Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వం విద్యుత్శక్తి 2003 చట్టానికి సవరణ చేస్తూ 2020 ఏప్రిల్ 17న సవరణ ముసాయిదా విడుదల చేస్తూ సూచనలు చేయడానికి 21రోజులు అంటే మే 8వరకు ఆ తర్వాత జూన్ 5 వరకు గడువు ఇచ్చారు. వాస్తవానికి ఈ గడువు చాలా తక్కువ. ఇంత పెద్ద సవరణను చేపట్టిన కేంద్ర ప్రభుత్వం కనీసం మూడు మాసాలు సూచనలు రాబట్టడానికి గడువు ఇవ్వాలి. అలా కాకుండా వీలైనంత త్వరగా సలహాల సేకరణను ముగించి హడావిడిగా పార్లమెంటులో చట్టం చేయాలని ప్రయత్నం చేస్తున్నది. విద్యుత్శక్తి కేంద్ర, రాష్ట్రాల ఉభయజాబితాలో ఉంది. ఈ సవరణద్వారా మొత్తం కేంద్ర ఆధ్వర్యంలోకి పోయింది. కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడంలోని ముఖ్య ఉద్దేశ్యాలు ఏమిటి? ఏయే అంశాలను సవరణ చేశారు అన్నది పరిశీలిద్దాం. ఈ సరవణలను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించడం ఆహ్వానించదగ్గ పరిణామం. చాలా రాష్ట్రాలూ వ్యతిరేకిస్తున్నాయి.
భారతదేశంలో 2018 అక్టోబర్ 30నాటికి థర్మల్ విద్యుత్, 2,21,802 మెగావాట్లు, న్యూక్లియర్ విద్యుత్ 6,780 మెగావాట్లు ఉంది. సాంప్రదాయ విద్యుత్ అనగా హైడల్ 45,482 మెగావాట్లు, రెన్యూవబుల్(సోలార్, గాలి) 70,648 మెగావాట్లు స్థాపిత శక్తి ఉంది. గతంలో ప్రపంచబ్యాంకు ఆదేశానుసారం విద్యుత్బోర్డులను అనేక రాష్ట్రాల్లో మూడుశాఖలుగా విభజించాయి.1.జనరేషన్ (ఉత్పత్తి), 2.ట్రాన్స్మిషన్(సరఫరా), 3.డిస్ట్రిబ్యూషన్ (పంపిణి)గా విభజించారు. ఈ మూడు కలిసి వినియోగదారులకు విద్యుత్ను సరఫరా చేయాలి. వినియోగదారులకు టారిఫ్ రేట్లు నిర్ణయించడానికి స్వతంత్ర బాధ్యతగల''రెగ్యులేటరీ కమిషన్'' సంస్థను వేశారు. ప్రస్తుతం ఈ కమిషన్లు డిసెంబర్లో డిస్కంల నుంచి ప్రపోజల్స్ తీసుకుని ఫిబ్రవరి బహిరంగ విచారణ జరిపి రేట్లు నిర్ణయిస్తాయి. ఈ రేట్ల నిర్ణయంలో తక్కువ రేటుకు వచ్చే విద్యుత్కు కమిషన్లు మొదటి ప్రాధాన్యతను ఇస్తాయి. కమీషన్ నిర్ణయించిన రేట్లు ఏప్రిల్ నుంచి మార్చి వరకు అమలులో ఉంటాయి. కమిషన్లు తక్కువ రేటుకు వచ్చే విద్యుత్కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ప్రయివేటు రంగంలో ఏర్పాటు చేసిన రెన్యువబుల్ విద్యుత్ను కమిషన్లు కేటాయించడం లేదు. హిమాలయ పర్వతాల నుంచి ఉత్తరాదిలో ప్రయివేటు రంగంలో హైడల్ ప్రాజెక్టులు, మెట్ట ప్రాంతాలలో సోలార్ ప్రాజెక్టులు, గాలితో ఉత్పత్తి అయ్యే ప్రాజెక్టులు పెద్దఎత్తున పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రయివేటు విద్యుత్ను కమిషన్ల చేత కేటాయించడానికి చట్ట సవరణ చేయడం జరిగింది. (25 మె.వా. కంటె తక్కువ సామర్థ్యం కల జలవిద్యుత్ ప్రాజెక్టులను మాత్రమే ఇప్పటి వరకు రెన్యువబుల్ ఎనర్జీగా పరిగణించారు.) 