Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్టికల్ 370 రద్దు విషయంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని తారుమారు చేసిందని నల్సర్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఫైజాన్ ముస్తాఫా అన్నారు. ది వైర్ జర్నలిస్ట్ కరన్ధాపర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కాశ్మీర్కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను చెప్పారు. బీజేపీ చెబుతున్నట్టు ఇప్పటి వరకు కాశ్మీర్ ప్రజలకు ఏ చట్టాలూ లేవనీ, తమ చర్య ద్వారానే కాశ్మీరీలు తమ జీవితాల్లో వెలుగు చూడబోతున్నారన్న అబద్ధాల గుట్టును కూడా ముస్తాఫా విప్పిచూపారు.
ఆర్టికల్ 370ని రద్దు చేయలేదు. అమలు కాకుండా 370ని నిర్వీర్యం చేసి ఒక ఉత్సవ విగ్రహంగా మార్చారు. 370 అనేది రాష్ట్రపతికి ఇతర ఆర్టికల్స్లో సవరణలు, మినహాయింపులు చేయడానికి అనుమతిస్తుంది. దీన్ని ఉపయోగించుకుని 367లో ఒక క్లాజు చేర్చి 370లోని కొన్ని పదాల్ని మార్చు కున్నారు. అవి ఇలా ఉన్నాయి. (1) ''జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ నిర్ణాయక సభ'' అని ఉంటే ఇప్పుడు ''శాసనసభ'' అని (2) ''రాష్ట్ర ప్రభుత్వం'' అనే పదాన్ని ''మంత్రి మండలి మార్గదర్శకత్వంలో పనిచేసే గవర్నర్ ''అని మార్చారు. ఎందుకు మార్చారు? చట్ట ప్రకారం రాజ్యాంగ నిర్ణాయకసభ, శాసనసభలకు రాష్ట్ర స్వరూపాన్ని మార్చే సమయంలో కీలక భూమిక ఉంటుంది. ఇప్పుడు రాజ్యాంగ నిర్ణాయక సభలేదు. బీజేపీ ఏర్పాటు చేయదలచలేదు. వీరే శాసనసభను రద్దుచేశారు. గవర్నర్నే శాసనసభతో సమానం అని చూపించి, రాష్ట్రపతితో తమకు కావాల్సిన విధంగా 370ని నిర్వీర్యం చేయడానికి వీలు కల్పించుకున్నది.
రాజ్యాంగంలో 370ని తొలగించకుండానే ఉత్సవ విగ్రహంగా మార్చేశారు. ఆర్టికల్ 370లో ''ఇతర అంశాలు'' అని ఉన్నది అవి ఆర్టికల్ 1, 238 ఇప్పుడు 238 ఉనికిలో లేదు. మిగిలింది ఆర్టికల్ 1 మాత్రమే, దానికి 370ని సవరించే అధికారం లేదు. దాని అర్థం ఇతర అంశాలను సవరించ వచ్చు, కానీ 370ని ఉపయోగించి 370నే అంటే తనను తాను సవరించుకోవడానికి రాజ్యాంగం అనుమతించదు. ఇక్కడే బీజేపీ ప్రభుత్వం తమ పరిధి దాటి వ్యవహరించిందనేది అర్థమవుతున్నది.
1973లో కేశవానంద్ భారతి తీర్పులో సుప్రీంకోర్టు పార్లమెంటుకు రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని మార్చడానికి వీల్లేదని చెప్పింది. పార్లమెంటుకు ఆ అధికారం లేనప్పుడు రాష్ట్రపతికి అసలే ఉండదు. 370 ఒక మామూలు ఆర్టికల్ కాదు. దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. రెండు సార్వభౌమాధికారం గల రాజ్యాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రతిఫలం 370, దాన్ని గౌరవించాల్సి ఉంటుంది. మన దేశ చరిత్రను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వంలో పూర్తి మెజారిటీ ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోర్టులు రాజకీయ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దూరం జరిగి పోతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడే కొంచెం చొరవ చూపుతున్నాయి. ఈ విషయంలో రెండో మార్గం రాజ్యాంగ ధర్మాసనానికి పంపుతారు. అక్కడ ఇప్పటికీ చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అందువల్ల ఈ కేసు పరిశీలనకు వచ్చేందుకు మూడునాలుగేండ్లు పట్ట వచ్చు. కోర్టుకి ఈ కేసును తక్షణమే పరిశీలించాలనే తొందర లేదు. ఏవో కుంటి సాకులు చెబుతుంటారు.
