Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమన్యాయమైన డిమాండ్ల పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నసమ్మె పూర్తిగా న్యాయ బద్ధమైనది. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా, గేటు ధర్నాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి అనివార్యంగా కార్మికులు సమ్మెబాట పట్టడం జరిగింది. కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చినప్పుడే ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచి పరిష్కరించకుండా రెచ్చగొట్టే ధోరణి అవలంబించింది. తీరా సమ్మె మొదలయ్యాక ప్రభుత్వం సమ్మెచేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపడం అన్యాయం. ఒక్కరోజు సమయమిచ్చి అంతా సమ్మెబాట వీడి విధుల్లో చేరాలని ఆజ్ఞాపించడం లేకపోతే డిస్మిస్ చేస్తామని హెచ్చరించడం ప్రజాస్వామ్య ప్రభుత్వ లక్షణం కాదు. చివరికి ముఖ్యమంత్రి పంతానికి పోయి 48000 మంది కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించి ఆర్టీసీ కార్మికులకు దసరా పండుగ సంతోషాన్ని లేకుండా చేసి వారి జీవితాలలో చీకటి నింపారు. పైగా కొత్తవారిని నియమిస్తామని, వారు భవిష్యత్తులో ఎటువంటి యూనియన్లో చేరబోమని తమకు హామీ ఇవ్వాలని ఆజ్ఞాపించటం బహుశా భారత ప్రజాస్వామ్యంలోనే అరుదైన సంఘటనగా, నియంతృత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కార్మికులకు యూనియన్ల ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఇన్ని యూనియన్లు ఎందుకు అన్న ముఖ్యమంత్రి ఆనాడు ఉద్యమసారథిగా సకల జనుల సమ్మె విజయవంతం చేయడంలో ఆర్టీసీకార్మికులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలే కీలకపాత్ర అని మెచ్చుకోలేదా? నాడు మోదమయిన సంఘాలు నేడు ఖేదమయ్యాయా? ముఖ్యమంత్రి ఆలోచించాలి. నీళ్ళు, నిధులు, నియామకాలు ఎజెండాగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళ విషయంలో ప్రాజెక్టులకు విపరీతంగా డబ్బులు ఖర్చు చేయడం జరిగింది. ప్రాజెక్టుల వ్యయం రాష్ట్ర ఖజానాకే భారంగా మారింది. నిధుల విషయంలో ఇవాళ తెలంగాణ అప్పుల తెలంగాణగా మిగిలిపోయింది. మిగులు బడ్జెట్ నుంచి ఇవాళ లోటు బడ్జెట్కు తిరోగమన దిశలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. నియామకాలు ఎలాగూ తెలంగాణ రాష్ట్రంలో జరగడం లేదు. రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్లు లేవు. ఇటువంటి పరిస్థితిలో ఒక్క ఉద్యోగం ఇవ్వని రాష్ట్రం ఏకంగా 48వేల మంది కార్మికులను తొలగించటం బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేదు. వెంటనే తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. మిగతా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలవాలి. ప్రభుత్వం పంచన చేరిన భజన సంఘాలు కూడా వెంటనే మేల్కోవాలి. నిన్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్ ఉద్యోగులు, నేడు ఆర్టీసీ కార్మికులు. రేపు ఎవరి వంతు వస్తుందో తెలియని పరిస్థితి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రజలే బుద్ధిచెపుతారు. ప్రజాస్వామ్యంలో పోరాటాలు, సమ్మెలు ఒక భాగం. ప్రభుత్వం అర్థం చేసుకొని పరిష్కరించాలి తప్ప అణచివేత తగదు. ఇప్పటికైనా ఆర్టీసీ సంఘాలతో చర్చించి వారి న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించాలి.
-పెండెం రాజు, హన్మకొండ.