Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనదేశంలో మనకు ఇక్కడ ఓవర్ యాక్షన్తో ప్రవచనాలు (బోధలు) చెప్పే ప్రవచన కారులు, బాబాలు, గురువులు, మూడుశ్రీలు, బ్రహ్మశ్రీలు, బాబాలు, ఫకీర్లు వగైరా అందరికన్నా, అది ఎంతో మెరుగు. అక్కడ ప్రజల అవసరాలు తీరుతున్నాయి. ఇక్కడ వీరితో జనం సమయం, డబ్బు, శక్తీ అన్నీ వృధా అవుతున్నాయి. చెత్తనంతా జనం మెదళ్ళకు ఎక్కిస్తూ.. వారి ఇంగిత జ్ఞానాన్ని సమాధి చేస్తున్న వీరు పెద్ద మోసగాళ్ళు.. నేరగాళ్ళు!! అందుకే జనం అప్రమత్తంగా ఉండాలని, తమ ఇంగితజ్ఞానాన్ని ఎల్లప్పుడూ ఉపయోగిస్తూ ఉండాలనీ కోరుకుందాం!
''సైన్సు తెలియకుండా వేదాంతం మాట్లాడేవారు అజ్ఞానులు. వారికి ఏమీ తెలియదు సరికదా, తమకేమీ తెలియదని కూడా తెలుసుకోలేరు'' అని అన్నారు 'జీవ శాస్త్ర విజ్ఞానం - సమాజం' అనే గ్రంథంలో డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్. 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టినా, తరతరాలుగా పనికిరాని పరిజ్ఞానం వంటబట్టించుకుని తిరోగమంలో ప్రయాణం చేస్తున్న ఈ సమాజం, ముఖ్యంగా భారతీయ సమాజం నిజంగా 21వ శతాబ్దంలోకి రావాలంటే ఇంకా చాలా సమయం పట్టేట్టుగా ఉంది. అన్నింటినీ శాసించగలుగుతున్న నేటి రాజకీయ రంగానికి ఒక క్రమ శిక్షణ, ఒక నిబద్ధతా లేదు. ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు. మనది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యమంటే విశృంఖల స్వేచ్ఛకాదు కదా? అబద్ధం ఆడకుండా, దోపిడీ చేయకుండా, తిమ్మిని బమ్మి చేయకుండా, విలువలతో చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు దాదాపు లేకుండా పోయాయి. తప్పులు చేసిన పెద్దలే నీతి సూత్రాలు వల్లెవేస్తున్నారు. తమ తమ పనులు గట్టెక్కించుకోవడం కోసమే బహుశా.. మానవ సంబంధాలు చలామణిలో ఉన్నాయా అనిపిస్తోంది! అసలు సమాజం ఎటుపోతోంది? సమాజంలో శాంతిని ప్రతిష్టాపిస్తామన్న మత గురువులే యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు. అందుకే అనుమానం వస్తోంది. ఈ దేశ పౌరులు తమ ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారా? లేదా? అని!
ఈ దేశానికి తొలి పౌరుడినన్న స్పృహ లేకుండా ఓ పెద్ద మనిషి, గ్రహాలన్నీ ఓ మత గురువు చుట్టూ తిరుగుతున్నాయని పొగడుతాడు. ఓ తల్లి స్వయంగా కూతురినే కాల్చేస్తుంది. కూతురు తల్లినే చంపుతుంది. తండ్రే స్వయంగా కూతురిని రేప్ చేస్తాడు. నమ్మిన బంటే యజమాని ప్రాణాలు తీసి, ఆస్తి కాజేస్తాడు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర గౌరవాన్ని రెపరెపలాడించిన వాడు దోషిగా కటకటాల వెనక్కి వెళతాడు. ఇవి అనునిత్యం అనుక్షణం మన సమాజంలో జరుగుతున్న సంఘటనలు. వేదాంతానికి, ఆధ్యాత్మికతకు మన దేశాన్ని మించిన దేశం లేదని గొప్పలు చెప్పే మత గురువులు, సమాజంలో అరాచకాలు ఎందుకు ఆపలేకపోతున్నారు. వీరి ముందు సాగిలపడే బూర్జువా రాజకీయ దురంధరులు తమ శక్తినంతా అధికారాన్నంతా ఉపయోగించి సమాజాన్ని క్రమపద్ధతిలో ఎందుకు ఉంచలేకపోతున్నారు? నిజాయితీ లేక, వేషాలు వేసుకుని తిరుగుతన్న ఈ మోసగాళ్ళని సామాన్యులు ఎంత సత్వరం గుర్తిస్తే అంత మంచిది.
