Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్న పాట తెలంగాణ సర్కార్కు బాగా సరిపోతుంది. కరోనా దెబ్బకు అతలాకుతలమైన రాష్ట్ర అర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆదుకుంటుందనుకున్న లిక్కర్ సర్కార్ను నట్టేట ముంచింది. కష్ట కాలంలో కాసుల వర్షం కురిపిస్తుందనుకున్న మద్యం ప్రభుత్వ నమ్మకాన్ని వమ్ము చేసింది. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఈ నెల 6న ప్రారంభమైన మద్యం షాపులు కొనేవాళ్లు లేక వెలవెల పోతున్నాయి. రాష్ట్ర సగటు మద్యం అమ్మకాలు ప్రతీ రోజూ దాదాపు రూ.75 కోట్లు కాగా మొదటి రోజు మాత్రం ఏకంగా రూ. 104 కోట్ల అమ్మకాలు జరిగాయి. దాంతో తమ పంట పండిందనుకున్న ప్రభుత్వానికి ఆతర్వాత అమ్మకాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. లాక్డౌన్ నుంచి నేటి వరకు సగటు అమ్మకాలు రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్లకు పడిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ సగటు అమ్మకాలు జరగడంతో అధికారులు హైరానా పడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే కనీసం లైసెన్స్ ఫీజులు సైతం రావేమోననే భయం ప్రభుత్వాన్ని పట్టి పీడుస్తున్నది. భవిష్యత్లోనైనా మద్యం ప్రియులు సర్కార్పై దయ చూపు తారో లేదో వేచి చూడాల్సిందే! -ఊరగొండ మల్లేశం