Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి శతాబ్ది పూర్తవుతోంది. ఈ శతాబ్దికాలం ఆధునిక భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో వేలాదిమంది విప్లవకారులు మొక్కవోని త్యాగదీక్షతో స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ, తరువాతా ప్రజా సమస్యల్ని ఎజెండాగా మార్చటానికి సాగించిన పోరాటాలు, మహత్తర త్యాగాలతో కొత్త అధ్యాయం నెలకొంది. సమకాలీన భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచే శాస్త్రీయ భౌతికవాద అవగాహనతో పరిష్కారాలు ప్రతిపాదించటం ప్రారంభిం చింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరి చేందుకు, రాజకీయ వ్యవస్థలకు దిశా నిర్దేశం చేయటంలో శక్తివంచన లేకుండా కృషి చేసింది. కమ్యూనిస్టు పార్టీ భారతదేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా చూడాలని ఆశించింది. దేశం సాధించిన రాజకీయ స్వాతంత్య్రాన్ని ఆర్థిక స్వాతంత్య్రంగా మల్చుకోవాలన్న లక్ష్యంతో పని చేయనారంభించింది. అటువంటి ఆర్థిక స్వాతంత్య్రం కేవలం సోషలిస్టు వ్యవస్థ ద్వారానే సాధ్యమని విశ్వసించింది.
భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది పొడవునా జాతి హితం దిశగా కమ్యూనిస్టు పార్టీ, ఉద్యమాలు అందించిన సుసంపన్నవంతమైన తోడ్పాటు గురించిన విషయాలు ప్రజల ముందుకు తేనున్నాం.
ఆరంభం
మొదటి ప్రపంచ యుద్ధం నాటికి భారత స్వాతంత్య్రోద్యమంలో విప్లవకర శక్తులు, మధ్యేవాదుల మధ్య మొదలైన భిన్నాభిప్రాయాలు తర్వాతి కాలంలో సైద్ధాంతిక విభేదాలుగా పరిణామం చెందాయి. 1917 రష్యా విప్లవం విజయఢంకా మోగించటం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విప్లవ శక్తులతో పాటు భారతీయ విప్లవకారులకు మరింత స్ఫూర్తినిచ్చింది. ఈ స్ఫూర్తితోనే స్వాతంత్య్రోద్యమంలో పాలుపంచుకుంటున్న అనేకమంది విప్లవకారులు కమ్యూనిస్టులుగా మారారు.
మొట్టమొదటి కార్మికవర్గ విప్లవాన్ని ఆచరణ సాధ్యం చేసిన స్వర్గధామాన్ని చేరుకోవటానికి భారతీయ విప్లవకారుల్లో కొందరు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రయాణం చేశారు. అక్టోబరు 17, 1920న అప్పటి తాష్కెంట్లో ఉన్న భారతీయ విప్లవకారులు భారత కమ్యూనిస్టు పార్టీని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా పడి ఉన్న వివిధ విప్లవ గ్రూపులకు మార్క్సిజం-లెనినిజంలో సైద్ధాంతిక ఆచరణకు సంబంధించిన ప్రథమ పాఠాలు నేర్పేందుకు ఈ పార్టీ స్థాపన తోడ్పడింది. బొంబాయి, కలకత్తా, మద్రాస్, ఉత్తరప్రదేశ్-పంజాబ్ ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉన్న కమ్యూనిస్టు విప్లవకారులందరూ 1925లో కాన్పూర్లో జరిగిన మొదటి కమ్యూనిస్టు మహాసభకు హాజరయ్యారు. ఈ మహాసభ ద్వారానే భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించింది. ఎం.ఎన్. రారు, బ్రిటిష్ కమ్యూనిస్టు నేత రజనీ పామీ దత్లు అందించిన సహాయసహకారాలు ఎంతోమంది భారతీయ కమ్యూనిస్టు నేతల చైతన్యాన్ని తీర్చిదిద్దాయి.
ఆరంభం నుంచీ భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయోద్యమాన్ని ప్రభావితం చేస్తూ వచ్చింది. 1921లో అహ్మదాబాద్లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో మౌలానా హస్రత్ మొహాని, స్వామి కుమారానంద సంపూర్ణ స్వాతంత్య్రం కోసం ప్రతిపాదించిన తీర్మానాన్ని గాంధీజీ అంగీకరించలేదు. 1922లో గయలో జరిగిన సమావేశాల్లో సీపీఐ జాతీయోద్యమ లక్ష్యాలకు సంబంధించి ఓ పత్రాన్ని ప్రతిపాదించింది.