సమాజంలో ఒకవైపు విద్య పెరిగింది. ధనం పెరిగింది. జీవన ప్రమాణాలు పెరిగాయి. జీవనశైలి సుఖవంతమైంది. వీటన్నిటికీ మూలకారణం సైన్సే.. కాని జనం ఆ విషయం గుర్తుంచుకోవడం లేదు. అందుకే సమాజం భ్రష్టు పట్టిపోతోంది. విలువలు అడుగుంటుతున్నాయి. తీవ్రంగా ఆలోచిస్తే తోచేది ఒకే ఒక్క విషయం!
మనిషి-వివేచన కోల్పోవడం..
వివేచన - ఇంగిత జ్ఞానంలోంచి వెలువడుతుంది -
ఇంగిత జ్ఞానమే లేనప్పుడు వివేచన ఎక్కడా?
మరి, వివేచనే లేనప్పుడు వైజ్ఞానిక స్పృహ ఎక్కడా? అది లేకుండా చేయడమే ప్రభుత్వాల లక్ష్యమైనప్పుడు ఇక అందు అవకాశమెక్కడ..? అందుకే ఇప్పుడు మనకు వైజ్ఞానిక స్పృహ / వివేచన / ఇంగిత జ్ఞానం కలిగించే రచనలు కావాలి. ఉపన్యాసాలు కావాలి. పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి. తరతరాలుగా సమాజంలో నాటుకుపోయిన భావజాలాన్ని మార్చగలగాలి.
''శాస్త్రీయ దృక్పథాన్ని మానవత్వాన్ని, సత్యాన్వేషణ తత్వాన్ని సంస్కరణ వాదాన్ని పెంపొందింపజేయడం ప్రతిభారత పౌరుని కర్తవ్యం'' అని మనం మన రాజ్యాంగంలో రాసుకున్నాం గానీ, ఆచరించడం లేదు. అలా కాకుండా విధిగా ఆచరిస్తూ ఉండాలి. ఆచరించక పోవడం వల్లనే కదా సంఘంలో అరాచక శక్తులు ప్రబలిపోతున్నాయి. ఈ రోజుల్లో కూడా 'చేతబడి'-నేపథ్యంలో సజీవ దహనాలు అవసరమా? ఇరవై ఒకటవ శతాబ్దంలో బతుకుతున్నామని విర్రవీగు తున్నామే కానీ, నిజంగా ఆ స్థాయిని అందుకోగలి గామా? 460బి.సి.ఎ.లో పుట్టిన హిప్పోక్రేట్స్ స్థాయిని కూడా అందు కోలేక పోతున్నామే? ''ఫాదర్ ఆఫ్ మెడిసిన్''గా ఆయనకు గుర్తింపు ఉంది. ఆయన దేవుణ్ణి నిరసించాడు. ప్రకృతి గొప్పతనాన్ని గుర్తించాడు. మనిషి గొప్పతనాన్ని కీర్తించాడు.
