Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవును! అప్పుడు శ్రీకాంతాచారి! ఇప్పుడు శ్రీనివాసరెడ్డి!! ఇవి చాటుగా కాల్చిన ఎన్కౌంటర్ హత్యలు కావు. హైదరాబాద్ నడిబొడ్డున బషీర్బాగ్లోనో, ఖమ్మంజిల్లా ముదిగొండలోనో చంద్రబాబు, వైయస్లు ఉసికొల్పిన పోలీసు హత్యలు కావు. రోజూ ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో ముఖ్యమంత్రో, రవాణశాఖ మంత్రో ఆర్టీసీ కార్మికులందర్నీ తొలగించేశామని, మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకునే సమస్యేలేదని చెప్పడం, ఎలక్ట్రానిక్ మీడియాలో పదేపదే దాన్ని చూపించడం కొందరు ఆర్టీసీ కార్మికులు గుండె నిబ్బరం కోల్పోయేలా చేసింది, చేస్తోంది.
2001లో ఏపీఎస్ఆర్టీసీలో 24 రోజులు సమ్మె చేసినా లక్ష గుండెల్లో ఒక్కటీ ఆగనిది, నేటి సమ్మె నాలుగైదు రోజులు గడిచేటప్పటికే నాలుగు గుండెలు బద్దలై నాలుగు కుటుంబాలు రోడ్డున పడటం, తొమ్మిదో రోజుకే ఒక ఆత్మబలిదానం జరగటం అంటే అర్థం ఏమిటి?
కొన్ని లెక్కలు చూస్తే ఈ ప్రభుత్వం ఎంత కిరాతకమైందో తెలుస్తుంది. కార్మికుల క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ డబ్బులు రూ.528.55 కోట్లు యాజమాన్యం వాడుకుంది. జనవరి 2019 నుంచి 9000 మందికి సీసీఎస్ లోన్లు రావట్లేదు. కార్పొరేషన్ వాడుకున్న పీఎఫ్ డబ్బు రూ.826 కోట్లు. 2019 మార్చి నుంచి కార్మికులకు పీఎఫ్ లోన్లు రావటంలేదు. (ఆర్టీసీకి విడిగా పీఎఫ్ ట్రస్టు ఉంది) 2018 నుంచి రిటైర్ అయిన కార్మికులకు ఇవ్వాల్సిన రూ.528 కోట్లలోనూ సుమారు వందకోట్లు ఇవ్వలేదు. దీని ఫలితం ఎంత హృదయవిదారకంగా ఉందో తెలుసా? శ్రీనివాసరెడ్డి సూసైడ్ నోట్లో ''పీఎఫ్ / సీసీఎస్ డబ్బులను వెంటనే జమచేయాలి'' అని రాశాడు. అందుకే ఈ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.
నిజాం జమానా ఎప్పుడో పోయింది కేసీఆర్ సాబ్!
మన ముఖ్యమంత్రి ఇంకా దేశ్ముఖ్ల, జాగీర్దార్ల జమానాలోనే వున్నాననుకుంటున్నాడు. ఆర్టీసీ కార్మికులందరూ తన పాలేర్లనుకుంటున్నాడు. 48,000 మంది కార్మికులు ''సెల్ఫ్ డిస్మిసల్'' అయిపోయారట! ''సెల్ఫ్ డిస్మిస్''అనే మాట పారిశ్రామిక వివాదాల చట్టంలో వుందా? అన్ని వేలమందిని అలా తొలగించటం తప్పనికాని, తొలగించలేరనిగాని కనీసం అధికారగణం కూడా ఆయనకు చెప్పినట్టు లేదు. లేదా చెప్పినా దొరవారు ముందుకే సాగాడేమో తెలీదు. ఈ సమ్మె చేసినవారికి సెప్టెంబరు జీతాలివ్వనంటున్నాడు కేసీఆర్. కేసీఆర్ ఇంట్లో పనివాళ్లా ఆర్టీసీ కార్మికులు? అక్టోబర్ 1వ తేదీనే సెప్టెంబరు జీతాలివ్వాలి. కనీసం 7వ తేదీలోపు ఇవ్వాలి. ఇది పేమెంట్ ఆఫ్ వేజెస్ చట్టం. ఈయనగారి ఢిల్లీ 'దోస్త్' మోడీజీ కొత్తగా తెచ్చిన వేజ్కోడ్ రక్షణ కవచంగా ఉంటుందన్న ఆశలో వున్న కేసీఆర్ మైకం ఆర్టీసీ కార్మికులు వదలగొట్టాలి.