తీవ్రమైన అణచివేత
భారతదేశంలో సంఘటిత కమ్యూనిస్టు ఉద్యమం వేళ్లూనుకుంటే తలెత్తే సమస్యల గురించి బ్రిటిష్ పాలకులకు స్పష్టమైన అవగాహన ఉంది. కమ్యూనిస్టు నాయకులపై కుట్ర కేసులు బనాయించి తీవ్రమైన అణచివేతకు పాల్పడింది. 1922, మే ప్రారంభంలో మాస్కో చేరటానికి ప్రయత్నించిన భారతీయ కమ్యూనిస్టు విప్లవకారులపై పెషావర్లో ఐదు కుట్ర కేసులు, తర్వాత 1923-24లో కాన్పూర్ కుట్ర కేసులు బనాయించింది బ్రిటిష్ ప్రభుత్వం. మాస్కో నుంచి భారతదేశం తిరిగి వచ్చిన విప్లవకారులను, దేశంలో ఉన్న విప్లవకారులను ఆగమేఘాల మీద ఖైదు చేసింది. అంతకు పూర్వమే 1915లో గదర్ ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్న వారిపై లాహౌర్ కుట్ర కేసు బనాయించింది. 291మంది గదర్ పార్టీ సభ్యులు దక్షిణాసియా దేశాల మీదుగా ప్రయాణించి భారతదేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరిని అరెస్టు చేసి విచారణ తతంగం సాగించి అందులో 42మందిని ఉరి తీయగా 114మందికి జీవిత ఖైదు విధించింది. 1929 మార్చి20న 31మంది ప్రముఖ కమ్యూనిస్టు ఉద్యమ నాయకులపై మీరట్ కుట్రకేసు బనాయించి భారతదేశంలో మొగ్గ తొడుగుతున్న కమ్యూనిస్టు ఉద్యమాన్ని తుంచేసేందుకు విస్తృత స్థాయిలో అణచివేతకు పాల్పడింది.
ఈ నాయకులంతా జైలుశిక్ష అనుభవించి స్వాతంత్య్రో ద్యమంలో అగ్రగామి నేతలుగా గుర్తింపు పొందిన తర్వాతనే 1934లో సీపీఐ అఖిల భారత కేంద్రం ఉద్యమ కేంద్రంగా పని ప్రారంభించి నేటికీ కొనసాగుతోంది.
భిన్న దృక్పథాల మధ్య ఘర్షణ
స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశంలో మూడు భిన్న దృక్పథాల మధ్య జరిగిన ఘర్షణ ఫలితమే సమీకృత భారతం భావన. ప్రధాన స్రవంతి పార్టీగా ఉన్న కాంగ్రెస్ భారతదేశాన్ని లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యంగా పరిమితం చేయాలని భావించింది. స్వాతంత్య్రానంతరం భారతదేశం పెట్టుబడిదారీ అభివృద్ధి పంథా అవలంబిస్తే కాంగ్రెస్ ప్రతిపాదించిన లౌకిక ప్రజాతంత్ర గణతంత్రం అన్న లక్ష్యాన్ని కూడా చేరుకోలేమని కమ్యూనిస్టులు భావించారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే దేశం సాధించిన రాజకీయ స్వాతంత్య్రాన్ని సామాజిక ఆర్థిక స్వాతంత్య్రంగా మల్చుకోవాలని, ప్రతి భారతీయుడినీ ఈ స్వాతంత్య్ర ఫలాలు అందేలా చూడాలని, అటువంటి ప్రయత్నం కేవలం సోషలిజంలోనే సాధ్యమని కమ్యూనిస్టు పార్టీ ప్రతిపాదించింది.
