Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంతంత పేమెంట్లిచ్చి వాళ్ళని మోస్తున్నది, మేపుతున్నది ఇలాంటి సందర్భాల్లో రాజుగార్ని కాచుకునేందుకే కదా! ఆర్టీసి సమ్మె ప్రారంభమైన మరుక్షణం నుంచి 'రాజుగారి బాకా' నోరుతెరుచుకునే ఉంది. మొన్నటి నుండీ ప్రధాన అర్చక పండితుల వారు ఇతర పత్రికలను తమ స్వామి పరాయణత్వంలోకి ము(ది)ంచే ప్రయత్నం మొదలుపెట్టారు. ఆర్టీసి సమ్మెకు రాష్ట్ర ప్రజానీకం మద్దతు విస్తారంగా లభిస్తున్న నేపథ్యంలో ఈ పండిత ప్రకర్ష నడుస్తున్నది.
రెండు ముఖ్యమైన విషయాలు రాష్ట్ర ప్రజానీకం మధ్య చర్చనీయాంశమైనాయి. సకల జనుల సమ్మెలోకి వివిధ రంగాల కార్మికుల్ని దించేందుకు ఆనాడు అధినాయకుడి డైలాగులు ఆయన మెడకే తగులుకున్న పాములై బుస్సుమంటున్న తీరు ఒకటి. రెండోది - గత ఎన్నో సంవత్సరాల నుంచి సీఐటీయూ మాత్రమే నెత్తీ నోరూ కొట్టుకుంటున్న ఆర్టీసీ పరిరక్షణ నేడు అందరి నోళ్ళలో నానుతున్నది. ఈ రెండింటితో గంగవెర్రులెత్తిన మూలవిరాట్ అబద్ధాలే ఆయుధాలుగా రంగంలోకి దిగాడు. ఆస్థాన పండితులందర్నీ ఉసిగొల్పాడు. ఇదీ నేటి సీన్.
టీఎస్ ఆర్టీసీ పరిరక్షణ కీలకాంశం
ముందుగా రెండో అంశాన్ని, ప్రభుత్వానికి గొంతులో పచ్చివెలక్కాయలా పడ్డ అంశాన్ని పరిశీలిద్దాం. ఇదే నేటి సమ్మెలో ముఖ్యాంశం. అందుకే అసలు డిమాండు నొదిలేసి కొసరు డిమాండ్లపై చర్చను మళ్ళిస్తున్నారు ఈ పండితులంతా కల్సి! ఒక క్లారిఫికేషన్ ఇక్కడ అవసరం. 'విలీనం' తేలేదాకా సమ్మె విరమించే ప్రశ్నే లేదని యూనియన్లు చెప్తున్నాయి, కాబట్టి అదే కీలకమని కొందరు భ్రమలు వ్యాపింపచేస్తున్నారు. పండితుల కుతర్కం కూడా దాని చుట్టూనే సాగుతున్నది. కాదు. అసలు విషయం అది కాదు. ఈ అంశాన్ని తర్వాత పరిశీలిద్దాం.