2003 చట్టంలో 39 సవరణలు చేశారు. అందులో సెక్షన్ 10కి 10(ఎ)ను కొత్తగా చేర్చారు. ఈ సవరణ ప్రకారం ''ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ'' కేంద్రం ఏర్పాటు చేస్తుంది. ఇక నుంచి రాష్ట్రాల రెగ్యులేటరీ కమిషన్లను కేంద్రమే నియామకం చేస్తుంది. సాంప్రదాయ విద్యుత్ యూనిట్ ధర ఎక్కువ ఉన్నప్పటికీ 20శాతం విధిగా రాష్ట్రాలకు కేటాయించాలన్న నిబంధన పెట్టారు. రీజినల్ లోడ్ డిస్పాచింగ్ సెంటర్ బెంగుళూరు బాధ్యతలను'' సెంట్రల్ లోడ్ డిస్పాచింగ్ పవర్''కు దఖలు పరుస్తారు. ఏ ఉత్పత్తిని ఎక్కడికి సరఫరా చేయాలన్నది సెంట్రల్ లోడ్ డిస్పాచింగ్ కేంద్రం నిర్ణయిస్తుంది. రాష్ట్రాలకు ఎలాంటి హక్కులు ఉండవు. ప్రయివేటు ఉ్పత్పత్తిదారులంతా పాలకపార్టీలో అత్యంత కీలకపాత్ర పోషించుతున్నవారే. వారి ఆదాయ వనరులు పెంచడానికి కేంద్రం ఈ చట్ట సవరణ చేసింది. ప్రయివేటు ఉత్పత్తిదారులు ఉత్తర భారతంలో ఉత్పత్తి చేసిన ఇప్పటికే ఉన్న ట్రాన్స్మిషన్ వ్యవస్థ ద్వారా ఎక్కడికైనా సరఫరా చేస్తారు. వీలింగ్ ఛార్జీలు(టాన్స్మిషన్ చార్జీలు) తగ్గించి ఉత్పత్తిదారులకు లాభాలు కట్టబెడతారు. రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్లు కేంద్రం ఆధిపత్యం కిందికి రావడంతో వారు తీసుకునే నిర్ణయాలు వినియోగదారులకు భారంగా తయారవుతాయి. వినియోగదారులు భారాలు భరిస్తేనే ఉత్పత్తిదారులకు లాభాలు వస్తాయి. గతంలో ఉన్న విద్యుత్ కొరతను దృష్టిలో పెట్టుకుని అనేక ప్రయివేటు కంపెనీలు విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి వచ్చాయి. విద్యుత్ సంస్థ ప్రారంభించేటప్పుడే గతంలో ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకుని మొదలు పెట్టారు. కానీ తరువాత ఎలాంటి ఒప్పందాలు లేకుండానే చాలా ప్రయివేటు సంస్థలు విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాయి. విద్యుత్ ఒప్పందాలు(పీపీఏ) 20-30ఏండ్ల వరకు చేసుకుంటారు. ఈ ఒప్పందాలలో ఉన్న షరతు ఏమిటంటే వారి నుంచి విద్యుత్ కొనుగోలు చేయకున్నా ఆ కంపెనీకి ఫిక్స్డ్ పెట్టుబడి చెల్లించాల్సిందే. విద్యుత్ ఉత్పత్తిలో రెండు రకాల పెట్టుబడులుంటాయి. 1.ఫిక్స్డ్ క్యాపిటల్ (పరిశ్రమ ఏర్పాటు చేయడానికి పెట్టిన పెట్టుబడి), 2. వేరియబుల్ క్యాపిటల్ (గ్యాసు, బొగ్గు, వేతనాలు) చేరి ఉంటాయి. ఒప్పంద కంపెనీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయనపుడు వేరియబుల్ క్యాపిటల్ వాటాను తగ్గించి ఫిక్స్డ్ క్యాపిటల్పై ఉన్న ఒప్పందం ప్రకారం ప్రభుత్వాలు చెల్లించాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఒక కంపెనీకి విద్యుత్ తీసుకోకుండా ఏటా రు.30 కోట్లు చెల్లిస్తున్నది.
