Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాబలిపురం సముద్రతీరంలో ప్రధాని ప్రత్యేక భద్రతా దళాల నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ పొందిన వ్యర్థ పదార్థాలను ఏరి సంచిలో వేస్తూ మోడీ సాగిస్తున్న స్వచ్ఛభారత్ అభియాన్ కేవలం ప్రచారపటాటోపమే అని మరోసారి రుజువు చేసిన మోడీ అక్కడి నుంచి నేరుగా మహారాష్ట్ర ఎన్నికల సభలో మాట్లాడుతూ ''ప్రతిపక్షాలు అధికారానికి వస్తే 370 అధికరణాన్ని తిరిగి రాజ్యాంగంలో చేరుస్తామని హామీ ఇస్తాయా'' అని సవాలు విసిరారు. ఓ వైపున కాశ్మీర్ ప్రజానీకం రెండున్నర నెల్ల పాటు అత్యాధునిక సాంకేతిక నిర్బంధాన్ని అనుభవిస్తుంటే తగలబడుతున్న ఇంటి దగ్గర చుట్టకు నిప్పుకోసం వెళ్లిన చందంగా మోడీ కాశ్మీరీ ప్రజల ఉచ్ఛ్వాస నిశ్వాలను సైతం నియంత్రించగల బీజేపీకి మాత్రమే ఓటు వేయండని మహారాష్ట్ర ఓటర్లను ప్రలోభపెడు తున్నారు. పై సవాలులో స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనిపించే అంశం 370 అధికరణం కేవలం కాశ్మీరీ ప్రజలకు అయాచితంగా ఇచ్చిన అధికారం, అవకాశం అన్న భావనను మరింత గుర్తు చేస్తూ దాన్ని అయాచిత అవకాశాలు, అధికారాలు, హక్కు లు రద్దు చేయటంలో తమకు తామే సాటి అని పాలకవర్గాలకు మరింత భరోసా ఇస్తున్నారు ప్రధాని మోడీ.
నిజంగా 370 అధికరణం కాశ్మీరీ ప్రజలకు అయాచితంగా దక్కిన అధికారమా లేక బ్రిటిష్ పాలకుల నుంచి అధికారాన్ని సొంతం చేసుకునే ఆతృతలో భారత పాలక వర్గాలు, బ్రిటిష్ ప్రభుత్వం, నాటి సంస్థానాల మధ్య కుదిరిన లోపాయికారీ ఒప్పందం ఫలితమా అన్నది తెలియచెప్పేందుకు ఈ వ్యాసంలో ప్రయత్నం చేస్తాను. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి కాశ్మీర్లో స్వాతంత్య్రోద్యమం కూడా కొత్త శక్తి సామర్థ్యాలు సంపాదించుకుంది. యుద్ధానంతరం కేవలం బలప్రయోగంతో భారతదేశాన్ని పరిపాలించటం సాధ్యం కాదని గుర్తించిన వైస్రాయి వేవెల్ నాటి ప్రధాని చర్చిల్తో జరిపిన సంవాదంలో అఖండ భారతదేశాన్ని భారత్, పాకిస్థాన్, మధ్యమధ్యలో సంస్థానాలతో కూడిన స్వతంత్ర దేశాలుగా విభజించటం మేలని ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనకు అనుగుణంగా ''సిమ్లాలో 1945 జూన్ చివరల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులతో పాటు ముస్లింలీగ్ ప్రతినిధులుగా జిన్నా, లియాఖత్ అలీఖాన్, దేశంలోని అన్ని సంస్థానాల ప్రధానులు కూడా హాజరయ్యారు.'' ఇది సర్దార్ వల్లభారు పటేల్ జీవిత చరిత్ర గ్రంథం నుంచి సేకరించిన వాక్యం. ఈ ప్రతిపాదనలను గాంధీ, నెహ్రూలతో పాటు పటేల్ కూడా కిమ్మనకుండా అంగీకరించారు. కానీ జిన్నా ఈ ప్రతిపాదనను తనవైన కారణాలతో వ్యతిరేకించటంతో వేవెల్ ప్రతిపాదనలు తాత్కాలికంగా వెనకపట్టు పట్టాయి.
