Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోషలిజం పని అయిపోయిందనే వారు కొందరు... మార్క్సిజం విఫలమైన సిద్ధాంతమని దుమ్మెత్తి పోసేవారు కొందరు. ఈ చర్చోప చర్చలు సాగుతుండగానే చైనా ఒక శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ప్రపంచాన్ని అబ్బురపరిచే స్థితికి చేరింది. కోవిడ్-19 ప్రపంచాన్ని కుదిపివేస్తున్న సమయంలో చైనా మరోసారి చర్చనీయాంశమైంది. ప్రపంచమంతా చైనా వైపు చూస్తున్నది. కరోనాను కట్టడి చేయటంలో చైనా ప్రదర్శించిన సామర్థ్యం చూసి ఆశ్చర్యపోతున్నది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా మీద రాళ్ళేస్తున్నాడు. ప్రపంచ మంతా కరోనా మీద యుద్ధం చేస్తుంటే... ట్రంప్ మాత్రం ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద యుద్ధం ప్రకటించారు. నిధులు నిలిపివేసాడు. చైనాను వెనకేసుకు వస్తున్నదని నిందలు వేస్తున్నాడు. ప్రపంచపు అవసరం చైనా వైపు చూస్తున్నది. శత్రువు చైనానే వేలెత్తి చూపుతున్నది. ఏ వైపు నుంచైనా చైనానే కేంద్ర బిందువయ్యింది. చైనా అనుసరిస్తున్న విధానాలే చర్చనీయాంశాలయ్యాయి. ప్రపంచమంతా చైనా గురించే చర్చించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఏమిటి చైనా గొప్పతనం?
రెండు ధోరణులు
కరోనా మహమ్మారిని ఎదుర్కొవటంలో రెండు పరస్పర వ్యతిరేక ధోరణలు వ్యక్తమవుతున్నాయి. ఒక ధోరణి కరోనా ముందు చేతులెత్తేసింది. మరో ధోరణి కట్టడి చేసింది. వూహాన్లో వైరస్ను గమనించిన మరుక్షణం నుంచి చైనా ప్రభుత్వం ప్రదర్శించిన అప్రమత్తత, ప్రజల పట్ల అంకిత భావం అద్భుతమైన ఫలితాలనిచ్చింది. రోగులున్న దగ్గరికే వైద్యులనూ, వైద్య పరికరాలు తరలించింది. ఉన్నత స్థాయి ఆస్పత్రులను పదిరోజుల్లో నిర్మించింది. వైరస్ను ఎదుర్కోడానికి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. వైద్య, పారిశుద్య సిబ్బందికి రక్షణ పరికరాలు సరఫరా చేసింది. వూహాన్లోని కోటీ నలభైలక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది. నిత్యజీవితావసర సరుకులు ఇంటికే సరఫరా చేసింది. భౌతికదూరం పాటించడానికీ, ఇంటికే పరిమితమై ఉండటానికీ ఏ ఆటంకం లేకుండా చేసింది. అన్ని బాధ్యతలూ ప్రభుత్వమే తీసుకున్నది. వూహాన్ నుంచి కరోనా ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా కట్టడి చేయగల్గింది. ఇదేమి వైరసో కూడా తెలియని దశలో నష్టాల మోతాదు చవిచూసింది. దాని లోతుపాతులు అర్థమైన క్షణం నుంచీ సర్వశక్తులూ ఒడ్డింది. ఇవన్నీ రాజకీయ నాయకత్వం ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగాయి. చైనా ప్రధాని వూహాన్లో పది రోజులున్నారు. దేశాధ్యక్షుడు కూడా క్లిష్ట సమయంలో పర్యటించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు పైనుంచి కింది వరకు ప్రజలతో మమేకమై కరోనాను ఎదుర్కొన్నారు.
వియత్నాం, ఉత్తరకొరియాలలో ఒక్క కరోనా మరణం నమోదుకాలేదు. చైనాలో వైరస్ను గమనించిన వెంటనే తమ దేశాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మరోవైపు కోటి జనాభా ఉన్న చిన్న దేశం క్యూబా, ఆరు దశాబ్దాలకు పైగా అమెరికన్ సామ్రాజ్యవాద పాలకుల ఆర్థిక దిగ్భంధనంతో కొట్టుమిట్టాడుతూ కూడా లక్ష మంది డాక్టర్లను తయారు చేసింది. అంటే సగటున వందమందికో డాక్టరును సృష్టించింది. తమ దేశంలో కరోనాను కట్టడి చేయటమే కాదు.. దేశ దేశాలకు తమ డాక్టర్లను పంపి సహాయ పడుతున్నది. కరోనాకు జాతి, మత, లింగ భేదాల్లేవు. దేశాల సరిహద్దులు లేవు. అంతటా వ్యాపిస్తున్నది. సోషలిజానికి కూడా జాతి, మత, లింగ భేదాలు లేవు. దేశాల సరిహద్దులు ఆటంకం కాదు. మనుషులెక్కడ ఆపదలో ఉన్నా ఆదుకుంటున్నది సోషలిజం. అందుకే కరోనా ఎక్కడున్నా ఎదుర్కొంటున్నది. అత్యధిక దేశాలకు చైనా తన అనుభవాలను పంచుతున్నది. సహాయం చేస్తున్నది.