ప్రస్తుతం తెలంగాణలో 2,797మె.వా సోలార్ విద్యుత్తోపాటు 14,555మె.వా స్థాపిత శక్తి ఉంది. మరో 13,752 మె.వా ఉత్పత్తికి ప్రభుత్వం రూ.92వేల కోట్లతో ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నది. మొత్తం లక్ష్యం 28,703 మె.వాగా ఉంది. ఇందులో 13,500మె.వా లిఫ్టు పథకాలకు వినియోగించాలి. ఏపీలో దాదాపు 20వేల మె.వా ప్రభుత్వ ప్రయివేటు రంగాలు కలిసి ఉత్పత్తి జరుగుతున్నది. వారి అవసరానికి మించి 2,500మె.వా అదనపు ఉత్పత్తిని ఇతరులకు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవాల్సిన స్థితిలో ఉంది. ఈ చట్ట సవరణతో ప్రభుత్వ రంగ ఉత్పత్తి వినియోగానికి ప్రమాదం ఏర్పడుతుంది. సోలార్ విద్యుత్ను పీక్ అవర్లో(కీలక సమయం ఉదయం 6-10గంటలు సాయంత్రం 6-10గంటలవరకు) ఉత్పత్తికాదు. ఉదయం 10 గంటల నుంచి సాయంద్రం 5 గంటల వరకే ఉత్పత్తి అవుతుంది. స్థాపితశక్తిలో 20శాతం మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. అందువల్ల సోలార్ వినియోగాన్ని నీటిపారుదల, గృహావసరాలకు తప్ప ఇతర పనులకు ఉపయోగపడదు. రాయితీలు పొంది ఉత్పత్తి చేస్తున్న సోలార్ విద్యుత్ రేటు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసిన విద్యుత్కన్నా ఎక్కువ రేటు ఉంటుంది. హైడల్ విద్యుత్ కేంద్రం ఒకసారి ఏర్పాటు చేస్తే 25-30సం||ల వరకు పని చేస్తుంది. దీనికి ఎలాంటి వేరియబుల్ పెట్టుబడి లేకున్నా ప్రయివేటు యజమానులు రేట్లు ఏటా పెంచుతూనే ఉన్నారు. అందువల్ల రెగ్యులేటరీ కమిషన్లు ప్రభుత్వరంగంలోని సాంప్రదాయ, హైడల్, ధర్మల్ విద్యుత్లకు ప్రథమ స్థానం ఇస్తారు. తరువాతనే ప్రయివేటు రంగాన్ని ఎంపిక చేస్తారు. చట్ట సవరణతో రెగ్యులేటరీ కమిషన్ కేంద్రం ఆధీనంలోకి వెళ్ళడంతో ప్రయివేటువారికి ప్రాధాన్యత ఇస్తారు.