ఇక్కడ అన్ని సంస్థానాల ప్రధానులు అన్న పదాన్ని మనం గమనించాలి. అంటే భారతదేశంలోనే అంతర్భాగంగా ఉంటూ బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పరిపాలన పరిధికి వెలుపల స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న సంస్థానాల్లో రాజులు, ప్రధానులు ఉండేవారని మనకు ఈ వాక్యం స్పష్టం చేస్తుంది. అప్పటి వైశాల్యంలో జమ్మూ కాశ్మీర్ సంస్థానమే అతి పెద్దది. ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకంగా ప్రధానిని ఎన్నుకునేందుకు ఉన్న అవకాశాన్ని రద్దు చేశామని బీజేపీ గొప్పలు చెప్పుకోవటం చరిత్ర పట్ల వారికున్న అజ్ఞానాన్ని మాత్రమే వెల్లడిస్తుంది. స్వాతంత్య్రోద్యమంలో మణిహారం లాంటి ఘటన 1946 ఫిబ్రవరిలో సైనికాదళం సాయుధ తిరుగుబాటు. తిరుగుబాటు చేస్తున్న నావికాదళ సైన్యం పటేల్ను కలిసినప్పుడు సైన్యానికి క్రమశిక్షణ అవసరమని, తిరుగుబాటును విమరించాలని ఒప్పించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో మార్చి15న బ్రిటిష్ పార్లమెంట్ను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని అట్లీ భారతదేశం స్వాతంత్య్రం కోరుకుంటే కాదనే శక్తి ఎవ్వరికీ లేదని స్పష్టం చేశాడు. అప్పటి వరకు హిందూ ముస్లింలు అన్న తేడాలేకుండా వలసవాద వ్యతిరేక పోరాటంలో భుజం భుజం కలిపిన ముందుకు సాగిన ప్రజల్లో కొత్త సంచలనం మొదలైంది. దేశాన్ని విడగొట్టాలా వద్దా అన్న మీమాంస కాంగ్రెస్కు ఉంటే అత్యధికులైన హిందూ ప్రజల చేతుల్లో తాము ద్వితీయశ్రేణి పౌరులుగా కొనసాగాలా అన్నది ముస్లిం ప్రజల మీమాంసగా మారింది.
స్వాతంత్య్ర సిధ్ధి కనుచూపు మేరలో కనిపిస్తుండటంతో భావిభారత పాలనా వ్యవస్థల పట్ల కాంగ్రెస్లో చర్చోపచర్చలు మొదలయ్యాయి. పటేల్ పూర్తి స్థాయిలో శక్తి సామర్ధ్యాలు కలిగిన కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండాలని ప్రతిపాదిస్తే ముస్లిం ప్రజలు గణనీయంగా ఉన్న ప్రాంతాలు కూడా భారతదేశంలో కలవటానికి సిద్ధంగా ఉన్నందున సమాఖ్యవ్యవస్థ మెరుగైనదని నెహ్రూ అభిప్రాయపడ్డాడు. భారతదేశాన్ని లౌకిక దేశంగా తీర్చిదిద్దాలని గాంధీ, అజాద్తో పాటు నెహ్రూ కూడా కాంక్షించాడు. ఈ వివాదాలు కొనసాగుతుండగానే బ్రిటిష్ ప్రభుత్వం ప్రతినిధిబృందానికి నాయకత్వం వహిస్తున్న క్రిప్స్ ఓ మధ్యే మార్గాన్ని ప్రతిపాదించాడు. అదే తర్వాతి కాలంలో క్యాబినెట్ మిషన్ ప్రణాళికగా చరిత్రకెక్కింది. ''కేంద్రం విదేశీ వ్యవహారాలు, రక్షణ, కమ్యూనికేషన్ వ్యవస్థల నిర్వహణ వంటి శాఖలు నిర్వహిస్తుంది. తక్కిన అంశాలన్నీ ప్రాంతాలు (నేటి రాష్ట్రాల) పరిధిలో ఉంటాయి. ఏ ప్రాంతం ఏ రాష్ట్రంలో కలవాలన్నది, ఆయా సంస్థానాలు ఏ దేశంలో కలవాలన్నది నిర్ణయించుకునే స్వయంప్రతిపత్తి సంస్థానాలకు ఉంటుంది'' అన్నది ఈ మిషన్ సారాంశం. ఈ ప్రణాళిక ప్రకారం పంజాబ్, సింధ్, వాయువ్య ప్రాంతం, బలూచిస్తాన్లు ముస్లిం జనాభా ఆధిక్యత కలిగిన ప్రాంతాలను ఒక పరిపాలన యూనిట్గా మార్చి దాన్ని ముస్లిం లీగ్ నియంత్రణకు అప్పగించాలి.
