Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాత్మాగాంధీ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయేందుకై ఐన్స్టీన్ సవాలు స్వీకరించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చినప్పుడు దానికి స్పందన ఇంత త్వరగా ఇంత దారుణంగా ఉంటుందని ఎవరూ ఊహించలేదు. గాంధీజీ బాటలో శాంతి సామరస్యం ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ అవసరాన్ని ప్రధాని దృష్టికే తెచ్చిన ప్రసిద్ధ కళాకారులు రచయితలు దేశ ద్రోహులుగా కేసులలో చిక్కుతారని అసలే అనుకోలేదు. కానీ అక్షరాలా అదే జరగడం మోడీ భావననూ పాలననూ కూడా ప్రతిబింబించే పరిణామం. ఆయన ఉద్దేశంలో ఐన్స్టీన్ సవాలంటే బారటి చీపుళ్లు పట్టుకుని (ఫోటో గ్రాఫర్లు ఉన్నంత వరకూ) శుభ్రమైన రోడ్లను వూడుస్తున్నట్టు ఫోజులివ్వడం. నీళ్లు ఉన్నాయో లేదో చూడకుండా లక్షల శౌచాలయాలు కట్టించడం మాత్రమే. కానీ దేశానికి గర్వకారణమైన ఈ ప్రముఖులు గాంధీజీ వారసత్వాన్ని మరోలా అర్థం చేసుకున్నారు. అసహనదాడులు మూకహత్యలు మతపరమైన ఉద్రిక్తతలు అణచివేత చర్యలపై ఆందోళనను ప్రధానితో పంచుకోవాలనుకున్నారు. అందుకోసం బహిరంగంగా లేఖ రాశారు. ఆవేదనతో లేఖ రాయడమే అపరాధంగా పరిగణిస్తారనీ, విజ్ఞప్తి చేస్తే విద్రోహంగా చిత్రించబడుతుందని వారు అనుకోలేదు. ట్విట్టర్లు మన్కీ బాత్లు, యాప్లతో త్రీడీ మోడీగా వెలిగిపోతూ నయాజాతిపితగా ఆయన చెప్పే సూక్తులు ఆలకించాలే తప్ప పౌర జీవనంలో పెరిగిపోతున్న ప్రమాద సంకేతాలగురించి చెప్పడం తప్పని తెలుసుకోలేకపోయారు. జాతీయ అంతర్జాతీయ పురస్కారాలతో దేశానికి వన్నె తెచ్చిన తమ వంటివారు లేఖ రాస్తే ప్రధాని కార్యాలయం నుంచి కనీస ప్రతిస్పందన ఉంటుందని ఆశించారు. అయితే అందుకు మారుగా వారిపై విషపు దాడి జరిగింది. దేశద్రోహముద్ర వేయబడింది. గతంలో రాజకీయంగా పాలక కూటమి అనుబంధ సంస్థలు, నేతలు చేసిన పనే ఇప్పుడు ఎక్కడో బీహార్లోని ముజఫర్పూర్లో ఒక చెట్టుకింద ప్లీడరు ఫిర్యాదు ద్వారా కేసులు ఎఫ్ఐఆర్లుగా ప్రత్యక్షమైంది.
జార్ఖండ్లో మూక హత్య నిందితులు పోలీసుల నిర్ల్యక్ష్యం కారణంగా విడుదలైన తర్వాత దేశమంతా నిరసన వ్యక్తమైన నేపథ్యంలోనే వారు ఈ లేఖ రాశారని గుర్తుంచుకోవాలి. తేజాబ్ అనే ఆ హతుని గురించి మోడీ కూడా పార్లమెంటు ప్రసంగంలో ప్రస్తావించారు. అలాటి ఘటనలు పరంపరగా జరుగుతున్నందునే యాభై మంది ప్రముఖులు జులై నెలలో బహిరంగ లేఖ రాయాల్సివచ్చింది. లేఖపై సంతకాలు చేసిన మణిరత్నం, అదూర్ గోపాలకృష్ణన్, అపర్ణాసేన్, రామచంద్ర గుహ వంటి వారు సుప్రసిద్ధులు. దేశభక్తి మంత్రంలా గాక తమ సృజనతో సేవలతో జాతి గౌరవం పెంచిన వారు.ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొనే వారు కాదు. వారు మోడీ లేదా బీజేపీపై ఆరోపణలు చేసింది కూడా లేదు. మెజార్టీ మతతత్వ పోకడలతో మైనార్టీలను వెంటాడటం, గోరక్షణ పేరిట ఘోరాలు, అసహన రాజకీయాలు మూక హత్యలలో నిందితులు తప్పించుకోవడం వంటివి ప్రస్తావించారు. ఇవి మన దేశానికి మచ్చ తెస్తున్నాయని హెచ్చరించారు. బహిరంగంగా లేఖ రాసినా పీఎంవో జవాబివ్వకపోవడం ఒకటైతే దానిపై దాడి చేయడం మరింత ఘోరమైన విషయం. ఎక్కడో ఫిర్యాదులుచేయించి ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు వరకూ వెళ్లడం బెదిరించి లోబర్చుకునేందుకేనన్నది స్పష్టం. అప్పట్లో ఆ లేఖ రాసినందుకే దేశ ప్రతిష్ట