ఈ రెండు దృక్పథాలకు పూర్తి విరుద్ధమైనది మూడో దృక్పథం స్వతంత్ర భారతదేశాన్ని మత ప్రాతిపదికన పునర్నిర్మించాలన్న ఎజెండాను ముందుకు తెచ్చింది. ఈ అవగాహన రెండు రూపాల్లో వ్యక్తమైంది. ఇస్లామిక్ రాజ్యాన్ని ప్రతిపాదించిన ముస్లిం లీగ్ ఈ అవగాహనకు ఓ కోణం అయితే హిందూ రాష్ట్రను ప్రతిపాదించిన ఆరెస్సెస్ రెండో కోణం. దురదృష్టవశాత్తూ దేశం ముక్కలై పాకిస్థాన్ ఏర్పడటంతో ముస్లిం లీగ్ లక్ష్యం నెరవేర్చుకోగలిగింది. పాకిస్థాన్ ఏర్పాటుకు బ్రిటిష్ ప్రభుత్వం తోడ్పాటు, పన్నిన వ్యూహం కీలక సాధనంగా ఉపయోగపడింది. దాని పర్యవసానాలు నేటికీ మనం అనుభవిస్తున్నాం. స్వాతంత్య్రోద్యమ కాలంలో భారతదేశాన్ని హిందు రాష్ట్రగా మార్చుకోవటంలో విఫలమైన ఆరెస్సెస్ అనుబంధ శక్తులు నవభారతాన్ని అడుగడుగునా అసహనంతో నిండి ఫాసిస్ట్ హిందూరాష్ట్రగా మార్చటానికి ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాయి. ఆరెస్సెస్ ప్రతిపాదించిన రాజకీయ లక్ష్యాన్ని స్వాతంత్య్రోద్యమం తిరస్కరించిందన్న వాస్తవాన్ని దిగమింగలేక పోవటమే గాంధీజీ హత్యకు దారితీసిన నేపథ్యం.
నిజానికి స్వాతంత్య్రోద్యమ కాలంలో భవిష్య భారతం గురించి మొదలైన మూడు దృక్పథాల మధ్య ఉన్న ఘర్షణే నేడు మనం చూస్తున్న రాజకీయ సైద్ధాంతిక పోరాటాల రూపంలో సమకాలీన భారతంలో ముందుకొస్తోంది.
వామపక్షాల పాత్ర
భారత కమ్యూనిస్టు పార్టీ వలసవాద వ్యతిరేక పోరాటంలో భాగంగా ముందుకు తెచ్చిన సమస్యలు, సాగించిన పోరాటాల ద్వారా సమీకృత భారతం అన్న భావన వేళ్లూనుకునేలా చేయటంలో కీలక పాత్ర పోషించింది. అలాంటివాటిలో మొదటిది భూసమస్య. కేరళలో ఉన్న ప్ర వాయలార్, బెంగాల్లో తెభాగ, అస్సాంలో సుర్మా లోయ, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ తిరుగుబాటు, వీటన్నింటికి తలమానికమైన తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా దేశంలో భూసంస్కరణల సమస్యల్ని కీలకమైన ఎజెండాగా మార్చింది. జమిందారీ వ్యవస్థ, భూస్వామ్య ఎస్టేట్ల రద్దు, కోట్లాదిమందిని భూస్వామ్య బంధనాల నుంచి విముక్తి చేయటానికి కావల్సిన చర్యలు చేపట్టడం ఈ రైతాంగ పోరాటాల పర్యవసానమే. దోపిడీకి గురవుతున్న విశాల గ్రామీణ ప్రజానీకం ఈ పోరాటాల ఫలితంగానే విముక్తి ఉద్యమంలో భాగస్వాములయ్యారు. దీనికి భిన్నంగా గ్రామీణ ప్రాంతంలో దోపిడీ చేస్తున్న వర్గాలకు నాయకత్వ స్థానం అప్పగించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కమ్యూనిస్టు పార్టీ సాగించిన పోరాటం రెండో కీలకమైన పోరాటం. కమ్యూనిస్టు పార్టీ సాగించిన పోరాటాల ఫలితంగానే నేడు మనం చూస్తున్న భారతదేశ చిత్రపటం ఉన్నంతలో ప్రజాతంత్ర స్వభావం కలిగిన పరిపాలన యూనిట్లుగా కనిపిస్తుంది. విశాలాంధ్ర, ఐక్య కేరళ, సంయుక్త మహారాష్ట్ర వంటి ఉద్యమాలకు దేశ కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగామి నేతలు నాయకత్వం వహించారు. ఫలితంగా భారతదేశంలో భాషా ప్రాతిపదికన అభివృద్ధి చెందిన జాతులు సమానత్వం, జాతీయ సమగ్రతల ప్రాతిపదికన ఐక్యంగా నిలిచాయి. భారతదేశపు ప్రత్యేకతలను దృష్టిలో పెట్టుకుని లౌకిక విలువల కోసం నికరంగా నిలబడటం భారత కమ్యూనిస్టు ఉద్యమ విజయాల్లో మూడోది. భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన 1920 తొలినాళ్లలోనే ఎం ఎన్ రారు ఆ సమయంలో జరిగిన మతోన్మాద కలహాల నేపథ్యంలో సామ్రాజ్యవాదానికి, మతోన్మాదానికి, దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పీడిత వర్గాల ఐక్యతే మతోన్మాద విచ్ఛిన్నానికి విరుగుడు అని స్పష్టం చేశారు.
