Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజీ లేదా మారణహౌమం మధ్య ఒకదాన్ని ఎంచుకోవాల్సి వస్తే పౌరులే తమకు ముఖ్యమని, అందుకే సిరియా అధ్యక్షుడు అసాద్, రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్తో ఒక అవగాహనకు వచ్చినట్టు సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్(ఎస్డీఎఫ్) ప్రధాన కమాండర్ మజులుమ్ అబ్దీ చెప్పారు. కొద్ది రోజులుగా టర్కీ దళాలు సిరియాలోని కర్దుల ఆధీనంలోని ప్రాంతాలపై దాడులు జరుపుతున్న పూర్వరంగంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఒక వైపు టర్కీ దాడులు కొనసాగిస్తుండగా సిరియా-టర్కీ సరిహద్దుల్లో ఉగ్రవాదులకు వ్యతిరేక పోరు పేరుతో దించిన తమ దళాలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇది జరగ్గానే సిరియా అధ్యక్షుడితో ఎస్డీఎఫ్ ఒక అవగాహనకు వచ్చింది. వెంటనే సిరియా దళాలు ఆ ప్రాంతానికి తరలి వెళ్లి టర్కీ దాడులను అడ్డుకునేందుకు సిద్ధం అయ్యాయి. ఈ పరిణామంతో యావత్ సిరియా ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినట్టు అయిందని, రష్యా, ఇరాన్ ఆ ప్రాంతంపై పైచేయి సాధించినట్టే అనే అభిప్రాయాలు వెల్లడి అవుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాల్లో ఇది మరొక మలుపు.
పశ్చిమాసియాలో పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. ఎవరు ఎవరికి ఎప్పుడు మిత్రులుగా మారతారో, శత్రువులుగా తయారవుతారో తెలియని స్ధితి. ఈ ప్రాంతంలోని దేశాలు, అక్కడ ఉన్న సహజ సంపదలను కొల్లగొట్టటంతో పాటు మిలిటరీ రీత్యా పట్టు సాధించేందుకు అమెరికా అనుసరిస్తున్న విధానాలు మారణహౌమాన్ని సృష్టిస్తూ శాంతిని లేకుండా చేస్తున్నాయి. తన లక్ష్యాల సాధనకు కర్దిస్ధాన్ ఏర్పాటుకు తోడ్పడతామని ఆశ చూపుతూ ఆ ప్రాంతంలోని కర్దులను అమెరికా పావులుగా వాడుకొంటున్నది. తామే ప్రవేశపెట్టిన ఐఎస్ తీవ్రవాదులను అణచే పేరుతో అక్కడ తిష్టవేయాలని చూసిన అమెరికా, ఐరోపా యూనియన్, వాటితో చేతులు కలిపిన టర్కీ దేశాలకు తాజా పరిణామం పెద్ద ఎదురు దెబ్బ.
మజులుమ్ అబ్దీ చెప్పినదాని ప్రకారం గత నాలుగేండ్లుగా సిరియా మీద దాడులకు దిగిన జీహాదీ లేదా ఐఎస్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా మాత్రమే కర్దులు పోరాడారు తప్ప టర్కీ, అమెరికా మిలిటరీ మీద ఒక్క తూటాను కూడా కాల్చలేదు. కర్దు ప్రాంతాలను ఆక్రమించిన ఐఎస్ తీవ్రవాదులను ఎదిరించేందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా టర్కీ, అమెరికా రెండూ కర్దులకు ఆయుధాలిచ్చాయి. కర్దులు ఐఎస్ తీవ్రవాదులను సిరియాలో అదుపు చేశారు. ఇదే సమయంలో అమెరికా హామీ మేరకు దాని మాటలు నమ్మి టర్కీ తమ మీద దాడులకు దిగదనే భరోసాతో కర్దులు టర్కీ సరిహద్దులనుంచి వెనక్కు తగ్గారు. అయితే ప్రస్తుతం టర్కీ అదే ఐఎస్ తీవ్రవాదులకు ఆయుధాలిచ్చి సిరియా ప్రాంతాలను తిరిగి ఆక్రమించేందుకు ప్రోత్సహిస్తోంది. ఇప్పుడు ఏకంగా దాడులకు దిగుతున్నది. ఈ దశలో కూడా సిరియన్ కర్దులు అమెరికా మీద విశ్వాసం ఉంచి టర్కీ మీద పలుకుబడిని ఉపయోగించి సిరియా సమస్యను పరిష్కరించాలనే కోరుతున్నారు. అమెరికా అక్కడి నుంచి తన సైన్యాన్ని ఉపసంహరిస్తానని చెప్పటాన్ని కూడా వారు తప్పుపట్టటం లేదు. దాని ఇబ్బందులు దానికి ఉన్నాయని సరిపెట్టుకుంటున్నారు. టర్కీ దాడులు తీవ్రతరం కావటంతో విధిలేని పరిస్థితుల్లో తమ జనాన్ని రక్షించుకొనేందుకు సిరియా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని మిలిటరీని దించేందుకు అంగీకరించామని మజులుమ్ అబ్దీ చెప్పారు. జనాన్ని రక్షిస్తామని సిరియా, రష్యా ప్రతినిధులు చెప్పటాన్ని కూడా మేము పూర్తిగా నమ్మటం లేదు. అసలు ఎవరిని నమ్మాలో తెలియటం లేదు, విధిలేని పరిస్థితుల్లో అంగీకరించాం అన్నారు.