మంటకలిసిందని పరివార్ విరుచుకుపడింది. ఈ ఘటనలపై అంతర్జాతీయ కథనాలు వస్తుంటే కళంకం కాదు గాని వాటిని సరిదిద్దుకోవాలనడం నేరమన్నారు. ఆ మేధావులపై అనేక విధాల బురదజల్లారు. వీరిలో మణిరత్నం పాతికేండ్ల కిందటనే కాశ్మీర్ ఉగ్రవాదంపై తీసిన రోజా చిత్రం గాని రామచంద్ర గుహ చరిత్రపై చేసే అధ్యయనం గాని అందరికీ తెలుసు. గుహ అయితే తన యాభై మంది భారతీయ నేతల గ్రంధంలో ఒక్క కమ్యూనిస్టు నేత గురించి కూడా రాయలేదు. అదూర్ గోపాలకృష్ణన్ కేరళలో కమ్యూనిస్టులకు భిన్నమైన సినిమాలే తీశారు. మణిరత్నం కుమారుడికి వామపక్ష భావాలున్నాయి. గాని ఆయన తన భావాల ప్రకారమే సినిమాలు తీసే వ్యక్తి. కనుక వీరిలో ఎవరూ వామపక్ష వాదులు కాదు. వివాద చరిత్రా లేదు. కాని బీజేపీ ఆరెస్సెస్ల కనుసన్నల్లో జరిగే ఘోరాలను, హిందూత్వ రాజకీయ పర్యవసానాలను ఎత్తిచూపినందుకే ఇంతటి అఘాయిత్యపు కేసులకు గురి చేశారు.
రాజులూ రాజ్యాలు పోయాక రాజద్రోహం కేసులు ఇంకా కొనసాగడమే ఒక విడ్డూరం. వాస్తవానికి ఇది బ్రిటిష్ వారు స్వతంత్ర పోరాటాన్ని అణచివేయడానికి రూపొందించిన చట్టం. ఐపీసీ 124ఎ కింద వున్న రాజద్రోహం నిబంధన స్వతంత్ర భారతానికి పొసిగేది కాదనీ, సాధ్యమైనంత త్వరలో ఎత్తివేయాలని జవహర్లాల్ నెహ్రూయే చెప్పారు. కాని మోడీ పాలనలో దాని వినియోగం బాగా పెరిగిపోయింది. జేఎన్యూలో కన్నయ్యకుమార్ వంటివారిపైనా ఇదే కేసు పెట్టారు. చాలా మంది రచయితలనూ మీడియా ప్రతినిధులనూ కూడా ఈ సెక్షన్ కిందనే వెంటాడి వేధిస్తున్నారు. ఇటీవలనే సుప్రీం కోర్టు న్యాయమూర్తి దీపక్ గుప్తా రాజద్రోహ నిబంధనను బాగా సడలించాల్సిన అవసరముందని చెప్పారు. రాజ్యాంగంలో 19వ అధికరణం వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్రాలకు రక్షణ నిస్తున్నది. ఆ మేరకు అధికారంలో వున్న ప్రభుత్వాల తప్పొప్పులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది. పొరబాట్లను వారు దృష్టికి తేవచ్చునని దీపక్ గుప్తా అన్నారు. జాతీయ గీతాన్ని చిహ్నాలను అవమానించారంటూ ఈ కేసులు పెట్టడం కూడా సరికాదని చెప్పారు. 70ఏండ్ల స్వాతంత్రం తర్వాత అవి వాటి గౌరవం పొందాలి గాని శిక్షలు కేసులతో కాపాడాల్సిన పనిలేదు అని స్పష్టం చేశారు. విమర్శించే వారిని లేదా పొగడని వారిని శిక్షించేందుకు చట్టాలు ఉపయోగిస్తే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఏమవుతాయని గుప్తా వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుహనా జాతీయవాదం, మెజార్టీ మత వాదం అసహనం వంటివి పెరగడానికి రాజద్రోహం కేసులు పెరగడానికి చాలా సంబంధం ఉంది. తాము పాలించే యూపీలో గాంధీని హత్య చేసిన గాడ్సే గుడిలో పూజలు ప్రదర్శనలు జరుగుతున్నా అది దేశ ద్రోహంగా కనిపించదు .ఫ్రధాని ఐన్స్టీన్ సవాలు కిందకు రాదు! భీమ్ కోరెగావ్ కేసులో ప్రధాని హత్యకు కుట్ర జరిగిందని వారే ఆరోపించి వరవరరావుతో సహా పలువురని దాదాపు ఏడాదిగా నిర్బంధంలోనే ఉంచుతున్నారు. నిజంగా ఆధారాలు ఏమిటో చెప్పకుండా అక్కడా రాజద్రోహం అంటారు. ఇక్కడ బహిరంగ లేఖ రాసి దేశాధినేతకు వినతి చేసినా నేరమేనని కేసు బనాయిస్తారు. ఇందులోని వైరుధ్యాన్ని వైపరీత్యాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. లౌకిక ప్రజాస్వామ్య విలువలను గౌరవించకపోగా వాటి గురించి మాట్లాడే వారి నోరు నొక్కడమే పనిగా పెట్టుకున్న ఫలితాలివి.