భారతదేశంలో ఉన్న లోతైన వైవిధ్యం నేపథ్యంలో జాతీయ సమైక్యత కాపాడాలంటే ఇదొక్కటే మార్గం తప్ప ఈ వైవిధ్యంపై ఏకీకృత సామాజిక నిర్మాణాన్ని రుద్దటం మార్గం కాదు. కానీ నేడు మతోన్మాదులు అటువంటి ఏకీకృత నిర్మాణాలను వివిధ జీవన స్రవంతులకు చెందిన ప్రజలందరిపైనా రుద్దాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. సామాజిక వైవిధ్యం నేపథ్యంలో భారతీయ భావనలు దండలో దారంలో ప్రజలందరి మధ్యా నెలకొనేలా చూడాలనటంలో ఎటువంటి సందేహమూ లేదు. ప్రత్యేకించి భిన్నమతాల ప్రజల మధ్య ఇది మరింత కీలక ప్రాధాన్యత కలిగిన అంశం. దేశ విభజన, దాంతో పాటు చోటు చేసుకున్న ఘోరమైన మతోన్మాద మారణకాండల నేపథ్యంలో లౌకిక విలువలు, లౌకికతత్వం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయటమే లౌకికతత్వానికి పరమావధి. అంటే రాజ్యం ఎవరు ఏ మత విశ్వాసాన్నైనా పాటించే పూర్తి హక్కులను ఖాయం చేస్తూనే ఏ ఒక్క మతానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటమే. కానీ ఆచరణలో స్వాతంత్య్రానంతర భారతదేశంలో లౌకికతత్వ భావనను అంటే మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయటం అన్న అవగాహనకు బదులు అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం అన్న అవగాహనకు కుదించేశారు. అన్ని మతాలకు సమాన ప్రాతినిధ్యం అంటే అనివార్యంగా సంఖ్యాబలం ఉన్న మతానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటమే. ఈ ధోరణే నేడు మతోన్మాద శక్తులు విచ్చలవిడిగా పేట్రేగే పరిస్థితులు కల్పించాయి.
నూతన వర్గాలు - వర్గ పోరాటాలు
వలస దేశాల్లో అభివృద్ధి చెందిన బూర్జువా వర్గాల్లో భారతీయ బూర్జువా వర్గం మరింత పరిపక్వమైనది. అటువంటి పరిపక్వమైన భారతీయ బూర్జువావర్గం స్వాతంత్య్రానంతరం పెట్టుబడిదారీ అభివృద్ధి పంథా అనుసరించేందుకు ఉత్సుకతతో ఉంది. స్వాతంత్య్రానంతరం పాలకవర్గానికి నాయకుడుగా స్థిరపడే క్రమంలో భూస్వామ్యవర్గంతో పొత్తు పెట్టుకుని సామ్రాజ్యవాద శక్తులతో రాజీ పడింది. ఈ విధమైన పొత్తు, రాజీల తర్వాతనే వలస పాలకులు దేశంలో అధికారాన్ని బదలాయించారు. తద్వారా భారతదేశాన్ని సామ్రాజ్యవాదం, భూస్వామ్య విధానాల పట్టు నుంచి విముక్తి కోసం సాగిన స్వాతంత్య్రోద్యమ విముక్తి లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరకుండా అవరోధాలు కల్పించారు. అందువల్లనే కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో విప్లవ దశను ప్రజాతంత్ర విప్లవ దశగా నిర్థారించింది. ఈ దశలో సాగే పోరాటాలకు మూడు లక్షణాలుంటాయి. మొదటిది భూస్వామ్య వ్యతిరేక స్వభావం, సామ్రాజ్యవాద వ్యతిరేక స్వభావం, గుత్తపెట్టుబడిదారీ వ్యతిరేక స్వభావం.
