Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్టీసీ సమ్మె రెండవ వారం నిరాఘాటంగా కొనసాగుతున్నది. ఖమ్మంలో డ్రైవర్ స్రీనివాస్ రెడ్డి ఒంటికి నిప్పంటించుకుని చనిపోవడం సమ్మె ఉధృతిని, ఆవశ్యకతను తెలుపుతోంది. ఇప్పటికి ఆరుగురు కార్మికులు మరణించారు. ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ, తమ కుటుంబ యజమానికి ఏ రకమైన ప్రమాదం పొంచి వున్నదోనని భయపడుతూ, జీతాలున్నా లేకున్నా సరే ప్రాణాలు ముఖ్యం అంటూ ఎప్పుడెప్పుడు సమ్మె పరిష్కారమవుతుందా? అని ఎదురు చూస్తున్నాయి. చాలామంది ఇతర ఉద్యోగులలోనూ అలాంటి ఒక అభద్రతా భావం చోటుచేసుకున్నది. సమ్మెను ప్రభుత్వం బేఖాతరు చేస్తూ స్కూళ్ళూ కాలేజీలకు సెలవులు ప్రకటించడం పుండుమీద కారం చల్లినంత దారుణం. ప్రభుత్వం పంతానికి పోయి అనుభవం లేని వారికి బస్సులిచ్చి ప్రయాణికుల ప్రాణాలను ఫణంగా పెట్టింది. తాత్కాలికంగా నియమింపబడిన కండక్టర్లకు టిక్కెట్లు ఇవ్వలేదు. ఎవరు ఎంత వసూలు చేస్తున్నారో ఎంత జమ చేస్తున్నారో లెక్క పత్రాలు అక్కర లేదా? మరోవైపు కొత్తగా కొలువుల్లోకి చేరాలంటూ కొన్ని రీజియన్లు ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ''ఆల్రెడీ సెల్ఫ్ డిస్మిస్ అయ్యారు కాబట్టి చర్చలే లేవ్'' అంటూ ఎద్దేవా చేస్తున్నా కాలయాపనలో జరగరాని నష్టం ఎక్కువైంది. ఇలాంటి డిస్మిస్లు కోర్టుల్లో నిలబడవన్నది తెలిసి కూడా ప్రభుత్వం మొండిగా వ్యవ హరించడం చాలా తప్పు.
ఎన్నో ప్రజా సంఘాలు వచ్చి తమ సంఘీభావాన్నీ, మద్దతూ తెలుపుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు మొక్కవోని విశ్వాసంతో సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇది కచ్చితంగా అభినందనీయమైనది. ప్రతి కార్మిక సంఘం, ఆ సంఘంలోని ప్రతి కార్మికుడు ఆర్టీసీ సమ్మె విజయవంతం కావాలని కోరుకుంటున్నారు. ఆర్టీసీ సమ్మె విజయవంతం కాకుంటే ముందు ముందు అన్ని రంగాల్లోని కార్మికులకు ఇదే దుస్థితి దాపురించే ప్రమాదం ఉంటుందేమో.. ఉద్యోగ అభద్రతా భావం వెంటాడుతోంది. ఈ ఆందోళనకు కారణం: ప్రభుత్వం ఏకపక్షంగా, సమ్మె చేస్తున్న కార్మికులపై ఎస్మా చట్టాన్ని విధించడం, అంతేకాకుండా విధులకు హాజరు కాని వారంతా డిస్మిస్ అయిపోయినట్టు అని ప్రకటించడం. 48వేలమంది ఉద్యోగులను ఒక్క ప్రకటనతో డిస్మిస్ చేస్తున్నామని ప్రకటించడం సర్కార్ నిరంకుశత్వాన్ని తెలుపుతున్నది. అగ్గికి ఆజ్యం పోసినట్టుగా ''ప్రభుత్వము కానీ, యాజమాన్యం కానీ ఉద్యోగులను డిస్మిస్ చేయలేదు, విధులకు హాజరు కాకపోవడం వల్ల ఉద్యోగులు వారిని వారే డిస్మిస్ చేసుకున్నారు'' అంటూ హేళనగా మాట్లాడటం ఉద్యోగుల్ని మరింత కోపోద్రిక్తుల్ని చేసింది. దశాబ్దాల కొద్ది, చిన్న ఆటంకం లేకుండా, ప్రతి పల్లెకు రవాణా సౌకర్యాన్ని అందిస్తున్న ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం ఇలా స్పందించడం సరైంది కాదు. ప్రయివేటు వ్యక్తుల ద్వారా బస్సులను నడుపుతామని దబాయిస్తూ ప్రగల్బాలకు పోయి కార్మికుల ప్రాణాలు తీస్తున్నారు. ఆర్టీసీని ప్రక్షాళన చేస్తామంటూ ప్రకటనలు చేస్తూ 50శాతం ప్రభుత్వ, 30శాతం ప్రభుత్వ ప్రయివేటు, 20శాతం పూర్తిగా ప్రయివేటు వాహనాలు... అంటూ బెదిరింపు ప్రకటనలు చేస్తున్నారు. ఈ రోజుల్లో పూర్తిగా ప్రయివేటులో నడుస్తున్న బస్సులలో ఎన్ని బస్సులు పల్లెలకు, రద్దీ తక్కువగా ఉన్న రూట్లలో నడుస్తున్నాయో అందరికీ తెలిసినదే కదా! కేవలం హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ తిరుపతి, హైదరాబాద్ ముంబై లాంటి ప్రధాన రూట్లలో మాత్రమే ప్రయివేటు బస్సులు నడుస్తున్నాయి, లాభాల్ని దండుకుంటున్నారు. పల్లెల్లో ఆర్టీసీ బస్సులు తిరగడం చరిత్రగా చెప్పబడుతుంది. ఉన్నఫళం గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మోటారు వాహన చట్టం ఎన్ని ఇబ్బందులు తెచ్చిందో కళ్లకు కట్టిన సత్యంగా ఉన్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా