Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎర్రటి ఎండ.. కాళ్లకు సగం సగం ఊడిపోయి ఎప్పుడు తెగిపోతాయో తెలియని చెప్పులు.. నెత్తిన మూట, పక్కన పదేండ్ల కూతురు, ఆ అమ్మాయి చేతిలో చంటిపాప, భార్య చేతిలో పెద్ద మూట, పక్కన నెత్తిమీద బరువుతో భార్య.. ఇలా మొత్తం కుటుంబం వందల కిలోమీటర్లు కాలినడకన సొంతూళ్లకు చేరుకునేందుకు నానా యాతనలు పడుతున్నారు. వందల కిలో మీటర్లు నడుస్తున్నారు. జనం లక్షల సంఖ్యలో ఇప్పటికీ మద్రాస్ నుంచి హైవేలో విజయవాడ మీదుగా ముందుకు సాగుతున్నారు. వీరంతా బీహార్, జార్ఖండ్కు చెందిన వలస కార్మికులు. వీరిలో కొందరు దారిలో ప్రాణాలు వదులుతున్నారు.
ఈ నేపథ్యంలో మే 12 రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ 20-20 యతి ప్రాసలతో 20లక్షల కోట్ల రూపాయల పథకాన్ని ప్రకటించారు. కోవిడ్-19ని ఎదుర్కొనే క్రమంలో వివిధ వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ఈ ప్యాకేజీ ప్రకటించినట్టు వివరించారు. పంజరంలో చిలుక పలుకులు మోడీ పలికితే పంజరం బయట నిర్మలాసీతారామన్ వాటినే యథాతథంగా వల్లించారు. వారి పలుకులలో తక్షణ కర్తవ్యం, దీర్ఘకాలిక వ్యూహం ఉండాలి. కానీ వీరి దక్ఫథం ఊహాలోక దీర్ఘకాలిక లక్ష్యంగా అస్పష్టంగా ఉంది తప్ప - తక్షణ కర్తవ్యం పొరపాటున గోచరించలేదు. తక్షణం వలస కూలీలను ఎలా ఆదుకోవాలనే ఆలోచన ఎక్కడా కనిపించలేదు. వారు సొంతూళ్లకు వెళ్లిన తర్వాత వారికి రెండు నెలల పాటు బియ్యం, నిత్యవసరాలు ఇస్తామన్నారు. నిజమే.. వారు అసలు సొంతూళ్లు వెళ్లకుండా మధ్యలోనే రాలిపోతున్న వాస్తవాన్ని ప్రధానిగానీ, ఆర్థికమంత్రిగానీ గుర్తించలేదు. వారి తీరు ఎలా ఉందంటే అన్నప్రాశన నాడే ఆవకాయ పెట్టిన చందంగా తయారైంది. వలసకూలీలు ఆకలికీ, నిరుద్యోగానికీ, వందలమైళ్ల నడకకూ భయపడటం లేదు. కానీ పాలకుల వివక్షకు మాత్రం వారు ఆందోళనకు గురవుతున్నారు. నిజమే, కోట్లాది మంది వలసకూలీలను పట్టించుకోని పాలకుల భయానకమైన బాధ్యతా రాహిత్యానికి రోడ్లపాలైన కూలీల బతుకులు, పట్టాలపై, రోడ్లపై విగతజీవులైన వారి జీవన్మృత సాక్ష్యాలు.
లాక్డౌన్ ప్రకటించి 50రోజులు దాటింది. అలా ప్రకటించే టప్పుడు పొట్టచేతపట్టుకుని నగరాలకు వలస వచ్చిన కూలీలు పరిస్థితి ఏమిటి? వారెలా జీవిస్తారు? ఎక్కడ ఉంటారు? వీరి బతుకులను ఏం చేయాలనే ఆలోచన, ప్రణాళిక లేకుండా వారిని బతికి ఉండేలా చేయాలనే ధ్యాస లేకుండా లాక్డౌన్ ప్రకటించారు. ఈ వలస కార్మికులు 20కోట్ల వరకు ఉంటారు. వలస కార్మికుల గురించి బీజేపీ ప్రభుత్వానికి అవగాహనలేదు. ఆర్టీఐ ద్వారా అడిగినా సమాచారం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వానికి నిఘా విభాగం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలైన కార్మిక విభాగం, సాంఘిక సంక్షేమ విభాగం, పోలీస్ డిపార్టుమెంట్ ఇంకా అనేక సంస్థలున్నాయి. ఈ సంస్థలన్నీ ఎక్కడ, ఎవరు బీజేపీి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ చిట్టా అంతా తయారు చేస్తున్నది కానీ వలసకూలీల లెక్క తీయడం లేదా? అవినీతి, అసమర్థత, ఆలోచనలేని నిర్ణయాలే ఈ జాతికి ప్రమాదకరమైనవి. నేడు కేంద్రం ఆ దిశలోనే సాగుతున్నది. నిర్మాణ, ఉత్పత్తి రంగంలో పనిచేసే వారి వివరాలు లేకపోవడమంటే ప్రభుత్వ సామాజిక స్వభావం అర్థమవుతుంది. అలాగే అసంఘటిత కార్మికులు మరో 20కోట్ల మంది ఉంటారు. వీరి ప్రాముఖ్యత 45రోజుల తర్వాత గానీ ప్రభుత్వానికి గుర్తుకు రాలేదు. ''గోటితో పోయేది గొడ్డలి దాకా'' అన్నట్టు లాక్డౌన్ ముందు గానీ, లాక్డౌన్ ప్రకటించిన తక్షణం గానీ వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు పంపి ఉంటే ఇంత రాద్దాంతం ఉండేది కాదు. ఇక్కడే వారి వర్గస్వభావం అర్థమవుతున్నది. వలస కార్మికులు వారివారి స్వస్థలాలకు వెళితే కొనసాగుతున్న భవన నిర్మాణాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు ఆగిపోతాయి. మైన్స్లోనూ, స్టీల్ రంగంలోనూ బీహారీలు, బెంగాలీలు ఎక్కువ పాత్ర వహిస్తారు. వారంతా వెళితే నిర్మాణరంగం కుంటుపడుతుందనే దురుద్దేశంతోనే ఇటు కాంట్రాక్టర్లు, అటు ప్రభుత్వం వలస కార్మికులను నిర్లక్ష్యం చేసింది. పోనీ అంతటి ప్రాముఖ్యత కలిగిన కార్మికులకు కనీస సౌకర్యాలైన తిండి, తిప్పలు చూశారా? నేను నానక్ రామ్ గూడ, కొత్తూరుల్లో భవన నిర్మాణ కార్మికులను కలిసి, వారి స్థితిగతులు తెలుసుకున్నాను. వారి దీనావస్థలు చూస్తే బానిస యుగంలో కార్మికులేవిధంగా ఉన్నారని చదువుకున్నామో అదే పరిస్థితి వారిలో కనిపించింది. కాకపోతే గోలుసులతో కట్టేయలేదు. నాకు బీహార్ నుంచి, బెంగాల్ నుంచి పార్టీ నాయకులు ఫోన్ చేసి చెన్నరులోనూ, హైదరాబాద్లోనూ కార్మికులున్నారు. వారికి సాయం చేయమని చెప్పారు. అప్పటికే చెన్నరు నుంచి కార్మికులు తడ వద్దకు వచ్చేశారు. స్థానిక పార్టీ నాయకులు సుధాకర్, వేలుమలూలను పంపాను. తడ చెక్ పోస్టు వద్ద గుమిగూడారు. స్థానిక పోలీస్ అధికారులతో మాట్లాడితే, వారెక్కడ పని చేసేదీ మాకు తెలియదు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. వారిని స్వస్థలాలకు పంపడానికి మా వల్ల కాదని చేతులెత్తేశారు. ఆ పూటకు భోజన వసతులు ఏర్పాటుచేశారే కానీ మరేతర సాయం చేయలేకపోయారు. వారి కాలి నడక కొనసాగుతూనే ఉన్నది. స్థానిక నాయకులు చెప్పినదాన్ని బట్టి వేలాది మంది వలస కార్మికులు తండోప తండాలుగా హైవే మీదపడి పోతూనే ఉన్నారు. అక్కడక్కడా స్థానికులు వారికి నీళ్లు, మజ్జిగ, అన్నం ప్యాకెట్లు అందిస్తున్నారు.