శతాబ్దం క్రితం ఏర్పడిన భారత కమ్యూనిస్టుపార్టీ భారతదేశంలో సోషలిజం స్థాపన లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోయిందని దేశ విదేశాల్లో ఉన్న కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషులు ప్రశ్నిస్తుంటారు. ఇదే సమయంలో ఏర్పడిన చైనా, వియత్నాం, కొరియా కమ్యూనిస్టు పార్టీలు ఆయా దేశాల్లో అధికారానికి వచ్చిన విషయం కూడా తరచూ ప్రస్తావనకు వస్తుంది. నిబద్ధత లేకపోవటమో లేక కార్యకర్తలకు త్యాగనిరతి కొరవడటమో దీనికి కారణం కాదు. దేశాన్ని కుదిపేసిన వర్గ పోరాటాలు నడిపిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. జాతీయ విముక్తి పోరాట కాలంలో పీడితులైన కార్మికులు, కర్షకులు, ఇతర వర్గాల పక్షాన అంతులేని త్యాగాలు చేసిన గుర్తింపు కూడా ఉంది. దేశంలో మెరికల్లాంటి విప్లవోద్యమాల వారసత్వం కమ్యూనిస్టు పార్టీది.
మార్క్సిజం-లెనినిజం సృజనాత్మక శాస్త్రం. నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట అధ్యయనానికి నిలువెత్తు నిదర్శనం. సదరు నిర్దిష్ట పరిస్థితుల్ని నిర్దిష్టంగా అంచనా వేయలేకపోయినప్పుడు, లేదా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విశ్లేషణలు మారనప్పుడు పొరపాటు జరుగుతుంది. వలసవాద వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టులు విశేషమైన పాత్ర పోషించినప్పటికీ చైనా, కొరియా, వియత్నాంలలో జరిగినట్టు విముక్తి ఉద్యమానికి నాయకత్వం వహించలేకపోయారు.
భారత పాలకవర్గాల వర్గ స్వభావం, భారత విప్లవ పంథా వంటి కీలకమైన అంశాల్లో కమ్యూనిస్టుల మధ్య తలెత్తిన విభేదాలతో గడచిన దశాబ్దాల్లో కమ్యూనిస్టు పార్టీ చీలిపోయింది. భారత పాలకవర్గాల వర్గ స్వభావాన్ని సరిగ్గా అంచనా వేసిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సాగించిన వర్గపోరాటాల్లో విశాల ప్రజానీకాన్ని సమీకరించగలిగింది. స్వతంత్ర భారతదేశంలో ప్రధానమైన కమ్యూనిస్టు శక్తిగా ఎదిగింది.
పార్లమెంటరీ పోరాటాలు, పార్లమెంటరీయేతర పోరాటాలు మేళవించిన సీపీఐ(ఎం) దేశంలో రాజకీయ పరిణామాలు, ప్రభుత్వాల ఏర్పాటును గుర్తించగలిగిన స్థాయిలో ప్రభావితం చేసింది. కేరళలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం 1957లో ఏర్పడింది. తర్వాతి కాలంలో బెంగాల్, త్రిపురలో సీపీఐ(ఎం) నాయకత్వంలోని వామపక్ష సంఘటన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. వీటితో పాటు పార్లమెంట్లో కూడా క్రియాశీల పాత్ర పోషించిన సీపీఐ(ఎం) ఆధునిక భారతదేశ రాజకీయాలు దిశ, దశలను ప్రభావితం చేయటంలో గణనీయమైన పాత్ర పోషించింది.
అయితే గత దశాబ్దకాలంగా సీపీఐ(ఎం) పార్లమెంటరీ రంగంలో పోషించే పాత్ర కుదించుకుపోయింది. మితవాదశక్తుల రాజకీయ పథకాలను నిరంతరం రాజీపడకుండా వ్యతిరేకిస్తున్నందున ఈ శక్తులు ప్రధానంగా కమ్యూనిస్టులను బలహీనపర్చటమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీనికిగాను మితవాద శక్తులు కమ్యూనిస్టులపై భౌతికదాడులు, అణచివేతకు పాల్పడటం, హింసాత్మక రాజకీయ సంస్క ృతిని పెంచి పోషించించటం వంటివి చేస్తూ వచ్చాయి. ఈ ప్రయోగానికి తొలుత బెంగాల్ను లక్ష్యంగా ఎంచుకున్న మితవాద శక్తులు తర్వాత తమ ప్రయత్నాలను త్రిపురకు కూడా విస్తరించాయి. తాజాగా కేరళలో ఇదే వ్యూహాన్ని అమలు చేసేందుకు విశ్వ విఫల ప్రయత్నం చేస్తున్నాయి.