టీఎస్ ఆర్టీసీ రక్షణకి సంబంధించి పరిశీలించే ముందు 'తమ ప్రభుత్వం ఆర్టీసిని ప్రయివేటీకరించట్లేద'ని అనేకమంది గులాబీ నాయకమ్మణ్యులు, వారి కిరాయి పండితులు గోచీలు బిగించి గోదాలో దిగారు. 2013-14లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో 1400గా వున్న అద్దె బస్సులు, 2019 ఆగస్టు నాటికి మన తెలంగాణాలోనే 2856. దీన్ని ఏమని పిలవాలి? ఆర్టీసీని ప్రయివేటు వారి చేతిలో పెడ్తేనే ప్రయివేటీకరణ కాదు. ఆర్టీసీ కార్మికులు చేసే పనుల్లో ప్రయివేటు / కాంట్రాక్టు / ఔట్సోర్సింగ్ కార్మికులు ప్రవేశించడం ఒక రకమైన ప్రయివేటీకరణ కాదా? మియాపూర్లోని బస్బాడీ బిల్డింగ్ యూనిట్ని (బీబీయు) నేడు దాదాపు పాడుపెట్టారు. ఏడాదికి 650 బస్ బాడీల నిర్మాణం చేసే ఈ బీబీయును మూతవేసి ప్రయివేటు వాళ్ళ దగ్గర బస్సులను నిర్మించడం ప్రయివేటీకరణ కాదా?! టికెట్స్ ముద్రించే, నేడు 'టిమ్స్' రోల్స్ ముద్రించే, అనేక రిజిష్టర్లు మొదలైనవి ముద్రించే ఆర్టీసీ ముద్రణాలయం మూసేసి ఈ పనంతా నేడు ప్రయివేటు వారికివ్వడం ప్రయివేటీకరణ కాదా? అన్ని డిపోల్లోని గ్యారేజీల్లో 42 రకాల పనులుంటాయి. వాటిలో 28 రకాల పనులు ఔట్సోర్సింగ్కివ్వడం విస్తరిస్తున్న ప్రయివేటీకరణకు నిదర్శనం కాదా? సాక్షాత్తూ ఎం.డి. గారి పేషీలోని 12 మంది ఉద్యోగుల్లో 11మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది! దీన్నేమంటారు సార్లూ?! టీఆర్ఎస్ సభ్యులు హృదయపూర్వకంగా బలపరిచిన యం.వి.యాక్ట్ 2019 లోని 88ఏ సెక్షన్ రాష్ట్రంలోని రూట్లను మోడీ సర్కార్ స్వేచ్ఛగా ప్రయివేటు వారికి అప్పగించే అవకాశం ఇచ్చారు కదా! ఇది హోల్సేల్ ప్రయివేటీకరణకే కదా! అందుకే కదా బీజేపీ / టీఆర్ఎస్లది లాలూచీ కుస్తీ అంటున్నాం.
1996లో చంద్రబాబు ప్రపంచబ్యాంకుతో చేసుకున్న (ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ రీస్ట్రక్చరింగ్ ప్రోగ్రాం) ఎపిఇఆర్పి ఫలితమే పైన పేర్కొన్నవన్నీ! చంద్రబాబుపాలన పోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ ప్రపంచ బ్యాంకు మాత్రం 'వదల బొమ్మాళీ! వదల' అంటూ మనల్ని పట్టుకు వేలాడుతూనే ఉంది. ఈ అంశాన్ని కార్మికులు అర్థం చేసుకోనంత కాలం పాలకుల, పాలక పార్టీల నేతల డైలాగులకు మోసపోతూనే వుంటారు.
ఇక ఆర్టీసీ రక్షణ అంశం. ఈ ప్రభుత్వం ఆర్టీసీని రక్షించకపోగా, భక్షిస్తున్నదని సీఐటీయూ అభిప్రాయం. నేడు ఆర్టీసీ కార్మికులందరూ ఈ అభిప్రాయానికే వచ్చారు, వస్తున్నారు.
సర్కారు బాకాలో ఊదరగొడ్తూన్నట్టు నిజంగానే ఈ ప్రభుత్వం ఆర్టీసీని రక్షించడానికి ప్రయత్నిస్తున్నదా?
ఆర్టీసీ ప్రజలకిస్తున్న, అంటే విద్యార్ధులు, వికలాంగులు వగైరాలకిస్తున్న రాయితీలు 2014-15 నుంచి 2018-19 వరకు రూ.2802.75 కోట్లు. పంచపాండవులు, మంచంకోళ్ళ కథ తెలియని తెలుగు వారుండరు. 2014-15 నుండి 2018-19 వరకు ప్రతి సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన మొత్తం సొమ్ము రూ.1360 కోట్లు. ఆర్టీసీకి ఇచ్చింది రూ.620 కోట్లు. నాలుగోవంతు కంటే తక్కువ. ఆర్టీసీ బతికి బట్టకట్టేదెట్టా? ఇదేనా ఆర్టీసీని రక్షించే పద్ధతి?
