Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హేతువాదులు మానవీయ విలువలతో నిజాయితీగా బతుకుతూ ఉంటే.. ఆత్మ విమర్శ చేసుకోవాల్సింది ఎవరూ? మత బోధకుల రాజకీయాలు ఏ స్థాయి వారిని ఆ స్థాయిలో ఉన్నాయి. అందువల్ల సామాన్య ప్రజలు అన్ని స్థాయిల్లో అలాంటి వారి గుట్టు రట్టు చేస్తూ ఉండాలి. సామాన్య ప్రజల్లో బేదాభిప్రాయాలు ఉంటాయి. అయినా క్షుద్రమైన మత రాజకీయాలను ఎదుర్కోవడానికి సంఘటితం కాకతప్పదు. ఉద్యమస్ఫూర్తితో ముందుకు కదలకా తప్పదు.
చంద్రయాన్-2 విజయవంతంగా ప్రయోగించ బడింది. అంతరిక్ష పరిశోధనా రంగంలో మనదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఉంది. నిజమే.. మరి ఇదే దేశంలో 'గుడి కట్టడం' అనే విషయంపై దశాబ్దాలుగా రాజకీయం నడుస్తోంది. ప్రభుత్వాలు ఎన్నుకోబడతాయి. గుళ్ళలోకి ప్రవేశం కోసం ఎక్కడో చోట ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి. అదేమిటో సర్వసంగ పరిత్యాగులమని ప్రకటించుకున్నవారే ఈ దేశంలో అతిపెద్ద వ్యాపార సంస్థలు నిర్వహిస్తూ ఉంటారు. పాలకులు పరిపాలనను మూలకు పడేసి తీర్థయాత్రలు చేస్తుంటారు. పుక్కిటి పురాణాల్లోంచి సైన్సును వెలికితీయాలని ఇక్కడి విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరుగుతుంటాయి. వ్యక్తిత్వ వికాసం మీద మానసిక బలహీనులైన స్వాములు, బాబాలు, పీఠాధిపతులు, ఫాదర్లు, ముల్లాలు అందరూ జనానికి పాఠాలు చెపుతుంటారు. విద్యాలయ ఆవరణల్లో నిక్కర్ల ఆసాములు కర్రసాములు నేర్పుతుంటారు. ఆ మాత్యులు పురాణ మర్మాలు విప్పిచెపుతూ, తమ అజ్ఞానాన్ని జనం ముందు గుమ్మరించుకుంటూ ఉంటారు. తమ నిజజీవితంలో పాశ్చాత్య సంస్కృతికి దాసోహమంటూ, మరో వైపు ప్రాచీన సంస్కృతి విశిష్టతల గూర్చి ఎదుటివారి చెవుల్లో పువ్వుగుర్తులు పెడుతుంటారు.
సాయిబాబా పుట్టిన రోజు సందర్భంగా పుట్టపర్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక రైళ్ళు, బస్సులు ఏర్పాటు చేస్తాయి. కేంద్ర మంత్రులు, గవర్నర్లు, అధికారులు వెళుతుంటారు. లౌకికవాదం అమలు పరుస్తామని ప్రమాణం చేసినవారు దొంగస్వాముల ఆశ్రమాలకు వెళ్ళకూడదు. అధికారికంగా వెళ్ళడం తప్పు. వెళ్ళాలని ఉంటే సెలవుల్లో ఉండి, వ్యక్తిగతంగా వెళ్ళాలి. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, నేర సామ్రాజ్యాలుగా విరాజిల్లుతున్న ఆధ్యాత్మిక గురువుల ఆశ్రమాలకు వెళ్ళడం ఎంత తప్పూ? అక్కడ హత్యలు, అత్యాచారాలు, భూకుంభకోణాలు, మాదక ద్రవ్యాల అమ్మకాలు, చెక్బౌన్స్ కేసులు నిత్యకృత్యాలయిపోయాయి. వీటిని ప్రభుత్వాలెందుకు ఉపేక్షిస్తున్నాయని సామాన్యులు ఆవేదన చెందుతుంటారు. రాజకీయ నాయకులకు, స్వాములకు గల ఆర్థిక లావాదేవీలు బయటికి రావు. నల్లడబ్బు తెల్లగా ఎలా మారుతుందో బయటికి తెలియదు. తెలియనీయరు గనుక, విషయం తెలియని సామాన్యులు ఆవేశపడటంలో అర్థం ఉంది. ఓ గుడ్డ పీలిక మాత్రంచుట్టుకుని అర్థనగంగా కూర్చున్న ఓ సాములోరిముందు ఓ రాష్ట్రాధినేత లేదా దేశాధినేత ఎందుకు సాష్టాంగ ప్రణామాలు చేస్తాడూ? అదంతా ఆధ్యాత్మికత, భక్తి పారవశ్యం అని అనుకునే పిచ్చి వాళ్ళెవరూ లేరిప్పుడు. ఇతని గుట్టు అతనికీ, అతని జుట్టు ఇతనికీ బాగా అందాయని అర్థం! అక్రమ ధనార్జనలో వారి బంధం బాగా పెనవేసుకుందని అర్థం. పైపైన కనిపించే దేమిటంటే - ఒకరు ఆధ్యాత్మిక గురువు, మరొకరు రాజకీయ నాయకుడు. లోతుగా తరచి చూస్తే, ఒకరి వల్ల మరొకరు లాభం పొందుతూ, పరస్పర అవగాహనతో అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న మాయగాళ్ళు వారు.
