Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ రెండు ఆడిటోరియాలు ఘనత వహించిన భాగ్య నగరానికి వన్నె తెచ్చిన సంగీత ఝరులు. సప్త స్వరాలు, వీణా నాదాలు, అందెల రవళులు, నృత్యాల కేళీ వినోదాలతో కళాప్రియులను అనునిత్యం అలరిస్తుంటాయి. అంతేనా... కవి సమ్మేళనాలు, సాహితీ గోష్టులు, చర్చా వేదికలు, అవార్డు ఫంక్షన్లు, సినీ ప్రముఖుల సన్మాన సత్కారాలతో అవి ఎప్పుడూ కళకళాలాడుతుండేవి. ఒకప్పుడు నటసామ్రాట్ అక్కినేని, ఆయన అనంతరం 'నన్ను దోచుకుందువటే' అంటూ తెలుగు పాటకు వన్నెలద్దిన సినారె, ఆ విశ్వంభరుడి తర్వాత నుంచి మొన్నటి వరకూ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య... ఆయా వేదికలకు పెద్ద దిక్కుగా నిలిచారు. 'మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాల...' అన్న నటవిరాట్ రావుగోపాల్రావు మాటల మాదిరిగా ఔత్సాహిక కళా పోషకులు.. ఉదారంగా ఇచ్చే విరాళాలతో ప్రతియేటా అనేక ప్రోగ్రాములు దినదిన ప్రవర్థమానమై అక్కడ భాసిల్లుతుండేవి. వాటి పుణ్యమా అని అనేక వందల మంది కళాకారులు, ఆర్టిస్టులు, వారి మీద ఆధారపడి బతికే సిబ్బంది 'కళామతల్లి...' ఆశీస్సులతో పొట్టపోసుకునేవారు. ఇదంతా గతం.. ఇప్పుడు కరోనా రక్కసి కరాళ నృత్యానికి... ఆ వేదికలపై నాట్యాలన్నీ బందైపోయాయి. అది ప్రపంచ వ్యాప్తంగా వాయిస్తున్న మరణ మృందంగానికి... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన ఆ రెండు సాహితీ, కళా వేదికలకు తాళాలు పడ్డాయి. వాటిలో ఒకటి అసెంబ్లీ ఎదురుగా ఉన్న రవీంద్రభారతి కాగా, మరోటి చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభ. 'బహుశా ఈ రెండు వేదికలు పుట్టిన దగ్గర్నుంచి ఇప్పటి దాకా అనివార్య కారణాల వల్ల ఒకట్రెండు రోజులు మినహా.. ఇన్ని రోజులపాటు వాటిని మూసేసిన దాఖలాల్లేవు...' అంటూ ఒక కళాభిమాని తన ఆవేదనను వ్యకం చేశారు. ఆయన ఆవేదనను నిజం చేస్తూ అవి ఇప్పుడు ఎలాంటి ప్రోగ్రాములూ లేక మౌనరాగాలను ఆలపిస్తున్నాయి. ఇటీవల పంజాగుట్ట దాకా పోయి వస్తుంటే... వాటి మౌనానికి సాక్ష్యాలుగా రవీంద్రభారతి వద్ద మాసిపోయి, చీలిపోయి గేటుకు వేలాడుతున్న ఏఎన్నార్ బొమ్మ, గానసభ దగ్గర గాలికి కొట్టుమిట్టాడుతున్న సినారె చిత్రం కనబడ్డాయి.
-బి.వి.యన్.పద్మరాజు