Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు ఉంది యవ్వారం... ఓకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని బహుళ ప్రచారంలో పెట్టవలసిందిగా ఢిల్లీ పెద్దలు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ''స్వదేశీ వస్తువులు ముద్దు విదేశీ వస్తువులు వద్దు'' అనే అర్థమేగా.. అంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం మొత్తం చైనా వ్యతిరేక ప్రచారంలో దిగిపోయింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక రాజ్యసభ సభ్యుడు ''అబ్బేబ్బే.. విదేశీని వ్యతిరేకించమని కాదు స్వదేశానికి ప్రాధాన్యత నిచ్చి, విదేశీ మోజులో పడవద్దని ఆ పిలుపు ఉద్దేశం'' అంటూ సర్దుకోబోయారు. స్వదేశీ నినాదం ఆహ్వానించదగిందే కానీ అది కేవలం నినాదం వరకే కాకుండా విధానంగా మారగలదా? ఆ చిత్తశుద్ధి ఉన్నదా? ప్రపంచీకరణకు సాగిలా పడిన ఈ పాలకులకు ఇది సాధ్యమయ్యేదేనా? చైనా వస్తువులు బహిష్కరించండి, వీటిని వాడటం వలన మన దేశ జీడీపీ పడిపోతుంది, చైనా వస్తువులు నాసిరకం మోసపూరితం అంటూ ప్రచారంలోకి పెడతారు, ఈ మెసేజ్ని మరో వంద మందికి పంపకపోతే నువ్వు నిజమైన దేశభక్తుడు కాదు అని ముక్తాయిస్తారు. కానీ ఏ దేశాల దిగుమతులకైనా అనుమతిని ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే అన్న దానిపై దష్టి పెట్టనివ్వరు. ఇదేం ఓకల్?
కుమ్మరి వాముల తుమ్మలు మొలిచెను, కమ్మరి కొలిమిలో దుమ్ము రేగెనూ, పెద్ద బాడిషా మొద్దుబారినది, సాలెల మగ్గం సడుగులిరిగినవి.. చేతి వత్తులా చేతులిరిగిపాయే... పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల... అంటూ గోరటి వెంకన్న రాసిన పాట ఇప్పటికీ అక్షర సత్యం. కొడవలి కాదు దాని కాడ కూడా దిగుమతి అవుతున్నది. ఆహార పంటలతో పాటు వ్యవసాయ పనిముట్లు అన్నీ ఊళ్ళలోనే తయారయ్యేవి. ఇప్పుడు పల్లెటూర్లన్నీ ప్రపంచ సాలెగూళ్ళో ఇరుక్కుపోయాయి, ప్రతి దానికీ ఎదురు చూడ్డమే. ప్రజలంతా పర ప్రాంతాలకు వలస వెళ్లి పడుతున్న ఇక్కట్లు కరోనా ద్వారా అందరి కండ్లు వాస్తవాన్ని గ్రహించాయి. 'కరోనా - లాక్డౌన్' సందర్భంగా ఎక్కడి మనుషులు అక్కడే గప్చుప్ అనేసరికి ఈ ''ఓకల్ ఫర్ లోకల్'' ఆవశ్యకత నినాదంగానైనా బోధ పడినందుకు సంతోషమే.
ఓకల్ ఫర్ లోకల్ అంటే స్వదేశీ వస్తువులను ఉత్పత్తులను బలపరచడమేగా! మరి అలాంటప్పుడు, భారతీయ సంచార్ నిగం లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) అనే సంస్థ బదులు రిలయన్స్ జియో కంపెనీని మాత్రమే బలపరచడం ఎంతవరకు కరెక్ట్. జియో కంపెనీ, ప్రారంభదశలో ఉన్నప్పుడు, కోరుకున్నట్టుగా ఇంటర్ యూసేజ్ చార్జెస్(ఐయూసీ) తొలగించారు. అదే జియో కంపెనీ 30కోట్ల కస్టమర్లను దాటిన తర్వాత అవే ఐయూసీ చార్జీలను మళ్లీ పునరుద్ధరించారు. భారత ప్రజల సంస్థ బీఎస్ఎన్ఎల్కి ఏడేండ్ల వరకు మొబైల్ రంగంలోకి రావడానికి అనుమతి ఇవ్వలేదు. ఆ తరువాత 12ఏండ్ల వరకు 4జీ నెట్వర్క్ అనుమతి ఇవ్వలేదు. కొత్తగా పుట్టుకొచ్చిన ప్రయివేటు కంపెనీలకు 4జీ నెట్వర్క్ అనుమతిని ఇచ్చారు. ఇలా చేయడం వలన ప్రభుత్వరంగ సంస్థ నష్టాల్లో కూరుకుపోయింది. ఉద్యోగులంతా వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని విధిలేక నిష్క్రమించ వలసి వచ్చింది. ఇదేనా ఓకల్ ఫర్ లోకల్ అంటే? అయినా పర్వాలేదు, జియో కంపెనీ కూడా మన లోకల్దే కదా అంటారా? మరి ఈ జియో కంపెనీలోని పదిశాతం వాటాని రూ.43 వేల 500 కోట్లకు ఫేస్బుక్, మార్క్ జుకర్ బర్గ్కి ఎందుకు అమ్మినట్టు? అంబానీ చెప్పినట్టుగా జియో కంపెనీని డెడ్ ఫ్రీ (రుణ విమోచక) కంపెనీగా చేయడమే లక్ష్యమైతే, జియో కంపెనీకి ఉన్న అప్పులు రెండు రకాలు ఒకటి బ్యాంకు రుణాలు, రెండు జియో కంపెనీ స్థాపనకు ముందుకొచ్చిన రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీలు. ఫేస్బుక్ సమకూర్చిన ఈ డబ్బుని, ఈ ఇద్దరూ రుణదాతలకు కొంత కొంత ఇస్తారు అన్నమాట. ఆ తదుపరి కాలంలో జియో సంపాదించిన లాభాలలో 10శాతం ఫేసుబుక్ వాళ్లకు ఇవ్వవలసిందేగా? అంటే ఈ దేశపు పెట్టుబడిదారులైన రిలయన్స్ సంస్థలు, బ్యాంకులకు లాభాలు ఇవ్వకుండా విదేశీ సంస్థలకు ఇస్తారన్నమాట! ఇదేనా ఓకల్ ఫర్ లోకల్ అంటే?
భారతదేశంలో ఉన్న బొగ్గు గనుల నుంచి తవ్వకాలు చేయడానికి, మినరల్స్ వెలికితీయడానికి ఇన్నాళ్ళు ఉన్న చట్టం క్యాప్టివ్ మైనింగ్ విధానం. క్యాప్టివ్ మైనింగ్ అనగా అవసరం మేరకే ఖనిజాలను తవ్వుకోవాలి. ఈ విధానం ఎందుకంటే, ఖనిజ సంపద మళ్లీ మళ్లీ పుట్టేది కాదు కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించు కోవాలి. అలాంటి విధానానికి స్వస్తి చెప్పి ఇప్పుడు ప్రయివేటీకరణ ద్వారా వ్యాపార కార్యకలాపాలకు కూడా అవకాశం కల్పించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఒరిగేది లైసెన్స్ ఫీజు, ఉత్పత్తిపైన పన్నులు వగైరాలు. బళ్లారి మైనింగ్ మాఫియా ఉదంతాలు మన కండ్ల ఎదుట ఉండి కూడా ఇలాంటి నిర్ణయం చేయడంతో అంతంత మాత్రమే నిల్వ ఉన్న బొగ్గు గనులు అంతరించిపోవడం తథ్యం. ప్రయివేటు సంస్థలు విపరీతమైన లాభాలు పొందడం తెలియబోయే వాస్తవం. ఇదేనా ఓకల్ ఫర్ లోకల్ అంటే?
డిఫెన్స్ రంగంలో ఆయుధోత్పత్తికి ఇప్పటివరకు ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతించబడిన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెట్మెంట్ 49శాతం. దీనిని 74శాతానికి పెంచారు. ప్రభుత్వ వాదన ప్రకారం ఆయుధ ఉప్పత్తి కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా స్వదేశంలో ఉత్పత్తి చేసుకోవచ్చు అని. అలాంటప్పుడు, వచ్చిన లాభాలలో 74శాతం పట్టుకు పోయేవాడు ఈ దేశంలో ఉంటేనేమి పరదేశంలో ఉంటేనేమి? భారత జీడీపీ 2.73 ట్రిలియన్ డాలర్స్, ఫ్రాన్స్ జీడీపీ 2.78 ట్రిలియన్ డాలర్స్. జీడీపీలో రెండు దేశాలు సమానంగా ఉన్నా, మానవవనరులు, ఇతర సహజ వనరులు భారత్లో ఎక్కువగా ఉన్నవి. కావలసిందల్లా టెక్నాలజీ మాత్రమే. దాన్ని దిగుమతి చేసుకోకుండా కంపెనీలను ఇక్కడ పెట్టమని అడగడం వల్ల లాభాలు పంచి పెట్టడమే అవుతుంది తప్ప ఉపయోగం తక్కువ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్.ఎ.ఎల్) ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారత ప్రభుత్వ సంస్థ. మిగ్-21 వంటి అత్యాధునిక విమానాలను తయారు చేసిన చరిత్ర దీనికి ఉన్నది. ఇదంతా ప్రభుత్వ పెద్దలకు తెలిసినా పెట్టుబడి ప్రభావానికి తలొగ్గుతున్నారు! ఇదేనా ఓకల్ ఫర్ లోకల్?