హైదరాబాద్ నానక్ రాంగూడకు వెళితే అక్కడ 6వేలమంది భవన నిర్మాణ కార్మికులున్నారు. యాజమాన్యం వారికి వారానికి మూడు కేజీల బియ్యం మాత్రం ఇచ్చారట. కొత్తూరువద్ద స్టీల్ ఫ్యాక్టరీలో పని చేసే వలస కార్మికుల పరిస్థితి అంతే. ఒక వైపు కాలే కడుపులతో వలస కార్మికులు, మరో వైపు మాటలతో కడుపు నింపే పాలకుల ప్రసంగాలు వింటుంటే నా కడుపు మండిపోతున్నది. గుర్తింపు కార్డులున్నా, లేకున్నా ఏ వ్యక్తిని పస్తు పెట్టం - అందర్ని కాపాడుకుంటాం అని ప్రధాని పదేపదే చిలుక పలుకులు పలుకుతున్నారు. ముఖ్యమంత్రులేమో వలస కార్మికులను కడుపులో పెట్టుకుని కాపాడతాం అనే మాటలతో కడుపు నింపుతున్నారు. కానీ ఆచరణలో వలస కార్మికులెవ్వరికీ ఆహార వస్తువులు అందడం లేదు. నగదు ఇవ్వడంలేదు. కానీ లెక్కలు ఘనంగా చెబుతున్నారు. బడ్జెట్ కేటాయింపులు దండిగా ఉన్నాయి. ''కుండలో కూడు కుండలోనే ఉండాలెె-బిడ్డలు మాత్రం బొద్దుగా ఉండాలి'' అన్న చందంగా ఉంది పాలకుల తీరు.. తీరా ప్రధాని 20 లక్షల కోట్ల తతంగం ప్రకటించారు. ఇప్పటికే ఆర్థిక వేత్తలు 20 లక్షల కోట్లు ''చిరిగిపోయిన కరోల్ బాగ్లో ఉండే విధంగా ఉన్నాయని'' ఎద్దేవా చేస్తున్నారు. మళ్లీ నేను దీనిని ప్రస్తావించదలుచుకోలేదు. వారి కేటాయింపులు పరిశీలిస్తే చిన్న తరహా పరిశ్రమల పేరుతో చిన్న చేపలను పెద్ద చేపలు ఏ విధంగా వెంటాడతాయో మనం చూడబోతున్నాం. ఇప్పటికి 7కోట్ల 70లక్షల టన్నుల ధాన్యం గిడ్డంగులలో ఉంది. ఇంకో నెలలో 4 కోట్ల టన్నుల ధాన్యం రాబోతున్నది. పది కేజీల బియ్యం, నెలకు 7,500 చొప్పున మూడు నెలలపాటు ఇచ్చినా కొంపలేమీ మునగవంటున్నారు ప్రభాత్ పట్నాయక్, మధుర స్వామి నాథన్ లాంటి మేధావులు.
కానీ మోడీ ప్రసంగంలో కానీ, నిర్మలా సీతారామన్ చిలుక పలుకుల్లోగానీ వలస కార్మికుల, అసంఘటిత కార్మికులకు రెండు నెలల రేషన్ గురించి తప్ప ఇతర అంశాలు ప్రస్తావించలేదు. అదీ ఆచరణలో ఎంత వరకూ అమలవుతుందో చెప్పలేని పరిస్థితి. అలాగే కరోనా వైరస్ దానిపై నిరంతరం యుద్ధం చేస్తున్న వైద్య రంగానికి కనీస భరోసా కూడా ఇవ్వలేదు. వైద్య రంగాన్ని పటిష్టవంతం చేసే సూచన ఏ ఒక్కటీ నిర్మలాసీతారామన్ ప్రస్తావించలేదు. సరైన ప్రణాళిక ప్రకారం కూలీలను గుర్తించి వారు తిరిగి వారి ఊళ్లకు వెళ్లేదాకా లేదా వారికి పని దొరికి వారంతట వారే సంపాదించుకునే దాకా వారిని పోషించడం లేదా వారిని సొంతరాష్ట్రాలకు తరలించడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కేరళలో వచ్చి పడిన లక్షలాది వలసకూలీల బాంక్ అకౌంట్ల వివరాలతో డేటా సేకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ డేటా సేకరిస్తే తగిన ప్రణాళికలు సాధ్యం. బ్యాంక్లో డబ్బు వేసినా తీసుకోవడానికి వీరు వెళ్లగలరా? ప్రసంగాలు, మార్గదర్శకాలు, సలహాలు, ప్రకటనలు జారీచేయడం అనే సులువైన పబ్లిసిటీ వ్యూహాలు దాటి కేంద్రం నిర్మాణాత్మకంగా పనులు చేసి రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంటే బాగుండేది. పాలకులు ముందుచూపు లేని బదిరాంధులు కాకపోతే బాధ్యతలు తెలుస్తాయి. మద్యం షాపులు తెరిచాక లాక్డౌన్కు విలువేముంది? లాక్డౌన్ ప్రకటించగానే క్రమశిక్షణతో దేశ ప్రజలందరూ పాటించారు. కానీ మద్యం విడుదలతో లాక్డౌన్ ప్రాథమిక సూత్రాలకే భంగకలిగింది. ఇక ఏ మాత్రం లాక్డౌన్ సంకెళ్లలో ఉంచి ప్రజలను, వలస కార్మికులను సలసలకాగే నూనెలో మాడ్చలేం. ఇప్పటికైనా పాలకులు కాలే కడుపులను సంతప్తిపరచకపోతే.. ఇన్నాళ్లూ లాక్డౌన్ జైలులో ఉన్నాం, ఇక తెగించి పోరాడటం ద్వారా వలస కార్మికులను కాపాడుకుంటామా - లాక్డౌన్ జైలు నుంచి పోలీస్ జైలుకు పోతామా? సమీప భవిష్యత్తే తేలుస్తుంది.
- డాక్టర్ కె. నారాయణ