ఆదివారం నాడు కుదిరిన ఒప్పందం మేరకు కర్దు దళాల ఆధీనంలో ఉన్న రెండు పట్టణాల ప్రాంతాన్ని సిరియా సైన్యానికి అప్పగించారు. గత ఆరు రోజులుగా టర్కీ చేస్తున్న దాడులకు ఉత్తర సిరియాలో ఎందరు మరణించిందీ తెలియదు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. పదమూడువేల మంది ఐఎస్ తీవ్రవాదులను తాము బందీలుగా చేశామని కర్దులు ప్రకటించారు. కర్దుల ప్రాంతాలపై దాడుల కారణంగా అనేక వందల మంది ఐఎస్ తీవ్రవాదులు బందీల శిబిరాల నుంచి తప్పించుకున్నట్టు వార్తలు వచ్చాయి. వారిని కర్దులే విడుదల చేశారని అమెరికన్ మీడియా చెబుతోంది. టర్కీ చర్యలను భారత్తో సహా అనేక దేశాలు ఖండించాయి. ఐరోపా యూనియన్ టర్కీ మీద ఆంక్షలను విధించాలని తలపెట్టినా దాని మీద వచ్చిన వత్తిడి కారణంగా సభ్యదేశాల విచక్షణకు వదలివేశారు. యుద్ధ విమానాలతో సహా టర్కీ ఆయుధాలన్నీ అమెరికా, ఐరోపా దేశాల నుంచే కొనుగోలు చేస్తున్నది. కర్దు తిరుగుబాటుదార్లను టర్కీ ఉగ్రవాదులుగా చిత్రిస్తోంది. సిరియా విముక్తి సేనపేరుతో ఉన్న ఐఎస్ తీవ్రవాదులను సిరియా విముక్తి ప్రదాతలుగా పరిగణిస్తోంది.
సిరియా-టర్కీ సరిహద్దు ప్రాంతాల నుంచి తమ సేనలను ఉపసంహరించుకుంటామని అమెరికా ఎప్పటి నుంచో చెబుతున్నప్పటికీ టర్కీ వత్తిడికి లొంగిపోయిన ట్రంప్ ఆకస్మిక నిర్ణయం తీసుకోవటంతో కర్దులు హతాశులయ్యారు. అమెరికా తమను మోసం చేసిందని భావిస్తున్నారు. అందుకే వెంటనే రష్యా మధ్యవర్తిత్వంతో సిరియా ప్రభుత్వంతో ఒక అవగాహనకు వచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. అయితే గతంలో కర్దులను అణిచివేయటంలో సిరియా ప్రభుత్వం కూడా తక్కువ తినలేదు. ఇప్పుడు కర్దుల ఆధీనంలోని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న తరువాత మరోసారి అణచివేతకు పూనుకోవచ్చనే అభిప్రాయాలు కూడా వెల్లడవుతున్నాయి.
ఇంతకాలం ఐఎస్ తీవ్రవాదులను అణచేందుకే ఉత్తర సిరియాలో ఉన్నామని ప్రకటించిన అమెరికా ఇప్పుడు అక్కడి నుంచి తప్పుకోవటం అంటే మొత్తంగా సిరియాను ప్రభుత్వానికి అప్పగించి తోకముడిచినట్టే అన్నది కొందరి వ్యాఖ్యానం. ఇదే సమయంలో టర్కీతో సిరియా యుద్ధ పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది. తమ దేశంలో తలదాచుకున్న 20లక్షల మంది సిరియన్ల రక్షణ ప్రాంతాలను ఏర్పరచేందుకే తాము దాడులు చేస్తున్నట్టు టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయిప్ ఎర్డోగన్ చెబుతున్నాడు.