డీజిల్ మీద రాష్ట్రం వేసే వ్యాట్ 27.22 శాతం. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గిస్తే ఏడాదికి రూ.300 కోట్లు ఆర్టీసీకి మిగుల్తుంది. కేంద్రం తనకొచ్చే ఎక్సైజ్ పన్ను తగ్గించుకుంటే మరో రూ.300 కోట్లు మిగుల్తుంది. ప్రజా రవాణా రక్షించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉద్దేశం వుంటే నేడు రూ.600 కోట్లు టీఎస్ ఆర్టీసీకి మిగుల్తుంది. పది లక్షల రూ||ల ఖరీదు చేసే కార్లకు కూడా జీఎస్టీ తగ్గించాలనే డిమాండు పెట్టి చిన్నగా ప్రభుత్వాలను దారికి తెచ్చుకుంటున్నారు కార్ల కంపెనీ యజమానులు. మరి మన ఆర్టీసీ కొనే ఛాసీస్లు, నిర్మించే బస్బాడీలపై జీఎస్టీని తగ్గించాలని కనీసం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే ఎదురేగి బలపరిచిన కెసిఆర్ కు కనీసం నోరు రావడం లేదెందుకని?
ఆర్టీసీని రక్షించడమంటే ఈ భారాలు తగ్గించడం, తగ్గించాలని కేంద్రంతో కొట్లాడటం! ఇవన్నీ నేడు కార్మికులు అడుగుతున్న ప్రశ్నలు. ఇవి చర్చనీయాంశం కావడానికి కారణం కార్మికుల సీసీఎస్ డబ్బుల్ని (రూ.528.55 కోట్లు) పీఎఫ్ డబ్బుల్ని (రూ.826 కోట్లు) కార్పొరేషన్ వాడుకోవడంతో తనకు పీఎఫ్ లోన్ ఎందుకు రాలేదంటే యాజమాన్యం వాడుకుందని కార్మికులు అర్ధం చేసుకుంటున్నారు. రక్షించకపోగా కార్మికుల సొమ్ము కైంకర్యానికి ఒడిగట్టడం కార్మికుల్లో క్రోధం కట్టతెగేలా చేసింది.
ఘనత వహించిన సర్కారీ పండితులందరూ కావాలనే ఈ అంశాల్ని వదిలేసి 'విలీనం' డిమాండు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటిదాకా పేర్కొన్న అంశాలన్నింటి వల్ల మొదట పేర్కొన్న విలీనం డిమాండు వచ్చింది. జీతాలు పెరగట్లేదు, అతి తక్కువగా ముష్టేసినట్టు ఇ.పి.ఎస్ పెన్షన్ వస్తుంది. 2019 ఏ ఆర్టీసీ కార్మికుడు రిటైరైనా పెన్షన్ రూ.6200 చిల్లర మాత్రమే వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులనిపించుకుంటే ఎక్కువ పెన్షన్ రాదు. 2004 నుంచి ప్రభుత్వోద్యోగులకూ జిపిఎస్ లేదు. ఎన్పిఎస్ మాత్రమే ఉంది. ఏ విద్యుత్ ఉద్యోగినడిగినా, ఏ ప్రభుత్వ ఉద్యోగినడిగినా దీనిపై స్పష్టత వస్తుంది.
ఏమైనా విలీనం కార్మికుల మనసులను ఆవహించడానికి కారణం ఈ కార్పొరేషన్ ఎప్పుడు దివాళా తీస్తుందోనన్న భయం. ఒకసారి ప్రభుత్వంలో అంతర్భాగమైపోతే ఈ బాధలుండవనే ఆలోచన.
ఇవి ఒక భాగమైతే, రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమంలో ముఖ్యంగా సకల జనుల సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికుల్ని రంగంలోకి దింపేందుకు స్వయంగా కెసిఆర్ 'తెలంగాణ రాష్ట్రం రావడంతోనే ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేసుకుని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలిస్తా'మని 'హర్షధ్వానాల' మధ్య చెప్పుకున్నాడు. ఒకపక్క ఆర్టీసీ పరిస్థితి దిగజారడం కూడా జోడయ్యేసరికి ఈ డిమాండు కార్మికులను ఆవహించింది.
