Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అది కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన జమిందారీ, భూస్వామ్య వ్యతిరేక పోరాటం. బాంచెనన్న బక్కోడితో బందూకుని పట్టించిన పోరాటం. నిరంకుశ రాజు నిజాం నవాబు, అతని తొత్తులయిన భూస్వాములను, రజాకార్లను తరిమికొట్టిన పోరాటం.
1948 సెప్టెంబర్ 13న హైదరాబాద్ సంస్థానం (తెలంగాణ)లోకి పటేల్ సైన్యాలు ప్రవేశించాయి. 17న అంటే 4రోజుల్లోనే నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ లొంగిపోయాడు. అయినా 1951అక్టోబర్ వరకు సర్దార్ వల్లభాయి పటేల్ (భారత్ యూనియన్) సైన్యాలు తెలంగాణలోనే ఉన్నాయి. ఎందుకు? తెలంగాణలో ఉండి పటేల్ సైన్యాలు ఏం చేశాయి. నిజాంను ఏం చేశారు. రజాకార్ల నాయకుడు కాశిం రజ్వి ఏమయ్యాడు.
నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ను రాజప్రముఖ్ (తెలంగాణ రాష్ట్ర గవర్నర్గా 1951 అక్టోబర్ 31 వరకు) చేశారు. ఆ రోజుల్లోనే సంవత్సరానికి రూ.50లక్షల వేతనం ఇచ్చారు. 850కోట్ల రాజ భరణాలు ఇచ్చారు. కాశిం రజ్వీని 1957 వరకు జైలులో పెట్టి, తర్వాత పాకిస్థాన్కు పంపించారు.
1948 సెప్టెంబర్ 17 ముందు రజాకార్లు, జమిందార్ల గుండాలు 1500మంది రైతులు, గ్రామీణ పేదలను చంపివేస్తే, సెప్టెంబర్ 17 తరువాత పటేల్, నెహ్రూ సైన్యాలు, భూస్వామ్య గుండాలు, రజాకార్లతో కలసి 2500మందిని చంపేశారు. వేలాదిమందిని కాన్సంట్రేటేడ్ (మిల్ట్రీ) క్యాంపుల్లో పెట్టారు. వందలాది మంది మహిళలను అత్యాచారాలు చేశారు. కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదలు స్వాధీనం చేసుకున్న 12లక్షల ఎకరాల భూమిని తిరిగి భూస్వాములు, జమిందార్లకు అప్పగించారు.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్మించింది కమ్యూనిస్టులు. దాని వారసులు కమ్యూనిస్టులు. అది కుల పోరాటం కాదు. మత పోరాటం కాదు. వర్గ పోరాటం.
నిజాం రాజు ముస్లిమ్ కావచ్చు కానీ, అతని తొత్తులయిన జమిందార్లు, భూస్వాములు హిందువులు. ప్రజలను ప్రత్యక్షంగా హింసించింది వీరే. తెలంగాణ గుండెల్లో విప్లవాగ్ని రగిలించిన దొడ్డి కొమరయ్యను చంపివేసింది విసునూరు దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి గుండాలు. అంతకుముందు వీరనారి చిట్యాల (చాకలి) అయిలమ్మ సాగు చేసిన భూమిలోని ధాన్యాన్ని గుంజుకున్నదీ, షేక్ బందగిని చంపిందీ ఈయన గుండాలే. భీంరెడ్డి నర్సింహారెడ్డి, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లా రెడ్డి, మల్లు స్వరాజ్యంతోపాటు కవి షోయబుల్లా ఖాన్, మగ్దుమ్ మొయొద్దీన్ వంటి అనేకమంది ముస్లిములు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.
ఆ పోరాటంతో ఏ విధమైన సంబంధంలేని, చరిత్రను వక్రీకరించడంలో సిద్ధహస్తులయిన సంఫ్ు పరివార్ శక్తులు, వారి రాజకీయ అంగమైన బీజేపీ చరిత్రను మసిపూసి మారేడుకాయను చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజాం ప్రభువు ముస్లిమ్ కాబట్టి మత రాజకీయాల ద్వారా హిందూ ఓట్ బ్యాంక్ పొందాలని చూస్తుంటే, ఫ్యూడల్ భావజాలం కలిగిన కేసీఆర్ రజాకార్ల వారసులైన ఎంఐఎంతో దోస్తాన్ ద్వారా ముస్లిముల ఓటు బ్యాంక్ పదిల పరుచుకోవాలని చూస్తున్నాడు. ఈ రెండు ధోరణులు తెలంగాణ అభివృద్ధికి ఆటంకం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యార్థులు, యువకులు, కార్మికులు, కర్షకులు ప్రత్యామ్నాయ విధానాల కోసం పోరాటం చేయడమే ఆ యోధులకు నివాళి. దానికి దిక్సూచి వామపక్షం.
- గీట్ల ముకుందరెడ్డి
సెల్: 94900 98857