పశ్చిమాసియాలో అనేక తెగలలో కర్దిష్ ఒకటి. పశ్చిమ, మధ్య ఆసియా ప్రాంతాలపై ఆధిపత్య పోరులో సఫావిద్ - ఒట్టోమన్ సామ్రాజ్యాల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి. ఒప్పందాలు జరిగాయి. వాటిలో భాగంగా కర్దులు గణనీయంగా లేదా మెజారిటీ ఉన్న ప్రాంతాలు చీలిపోయాయి. సులభంగా అర్థం చేసుకోవాలంటే నేటి టర్కీ, సిరియా, ఇరాన్, ఇరాక్ దేశాలలో ఈ ప్రాంతాలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన ఒట్టోమన్ సామ్రాజ్యాన్ని ముక్కలు చేశారు. తరువాత వాటికి స్వాతంత్య్రం ఇచ్చే క్రమంలో యూదులకు ఇజ్రాయెల్ మాతృదేశంతో పాటు కర్దులకు ఆయా దేశాలలో స్వయం పాలిత ప్రతిపత్తి మంజూరును పరిశీలించాలని సామ్రాజ్యవాదులు సూచించారు. టర్కీ తప్ప మిగిలిన దేశాలు వ్యతిరేకతను వ్యక్తం చేయలేదు. టర్కీ అయితే తమ దేశంలో కర్దు అనే పదం వినపడకుండా చేసింది. చివరకు ఆ భాష మాట్లాడేవారిని కూడా వెంటాడి వేధించింది. కర్దులకు కొండ ప్రాంతాల టర్కులని పేరు పెట్టింది. ఈ నేపథ్యంలో కర్దు ప్రాంతాలలో అనేక తిరుగుబాట్లు జరిగాయి. పాలస్తీనాను విభజించి ఇజ్రాయెల్ ఏర్పాటు నిర్ణయం జరగటం, స్వయంప్రతిపత్తి ప్రాంతాల డిమాండ్ను సక్రమంగా అమలు జరపకపోవటంతో అది 1945లో నాలుగుదేశాలలోని కర్దు ప్రాంతాలతో కర్దిస్థాన్ ఏర్పాటు చేయాలనే నినాదంగా మారింది.
కర్దిస్థాన్ సాధనకు నాలుగు దేశాలలో తలెత్తిన ఉద్యమాలు సాయుధ రూపం తీసుకున్నాయి. వాటిని అణచివేయటంలో ఏ దేశ పాలకులూ తక్కువ తినలేదు. ఇదే సమయంలో తన రాజకీయ, ఆధిపత్య ఎత్తుగడలలో భాగంగా అమెరికన్లు నాలుగు చోట్లా కర్దులకు మద్దతు ఇచ్చి వారి తిరుగుబాట్లను ప్రోత్సహించారు. వాటిలో కర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ(పికెకె) ప్రధాన సంస్థగా ముందుకు వచ్చింది. టర్కీలో కర్దులపై అణచివేతకు వ్యతిరేకంగా విద్యార్థులు దీనిని ప్రారంభించారు.1984లో పూర్తి స్థాయి తిరుగుబాటుగా మారింది. అనేక పరిణామాల తరువాత 2013లో పికెకె కాల్పుల విరమణ ప్రకటించింది. రెండేండ్ల తరువాత టర్కీ దాడులు, ఇతర పరిణామాల కారణంగా కాల్పుల విరమణ విరమించింది.
ఇరాక్, సిరియాలలో కర్దుల స్వయంపాలిత ప్రాంతాల ఏర్పాటును టర్కీ వ్యతిరేకించటమే కాదు, ఆ ప్రాంతాలలోని కర్దులపై తరచుగా దాడులు చేస్తున్నది. ఇరాకీ కర్దు ప్రాంతాలలో తనకు అనుకూలమైన ఉగ్రవాద బృందాలకు సాయం చేసి ఆ ప్రాంతంలో తన తొత్తులను ప్రతిష్టించాలని కూడా టర్కీ చూసింది. ఇప్పుడు అమెరికా, ఐరోపా యూనియన్ మద్దతుతో మరోసారి సిరియాలోని కర్దు ప్రాంతాలపై దాడులకు దిగుతున్నది, ఐఎస్ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చి సిరియాను అస్థిరం చేయాలని చూస్తున్నది.
- ఎం. కోటేశ్వరరావు
సెల్: 8331013288