మతాలన్నీ ఎప్పుడు, ఎలా, ఎందుకు తలెత్తాయో అర్థం చేసుకుంటే గాని.. అవి ఈ రోజుల్లో ఎందుకు నిరుపయోగమో తెలుస్తుంది. ''మతం ఎపెండిక్స్ లాంటిదని'' లోగడ ఎవరో అన్నారు. ఆ మహానుభావుడి మాట పూర్తిగా నిజం. మన కడుపులో పెద్దపేగుకు చివరి ఉండే భాగమే - అపెండిక్స్. ఒకప్పుడు మనకు పనికొచ్చేది. మనిషి పచ్చి ఆకులు పండ్లు తినే కాలంలో 'పత్రహరితం' జీర్ణం చేయడానికి అది ఉపయోగపడేది. కొన్ని శతాబ్దాల కాలంలో జరుగుతూ వచ్చిన మార్పుల కారణంగా, మనుషులంతా పచ్చి ఆకులు, అలములు తినడం మానేస్తూ వచ్చారు. అందువల్ల అపెండిక్స్ శరీరంలో ఒక పనిలేని అవయవంగా మిగిలపోయింది. ఏ కారణం వల్లనైనా అది పగిలిపోవడాన్ని 'అపెండిసైటిస్' అని అంటారు. శస్త్ర చికిత్స ద్వారా వెంటనే దాన్ని తొలగించాలి.. అదే చికిత్స! మరోమార్గం లేదు. ఆ పనికిరాని అవయవం తొలగించడం వల్ల శరీరం కుదురుకుంటుంది. ఆరోగ్యం చేకూరుతుంది. మతమనేది కూడా అంతే.. దాన్ని కూడా జీవితంలోంచి తొలగిస్తేనే జీవితాలు బాగుపడతాయి!! ఈ అత్యాధునిక వైజ్ఞానిక యుగంలో మతమనేది ఎందుకూ పనికిరానిదన్నది జనం గుర్తించగలగాలి.
మనకు గొప్ప మేథావులతో పాటు, ఇంగిత జ్ఞానంతో పనిచేసే సామాన్య పౌరులు ఎక్కువ సంఖ్యలో కావాలి. అలాంటి వారితోనే ఆరోగ్యకరమైన సమాజం రూపుదిద్దుకుంటుంది. మరి అలాంటి వారికోసం సరళ వైజ్ఞానిక శాస్త్ర గ్రంథాలు విరివిగా రావల్సిన అవసరం ఉంది. దానివల్ల సమాజంలో వైజ్ఞానిక దృక్పథం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బాధ్యతగల రచయితలు, సంస్థలు, ప్రభుత్వాలు ఈ దిశలో ఒక నిబద్దతతో పనిచేస్తూనే ఉండాలి. మనకు గొప్ప శాస్త్రవేత్తలూ, మేధావులూ ఉన్నారు. కానీ, సామాన్యుడి కోసం సైన్సురాసే రచయితలు ఎక్కువగా లేరు. ఉన్నా, వారు సైన్సు సమాచారం ఇవ్వగలుగుతున్నారే గానీ, విషయం సమాజానికి, నిత్య జీవితానికీ అన్వయించి రాయలేకపోతున్నారు. హేతువాద నేపథ్యంలోంచి, మార్క్సిస్టు దృక్పథంలోంచి విషయం వివరిస్తూ పాఠకుల్లో వైజ్ఞానిక స్పృహను పెంచే విధంగా రాయగలగాలి.. వివేకవంతులైన వారు.. వారి స్థాయిలో ఈ పనిని సత్వరం చేపట్టాల్సి ఉంది. అలాగే, మత భావనల్ని వదిలేసే విషయంలో ముందు ఉండాల్సింది మహిళలు.. ఎందుకంటే, మత పరంగా వారు ఎంతో హింసించబడ్డారు. వారిని దాదాపు అన్ని మతాలూ భోగవస్తువుగానే చూశాయి. వారి ఆలోచనల్ని, వివేచనని, స్వేచ్ఛని అణిచిపెట్టాయి. అసలు మనుషులకు ఇవ్వాల్సిన విలువను మతాలు స్త్రీలకు ఎప్పుడూ ఇవ్వలేదు. పురుషాధిక్య మత సామ్రాజ్యంలో వారు కొన్ని శతాబ్దాలుగా బానిసలుగానే బతుకీడుస్తున్నారు. అందువల్ల మహిళలు మతాన్ని వదిలేస్తే వారి కుటుంబాలు బాగుపడతాయి. కుటుంబాలు బాగుపడితే సమాజం బాగుపడుతుంది. అందరం మనుషులమేనన్న భావన బలపడుతుంది. అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు ఉంటాయన్నది గ్రహిస్తే ఇకనేం? అందరూ మానవీయ విలువల పరిరక్షణ కోసం సంసిద్ధులవుతారు.