జబ్బలు జారేసిన అగ్రరాజ్యం
అగ్రరాజ్యం మాత్రం కరోనా ముందు జబ్బలు జారేసింది. చిగురుటాకులాగా వణికిపోతున్నది. అత్యధిక కరోనా బాధితులూ, కరోనా మరణాలతో అల్లాడిపోతున్నది. మొదట ఇదో సమస్యే కాదని ట్రంప్ నిర్లక్ష్యం చేసాడు. ఆ తర్వాత తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద, చైనా మీద నిందలు వేస్తున్నారు. ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చచ్చినా ఫర్వాలేదని బహిరంగంగానే అన్నారు. బతికిన వారే సుఖంగా బతుకుతారంటున్నారు. తనకు ఆర్థిక వ్యవస్థే ముఖ్యమనీ, లాక్డౌన్ ప్రకటించడానికీ నిరాకరించారు. చనిపోతున్న వారిలో అత్యధికులు నల్లజాతీయులూ, అసంఘటిత కార్మికులు. అందుకే.. వారి ప్రాణాలంటే ఆయనకు లెక్కలేదు.
ఎవరి కోసం...?
సోషలిస్టు వ్యవస్థలో మనుషులను బతికించుకోవటమే లక్ష్యంగా పాలకులు వ్యవహరించారు. ప్రజల భద్రతకే ప్రాధాన్యతనిచ్చారు. అందుకే కరోనాను ఎదుర్కోవటంలో కూడా తన ఔన్నత్యాన్ని ప్రదర్శించగల్గింది సోషలిస్టు వ్యవస్థ. ఇందుకు పూర్తి విరుద్ధంగా పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యవహరిస్తున్నది. ప్రజలు చచ్చినా ఫర్వాలేదంటున్నారు ట్రంప్. మార్కెట్టే తనకు ముఖ్యమని నిర్మొహమాటంగా, బహిరంగంగా ప్రకటించారు. పెట్టుబడికి లాభం తప్ప మానవత్వం ఉండదని మరోసారి మన కండ్ల ముందే రుజువవుతున్నది. అందుకే మనుషులను బతికించుకోవటం కన్నా వ్యాపార ప్రయోజనాలకే ప్రాధాన్యతనిస్తున్నారు.
ఎట్లా సాధ్యమైంది?
సోషలిస్టు దేశాలలో విద్య, వైద్యం, ఆరోగ్యం, ప్రజాపంపిణీ రంగాలు ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. అందుకే వూహాన్లో వైరస్ సోకగానే.. దేశంలో ఉన్న గొప్ప వైద్యులనూ, వైద్య పరికరాలనూ యుద్ధప్రాతిపదికన వూహాన్కే తరలించటం సాధ్యమైంది. పదిరోజుల వ్యవధిలో అత్యాధునిక ఆస్పత్రుల నిర్మాణమూ చేయగల్గింది. లాక్డౌన్ ప్రకటించినప్పటికీ నిత్యజీవితావసర సరుకుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా బాధ్యత తీసుకోగల్గింది. వూహాన్ ప్రజలందరికీ కరోనా పరీక్షలు చేయగల్గింది. ఇవన్నీ ప్రపంచ రికార్డులే. వూహాన్ను కరోనా రహిత నగరంగా ప్రకటించగల్గింది. ప్రపంచమంతా కరోనాతో కొట్టుమిట్టాడుతుంటే.. ఇప్పుడు చైనా మాత్రం ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం మీద దృష్టిసారించగల్గింది. ప్రజల చేతికి డబ్బు చేర్చుతూ అనేక రాయితీలు అమలు చేస్తున్నది. అమెరికా, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాలలో అన్నీ ప్రయివేటురంగంలో ఉన్నాయి. కార్పొరేట్ సంస్థల గుప్పిట్లో ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉన్నవాడికే వైద్యం. ఇన్సూరెన్స్ పరిధిలోకి కోవిడ్-19 వైరస్ వస్తేనే వైద్యం. దేశంలో కరోనా వ్యాపించకుండా చూసే బాధ్యత వారికి లేదు. వారికి కావల్సింది లాభం. జనం మరణాలతో వారికి సంబంధం లేదు. పాలకులకు వ్యాపార ప్రయోజనాలే ప్రధానం. కార్పొరేట్ సంస్థలకు లాభాలే ముఖ్యం.
