Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ రాష్ట్రంలో అటు ఉద్యోగులు, ఇటు నిరుద్యోగుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలా తయారైంది. నిరుద్యోగులకు నియామకాలు లేవు, ఇస్తామన్న నిరుద్యోగ భృతీలేదు, గతీలేదు. ఇటు ఉద్యోగులకు మధ్యంతర భృతి లేదు. పీఆర్సీ అమలు లేదు. ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ లేవు. పదోన్నతులు లేవు. తెలంగాణ వస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని భావించిన ఆయా వర్గాలకు నిరాశే మిగులుతోంది. నాడు ఉద్యమ సమయంలో జరిగిన సకల జనుల సమ్మెలో నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రజలతో కలసి భాగస్వాము లయ్యారు. ఉద్యమ నాయకుడు ప్రభుత్వాధినేత అయితే ఉద్యమకారుల సమస్యలు పరిష్కారమవుతాయి అనుకుంటే.. ఉద్యమం చేసినోళ్లు డిమాండ్ల సాధన కోసం రోడ్లమీద టెంట్ల కింద పోరాటం చేస్తుంటే, ఉద్యమంలో పాల్గొనని వారు ఉద్యమాన్ని కించపరిచినవారు నేడు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా వివిధ ప్రభుత్వ పదవులలో దర్జా ఒలకబోస్తున్నారు. కీలక విషయం ఏమిటంటే నాడు సకల జనుల సమ్మెలో ఉద్యోగులు నాయకత్వం వహించినవారు నేడు ప్రభుత్వంలో వారు కనీసం ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకువెళ్లే ధైర్యం చేయటం లేదు. ఆయా సంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇప్పించలేని దైన్యస్థితిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యోగ సంఘాలు నేడు కేవలం ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారడం ఉద్యోగులు జీర్ణించుకోలేక పోతున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తమ జీతాలను, జీవితాలను పణంగాపెట్టి సమ్మె చేస్తుంటే కనీసం సాటి ఉద్యోగులుగా వారికి మద్దతు పలకలన్నా కూడా నేడు ఉద్యోగ సంఘాలు మీనమేషాలు లెక్కించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
ఉమ్మడి రాష్ట్రంలో శాసించే స్థాయిలో ఉన్న సంఘాలు నేడు స్వంత రాష్ట్రంలో యాచించే పరిస్థితి రావడం బహుశా ఒక్క ఉద్యోగి కూడా కలలో కూడా ఊహించని పరిస్థితి. 33 రోజులు సకల జనుల సమ్మె చేస్తే నాటి ప్రభుత్వం ఉద్యోగులు, కార్మికుల మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంత కఠినంగా ఏనాడు అణిచివేయలేదు. పైగా సమ్మెకాలానికి ఉద్యోగులకు వేతనం కూడా ఇచ్చారు. కాని నేడు రాష్ట్రంలో ఎమర్జన్సీ రోజులను తలపిస్తున్నాయి. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం బలిదానాలు చేస్తే నేడు కోరి తెచ్చుకున్న రాష్ట్రంలో డిమాండ్ల సాధన కోసం ఆత్మబలిదానాలకు కూడా సిద్ధపడటం విచారకరం.
ఒంటరి అయిన ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ సంఘాలు బాసటగా నిలవాలి. రేపు మీరు సమ్మెచేస్తే మీ పరిస్థితి కూడా ఇంతే అని ప్రభుత్వం చెప్పకనే చెప్పినట్టయింది. ఇవాళ ప్రభుత్వం బలం కన్నా సంఘాల అనైక్యతే ప్రభుత్వానికి ఆదనపు బలంగా మారింది. ఈ పరిస్థితి మారాలి. మళ్లీ సకల జనుల సమ్మె స్ఫూర్తిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాలు ఒక్కటి కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటై జేఏసీ గొడుగుకింద ఉద్యమాలు చేస్తే తప్ప నిరంకుశ, నియంతృత్వ ప్రభుత్వానికి సోయి రాదు. ప్రభుత్వం 48వేల మంది కార్మికులను డిస్మిస్ చేసినా అదరక, బెదరక సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికుల పోరాట స్ఫూర్తి అభినందనీయం. ఉద్యోగ సంఘాలు కూడా వారికి మద్దతు ప్రకటించి ప్రత్యక్ష పోరాటాలు చేసే చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోవాలి.
- పెండెం రాజు, వరంగల్.