వీటితో పాటు ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్, అటామిక్ ఎనర్జీ, ఎయిర్ పోర్టులు, పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ల ప్రయివేటీకరణకు శ్రీకారం చుట్టారు. ఈ అన్ని రంగాలను భారత ప్రభుత్వ సంస్థలే అభివద్ధి పరిచి పెట్టినవి, ఇట్టి వాటిని అప్పనంగా ప్రయివేట్కు ఇస్తే ఇన్నాళ్లు వీటిని నిర్మించడానికి అయిన ఖర్చంతా ఉచితంగా ఇచ్చినట్టు అవుతుంది కదా! అంతే కాకుండా ఇప్పుడున్న ఆరు ప్రధాన ఎయిర్పోర్టులు ప్రయివేటీ కరించి మరో పన్నెండింటిని పీపీపీి ద్వారా నిర్మిస్తారట. అంటే భవిష్యత్తులో ఎవరో గుప్త దాతకు సిద్దం చేస్తున్నారన్న మాట. ఇదేనా ఓకల్ ఫర్ లోకల్?
ఇంతకు మునుపే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థను స్ట్రాటజిక్ సేల్తో సహా అమ్మేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్ట్రాటజిక్ సెల్ అంటే యాజమాన్యపు హక్కులు కూడా బదిలీ అయిపోతాయన్నమాట. బీపీసీఎల్లో ఇప్పుడున్న 53శాతం మొత్తాన్ని ప్రయివేటీకరించడం ద్వారా యాజమాన్య హక్కులు బదలాయించ బడతాయి. 25 వేల అవుట్లెట్ యూనిట్లను 62 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు శుద్ధి కెపాసిటీని కలిగి ఉండి అత్యంత లాభాలను ఇస్తున్న ఈ సంస్థను ప్రభుత్వరంగంలో ఉంచకపోవడం ఓకల్ ఫర్ లోకల్ ఎలా అవుతుంది? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో(ఎల్.ఐ.సి) క్రమ పద్ధతిన వాటాల విక్రయానికి గత బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టారు. కేవలం ప్రభుత్వ ఖజానాకు కొన్ని వేల కోట్ల రూపాయల కోసం వాటాల విక్రయం అనే ప్రక్రియకు పూనుకోవడం ఓకల్ ఫర్ లోకల్ ఎలా అవుతుంది?
ఒక నినాదాన్ని ప్రచారంలో పెట్టి, ప్రజలంతా ఆ నినాదంకు జేజేలు కొడుతుంటే, చాప కింద నీరులా సర్వం ప్రయివేటు వ్యక్తులకు అప్పజెప్పి, ''విపత్తు ఏర్పడినప్పుడు నీకు లిక్విడిటీ రూపంలో రుణాలు అందుబాటులో ఉంటాయి, రుణాలని తీసుకొని మీ కర్మలు మీరే బాగు చేసుకోండి అని చెప్పే పాలన ఏ కోవలోకి వస్తుంది? ఊబిలో పడిపోతున్న వారికి ఉపాయపు పాఠాలు చెబుతారా ఊతమందించి రక్షిస్తారా? దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజల మానసిక స్థితి, అస్థిరమైన ఉపాధితో కార్మికుల మనోధైర్యం, అత్యంత ప్రమాదంలో పడిపోయిన ఈ సందర్భంలో, ఒక్కసారిగా, ప్రధాన రంగాలను ప్రయివేటీకరించే నిర్ణయం చావు బతుకుల మధ్యనున్న పేషెంట్పై ప్రతాపం చూపించడమే. కరోనా కాలంలో భారత్లో వర్గాలు బహిర్గతమయ్యాయి. బతుకు గమనంలో ఆప్తుల కోసం తహహలాడుతున్న అమాయక కూలీలొకవైపు (15 కోట్లు), పరిశ్రమల పునద్ధరణానంతరం కార్మికులను కట్టడి చేసే కుయుక్తులను శాసనాలుగా మార్పించడంలో యజమానులొకపైపు ఉండగా కార్మికచట్టాలను పెట్టుబడి దారులకు అనుకూలంగా మారుస్తూ సర్వం ప్రయివేటీకరణ దిశగా సంస్కరణలు చేస్తూ ప్రభుత్వం వారివైపే నిలవటం కండ్లకు కట్టిన సత్యం. అయితే కరోనాపై విజయం సాధించడంలో ఆలస్యం కావచ్చు కానీ, ప్రభుత్వ రంగాలను కాపాడుకోవడం కోసం కరుణలేని ప్రభుత్వాలను ఎదిరించి పోరాటాలకు దిగడం కార్మికవర్గానికి కొత్తేమీ కాదు. సంఘటితమై ముందుకు నడవడమే...
సెల్: 9951300016
జి. తిరుపతయ్య