కేరళ ప్రత్యేకత
కేరళలో కరోనాను ఎదుర్కొన్న తీరు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. విదేశాలలో ప్రధాన స్రవంతి మీడియా ఈ విషయానికి ప్రాధాన్యతనిచ్చి చర్చిస్తున్నది. ఒక చిన్న రాష్ట్రం తీసుకున్న చర్యలు ప్రపంచంలో ఎందుకు చర్చనీయాంశాలవుతున్నాయో గమనించాలి. అక్కడి వామపక్ష ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమే ప్రత్యేకత. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులలో అత్యధికులు కేరళీయులు. వైరస్ వ్యాప్తి వార్తలు గమనించిన వెంటనే కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజల పట్ల అంకిత భావంతో పని చేసింది. నిబద్ధత ప్రదర్శించింది. బాధ్యత జనం మీద వదిలి చేతులు దులుపుకోలేదు. తొలి కరోనా కేసు తమ రాష్ట్రంలోనే గుర్తించినా బెంబేలెత్తలేదు. బాధ్యతగా వ్యవహరించింది. విమానాశ్రయం నుంచే తీసుకుపోయి ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచింది. విస్తరించకుండా కట్టడి చేసింది. దేశంలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో సగానికి పైగా కేరళలోనే ఉన్నాయి. ''భౌతిక దూరం - సామాజిక ఐక్యత'' అన్న నినాదంతో ప్రజలను కలిపి నడిపింది. సకాలంలో తగిన నిధులు కేటాయించింది. దశాబ్దాలుగా ప్రభుత్వరంగంలో నిర్మించుకున్న వైద్య, ఆరోగ్య వ్యవస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థనూ, సహకార రంగాన్నీ సాధనాలుగా వినియోగించుకున్నది. వలస కూలీలను ఆ పేరుతో పిలవడానికి నిరాకరించింది. తమ ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో భాగస్వాములైన తమ అతిథులని చెప్పారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్. అతిథులుగానే చూసుకున్నారు. రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, స్వచ్ఛంద సంస్థలనూ, వ్యక్తులనూ కలుపుకుపోవటంలో ముందున్నది కేరళ ప్రభుత్వం. సమన్వయంతో ముందుకు సాగింది. ఇవన్నీ కేరళ వామపక్ష ప్రభుత్వం ప్రత్యేకతలు. వీటికి తోడు కమ్యూనిస్టు శ్రేణులు భౌతిక దూరం పాటిస్తూనే ప్రజలకు అండగా నిలిచారు.
కేరళ నమూనా..
ఇప్పుడు దేశంలో కేరళ నమూనా చర్చనీయాంశమైంది. గుజరాత్ మోడల్ కనుమరుగైంది. ఆరేండ్ల నుంచి గుజరాత్ నమూనా గురించి ప్రచారం చేసుకున్న ప్రధాని మోడీ, ఇప్పుడు ఆ పేరు ఉచ్ఛరించడానికే జంకుతున్నారు. కరోనా విస్తరణతో గుజరాత్ గజగజ వణుకుతున్నది. దేశంలో మహారాష్ట్ర తర్వాత కరోనా బారిన పడి విలవిలలాడుతున్న రాష్ట్రం గుజరాత్. వలసకూలీలను అతిథులుగా కేరళ భావిస్తుంటే... గుజరాత్ ప్రభుత్వం మాత్రం వారిమీద లాఠీలనూ, బాష్పవాయుగోళాలనూ ప్రయోగిస్తున్నది. చంటిబిడ్డలూ, కన్నతల్లులన్న కనికరం లేకుండా చావబాది కేసులు పెడుతున్నది. వజ్రాలు, ఆభరణాలూ, వస్త్రపరిశ్రమల యజమానుల కోసం వలస కూలీల మీద విరుచుకు పడుతున్నది. ఇప్పుడు దేశం ముందు రెండు నమూనాలున్నాయి. కమ్యూనిస్టు పాలలోని కేరళ నమూనా ఒకటైతే.. మోడీ పురిటిగడ్డ గుజరాత్ నమూనా మరొకటి. ప్రపంచం ఒకవైపు సోషలిస్టు చైనా నమూనానూ, మరోవైపు పెట్టుబడిదారీ అమెరికా నమూనానూ గమనిస్తున్నది.
లాక్డౌన్ బాధలకు బాధ్యులెవరు?
