Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా సంక్షోభంలో కూడా కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ ఏప్రిల్ 17న విద్యుత్ చట్టం 2003కు సవరణలు ప్రతిపాదిస్తూ విద్యుత్ (సవరణ) చట్టం 2020 ముసాయిదా బిల్లును ప్రకటించింది. 21 రోజుల గడవులోగా సూచనలు, సలహాలు చెప్పాలని ప్రజల ముందు ఉంచారు. లాక్డౌన్ సమయంలో ఎలా సాధ్యమని ఒత్తిడి రావడంతో జూన్ 5 వరకు పొడిగించారు. ఎలాగైనా మోడీ ప్రభుత్వం వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదింప చేసుకోవాలని పట్టుదలతో ఉంది. దేశంలో కేరళతో సహా మరో మూడు రాష్ట్రాలలో బతికి వున్న విద్యుత్ బోర్డులు, సంస్థలు ఈ బిల్లుతో భూస్థాపితం అవుతాయి. ప్రయివేటు సంస్థలు యధేచ్ఛగా దోచుకోవడానికి గేట్లు బార్లా తెరువబడతాయి. విద్యుత్రంగంలో సంస్కరణలను స్వాగతించిన తెలంగాణ, తమిళనాడు లాంటి ప్రభుత్వాధినేతలు కూడా ఈ బిల్లు ఆమోదం పొందితే విద్యుత్రంగంలో రాష్ట్రాల హక్కులు, ప్రయోజనాలు హరించుకుపోతాయని ఫెడరల్స్ఫూర్తి దెబ్బతిని కేంద్రం చేతిలో విద్యుత్ అధీóకృత వ్యవస్థ అంతా కేంద్రీకృతం అవుతుందని గగ్గోలు పెడుతున్నారు. 1999 ఫిబ్రవరి నాటికే చంద్రబాబు ప్రభుత్వం ఉమ్మడిరాష్ట్రంలో స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డును ముందు రెండు ముక్కలు, 2000 ఏప్రిల్ 4 నుంచి మరో నాలుగు ముక్కలు చేసి ఉత్పత్తి, సరఫరా, పంపిణీ విభాగాలుగా ఏర్పాటు చేసింది. ప్రజలపై భారాలు మోపింది. ప్రయివేటీకరణకు తెరలేపిన అనుభవం చూశాం. 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం సవరణలకు ఆరాటపడుతూనే ఉంది. కేరళ, త్రిపుర, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలలో ప్రభుత్వాల ఆధీనంలోనే విద్యుత్ బోర్డును కొనసాగిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలు చేస్తూ, చట్టంలో మార్పులు తీసుకువస్తున్నది. ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశ్యం విద్యుత్ రంగంలోని ప్రయివేటు శక్తులకు లబ్దిచేకూర్చడమే. ఈ పరిస్థితిలో విద్యుత్ (సవరణ) చట్టం 2020 ద్వారా ఏం చేయబోతున్నది పరిశీలించడం అవసరం.
సబ్సిడీల ఎత్తివేత : ముసాయిదా విద్యుత్ (సవరణ) చట్టం 2020 బిల్లులో 9అంశాలు కీలకమైనవిగా భావించవచ్చు. అందులో సబ్సిడీలు ఎత్తివేసి వినియోగదారులపై భారాలు మోపడం, డిస్కంలను నిర్వీర్యం చేస్తూ విద్యుత్ పంపిణీని ప్రయివేటు సంస్థలకు అప్పగించడం ముఖ్యమైనవి. 2003 విద్యుత్ చట్టంలో సెక్షన్ 65 సవరణ ప్రకారం రానున్న కాలంలో క్రాస్ సబ్సిడీ ఎత్తివేస్తారు. ఉచిత విద్యుత్ వ్యవసాయానికి ఇవ్వడానికి అవకాశం ఉండదు. అలాగే గృహ వినియోగదారులకు కూడా సబ్సిడీని గ్యాస్ సబ్సిడీ మాదిరి ఇస్తున్నట్టుగా వినియోగదారునికి నేరుగా బ్యాంకు ద్వారా చెల్లిస్తారట! రైతుగానీ, గృహ వినియోగదారుడు కానీ విద్యుత్ ఖర్చుపై సబ్సిడీ తీసివేసి బిల్లు ఇస్తున్నట్టు గా కాకుండా మొత్తం యూనిట్ కాస్టు ముందు చెల్లించవల్సి ఉంటుంది. ఆ లెక్కన ప్రస్తుతం 100యూనిట్ల లోపు వారికి రూ.3.30 నుంచి రూ.6.87 పెరిగేఅవకాశం ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 1,13,19,524 గృహ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 80శాతం అంటే 97,60,728 మంది సబ్సిడీ పొందుతున్నారు. వీరంతా నష్టపోతారు.