ఒకప్పుడు కేరళలో సముద్రపు ఒడ్డున పిచ్చిగా తిరిగే సంధ్యారాణి ఈ రోజు మాతా అమృతానందమయిగా, కౌగిలింతల అమ్మగా వేల కోట్లకు పడగలెత్తింది. ఈమెకు లోగడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రభుత్వం రెండువందల ఎకరాల భూమి ధారాదత్తం చేసింది. మెడికల్ యూనివర్సిటీ స్థాపించడానికి అనేది బయటికి చెప్పే కారణం. ఇందులో చదివిన వారు వైద్యులవుతారా మానసిక రోగులవుతారా అన్నది భవిష్యత్తులో తేలుతుంది. మూడు శ్రీల రవిశంకర్ యమునా నది ఒడ్డును నాశనం చేస్తే, పర్యావరణశాఖ కొన్ని కోట్ల జరిమానా విధించింది. 'దోస్త్ మేరా దోస్త్ - మోడి మెరా దోస్త్' అనే వంకతో ఆయన ప్రభుత్వానికి వందకోట్ల జరిమానా ఎగ్గొట్టాడు. అలాగే కోయంబత్తూర్లో గిరిజనుల భూములాక్రమించి ఈషా ఫౌండేషన్ స్థాపించుకున్న జగ్గీ వాసుదేవ్ - భార్యను హత్య చేసిన ఘనుడు! ఈయన గూర్చి న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంగ్లీషు దినపత్రిక ప్రచురించిన కథనాలు అబద్ధాలు కాదు గదా? ఈయన నేరచరిత్ర తెలుసుకోకుండానే, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈయనను ఆహ్వానించాడా? ఆయనతో పాటు గంతులేశాడా? రాందేవ్ బాబా తయారుచేస్తున్న వస్తువులన్నీ కల్తీవని నేపాల్ ప్రభుత్వం గ్రహించి నిషేధించింది. మరి మన ప్రభుత్వానికేమయ్యింది? ప్రజారోగ్యం కన్నా ప్రధాని మోడీకి రాందేవ్ స్నేహమే ఎక్కవయ్యిందా? ఎందుకు చర్యలు తీసుకోలేదు. పార్లమెంట్లో కూడా కొందరు ఎంపీలు తీవ్రంగా నిరసించారు కదా? ప్రధానికి చీమకుట్టినట్టు కూడా లేదు. పైగా రాందేవ్ని నెత్తిన పెట్టుకున్నాడు. అంటే లోపాయికారి ఒప్పందాలేవో ఉన్నట్టే కదా? స్వాములు, బాబాలు, మాతల పట్ల ప్రభుత్వాలు వాటి వైఖరి మార్చుకోవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎ(హెచ్)లో ఉన్న విధంగా మసలుకోవాలి. దేశ పౌరులంతా దానికి అనుగుణంగా నడుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. మానవాతీత శక్తులు ఎవరికీ ఉండవు. ఉన్నాయని ప్రకటించుకున్న వారిని ముందు అరెస్టు చేసి విచారణ చేపట్టాలి. మూఢనమ్మకాల నిర్మూలన చట్టాలు తీసుకురావాలి. ఆ దిశలో పనిచేసే ఉద్యమకారులకు, కార్యకర్తలకు అవి కొంత బలాన్ని చేకూరుస్తాయి. ఆ చట్టాల కోసం సామాన్య ప్రజలు ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలి.
గతంలో నలుగురు యువకులు పుట్టపర్తి సాయిబాబా పడకగదిలో హత్యచేయబడ్డారు. అతను గుప్తరోగాలతో చనిపోయాడు. ఇవన్నీ ఊరికే కారణం లేకుండా జరగవుకదా? సచ్చాడేరా గురుమీత్సింగ్ ఆశ్రమంలో శవాలగుట్టలే బయటపడ్డాయి. ఆశారాం బాపు, ఆయన కుమారుడు అత్యాచారం కేసుల్లో జైలుపాలయ్యారు. దేశంలో స్వాములు, బాబాలు, అమ్మల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఆధ్యాత్మికత ముసుగులో వారి అఘాయిత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అదుపు చేయాల్సిన ప్రభుత్వాధినేతలే లాలూచీపడిపోయి, వారికి పాదాక్రాంతులవుతున్నారు. ఇక చర్యలు తీసుకునే దెవరు? అన్ని రకాల వ్యవస్థల్ని కొనేయగలమనుకుని, ధనమదంతో చెలరేగి పోతున్నప్పుడు వారికి ఎవరు చెక్ పెట్టాలి? సామాన్య ప్రజలే పెట్టాలి. వివేకవంతులై వ్యవహరిస్తూ, వారి ఆటకట్టిస్తూ ఉండాలి. నిజాయితీ, నిబద్ధతా గల సామాన్యులే ఈ సమాజాన్ని ఆరోగ్యవంతంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోగలరు. దోషుల్ని చట్టానికి అప్పగించే పనిలో సామాన్య ప్రజలు నిరంతరం బాధ్యత తీసుకుంటూ ఉండాలి. ప్రజానేత్రం ఇలాంటి వారిపై నిఘా పెంచాల్సి ఉంది.
