Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒకరోజు మరణించాల్సిందే. జీవితాంతం ఎలా బతికినా చివరి మజిలీకి ప్రశాంతంగా చేరుకోవాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాలు అని తేడాలేకుండా స్మశానవాటికలు, కర్మకాండ నిలయాలు కరువైపోయాయి. నగరాలు, పట్టణాలలో స్మశానాలు అందుబాటులో ఉన్నా అద్దె గృహాలలో ఉండేవారు మరణిస్తే ఇంటి యజమానులు మృతదేహాలను తీసుకురానీయక పోవడం మూలాన నేరుగా స్మశానవాటికలకు తరలించి కర్మకాండలు చేస్తున్నారు. గ్రామాలలో కూడా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. సొంత భూమి ఉన్నవారు, వ్యవసాయ క్షేత్రాలు ఉన్నవారు ఆ ప్రదేశంలోనే ఖననం చేస్తున్నారు. గ్రామాలలో వ్యవసాయ భూములు లేనివారు మృతదేహాలను గ్రామంలోని ప్రభుత్వ భూములలోనో, చెరువులు, గుట్టల వెంబడి దహనం చేస్తూ నానా యాతనపడుతున్నారు. ప్రభుత్వం గుర్తించిన ప్రతీ గ్రామంలో వైకుంఠధామాల నిర్మాణానికి ముందుకువచ్చి ఉపాధి నిధులతో అనుసంధానించినా పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్ని గ్రామాలలో మాత్రమే వైకుంఠధామాల నిర్మాణ పనులు పూర్తయినాయి. రాష్ట్ర ప్రభుత్వం స్మశాన వాటికల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి స్మశానవాటికలను వైకుంఠధామాలుగా అభివృద్ధి చేసేందుకు నిధులను వెచ్చిస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఒక్కోక్క స్మశాన వాటికకు పదిలక్షల రూపాయలు వెచ్చించి అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించింది. కానీ పనులు ముందుకు సాగడం లేదు. అనేక గ్రామాలలో స్మశానవాటికలు నిర్మించేందుకు స్థలాలు లేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది. ప్రభుత్వ స్థలాలు లేని చోట ప్రయివేటు స్థలాలను కొని స్మశాన వాటికలను నిర్మించడమో, అలా కాని సందర్భంలో గ్రామాలలో ఎవరైనా స్థలం దానం చేసేందుకు ముందుకు వచ్చే విధంగా ప్రోత్సహించడమో చేయాల్సి ఉంది. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడటం వల్ల వైకుంఠధామాల నిర్మాణాలు వెనుకబడుతున్నాయి. పనులు ప్రారంభమైన ప్రదేశంలో ఈజీఎస్ నిధులు సకాలంలో రాక వేగవంతంగా పనులు జరగడం లేదు. కూలీలకు సకాలంలో డబ్బులు అందక పనులు అర్ధాంతరంగా నిలిచిపోయిన సందర్భాలు అధికంగా ఉన్నాయి. అనేక గ్రామాలలో చెరువు శిఖంలో మృతదేహాలను ఖననం చేస్తుండటంతో అనంతరం జరిగే కర్మకాండలు ఇబ్బందికరంగా సాగుతున్నాయి. వర్షాకాలంలో పరిస్థితి మరింత అధ్వాన్నం. వర్షాల వల్ల నీరు నిలిచిపోతుండటంతో బురదలోనే అంత్యక్రియలు చేయడం, వర్షాల వల్ల చితి సరిగ్గా దహనం కాకపోవడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పట్టణాలు, నగరాలలో కూడా కొన్ని ప్రాంతాలలోనే స్మశానవాటికలు ఉండటం వల్ల మృతదేహాల తరలింపు కష్టసాధ్యంగా ఉన్నది. కొన్ని గ్రామాలలో ఊరికి సమీపంలో రహదారుల ప్రక్కనే దహన కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో గ్రామస్తులు, పిల్లలు భయాందోళనలకు గురవుతున్నారు. ఆత్మహత్యల చేసుకుంటున్నవారు, రోడ్డు ప్రమాదాలలో మరణిస్తున్నవారు, ఆకస్మిక మరణాలు సంభవిస్తుండటంతో మరణించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో యుద్ధ ప్రాతిపదికన స్మశానవాటికలు నిర్మించాల. అసంపూర్తిగా పనులు జరుగుతున్న వైకుంఠధామాల పనులు వేగవంతం చేయాలి. ప్రతీ స్మశానవాటికలో నాలుగు గదులను నిర్మించి, నీటి వసతి కల్పించాలి. దహన సంస్కారాల నిమిత్తం అవసరమయ్యే కర్రను ప్రభుత్వం కొనుగోలు చేయాలి.
- కె. సతీష్రెడ్డి
సెల్: 9848445134