కరోనా మనదేశానికి విదేశాల నుంచి విమాన ప్రయాణీకుల ద్వారా వచ్చిందన్న విషయం అందరికీ తెల్సిందే. జనవరి 30న తొలి కరోనా కేసు మన దేశంలోకి రానే వచ్చింది. వెంటనే విదేశీ విమానాలను నిషేధించి ఉంటే ఇప్పుడు దేశానికింత యాతన ఉండేది కాదు. ఇది కేవలం మోడీ సకాలంలో పరిస్థితిని అంచనా వేయటంలో వైఫల్యం మాత్రమే కాదు. రాజకీయ ప్రయోజనం, బడాబాబుల సేవలో తరించిన ఫలితమిది. ఫిబ్రవరి 25న గుజరాత్లో ట్రంప్ పర్యటన, ట్రంప్ సేవలో ప్రధాని మోడీ బృందం తరించటం తెల్సిందే కదా! ఫిబ్రవరి ఒకటి నుంచి కరోనా ప్రమాదమున్నదని విమానాలు రద్దు చేస్తే ట్రంప్ పర్యటన సాధ్యం అయ్యేది కాదు. భౌతిక దూరం పాటించాలని నిర్ణయిస్తే ట్రంప్ రోడ్షో, లక్షలాది ప్రజల సమీకరణ సాధ్యమయ్యేది కాదు. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేసిన ఈ తతంగమే ఇప్పుడు గుజరాత్ను కోవిడ్-19తో వణికిస్తున్నది. విదేశీ విమానాలు నిషేధించి ఉంటే వాణిజ్య రాజధాని కేంద్రం ఉన్న మహరాష్ట్ర కూడా రక్షించబడేది కదా! తబ్లిగీకి 250 మంది విదేశీ యాత్రికులు వచ్చేవారూ కాదు. భౌతిక దూరం పాటించాలన్న నిర్ణయం చేసి ఉంటే తబ్లిగీతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి మార్చి 18 వరకు లక్షలాది మంది సందర్శకులూ వచ్చేవారు కాదు. వీరితో ఎన్ని ప్రాంతాలకు కరోనా విస్తరించిందో ఎవరూ తేల్చలేరు. మార్చి 22న జనతా కర్ఫ్యూకు పిలుపు నిచ్చిన నేతలే 23న మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. పెద్దయెత్తున జన సమీకరణ చేసారు.
ఒక్క రోజు జనతా కర్ఫ్యూ కోసం 12 మంది ముఖ్యమంత్రులను సంప్రదించి, రెండు రోజులు ముందే ప్రకటించారు. కానీ 24న అర్థరాత్రి నుంచి అమలు చేసిన మూడు వారాల లాక్డౌన్ కోసం ఎవరినీ సంప్రదించకపోగా, ముందస్తు సమాచారం గానీ, ఏర్పాట్లుగానీ లేకుండానే ప్రకటించారు. 13 కోట్లమంది వలస కూలీల బతుకులతో ఇది చెలగాటం. జనమంతా లాక్డౌన్తో సతమతమవుతున్న సమయంలోనే మోడీ మాత్రం 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచే పనిలో బిజీగా ఉన్నారు. విద్యుత్తు పంపిణీ ప్రయివేటీకరణ ప్రయత్నాలలో ఉన్నారు. లీటరు పెట్రోలుకు రూ.10, లీటర్ డీజిల్ మీద రూ.13 పెంచి జనం మీద భారం మోపారు. జనం చేతికి డబ్బులివ్వ వల్సిన సమయంలో వారి జేబులు కొట్టేవిధంగా 'పెట్రోలియం' ధరలు పెంచారు. స్థూలంగా, ప్రధాని మోడీ మాటల్లోనే చెప్పాలంటే దేశ ప్రజలంతా కరోనా మీద యుద్ధం చేస్తున్నారు. మరి మోడీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, బడా పారిశ్రామిక వేత్తల సేవలో తరించటం, కార్మికుల హక్కులు హరించటంతో బాటు ప్రజల మీద భారాలు మోపారు. మరో విషయం గమనించవచ్చు. ప్రజలు కరోనాతో సతమతమవుతుంటే కార్పొరేట్ వైద్య సంస్థల యాజమాన్యాలు మాత్రం ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తామని గానీ, తమ ఆస్పత్రులను క్వారంటైన్ కేంద్రాలుగా వాడుకోవచ్చని గానీ ఇవ్వడానికి సిద్ధపడలేదు. ఏం చేసినా ప్రభుత్వరంగమే చేయవల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కూడా కరోనా బాధితుల వైద్యానికి తమ కార్యాలయాలను ఉపయోగించడానికి సిద్ధపడింది కమ్యూనిస్టులే! తమ పార్టీ కార్యకర్తలందరినీ ప్రభుత్వం చేతిలో పెట్టి ప్రజాసేవలో వినియోగించడానికి సిద్ధపడిందీ కమ్యూనిస్టులే! పాలకులు స్పందించకున్నా.. చేతనైనంత సేవలందిస్తున్నదీ కమ్యూనిస్టులే కదా!
- ఎస్. వీరయ్య