వేతన ఒప్పందం కోసం 30 నెలలు ఆగి, 2019 సెప్టెంబరు 6న సమ్మె నోటీసు ఇచ్చాయి అన్ని కార్మిక సంఘాలు. ఈ 30 నెలల్లో ప్రతి సంఘమూ చెయ్యని ప్రయత్నం లేదు. మంత్రుల పైరవీల దగ్గర్నించి, సమ్మె బ్యాలెట్ల వరకు ఒక్కొక్క యూనియన్ ఒక్కొక్క పద్ధతిలో ప్రయత్నించాయి. ఏదీ సఫలం కాలేదు. ఏ ప్రయివేటు పరిశ్రమలోను ఇంత ఓపిగ్గా వుండరు కార్మికులు. కాని ఆర్టీసీలో వున్నారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలిస్తానని స్పష్టంగా చెప్పాడు. ఈ కాలంలో ఈ విషయం కార్మికుల మనసుల్లో బలంగా నాటుకుంది. దీనికితోడు పక్కనున్న ఏపీలో విలీనం చేసుకుంటున్నట్టు ఆ రాష్ట్ర సీఎం ప్రకటించాడు. వైఎస్ జగన్తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న కేసీఆర్ ఇక్కడా అమలుచేస్తాడన్న ఆశ కార్మికుల్లో కలిగింది. శ్రీనివాసరెడ్డి సూసైడ్ నోట్లోనూ ''విలీనం'' ఒక ప్రధాన కోరిక.
రెండు సంవత్సరాలపైగా ఆగి అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత సమ్మె ప్రారంభించిన వెంటనే 'బ్లాక్మెయిల్' చేస్తున్నారని ముఖ్యమంత్రి బెదిరించడంలో ఆంతర్యం ఏమిటి? మరి తమతో ఆనాడు 27రోజులు సకలజనుల సమ్మె చేయించటం కూడా బ్లాక్మెయిలేనా? అని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఏ రంగం కార్మికుల డిమాండ్లయినా, చివరికి రాజకీయ డిమాండ్లయినా పోరాడకపోతే సాధించుకోగలమా? అడగనిదే అమ్మ అయినా పెట్టదనే జీవిత సత్యం తెలియని వారుంటారా? తనది ఉద్యమపార్టీ అని చెప్పుకునే కేసీఆర్ అనాల్సిన మాటేనా ఇది?! ఆయన మాటలు రాష్ట్ర కార్మికోద్యమానికే పెద్ద సవాలు. రాష్ట్ర కార్మికోద్యమమా! హోషియార్ రహో!
టీఎస్ఆర్టీసీని రక్షించుకుందాం!
నేడు ఆర్టీసీ సమ్మెలో కీలక డిమాండ్ ఆర్టీసీ పరిరక్షణ. ఇది అన్ని ప్రభుత్వరంగ పరిశ్రమల కార్మికులు అనుసరించాల్సిన పంథా. ''నీచేతను, నా చేతను, వరమడిగిన కుంతిచేత, వాసవుచేతన్, ధరచేత, శల్యుచేత అరయంగా కర్ణుడీల్గె ఆర్గురి చేతన్'' అన్న శ్లోకం తెల్సిన వారికి కచ్చితంగా ఆర్టీసీని హత్య చేస్తున్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేనన్న విషయం కూడా తెలియాలి.
రోజూ 36 లక్షల కి.మీ. తిరుగుతూ (2018-19లో) సుమారు కోటి మంది ప్రయాణీకులను వారి గమ్యస్థానాలకు చేర్చే టీఎస్ఆర్టీసీ సంవత్సరంలో 25 కోట్ల 55 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తోంది. దీనిపై కేంద్రానికి చెల్లించిన ఎక్సైజ్ డ్యూటీ గత 5 సంవత్సరాల్లో రూ.1375.28 కోట్లు, రాష్ట్రానికి చెల్లించిన పన్ను రూ.1234.61 కోట్లు. అంటే రెండూ కలిసి రూ.2609.89 కోట్లు. ఇది పన్నే. దీనికి ఇంత డీజిల్ ఖరీదు (మనం కొనే ప్రతి లీటర్ డీజిల్లో 51శాతం పన్ను, 49 శాతం డీజిల్ ధర కనీసం దేశంలోని ఆర్టీసీలకైనా పన్నులు తగ్గించాలని దేశ ప్రజాతంత్ర ఉద్యమం ఏనాటి నుండో డిమాండ్ చేస్తున్నది. టీఎస్ఆర్టీసీలో సీఐటియూ అనుబంధ సంఘం ఈ ఐదేండ్లలో డిమాండ్చేయని రోజు లేదు.