భావిస్తూ ఆర్టీసీని ప్రక్షాళన చేసేందుకు పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్షిప్ అంటూ మరో ఎత్తుగడ ముందుకు తీసుకు రావడం సరైంది కాదు. నిరంతరం పనిచేయడం, నిర్ణీత గడువు అయిన తర్వాత జీతాలు పెంచాలని అడగడం తప్పా? ఏ రకమైన అధికారం లేని కార్మికులపై ఇంతటి దాష్టీకానికి ప్రభుత్వాలు తెగబడటం దురదృష్టం. ''ఆర్టీసీ ఉద్యోగులకు 50 వేల జీతాలు ఉన్నాయి. ఇంకేం కావాలి'' అంటూ స్వయాన ప్రభుత్వం ప్రకటించడం ద్వారా ప్రజల్లో కార్మికుల పై వ్యతిరేకత భావాన్ని రెచ్చగొట్టడమే అవుతోంది. ఆర్టీసీ కార్మికులకు చెల్లిస్తున్న జీతాలలో ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖజానా నుండి రావడం లేదు, కేవలం ఆర్టీసీ సంపాదించిన సంపదనుంచే చెల్లించబడుతోంది, అదంతా ఖర్చులలో భాగంగా ఉంటుంది. అనగా ప్రభుత్వంపై ఏమాత్రం ఆధారపడకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారు ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీ యాజమాన్యంలో లోపాలు, నిర్వహణా లోపాలు సరిదిద్దడం కోసం ప్రయత్నాలు చేయకుండా, కేవలం ఉద్యోగులపై తమ అధికారాన్ని ప్రదర్శించడం సరైంది కాదు. లాభాలు రాని రూట్లలో బస్సులు నడపాలనే నిబంధనలను ప్రభుత్వమే సూచిస్తున్నప్పుడు ఆర్టీసీ ఉపయోగిస్తున్న డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న సుంకం (టాక్స్) ఎందుకు ఉపసంహరించకూడదో ఒకసారి ప్రజలకు చెప్పాలిగా. నిజానికి ప్రజా జీవనంలో ఆర్టీసీ మమేకమై ఉన్నది. అత్యంత నమ్మకమైన సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తున్నదిగా పేరు పొందినది. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నది ఇట్లాంటి సంస్థను నిర్వహిస్తున్న కార్మికులపై విరుచుకుపడడం సరైందేనా?
2001లో అప్పటి ప్రభుత్వం స్పందించనందుకు ఆర్టీసీలో 24 రోజుల సమ్మె జరిగింది. చివరకు ప్రభుత్వం దిగి రావలసి వచ్చింది. పొట్టకూటి కోసం పనిచేసుకునే కార్మికులపై కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరించడం ఇప్పుడూ సరైంది కాదు. ఎప్పటికీ సరైంది కాదు. ఇప్పటికైనా చర్చలకు పిలిచి వీలైనంత త్వరగా సమ్మె విరమింప చేయాలి. ఇలాంటి చర్యలకు పూనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ సంఘాలు మద్దతు ఇస్తాయేమో అన్న భయంతో టీఎన్జీఓ నాయకులను పిలిచి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి మంతనాలు జరపడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇది సంఘాలను విభజించి పాలించాలనుకునే ఆలోచనలో భాగమే అయితే, అది చాలా తప్పుడు విధానం. అలాంటి విధానాలకు ఒకటీ అరా సంఘాలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తాయేమో కానీ అనేక సంఘాలు కార్మికులకే, ముఖ్యంగా సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతుగా నిలిచే అవకాశం ఉన్నది. తద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. అందుచేత ప్రభుత్వం కార్మికులతో సూత్రప్రాయంగా అంగీకారానికి రావడం అత్యంత ఆవశ్యకమైనది. ఇదే సందర్భంలో ప్రతి సంఘము, సమాజంలోని ప్రతి సమూహము, సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం ఇలాంటి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నప్పుడు నేడు ఆర్టీసీ కార్మికులు రేపు మరో రంగ కార్మికులు ఎల్లుండి రైతులూ.. ఇతరులందరు కూడా వారి నిరంకుశత్వానికి తలొగ్గవలసిందే. లేదంటే మరింత కఠినంగా వ్యవహరించే ప్రమాదముంది. చర్చలకు పిలిచి ఆర్టీసీ సమ్మెను విజయవంతంగా ముగిస్తే ప్రభుత్వానికి నష్టం ఏమీ ఉండదు. ఒకవేళ సమ్మెను విచ్ఛిన్నం చేసినా, లేక బలవంతంగా అణచివేసినా దాని పర్యవసానాలు ఇతర రంగాలపై పడతాయి. ఇతర రంగాల్లోని యాజమాన్యాలు మరింత దోపిడీకి తెగబడతాయి. అందుచేత ఆర్టీసీ సమ్మె విజయవంతం కావడం ఉభయతారకం. అందరికీ శ్రేయస్కరం.
- జి. తిరుపతయ్య
సెల్: 9951300016