ఈ సబ్సిడీ ఎత్తివేత వల్ల వ్యవసాయ రంగం కుదేలౌవుతుంది. పేద, మధ్యతరగతి రైతులపై మరింత భారం పడే అవకాశం ఉంది. రాష్ట్రంలో 24.4లక్షల పంపుసెట్లు ఉన్నాయి. ఇప్పటికి వెనుకబడ్డ జిల్లాల్లో వ్యవసాయం పంపుసెట్ల ఆధారంగా కొనసాగుతున్నది. వీటన్నింటికి మీటర్లు పెట్టి రైతుల నుంచి వసూలు చేస్తారు. సగటున ఒక రైతు పంపుసెట్టు రోజుకు 30యూనిట్లు ఖర్చు చేస్తే యూనిట్కు రూ.6.87 చొప్పున రెండు పంటలకు ఏడాదికి రూ.50వేలు బిల్లు కట్టవల్సి ఉంటుంది. ఇది రైతులను పెనుభారం. ఇప్పటికే గిట్టుబాటు ధరలు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రేపు కరెంటు బిల్లు కట్టలేక వ్యవసాయం చేయలేక అప్పులపాలై ఆత్మహత్యలు పెరుగుతాయి.
విద్యుత్ పంపిణీ పూర్తిగా ప్రయివేటు సంస్థల చేతుల్లోకి వెళ్తుంది. ప్రధాన చట్టంలోని సెక్షన్ 2కు సవరణలు చేస్తూ 'అప్పిటేల్ ట్రిబ్యునల్'గా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎన్ఫోర్స్మెంట్ ఆధారిటిని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే క్లాజు 17ఏ ప్రకారం 'డిస్ట్రిబ్యూషన్ సబ్లైసెన్సీ'లకు అవకాశం కల్పిస్తారు. ఈ చర్యవల్ల లాభాలు వచ్చే ప్రాంతాలలో సబ్ కాంట్రాక్టర్లు, ఫ్రాంచైజీలు పొంది మన డిస్కాంలను దివాళా తీయడానికి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ పంపిణీ, నష్టాలు వచ్చే ప్రాంతాలకు సరఫరా బాధ్యత తీసుకోకుండా నష్టాలకు గురిచేసి చివరకు డిస్కాంలు కూలిపోయే పరిస్థితి వస్తుందని విద్యుత్రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ చర్య డిస్ట్రిబ్యూషన్లో పూర్తిస్థాయి ప్రయివేటీకరణకు పాల్పడటమే అవుతుంది. అలాగే విదేశాలతో విద్యుత్ వ్యాపారం చేసుకోవడానికి అవకాశం పేరున విదేశీ బహుళజాతి సంస్థల ప్రవేశానికి మార్గం సుగమం కాబోతుంది.
డా|| బిఆర్. అంబేద్కర్ సారధ్యంలో 1948లో విద్యుత్ పాలసీ రూపొందించిన సందర్భంలో విద్యుత్రంగం ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని చెప్పిన లక్ష్యానికి పూర్తి స్థాయిలో తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రాల చేతిలో వున్న పవర్ లైసెన్సింగ్ సిస్టం మొత్తం కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. యూనిట్ ధరను కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. చెల్లింపులు ఆలస్యమైతే అపరాధ రుసుం పేరిట వినియోగదారులపైనే అంతిమంగా విపరీత భారం వేస్తారు. రెన్యువబుల్ ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తికి విధాన రూపకల్పన చేస్తామని చెబుతున్నారు. జల విద్యుత్ను రెన్యువబుల్ క్యాటగిరీకి మారుస్తారు. కచ్చితంగా రాష్ట్రాలు కొంత పర్సెంటేజ్ కొనుగోలు చేయాలని నిబంధన పెట్టబోతున్నారు. విద్యుత్ కాంట్రాక్టు అమలు సంస్థ ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రాల పరిధిలోని కమిషన్లు నిర్వీర్యం అవుతాయి. నియమ నిబంధనలు దేశవ్యాప్తంగా ఒకేరకంగా పెట్టి ఛైర్మన్ సభ్యులును ఎంపిక చేస్తారు. వీటికి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి. బహుళ కమిటీలురద్దు చేయడం విద్యుత్బోర్డు అమలుకు జరిమానాలు పెంచడం చేయబోతున్నారు.
ఈ విధంగా అనేక సంస్కరణలు తీసుకురావడం వల్ల విద్యుత్ రంగంలో పని చేసే ఉద్యోగుల భద్రత లేకుండాపోతుంది. కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినెంట్ అవకాశం ఉండదు. వినియోగదారులపై విపరీతమైన భారం పడుతుంది. కార్పొరేట్లకు లాభాలు పెంచడమే పరమావధిగా ఉంది. విద్యుత్ ఉద్యోగులు స్వాతంత్య్రానంతరం ఉత్పత్తి, సరఫరా, పంపిణీలలో అనేక త్యాగాలు చేసి విశాలమైన భారత దేశమంతటా వెలుగులు నింపారు. ప్రపంచంలో 35వ అతిపెద్ద దేశంగా నిలిపారు. కాంగ్రెస్ ప్రారంభించిన ప్రక్రియకు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేయడానికి పూనుకున్నది. లాక్డౌన్ సమయంలో దొంగదెబ్బ తీస్తున్నది. ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, మేధావులతో చర్చలు చేయకుండా సలహాలు ఇవ్వాలని చెప్పి యాంత్రికం గా ప్రక్రియ నడిపి పార్లమెంటులో ఆమోదింప చేసుకోవాలని చూస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలందరూ ఈ బిల్లును ముక్తకంఠంతో వ్యతిరేకించవల్సిన అవసరం ఉంది.
భూపాల్
సెల్: 9490098034