పండితుల వంకర వాదనలు
ఆ పార్టీ పాలనలో నున్న రాష్ట్రంలోను, ఈ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రంలోను ఆర్టీసీని విలీనం చేశారా అన్నది సీఎమ్ గారి దగ్గరి నుంచి పండితులందరి వాదన! ఆ డిమాండు కార్మికులను ఆవహించడానికి కారణం పైన చెప్పుకున్నాం. మొత్తం 8రాష్ట్రాల్లో ఆర్టీసీ ప్రభుత్వ డిపార్ట్మెంట్లుగానే ఉంది. హర్యానాలో దాన్ని ప్రయివేటు వారి చేతుల్లో పెట్టేందుకు (అంటే రూట్లు వేలం వేసేందుకు) అక్కడి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే ఉద్యోగులు ఏకమై అడ్డుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ మొదలైన పార్టీలన్నీ ఒకే తానులోని ముక్కలు. అన్నింటి విధానాలు ఒకటే. టీఆర్ఎస్ కూడ ఆ ముక్కల్లో ఒక ముక్కని ఒప్పుకుంటుందా? ప్రత్యేక విధానాలున్న పార్టీగా నిలబడ్తుందా? ఇక్కడ సమస్యల్లా అలాంటి పార్టీలైనా ఆయా రాష్ట్రాల్లో ప్రజారవాణా కోసం సాయపడ్తున్నారు. ఉదాహరణకు కర్నాటక, గుజరాత్, మహారాష్ట్రల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఈక్విటీ రూపంలో పెట్టుబడి పెడ్తున్నారు. ఆ పని గత 60ఏండ్లుగా కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ పాలనలో జరగనే లేదు. అసలు ఆర్టీసీ చట్టం (1950) ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో ఆర్టీసీలో మూలధనం రూపంలో పెట్టుబడి పెట్టాలి. అది జరగనే లేదు మన రాష్ట్రంలో. 2011-19 మధ్య తమిళనాడులో (డీఎంకే, ఏఐడీఎంకే ప్రభుత్వాలు) ఆర్టీసీలో 20వేల కోట్లు పెట్టుబడి పెట్టినాయి. పైగా 1971లో 22 కార్పొరేషన్లుగా విడగొట్టిన టీఎన్ ఆర్టీసీని 1985లో 8గా కలిపేశారు. 2017లో 7గా కలిపారు. త్వరలో ఒకటే ఆర్టీసీగా కలిపేందుకు ఆలోచిస్తున్నారు. కేరళలో సం||నికి వెయ్యి కోట్ల రూ||లు బడ్జెట్లో కేటాయిస్తున్నారు. తక్కువ వడ్డీకి రూ.3500 కోట్లు అప్పు ఇప్పించారు. ఆర్టీసీ కార్మికుల పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఆర్టీసీ ఆదాయానికి, వ్యయానికి మధ్య వున్న వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఇవన్నీ చేయగలరా కెసిఆర్ గారూ?!
1917లో సోవియట్లో సోషలిజం వచ్చిన తర్వాత ప్రపంచంలోనే మొట్టమొదట ప్రజా రవాణా సంస్థ సోవియట్ యూనియన్లో ఏర్పడితే రెండవది నిజాం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పడిన సంస్థ 'నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ డిపార్ట్మెంట్'. ఇది 1932లో విషయం. దాన్ని ధ్వంసం చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గం.
హైకోర్టు చెప్పినా తాను కార్మిక సంఘాలతో చర్చలు చేయనని కేసీఆర్ భీష్మించుకోవడం ఆయన ఫ్యూడల్ మనస్తత్వానికి పరాకాష్ట. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా రాష్ట్ర కార్మికోద్యమం పూర్తి స్థాయిలో రంగంలోకి దిగే సమయమాసన్నమైంది. 'వాస్తవం అక్షరమై వెలిగినప్పుడల్లా అవినీతి మెదళ్ళకు మతి భ్రమణం కల్గుతుంది' అన్న కటుకోఝ్వుల రమేష్ చెప్పింది ఎంత సరైందో కదా!
- ఆర్. సుధాభాస్కర్
సెల్: 9490098025