దేవుడు నయం చేసిన వ్యాధులేవో ఎవరైనా చెప్పగలరా? సైన్సు నయం చేస్తూ వచ్చినవి అసంఖ్యాకంగా ఉన్నాయి. ఇలాంటి ఉదాహరణలు మన నిత్య జీవితంలోంచి ఎన్నయినా చెప్పుకోవచ్చు. ప్రమాదవశాత్తూ కుంటిదైపోయిన క్రీడాకారిణికి సైన్సు సహాయం అందిస్తుంది. కృత్రిమంగా తయారు చేసిన కాలుని ఇచ్చి, మళ్ళీ ఆటలో నిలబెడుతుంది. అదే క్రీడాకారిణి ఏండ్లకేండ్లు ప్రార్థనలు, భజనలు ఏవి చేసినా ఏమీ లాభం ఉండదు. కుంటిదాని లాగానే ఇంట్లో కూర్చోవాలి. సైన్సు కృత్రిమ అవయవాన్నిచ్చి మరింతగా ప్రోత్సహిస్తుంది. అందుకే చెప్పేది.. సైంటిస్టులు 'బ్లాక్హౌల్'ను అధ్యయనం చేస్తుంటే.. మెజారిటీ దేశ ప్రజలు యజ్ఞాలు, యాగాలు, హౌమాలు అంటూ సమయం, డబ్బు, శక్తి అన్నింటినీ వృధాచేసు కుంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాల పేరుతో వేలవేల యేండ్ల నాటి మూఢనమ్మకాల్ని పునరుద్ధరించు కుంటున్నారు. ఇలాంటివారు అధిక సంఖ్యలో ఉన్నంత మాత్రాన వారంతా సరైన మార్గంలో ఉన్నట్టుకాదు. బూజుపట్టిన ఆలోచనలు గలవారు అలాగే ఉండదలిస్తే.. ఉండొచ్చు. కానీ, రాబోయే తరాల్ని చెడగొట్టొద్దు. వారిని జ్ఞానవంతులుగా చేయాలంటే, విజ్ఞాన శాస్త్రం చదివించడమో, లేదా దానిసారాంశాన్ని జీర్ణించుకునేట్టు చేయడమో చేయాలి.. అలా చేయకపోతే పిల్లల దృష్టిలో పెద్దలంతా 'ఫూల్స్' అయ్యే ప్రమాదం ఉంది. ఆధునిక మానవుని విజ్ఞానం ముందు తల దించుకుని ఆపరాధ భావంతో నిలబడాల్సి వస్తుందన్నది నిజం.
అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్తో పని చేసే.. ''మాట్లాడే బొమ్మ'' ఉంది. అది ప్రయాణీకుల సందేహాలు తీరుస్తుంది. సరదాగా కబుర్లు చెపుతుంది. ఏ విషయం మీదైనా చర్చించదలిస్తే, అది చర్చలో పాల్గొంటుంది. మనదేశంలో మనకు ఇక్కడ ఓవర్ యాక్షన్తో ప్రవచనాలు (బోధలు) చెప్పే ప్రవచన కారులు, బాబాలు, గురువులు, మూడుశ్రీలు, బ్రహ్మశ్రీలు, బాబాలు, ఫకీర్లు వగైరా అందరికన్నా, అది ఎంతో మెరుగు. అక్కడ ప్రజల అవసరాలు తీరుతున్నాయి. ఇక్కడ వీరితో జనం సమయం, డబ్బు, శక్తీ అన్నీ వృధా అవుతున్నాయి. చెత్తనంతా జనం మెదళ్ళకు ఎక్కిస్తూ.. వారి ఇంగిత జ్ఞానాన్ని సమాధి చేస్తున్న వీరు పెద్ద మోసగాళ్ళు.. నేరగాళ్ళు!! అందుకే జనం అప్రమత్తంగా ఉండాలని, తమ ఇంగితజ్ఞానాన్ని ఎల్లప్పుడూ ఉపయోగిస్తూ ఉండాలనీ కోరుకుందాం!
డాక్టర్ దేవరాజు మహారాజు
- సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.