అసాధారణ స్థాయిలో జీఎస్టీ బాదుతోంది
బస్ బాడీ బిల్లింగ్ చేయిస్తే దానిపై గతంలో 5శాతం పన్ను కట్టే టీఎస్ఆర్టీసీ నేడు 18శాతం జీఎస్టీ కడ్తున్నది. ఛాసిస్లపై 14శాతం పన్ను కడ్తూండగా నేడు 28శాతం జీఎస్టీ కడ్తున్నది. నిర్మించిన బస్సుపై 14శాతంగా వున్న పన్ను నేడు జీఎస్టీ 28శాతానికి చేరింది. ఇవిగాక స్పేర్పార్ట్లపై పన్నులు. తడిసి మోపెడై ఆర్టీసీ మునిగిపోవట్లేదా?! నేడు ఆర్థిక సంక్షోభం వచ్చిందని ప్రతిరంగం వారూ జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేస్తుంటే దేశంలోని అన్ని రోడ్ ట్రాన్స్పోర్టు కార్పొరేషన్లకూ తగ్గించాలనే ఇంగిత జ్ఞానం కేంద్ర ప్రభుత్వానికి ఉండాలి కదా?! ఆనాడు బల్లలు చరిచి ఆమోదం తెల్పిన టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు నేడు గుండెలు బాదుకుని దీనివల్ల మా ఆర్టీసీ దెబ్బతింటోందని అడగాలి కదా!? అడుగుతున్నారా? ఎప్పుడైనా అడిగారా?
ఇదిగాక మోటారు వెహికిల్ టాక్స్ 2014-15 నుండి 2018-19కి సగటున ప్రతి సంవత్సరం రూ.210.4 కోట్లు కడ్తున్నది టీఎస్ఆర్టీసీ. ఇంత భారం మోస్తూనే ప్రజలకిచ్చిన రాయితీల విలువ ఈ ఐదేండ్లలో రూ.2802.75 కోట్లు. వాస్తవానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఆర్టీసీకి దీన్ని చెల్లించి వుంటే నేడీ సమ్మె వుండేది కాదు. ఇస్తున్నామని కేసీఆర్ బుకాయింపు ఎంత బోలైనదో ఈ లెక్కలు చూడండి.
సం|| కేటాయింపు చెల్లించినది
2014-15 వందకోట్లు వందకోట్లు
2015-16 110 కోట్లు 102.50 కోట్లు
2016-17 110 కోట్లు 27.50 కోట్లు
2017-18 520 కోట్లు 260 కోట్లు
2018-19 520 కోట్లు 130 కోట్లు
మొత్తం 1360 కోట్లు 620 కోట్లు (ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంకెలు)
అంటే సారు సొరకాయ కోతలు ఏ స్థాయిలో వున్నాయో అర్థం కావడం లేదా?!