ఈ ప్రక్రియలో మరో క్లిష్టమైన అంశాన్ని పరిశీలిద్దాం. ఒక రాష్ట్రాన్ని రెండుగా విడదీసి ఆ రెండు ముక్కల స్థాయిని కేంద్రపాలిత ప్రాంతంగా తగ్గించారు. ఇక్కడ సమయం సందర్భం... గమనిస్తే ఒక రాష్ట్రాన్ని విడకొట్టాలంటే శాసన సభ అభిప్రాయం తీసుకోవడం తప్పనిసరి. మొదటగా అసలు శాసనసభే లేదు. ఉన్న దాన్ని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే గత కొన్ని నెలల ముందు రద్దు చేసింది. శాసనసభ లేకుండా అడ్డు తొలగించారు. రాష్ట్రపతి పాలనలో ఉన్నందుకు పార్లమెంటుకు అధికారం ఉన్నదని, రాష్ట్ర శాసనసభలో పనిలేదనే విధంగా పనికానిచ్చారు. ఒక రాష్ట్రాన్ని విడగొట్టి స్థాయి తగ్గించి కేంద్ర పాలిత ప్రాంతం చేశారు. ఆగస్టు 5న రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. అదే రోజు రాష్ట్రపతి ఉత్తర్వు వచ్చింది. ఆగస్ట్ 5కు ముందు రాజ్యాంగంలోని ఆర్టికల్ 3(1) ఉనికిలో ఉన్నది దాని ప్రకారం ఈ అంశాన్ని రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందాలి (అభిప్రాయాలు తీసు కోవడం మాత్రమే చెల్లదు) ఇదీ జరగలేదు. ఆగస్టు 5 తరువాత పరిస్థితి మారిపోయింది. 370 నిర్వీర్యం కావడంతో అన్ని రాష్ట్రాల్లో జరిగినట్టుగానే జమ్మూ కాశ్మీర్ అస్తిత్వానికి సంబంధించి ఏ మార్పు జరగాలన్నా శాసనసభ అనుమతి అనివార్యమైంది. తెలంగాణ విషయంలో 2013 డిసెంబర్లో ఏపీ శాసనసభకు తీర్మానం పంపబడింది. శాసనసభలో 84మంది, కౌన్సిల్లో 54మంది చర్చలో పాల్గొన్నారు. తరువాతనే పార్లమెంటు తెలంగాణను ఏపీ నుంచి విడగొట్టింది. ఈ పద్ధతి కూడ కాశ్మీర్ విషయంలో పాటించలేదు. ఇక్కడ కూడ పరిధి దాటి వ్యవహరించారు. ''అధికారం'' ''అభిప్రాయం తీసుకోవడం'' అనేవి రెండూ వేరు వేరు. ఏది ఎప్పుడు కావాలో అది అప్పుడు జరగాల్సిందే. ఈ సూత్రాన్ని కూడ పక్కనపెట్టారు. దీంతో అన్ని రాష్ట్రాలకు ఇప్పుడు ప్రమాదం పొంచి ఉన్నది. ఎప్పుడైనా, కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ఏ రాష్ట్రమైనా కేంద్రపాలిత ప్రాంతంగా మారిపోవచ్చు. ఇప్పటికే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని పుకారులు షికార్లు చేస్తున్నాయి.
ఆర్టికిల్ 370 అనేది తాత్కాలికం, అని చెప్పి70 ఏండ్లుగా ఎందుకు కొనసాగించారు అని కూడ ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు కాశ్మీర్ 370 అనేది ప్రత్యేకమైనది, శాశ్వతం అని ప్రకటించింది. ఇది ప్రత్యేక హౌదా. తాత్కాలికం అంటే రాజ్యాంగసభ ఏర్పాటు చేసేదానిలో ఏకీభావం పొందే వరకు అని అర్ధం. 2016లో రోహింగ్టన్ నారీమన్ అనే సుప్రీంకోర్టు జడ్జికూడ రాజ్యాంగ సభ ఆమోదంతో మాత్రమే 370ని రద్దుచేయవచ్చు అని తీర్పు ఇచ్చారు. రాజ్యాంగ సభ అవసరం లేని సందర్భంలో తాత్కాలికం అంటే కచ్చితంగా కాలపరిమితి ప్రకటించాలి.