అయితే ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటకీ ఈ కాలంలో పీడితవర్గాలను పోరాటాల్లోకి సమీకరించటంలో సీపీఐ(ఎం)కీలక పాత్రధారిగా ఉంది. ప్రధానంగా ఈ కాలంలో కార్మిక, కర్షక వర్గాలను సమీకరించటంలో సీపీఐ(ఎం) విశేష కృషి చేసింది. ఈ పోరాటాలు దేశ రాజకీయరంగం మీదకు తెచ్చిన అనేక సమస్యలు విస్మరించలేనివిగా మారాయి.
నేటి సవాళ్లు
మతోన్మాదంతో మిలాఖత్ అయిన కార్పొరేట్ శక్తులు మతం ఆధారిత జాతీయోన్మాదాన్ని రెచ్చగొడుతున్నాయి. ప్రజా ప్రయోజనాలకంటే జాతి ప్రయోజనాలే మిన్న అన్న ప్రచారాన్ని తలకెత్తుకున్నాయి. జాతి ప్రయోజనాల రీత్యా ప్రజలు చివరకు తమ ప్రజాతంత్ర హక్కులు సైతం త్యాగం చేయటమే దేశభక్తి చిహ్నం అన్న భావనలు కల్పిస్తున్నారు. తాజాగా జాతీయ నిఘా చట్ట సవరణ బిల్లుపై పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా హౌంశాఖ మంత్రి అమిత్షా ఈ సవరణలు వ్యతిరేకించే వారంతా ఉగ్రవాద సమర్ధకులేనని ప్రకటించటం ఇందులో భాగమే. అన్ని తరగతుల పౌర స్వేచ్ఛ, ప్రజాతంత్ర హక్కులను ఈ చట్టాలు, సవరణలు పెద్దఎత్తున పరిమితులు ఏర్పరుస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం, దాని విధానాల పట్ల అసమ్మతి వ్యక్తం చేయటం కూడా రాజద్రోహంగా పరిగణిస్తూ అరెస్టులకు దారితీసే పరిస్థితులు తలెత్తాయి. పోలీసు రాజ్యాన్ని ఇప్పుడు అధికారికంగానే అమలు చేయటానికి కేంద్రం పూనుకుంది.
జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హౌదా రద్దు చేయటం, రాష్ట్రంలో ప్రజా జీవనాన్ని సైనిక చట్రబంధంలో బిగించటం, అస్సోంలో పౌర రిజిష్టరు, అటువంటి రిజిష్టరును దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్న హెచ్చరికలు, పౌరసత్వం చట్టానికి సవరణలు తెచ్చి దేశంలోని ముస్లింలను పౌరులుగా గుర్తించ నిరాకరించే ప్రయత్నం వంటివన్నీ లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర భారతం మనుగడనే సవాలు చేస్తున్న పరిణామాలు.
వామపక్షాలకు, వామపక్ష మధ్యేవాద శక్తులు సంఘటితం కావటమే మితవాద రాజకీయ సంఘటనను ఎదుర్కొనే ఏకైక మార్గం. మితవాద రాజకీయ శక్తులు విసురుతున్న సవాలును ఎదుర్కొనేందుకు సీపీఐ(ఎం) కృతనిశ్చయంతో ఉంది. భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ శతాబ్ది ఉత్సవాలు ఇప్పటి వరకు ఈ ఉద్యమం ఎదుర్కొన్న అనేక పరిమితుల్ని అధిగమించేందుకు స్ఫూర్తినిచ్చే సందర్భంగా మారాలి. కమ్యూనిస్టు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు కంకణధారులమయ్యే సందర్భం ఇది కావాలి. వర్తమాన భారతదేశాన్ని రాజ్యాంగ విలువల ప్రాతిపదికన మనుగడ సాగించే దేశంగానూ, దేశంలోని దోపిడీకి భరతవాక్యం పాడటం ద్వారానే పై లక్ష్యాలు మనం నెరవేర్చుకోగలం.
మౌలానా హస్రత్ మొహాని ఇచ్చిన నినాదం భగత్సింగ్ పేరు స్మరిస్తేనే గుర్తుకువచ్చే నినాదం ఇంక్విలాబ్ జిందాబాద్. సమకాలీన మతోన్మాద జాతీయ దురహంకారంతో కూడిన దాడులను ఢకొీట్టే సింహనాదం కావాలి. సమీకృత భారతం వర్ధిల్లాలి. జనతా ప్రజాతంత్ర ప్రభుత్వ సాధన, సోషలిజం కోసం సాగే ప్రయత్నాలను మరింత సంఘటితం చేసుకంటూ ముందుకు సాగుదాం. - - సీతారాం ఏచూరి
అనువాదం : కొండూరి వీరయ్య
సెల్: 9871794037