్రజాస్వామ్య రాజ్యాంగ పరిధిలోకి తెలంగాణ కూడా వచ్చింది. ఆమేరకు ప్రజల విజయం. కానీ భూస్వామ్య దోపిడీ నుంచి విముక్తి లభించలేదు. ఆ దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అదనంగా పెట్టుబడిదారీ దోపిడీ అనేక రెట్లు పెరిగింది. తెల్లదొరల ప్రత్యక్ష పాలన పోయినా.. బహుళజాతి సంస్థల రూపంలో దోపిడీ కొనసాగుతున్నది. ఈ శ్రమ దోపిడీ నుంచి విమోచన కోసం ఇంకా ప్రజలు పోరాడవల్సిందే. శ్రామికులంతా భుజం భుజం కలిపి నడవవల్సిందే! తెలంగాణ విమోచన అయినట్టు నమ్మబలుకటమంటే దోపిడీని కాపాడే ప్రయత్నమే. అంతేకాదు. తెలంగాణ 'విమోచన' అయితే కాశ్మీరు విలీనం ఎట్లా అవుతుంది? అప్పుడు హిందూ పాలకుల నుంచి ముస్లిం ప్రజలు విమోచన చెందారని చెప్పాలా? తెల్లదొరల నుంచి దేశానికి వచ్చింది కూడా స్వాతంత్య్రం అంటున్నాం. విమోచన అనటం లేదు. బ్రిటిష్ పాలకుల నుంచి రాజకీయ స్వాతంత్య్రం సాధించుకున్నాం తప్ప శ్రమ దోపిడీ నుంచి విముక్తి కాలేదు కదా! అందువల్ల తెలంగాణ అయినా, జమ్మూ కాశ్మీర్ అయినా భారతదేశంలో విలీనం అయ్యాయి. ఇది నిజం. దేశానికి తెల్లదొరల నుంచి స్వాతంత్య్రం లభించింది. ఇదీ నిజం. నాటి ప్రజా పోరాటాల చరిత్రకు దూరంగా ఉన్నవారు.. ఆ చరిత్రను వక్రీకరిస్తూ, నేడు అధికార దాహంతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు.
చరిత్రను నిస్పాక్షికంగా పరిశీలించే వారెవరికైనా అర్థమయ్యే మరొక మహత్తర జ్ఞాపకం ఉన్నది. అదే జులై 4, తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఆ రోజు గుర్తొస్తే కొందరికి చెమటలు పడతాయి. గుండెలు జారిపోతాయి. అదే దొడ్డి కొమురయ్య రక్తతర్పణ చేసిన రోజు. సాయుధ తిరుగుబాటుకు శ్రీకారం చుట్టిన రోజు. అందుకే ఆ జ్ఞాపకం కార్మికవర్గానికీ, శ్రామిక జనానికీ స్ఫూర్తినిస్తుంది. కమ్యూనిస్టులకు ఆదర్శప్రాయం. చరిత్ర మిగిల్చిన కర్తవ్య సాధనకు కంకణ బద్ధులయ్యే రోజు. అందుకే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోగానీ, ఇప్పుడు తెలంగాణలో గానీ.. ఆ రోజును తలుచుకుంటేనే పాలకులకు ఒంటి మీద జెర్రిపోతులు పాకినట్టు జలదరిస్తారు. కొత్తతరం ఆ చరిత్రను మరచిపోవాలనుకుంటారు. టీఆర్ఎస్ నాయకత్వం కూడా తెలంగాణ సాయుధ పోరాట యోధులు అయిలమ్మ, కొమురయ్యల పేర్లు స్వార్థ, సంకుచిత ప్రయోజనాల కోసం వాడుకున్నదే తప్ప, ఆ చరిత్ర స్ఫూర్తిని అందించడానికి సిద్ధంగా లేదు. జులై 4ను మరిపించటానికి, తక్షణ ప్రయోజనం కోసం సెప్టెంబరు 17ను ఉద్యమకాలంలో ముందుకు తెచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాలే దీనిని కూడా విస్మరించేటట్టు చేసాయి. సరిగ్గా దీన్నే అవకాశంగా తీసుకుని అధికారం యావలో ఉన్న బీజేపీ, పరివారం ఆందోళనకు ఉసిగొల్పుతున్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాలకోసం మోడీ, అమిత్షాల శిష్య బృందం ప్రజా ప్రయోజనాలతో ఆడుతున్న చెలగాటమిది. ఇలాంటి సమయంలో రాజకీయ క్షేత్రం వీరికే వదిలేస్తే.. ప్రశ్నించేవారే లేకపోతే జరిగే ప్రమాదం అర్థం కానిదేమీ కాదు. లౌకిక విలువల మీద ఏమాత్రం విశ్వాసం ఉన్నా.. ప్రజల పట్ల నిబద్ధతా.. ప్రజా ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉన్నా.. సెప్టెంబర్ 17 సమస్యలో జోక్యం చేసుకుని విలీన చరిత్ర వాస్తవ చిత్రం ప్రజల ముందుంచాలి. మతోన్మాదుల దుష్ట తలంపులను ఎండగట్టాలి. అధికార దాహంతో ఆడుతున్న ఆటకు అడ్డుకట్ట వేయాలి. కానీ కాంగ్రెస్, టీఆర్ఎస్ వంటి పార్టీలకు ఈ చిత్తశుద్ది కరువైంది. వీరి అవకాశవాదమే అవతలి వారికి ఆయుధమైంది. కేవలం కమ్యూనిస్టులు మాత్రమే చారిత్రక బాధ్యత నిర్వహించే ప్రయత్నంలో ఉన్నారు. నాడు సాయుధ రైతాంగ పోరాట నేతలు కమ్యూనిస్టులే.. నేడు ఆ చారిత్రక నిప్పులాంటి నిజాలను నవతరం ముందుంచి బాధ్యతగా వ్యవహరిస్తున్నదీ కమ్యూనిస్టులే. రేపు చరిత్ర మిగిల్చిన కర్తవ్య నిర్వహణకు కదం తొక్కేదీ కమ్యూనిస్టులే!
- ఎస్. వీరయ్య