టీఎస్ఆర్టీసీని నష్టాల పాలు చేస్తున్నది అక్రమరవాణా
మన రాష్ట్రంలో 4000 బస్సులు టూరిస్టు పర్మిట్లతోను కాంట్రాక్టు పర్మిట్లతోను తిరుగుతూ స్టేజి క్యారియర్లుగా నడుస్తున్నాయి. ఒక రూట్లో ఒక బస్సుకు అనుమతి తీసుకుని 2, 3 ట్రిప్లు నడుపుతారు. ఇలాంటి వ్యాపారం ద్వారా టీఎస్ఆర్టీసీకి సుమారు రూపాయలు వెయ్యి కోట్లు నష్టం వస్తోందని అంచనా. వీటిని అదుపు చెయ్యాల్సిన ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ నిద్ర నటిస్తుంటే వామపక్షేతర రాజకీయ నేతలు ఈ దందాలో మునిగి తేలుతున్నారు. ఇవన్నీ లాభాలున్న రూట్లలోనే తిరుగుతాయి. ఆ మేరకు మన ఆర్టీసీకి మరింత నష్టం. పల్లె వెలుగు బస్సులు గ్రామాలకు ఆర్టీసీనే నడపాలి. ప్రయివేటువారు నడపరు. రాష్ట్రంలోని మొత్తం 10,434 రెవెన్యూ గ్రామాలకుగాను 1,400 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. మరో 3000 గ్రామాలకు ఒక ట్రిప్ మాత్రమే వెళ్తుంది ఆర్టీసీ బస్సు. అంటే ప్రజారవాణా ఒక సామాజిక బాధ్యతగా ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలో పాటిస్తున్నారు. మనదేశంలోనే లాభనష్టాలతో లెక్కిస్తున్నారు.
ఆర్టీసీని ''లాభాల్లోకి తేవడం డూవబుల్, నాట్ అన్డూవబుల్'' అన్న ముఖ్యమంత్రి, కాని కార్మికులకు దాన్ని లాభాల్లోకి తేవాలని లేదు అంటూ మీడియా ముందు విరుచుకుబడ్డారు. పైన పేర్కొన్న వివరాలన్నీ చదివితే ఆర్టీసీని నష్టాల్లోకి నెడ్తున్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనని అర్థం కావడంలేదా?! అందుకే నేటి సమ్మెలో ఆర్టీసీ పరిరక్షణ ఒక కీలక డిమాండైంది. బహుశా అందుకేనేమో ప్రభుత్వం అంతమొండిగా ఉంది.
బీజేపీ దొంగాట!
ఆర్టీసీని రక్షించే పోటుగాళ్ళులాగా నేడు బీజేపీ నేతలు వీరంగం వేస్తున్నారు. వీరి వ్యవహారం చూస్తే దొంగే దొంగదొంగ..! అని అరిచినట్టుంది. దేశంలో 1950లో ఆర్టీసీ చట్టం వచ్చినా హర్యానాలో ప్రభుత్వ డిపార్టుమెంటుగా ఉంది. ఆర్టీసీ గతంలో 3,600 రూట్లు వేలం పాట పెట్టింది అక్కడి బీజేపీ ప్రభుత్వం. ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ పెద్దఎత్తున ఆందోళన చేశారు. వెంటనే రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒకడుగు వెనక్కి తగ్గింది బీజేపీ. మళ్ళీ గెలవగానే 750 రూట్లను వేలంపాట పెట్టేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో నడిచే బస్సుల్లో ఒక వంద కార్పొరేషన్ కిందే వుంచుకుని మిగిలిన 450 బస్సులనూ, వాటి రూట్లనూ 4 ప్రయివేటు కంపెనీలకు అమ్మేశారు మోడీగారి స్వంత ఇలాకాలో. ఇక రాజస్థాన్ వ్యవహారం లోకవిదితమే. వసుంధర రాజే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆర్టీసీని ప్రయివేటు బాట పట్టించే ప్రయత్నం చేశారు. కార్మికుల ప్రతిఘటనతో వెనక్కి తగ్గింది.
అన్నింటికీ మించి మోటారు వెహికల్ అమెండ్మెంట్ చట్టం తనకున్న మందబలంతో పాస్ చేసుకుంది మోడీ ప్రభుత్వం. ఆ చట్టం ప్రకారం దేశంలోని రూట్లకు అనుమతించే బాధ్యత కేంద్రమే తీసుకుంది. ఓలా, ఊబర్ వంటి బహుళజాతి కార్పొరేషన్లకు అప్పగించే అవకాశం తన చేతిలోకే తీసుకుంది. అందుకే బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు విమర్శించుకోరు ఈ విషయాలలో. రాష్ట్ర రాజకీయాలలో ఆధిపత్యం కోసం పోటీలు పడతారు. ఆర్టీసీ వంటి సంస్థల ప్రయివేటీకరణలోనూ పోటీలు పడతారు. ఇదీ.. వీరిద్దరి లాలూచీ కుస్తీ.
- ఆర్. సుధా భాస్కర్
సెల్: 9490098025