Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై తమ ఐక్యకార్యా చరణను సత్వరమే ప్రకటించాల్సిన అత్యవసర పరిస్థితి నెలకొంది. ఉద్యోగ, కార్మిక వర్గంపై ఉక్కు పాదం మోపుతున్న కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని ఐక్యంగా తిప్పికొట్టాలి. ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి ''సెల్ఫ్ డిస్మిసల్'' అయిన ఉద్యోగులతో చర్చలు జరిపే ప్రసక్తేలేదని బల్లగుద్ది మరీ చెప్పిన ముఖ్యమంత్రి తీరును నిశితంగా ఎండగట్టాలి. సమ్మె హక్కు అనేది ఉద్యోగ, కార్మికవర్గం నుంచి విడదీయరాని హక్కు అని ''జస్టిస్ అహ్మదీ'' చెప్పారు. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మెను ఉద్దేశించి రాష్ట్ర హైకోర్టులో ''హౌస్ మోషన్''కు వెళ్ళింది. ఇటు ప్రభుత్వాన్నీ అటు ఆర్టీసీ కార్మికులనూ చర్చలకు సిద్ధం కావాలని హితవు పలికింది. ఆర్టీసీలోని 50వేలమంది కుటుంబాల బతుకులను రోడ్డుపాలు చేయగలదా ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే 50వేలమంది కుటుంబాల ఉపాధిని కోల్పోయి కడుపు మాడుతుంటే చూడగలరా..? ఒక్కసారి ఆలోచించండి! ఇది ముమ్మాటికి అవివేకమైన ప్రభుత్వ చర్య అని మన కండ్లముందు సాక్షాత్కరిస్తోంది. ఇంతకు మునుపు మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో జయలలిత ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరించి కఠినంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను తొలగించింది. ఆ తరువాత ప్రజా వ్యతిరేకతకు గురి అయి ప్రభుత్వ ఉద్యోగుల పోరాట ఉధృతికి తలవంచి ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లో నియమించుకుంది. కానీ చివరకు జయలలిత పదవి ఊడింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణిని అవలంబించాల్సిన అవసరం ఉంది.
ఇప్పుడు సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తే ఆ బాధ, వారి రోదన ఒక ఆర్టీసీ కుటుంబాలకే పరిమితం కాదు. అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ మానవత్వాన్ని సైతం మరుస్తూ ఉద్యోగుల కార్మికుల హక్కులను కాల రాసేందుకు కంకణం కట్టుకున్న ఈ కఠిన ప్రభుత్వ తీరు ఇంతటితో ఆగదనీ ప్రతి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగి కండ్లు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గం, రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల ఉద్యోగులూ తమ తమ వేతనాల పెంపును సాధించుకోవాలంటే ఉద్యమించాల్సిన అవసరం ఉంది. వారు తమకున్న సదుపాయాలను హక్కులను పొందాలన్నా, మెరుగైన వేతన పురోభివృద్ధి సాధించుకోవాలన్నా, ఉద్యమం పోరాటం విజయం సాధించే దిశగా సాగాలన్నా, ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె పోరాటం విజయవంతం కావాల్సిన అవసరం తప్పనిసరి అని గ్రహించాలి. ''పీఆర్సీ'' కానీ ''ఇంటీరియం రిలీఫ్'' కానీ భవిష్యత్తులో సాధించుకోవాలంటే తమ ఉనికికి ప్రమాద ఘంటికలు మోగాయని గమనంలోకి తీసుకుని అభద్రతకు లోను కాకుండా సంఘటితమై పోరాటం చేస్తూ ప్రజా బలాన్ని కూడగట్టాల్సిన గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగవర్గం మీద కూడా ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను నిర్థాక్షిణ్యంగా అణచివేసి ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా ఈ తెలంగాణ ప్రభుత్వం తొలగించినట్టయితే రాష్ట్రంలోని ఏ ఒక్క ఉద్యోగ వర్గం కూడా తమ హక్కుల సాధన కోసం చేసే పోరాటాలలో విజయవంతం కాలేరన్నది నగసత్యం. ఈ సత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వర్గం గ్రహించగలిగితే ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎంతగా విజయవంతం కావాలో బోధపడుతుంది. కాబట్టి మనమంతా కూడా ఆర్టీసీ కార్మికులు ఎందుకు సమ్మె చేస్తున్నారు.. వారి న్యాయమైన కోరికలు ఏమిటి అనే విషయాలను ప్రజలకు శాస్త్రీయంగా వివరిస్తూ ప్రజా మద్దతు కూడగట్టి మనమంతా తెలంగాణ ప్రభుత్వంపై విజయం సాధించే దిశగా ఉద్యమ పథంలో సాగాలి.
ఉద్యోగ వర్గం, ప్రజలు కూడా ఒకసారి ప్రస్తుత పరిస్థితిని అవలోకనం చేసుకొని పున్ణ సమీక్షించుకుంటే రాష్ట్రంలోని రాజకీయ పక్షాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి? ఎంత నిజాయితీగా వ్యవహరిస్తున్నాయి? తమ ఉనికి కోసం ప్రాకులాడుతున్నాయా.. లేదా నిక్కచ్చిగా కార్మిక పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయా.. అని గమనించి బేరీజు వేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని రైల్వేలను, విమానయాన వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటీకరణ దిశగా అడుగులేస్తూ ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ప్రధాన జాతీయ పార్టీలు ఇక్కడ మద్దతిస్తూ సమ్మె విజయానికి సహకరిస్తాయా! మనలో విశ్వాసాన్ని కల్పిస్తాయా? నట్టేట ముంచుతాయా అని లోతుగా ఆలోచించాలి. ఏది ఏమైనా ఉద్యోగ వర్గమంతా సమిష్టిగా కలసికట్టుగా సంఘటితంగా పోరుబాట పట్టాల్సిందే. ముందుచూపుతో వ్యవహరించి ఆర్టీసీ సమ్మెను విజయవంతం అయ్యేలా కృషి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఆర్టీసీ కార్మికులకు న్యాయం కలిగించేలా, ''ఆర్టీసీ సంస్థ''ను పరిరక్షించేలా ఉద్యమాన్ని ఉధృతం చేయాలి.
- శ్రీహరి బలభక్తుల
వరంగల్.