'కాశ్మీర్'లో అనేక పార్లమెంటు చట్టాలు అమలులో లేవని కేంద్ర న్యాయశాఖ మంత్రి చెబుతున్నారు. కాని వాస్తవం ఏమిటంటే ఈ 50ఏండ్లలో రాజ్యాంగంలోని అనేక అంశాలను కాశ్మీర్కు కూడ విస్తరించారు. మరో మాటలో చెప్పాలంటే. 42 సవరణలుచేసి 370ను ఒక డొల్లలా తయారు చేశారు. మిగతావి కాశ్మీర్ సొంత రాజ్యాంగంలో ఉన్నాయి. అక్కడ సమాచార హక్కు చట్టం 2004 నుంచే ఉన్నది. విద్యాహక్కు చట్టం, అవినీతి నిరోధక చట్టం, బాల వివాహాల రద్దు చట్టం ఇప్పటికే అమలులో ఉన్నాయి. అవి కూడ మెరుగైన విధంగా ఉన్నాయి. ఉదాహరణకు విద్యాహక్కు చట్టంలో విశ్వ విద్యాలయ స్థాయి వరకు ఉచిత విద్య అందిస్తున్నారు (తెలంగాణలో కేజీ టు పీజీ పరిస్థితి మనకు తెలుసు). వారి రాజ్యాంగంలో లౌకికవాద, సోషలిస్టు అనే పదాలు 1956 నుంచే ఉన్నాయి. మన భారత రాజ్యాంగంలో వీటిని 1976లో చేర్చారు. భారత రాజ్యాంగం కంటే 20ఏండ్ల ముందు వారు పై పదాలను పొందుపర్చు కున్నారు.
కాశ్మీర్లో ముస్లిం పర్సనల్ లా అమలులో లేదు. వారి సాంప్రదాయక చట్టాలనే వారు అమలు చేస్తున్నారు. ఆ చట్టాల్లో కొన్ని అభ్యుదయకరంగా ఉన్నాయి. అక్కడ పెళైన కూతురు తండ్రి దగ్గరే ఉంటే కొడుకుతో సమానంగా ఆస్తిలో భాగం పొందుతుంది. మిగతా చోట్ల కొడుకుకు ఇచ్చిన దానిలో సగం మాత్రమే పొందుతారు. ఇస్లామిక్ చట్టం ప్రకారం దత్తత చట్టపరం కాదు. అక్కడ చట్టపరం చేసుకున్నారు. దత్తత వెళ్ళిన వారికి ఆస్తిలో సమానవాటా వస్తుంది. పెండ్లి కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాశ్మీరీ అమ్మాయి బయటి వారిని పెండ్లి చేసుకుంటే ఆ అమ్మాయి ఆస్తిలో వాటా పొందదు అని ప్రచారం చేస్తున్నారు. అది అబద్ధం. 1920 చట్టం ప్రకారం కచ్చితంగా పొందుతారు. 2016లో కాశ్మీర్ హైకోర్టు సుశీల కేసులో స్పష్టమైన తీర్పు వచ్చింది. అయితే బయట నుంచి వచ్చిన పురుషుడు మాత్రం ఆస్తి పొందలేడు అనేది వాస్తవం. అక్కడ పౌరసత్వం కూడా ఇవ్వరు.
న్యాయశాఖ మంత్రి కాశ్మీర్లో ఇప్పుడు రిజర్వేషన్లు పొందవచ్చని, ఇది ఇప్పుడే పుట్టిన అవకాశంలా మాట్లాడుతున్నారు. కాశ్మీర్కు 2004లో రిజర్వేషన్స్ చట్టం ఏర్పడింది. అది కూడ అభ్యుదయకరంగా ఉన్నది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు జరుగుతున్నాయి. 50శాతానికి పరిమితి ఉన్నది. సీట్లు నిండనప్పుడు వాటిని వాయిదా వేసి తరువాత నింపుతారు.
దేశంలో అనేక రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. 371 అందులో భాగం. ఈశాన్య రాష్ట్రాలలో 371 ఉన్నది. తెలంగాణలో 1/70 చట్టం గిరిజన ప్రాంతాలలో ఉన్నది. పార్లమెంటు ఏ చట్టం చేసినా అది నాగాలాండ్లో అమలు జరగాలంటే అక్కడ శాసనసభ ముందు ఆమోదించాలి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి. మరోలా చెప్పాలంటే భిన్నమైనవారు భిన్నమైన స్వయంప్రతిపత్తులు కలిగి ఐక్యంగా ఉండటమే సమాఖ్య స్ఫూర్తి.
గతంలో కేంద్ర ప్రభుత్వం కూడ 370ని అడ్డుపెట్టుకొని రాష్ట్రపతి పాలన కొనసాగించడం లాంటివి చేసేది. ఇప్పుడు అది కుదరదు. చివరి విషయం భవిష్యత్లో పూర్తి మెజారిటీ కలిగి, 370 నిబంధన పునరుద్ధరించాలనే ధృఢ సంకల్పం గల ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే 370ని చట్టాల ప్రకారం పునరుద్ధరించ వచ్చు. అయితే అలా జరుగుతుందా లేదా ఇప్పుడే చెప్పడం కష్టమే.
- దివైర్ సౌజన్యంతో
సంక్షిప్త స్వేచ్ఛానువాదం :టి.ఎన్.వి.రమణ,
సెల్: 985628662