ఈ చట్ట సవరణ ప్రకారం ఇతర దేశాల నుంచి విద్యుత్ను కొనుగోలు చేయడం, ఎగుమతి చేయడం బాధ్యత కూడా కేంద్రం చేపడుతుంది. ప్రస్తుతం దేశంలో ఉన్న రేట్లకు తక్కువగా ఇతర దేశాలు విద్యుత్ సరఫరా చేస్తామంటే మనం కొనుగోలు చేయాలి. అప్పుడు స్థానిక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు మూతపడతాయి. ఒక్క తెలంగాణలోనే 22,550 మంది ఔట్సోర్సింగ్తోపాటు మొత్తం 70వేల మంది పని చేస్తున్నారు. ఏపీలో కూడా వేల సంఖ్యలో ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉభయ రాష్ట్రాలలో 3.5కోట్ల విద్యుత్ సర్వీసులున్నాయి. ఇతర దేశాల నుంచి విద్యుత్ దిగుమతి అయితే వీరందరూ ఉద్యోగాలకు ఎసరొస్తుంది. మాంద్యం మరింత పెరుగుతుంది.
ఈ చట్ట సవరణ చేయడానికి ప్రపంచ బ్యాంకు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నది. విద్యుత్రంగాన్ని విభజనకు ప్రోత్సహించింది ప్రత్యక్షంగా ప్రపంచబ్యాంకు విధానాలే. దీనికి ప్రస్తుతం డబ్ల్యుటీఓ తోడైంది. ఈ రెండు సంస్థల ద్వారా ధనిక దేశాలు అన్ని దేశాలలోని విద్యుత్శక్తి కేంద్రాలను ప్రయివేటీ కరించాలని, తద్వారా లాభాలు సంపాదించాలని ఒత్తిడి తెస్తున్నదానిలో భాగమే ఈ చట్ట సవరణ. ఇప్పటి వరకు చాలా రాష్ట్రాలలో ప్రయివేటీకరణ జరగలేదు. సబ్స్టేషన్లు మొదలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వరకు ప్రభుత్వ రంగంలో ఉన్నవాటిని ఫ్రాంచైజ్ చేసి(ప్రయివేటీకరించి) ప్రభుత్వం తప్పుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. మరొక గమనించవలసిన అంశం ఏమిటంటే భారతదేశం రాష్ట్రాల యూనియన్గా ఉంది. వ్యవసాయం, ఇరిగేషన్, మార్కెట్, రాష్ట్ర పారిశ్రామిక ఉత్పత్తి తదితర అంశాలు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రా జాబితాలో ఉన్నాయి.''యూనియన్ బడ్జెట్'' అంటారే కానీ భారత బడ్జెట్ అనరు. జిఎస్టి ద్వారా గతంలోని పన్నుల విధానాన్ని కేంద్రీకరించి రాష్ట్రాల ఆదాయ వనరులను తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఆ తరువాత ఒకేదేశం, ఒకే భాష అంటూ నినాదం ఎత్తుకుంది. ప్రస్తుతం ఒకే దేశం, ఒకే విద్యుత్ కంపెనీ అనే పేరుతో కేంద్రం తన అధీనంలోకి తీసుకోవడానికి ఈ చట్ట సవరణకు ఉద్దేశించింది. దీనివల్ల టారిఫ్లు నిర్ణయించడం, ఏ విద్యుత్ను వాడాలో కేంద్ర రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించడం జరుగుతుంది. చివరకు లోడు డిస్పాచింగ్ కూడా కేంద్రం ఆదేశాల ప్రయారమే జరుగుతుంది.
భారత ఆర్థిక విధానం ప్రకారం వికేంద్రీకరణ జరిపి ఉత్పత్తిని ఉత్పాదకతను పెంచాలి. వీకేంద్రీకరించబడి ఉన్నవాటిని కేంద్రీకరించి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు గుత్తాధిపతులకు లాభాలు కట్టబెట్ట చూస్తున్నది. భారత ప్రజలపై భారాలు పెంచుతున్నది. భాషే కాక జీఎస్టీ, విద్యుత్, జలవనరులు తదితర మౌలిక అంశాలను కేంద్రీకరించి కార్పోరేట్లకు లాభాలు కట్టబెట్టే ప్రయత్నాన్ని విద్యుత్ వినియోగదారులే కాక ప్రజలంతా ఏకమై ఈ చట్ట సవరణను వ్యతిరేకించాలి.
సారంపల్లి మల్లారెడ్డి
సెల్: 9490098666