అంతేకాదు. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రకారం ''ఆయా గ్రూప్ అంతా కలిసి ప్రావిన్స్కు ఓ ప్రత్యేక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాలి. కొత్త రాజ్యాంగం ప్రకారం ఏర్పడే శాసనసభ సదరు ప్రాంతం, రాష్ట్రం ఏ దేశంలో భాగంగా ఉండాలి అన్న విషయాన్ని నిర్ణయించుకునే స్వేచ్ఛ కలిగి ఉంటుంది.'' ఈ క్యాబినెట్ మిషన్ ప్రకారం అన్ని సంస్థానాలకు అటువంటి అవకాశాలు, స్వయంప్రత్తి ఉంది. ఈ ప్రణాళికలను నాటి భారత పాలకవర్గం పటేల్, నెహ్రూలతో పాటు అందరూ అంగీకరించారు. ఈ ప్రాతిపదికన ఏర్పడిన రాజ్యాంగ సభలో కూడా హిందూ ముస్లిం జనాభా దామాషాకు అనుగుణంగా సభ్యులను ఎన్నుకున్నారు. ఈ విధంగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్ ఖరారు చేసిన రాజ్యాంగాన్ని మనం ఇప్పుడు అమలు చేసుకుంటున్నాం. తన పర్యటన ముగించుకుని లండన్ చేరిన క్రిప్స్ హౌస్ ఆఫ్ కామన్స్కు నివేదిక సమర్పిస్తూ క్యాబినెట్ మిషన్ ప్రణాళికలో కొన్ని పదాలు కావాలనే అస్పష్టంగా వదిలేశానని, తద్వారా పరస్పర విరుద్ధ ప్రతిపాదన లతో అటు కాంగ్రెస్, ఇటు ముస్లిం లీగ్ మద్దతు సంపాదించటం, దేశ విభజన పథకాన్ని అమల్లోకి తేవటమే తన లక్ష్యమని క్రిప్స్ స్పష్టం చేశారు.
ఈ చారిత్రక వాస్తవాలు గమనించినప్పుడు కాశ్మీరీ రాష్ట్ర స్వయం ప్రతిపత్తి అన్నది కేవలం కాశ్మీర్ ముస్లింలను ప్రలోభపెట్టి మన దేశంలో కలుపుకోవటానికి ఇచ్చిన తాయిలం కాదు. అటువంటి స్వయంప్రతిపత్తి అన్ని సంస్థానాలకు, రాష్ట్రాలకు ఉంది. అంతే కాక అన్నిరాష్ట్రాలు తమ తమ రాజ్యాంగాన్ని రూపొందించుకుని తద్వారా ఎన్నికలు జరిపాక ఏర్పడే శాసనసభ ద్వారా ఏ దేశంలో కలవాలన్నది నిర్ణయించుకునే హక్కు ఉంది. ఇదేదో ప్రజలు సాధించుకున్న హక్కు కాదు. నాటి పాలకవర్గాలు కనుచూపుమేరలో కనిపిస్తున్న అధికారాన్ని చేజారనీయకుండా చూసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వంతో రాజీపడిన ఫలితమే. ఈ వాస్తవాలు మరుగునపెట్టి కాశ్మీర్ ప్రజలకు ఏదో ప్రత్యేక హక్కులు ఒరగబెడుతూ వచ్చినట్టు దాని ద్వారా ఉగ్రవాద ప్రమాదం తలెత్తినట్టు ఇప్పుడు 370 రద్దు ద్వారా అటువంటి ప్రత్యేక హక్కులను రద్దు చేస్తే ఉగ్రవాద సమస్య పరిష్కారం అవనుందన్నట్టు ప్రచారం చేయటం నేటి పాలకవర్గాలు, వాటికి ప్రాతనిధ్యం వహించే పార్టీల ఆత్మ వంచనే.
- కొండూరి వీరయ్య
సెల్: 9871794037