అదృష్టవశాత్తూ ఈ దేశ లౌకిక వాదం పునాదులు బలంగా ఉన్నాయి. అభ్యుదయ వాదాన్ని ఆమోదించే మేధావులూ తగినంత మంది ఉన్నారు. ఇలాంటి వేధింపులతోనే వారు జంకుతారనుకోవడం పొరబాటు. రాజద్రోహం కేసుపై అదూర్ గోపాలకృష్ణన్, మణిరత్నం వంటివారు స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం. ప్రధానికి లేఖ రాయడం నేరమెలా అవుతుందని వారు సూటిగానే ప్రశ్నించారు. అసలు ఇలాంటి కేసు కోర్టు ఎలా అనుమతిస్తుందని అదూర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమకు ఇంతవరకూ అధికారికంగా ప్రధాని కార్యాలయం నుంచి ఎలాటి సమాచారం రాలేదని వెల్లడించారు. రామచంద్రగుహ నిరంతరం వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఎవరో బీహార్ న్యాయవాది చేస్తే ప్రధానికి సంబంధం ఏమిటని బీజేపీ నేతలు వితండ వాదన చేస్తున్నారు. లేఖ రాసింది పీఎంవోకు అయినప్పుడు అక్కడి నుంచి స్పందన రాకపోవడం మరెవరో కేసు పెడితే పట్టించుకోకపోవడం తెలియకుండా జరిగేపనేనా? ఇప్పుడు జరిగే ఎన్నికల ప్రచారంలో గాని మొన్న గాంధీజీ 150వ జయంతి సందర్బంలో గాని మోడీ ఈ విలువల గురించి మాట్లాడారా? గాడ్సేను కీర్తించిన ఎంపీ సాధ్విప్రజ్ఞాసింగ్ వంటివారిపై చర్య తీసుకున్నారా? లేదే! అదే దేశం కోసం లేఖ రాసిన వారిపై మాత్రం కేసు పెడుతున్నారు. ఇటీవల లోక్సభలో ఎన్ఐఎ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ వీటిని వ్యతిరేకించేవారెవరైనా టెర్రరిజాన్ని సమర్థిస్తున్నట్టేనని మంత్రి వాఖ్యానించారు. ఇవే గనక అమలులోకి వస్తే గిట్టని వారెవరిపైనైనా ఏకంగా టెర్రరిస్టు ముద్ర వేసి జాతి వ్యతిరేక రంగు పూసి నిర్బంధించవచ్చు.
కాబట్టి ప్రధాని మోడీ ఐన్స్టీన్ సవాలు గాంధేయ బహుముఖీన వారసత్వాన్ని గౌరవించే వారికేనని దీంతో స్పష్టమై పోయింది. మత సామరస్యం గాంధీజీ జీవిత సందేశాలలో ప్రధాన మైంది కాగా అటు ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు హెగ్జేవార్, తర్వాత గోల్వాల్కర్, వారి ప్రేరకులైన సావర్కార్ వంటి వారు ఒకవైపు, ముస్లింలీగ్ నేత మహమ్మదాలీ జిన్నా మరోవైపు మతంపైనే రాజకీయాలు నిర్మించుకున్నారు. నా జాతీయ వాదం సావర్కార్, జిన్నాల వాదాలకు భిన్నమైందని గాందీజీ కరాచీ కాంగ్రెస్ తీర్మానం ప్రవేశపెడుతూ స్పష్టంగా ప్రకటించారు. బ్రిటిష్ వారి వ్యూహాలతో దేశ విభజన అనివార్యమైనప్పుడు కూడా ఆయన మత సామరస్యానికే పరితపించారు. నౌఖాలిలో మంటలార్పడానికి శాంతి దూతగా పనిచేశారు. అది సహించలేకనే సావర్కార్ శిష్యుడు, పూర్వపు ఆరెస్సెస్ అనుయాయి, కరుడుగట్టిన హిందూత్వ వాది నాథూరాం గాడ్సే 1948 జనవరి 30న ప్రార్థనా వేదికపైనే ఆయనను కాల్చి చంపాడు. ఇప్పుడూ కల్బుర్గి, పన్సారే వంటివారి ప్రాణాలు తీయడం ఆ కోవలో ఘాతుకమే. రాజ్యం తమది గనక రాజద్రోహం కేసులు మోపి హడలగొట్టడమూ అందులో భాగమే. గాంధీజీని భౌతికంగా హత్య చేయగలిగారు గాని, ఈ దేశ సాంస్కృతిక వైవిధ్యం బహుళ ప్రజాస్వామ్య ప్రతిధ్వనులను తుదముట్టిం చడం జరిగేపని కాదు. ఈ విద్రోహ కేసులే వినూత్న నిరసనకు దారితీసినా ఆశ్చర్యం లేదు.
- తెలకపల్లి రవి