మతమేదైనా, మత గురువుల పేరుతో చలామణీ అయ్యే ఆధ్యాత్మిక గురువులంతా నేరగాళ్ళే. సామాన్య జనంలో ఎక్కువ ఓపిక, తక్కువ అవగాహన ఉండటం మూలాన మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మత గురువుల ఆటలు సాగుతున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన క్రైస్తవ మత పెద్ద కార్డినల్ పెల్, ప్రముఖ హేతువాది, నాస్తికుడు అయిన రిచర్డ్ డాకిన్స్తో ఒక చర్చలో పాల్గొన్నాడు. ''నాస్తికులకు నీతిగా బతకడం చేతకాదు'' అని ఆరోపించాడు. డాకిన్స్ దాన్ని తీవ్రంగా తిప్పికొట్టాడు. ''నీతిగా ఉండటమెలాగో నాస్తికుల నుంచి నేర్చుకోండి'' అని హితవు పలికాడు. చర్చ అయిపోయింది. ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. కొన్ని నెలలు గడిచాయి. వృద్ధుడైన ఆ మత పెద్ద కార్డినల్ పెల్ జైలు పాలయ్యాడు. కారణమేమంటే ఐదుగురు చిన్నారుల్ని లైంగికంగా వేధించి పట్టుబడ్డాడు. చిన్న పిల్లల్ని రేప్ చేసినట్టు న్యాయస్థానంలో ఒప్పుకున్నాడు. అదేమీ పెద్ద నేరం కాదని, శిక్ష తగ్గించమని సిగ్గులేకుండా న్యాయమూర్తిని వేడుకున్నాడు. న్యాయమూర్తి ఒప్పుకోలేదు. శిక్ష తగ్గించలేదు. వృద్ధాప్యంలో ఆ మత పెద్ద నీచుడిగా రుజువై జైల్లో మగ్గుతున్నాడు. గొంతుపెంచి, దబాయించి వాదించేవారంతా నీతిమంతులు కాదు. నిజమైన హేతువాదులు ఇలాంటి నీచమైన పనులకు పూనుకోరు. ''మీరంతా పాపులు'' అని జనాన్ని సంబోధించేవారే నిజమైన పాపులు!! వాక్చాతుర్యం వేరు. నిజాయితీగా సంస్కారవంతమైన విలువలతో కూడిన జీవితం - జీవించడం వేరు.
అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ కాంపస్లో ఉన్న మసీదుకు ఒక మౌల్వీగారున్నారు. ఆయన తొమ్మిదేండ్ల అమ్మాయిపై అత్యాచారం చేసి పట్టుబడ్డాడు. అమ్మాయికి 'ఖురాన్' నేర్పిస్తానని చెప్పి, మభ్యపెట్టి, ఇంటికి రప్పించుకుని అఘాయిత్యం చేశాడు. అమ్మాయి తల్లి విషయం గ్రహించి, పోలీసుల్ని ఆశ్రయించడంతో వారు మౌల్వీగారిని అరెస్ట్ చేశారు. మత విశ్వాసకుల - బోధకుల నిజాయితీ గురించి రోజూ ఎన్నో వార్తలు చదువుతున్నాం. దేవుడిపేరుతో, పవిత్ర గ్రంథాల పేరుతో జరుగుతున్న దురాగతాలు ఆగేదెట్లా? నిరీశ్వరవాదులు, హేతువాదులు మానవీయ విలువలతో నిజాయితీగా బతుకుతూ ఉంటే.. ఆత్మ విమర్శ చేసుకోవాల్సింది ఎవరూ? మత బోధకుల రాజకీయాలు ఏ స్థాయి వారిని ఆ స్థాయిలో ఉన్నాయి. అందువల్ల సామాన్య ప్రజలు అన్ని స్థాయిల్లో అలాంటి వారి గుట్టు రట్టు చేస్తూ ఉండాలి. సామాన్య ప్రజల్లో బేదాభిప్రాయాలు ఉంటాయి. అయినా క్షుద్రమైన మత రాజకీయాలను ఎదుర్కోవడానికి సంఘటితం కాకతప్పదు. ఉద్యమస్ఫూర్తితో ముందుకు కదలకా తప్పదు.
డాక్టర్ దేవరాజు మహారాజు
- వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త,
బయాలజీ ప్రొఫెసర్