Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామబాణం - లక్ష్మణరేఖ అంటూ చెప్పుకొచ్చిన ప్రధాని, దూరదర్శన్లో రామాయణం టెలివిజన్ సీరియల్ని మళ్ళీ వేయిస్తున్నారు. జనాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి దేవుడు, మతం, పురాణాలు, వేదాలు, మనుస్మృతి తప్ప ఆర్థికస్థితి, అభివృద్ధి, ఆహారం, ఉద్యోగం, పరిశ్రమలు వగైరాల గురించి పొరపాటున కూడా మాట్లాడరు కదా? నిర్దాక్షిణ్యంగా వలస కార్మికుల్ని రోడ్డున పడేసినందుకు ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ జాతికి క్షమాపణలు చెప్పుకోవాల్సిన సందర్భం.
కరోనా ప్రభావం వల్ల ఒక విషయం స్పష్ట మైంది. దేవుడూ - మతం మనిషికి నిత్యావసరం కాదనీ, మనిషి మాత్రమే మనిషిని ఆదుకోగలడని రూఢగాీ తెలిసింది. మానవ తప్పిదం వల్లే కరోనా వస్తే, దాని నివారణకు మనిషే కృషి చేస్తున్నాడు. ఇందులో ఏ అద్భుత శక్తి ప్రమేయమూ లేదు. ప్రపంచాన్ని ప్రపంచ జనాన్ని రక్షిస్తున్నారని కొన్ని శతాబ్దాలుగా ప్రచారం చేయబడ్డ అన్ని మతాల దేవుళ్ళంతా నిస్సహయంగా లాక్డౌన్లో ఎందుకు ఐసోలేషన్ అయిపోయ్యారు. ప్రచారం చేసిన మహత్తులన్నీ అబద్ధాలేనన్న నిరూపణ జరిగిపోయింది కదా?
వైరస్ గొలుసును తెగ్గొట్టడానికి వ్యక్తిగత దూరం పాటిస్తూ, మాస్క్లు ధరిస్తూ, సబ్బులు, సానిటైజర్లు వాడుతూ అప్రమత్తంగా ఉండటం ప్రజలు నేర్చుకున్నారు. పాల పాకెట్లు, కాయగూరలు, పండ్లు సబ్బు నీటిలో శుభ్రంగా కడిగి వాడుకోవడం అలవర్చుకున్నారు. ఇంట్లో సురక్షితంగా ఉంటూనే ఎవరి పనులు వారు చేసుకోగలుగుతున్నారు. స్కూలు, కాలేజి విద్యార్థినీ విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, డాక్టర్లు ఆన్లైన్లో సెమినార్స్ (వెబినార్స్) నిర్వహించు కుంటున్నారు. డాక్టర్లు ఆన్లైన్లో చికిత్సనందిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు ఆన్లైన్లో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో పాటలు, ఆన్లైన్లో కవితా గానాలు, ఆన్లైన్లో టీవీ సీరియల్స్, లైవ్ షోలు, ఇంటర్వ్యూలు జరిగిపోతున్నాయి. కోవిడ్-19 ఫలితంగా జీవితాల్లో అనేకానేక కొత్త కొత్త పద్ధతులు అవలంబించాల్సి వస్తోంది. ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్లు, కోర్టులో ఆన్లైన్ వాదనలు మామూలైపోయాయి. ఇవన్నీ చెప్పుకోవడం ఎందుకంటే సజీవంగా ఉండి, బుద్ధిని, జ్ఞానాన్ని ఉపయోగించుకోగలిగే మనిషి మాత్రమే ఇవన్నీ చేయగలుగుతున్నాడు. మనిషి ఎక్కడా ఆగిపోలేదు. దేనికీ రాజీపడలేదు. నిరంతరం చలనంలోనే - జ్వలనంలోనే ఉన్నాడు. అయినా ఎక్కడా ఎప్పుడూ మనో ధైర్యాన్ని వీడలేదు. ఏ శక్తులూ లేని దేవతా విగ్రహాల వలె తలుపులు మూసుకుని మూలన పడి ఉండలేదు. వాటిని చూపించి, తమ బతుకు దెరువును వెతుక్కునే మనుషులొస్తే పాతకథ మళ్ళీ మొదలవుతుంది. దేవుడనేవాడు ఉన్నా లేకపోయినా తమకు ఒకటేనన్నది సామాన్యుడు గ్రహించుకున్నాడు. మూఢభక్తుల్లో సైతం మూఢత్వం తగ్గడానికి ఈ రెండు నెలల అనుభవ సారం కొంత పనికొస్తుంది.
అయితే ఇప్పుడిక అర్చకులు, మౌల్వీలు, ఫాదర్లూ ఊరికే ఏమీ కూర్చోరు. కరోనా ప్రభావం కొంత తగ్గగానే మళ్ళీ మేం ఉన్నామంటూ తమ వ్యాపార కార్యకలాపాలు మొదలు పెడతారు. అబద్ధాలు ప్రచారం చేస్తారు. ఇప్పటికే అది మొదలైంది. ఎందుకంటే కరోనా - దేవుడి పదకొండో అవతారమని ప్రచారం ప్రారంభించారు. కరోనాకు పూజలుచేస్తే శాంతిస్తుందని చెపుతూ మరోవైపు యాగాలు, సహస్రనామార్చనలు ప్రారంభించారు. పూజలు చేస్తే దేవుడు అంతా మేలు చేస్తాడని శతాబ్దాలుగా సాగుతూ వస్తున్న విశ్వాసాన్ని ప్రజల్లో ఏ మాత్రం సడలనివ్వరు. ఎప్పటికప్పుడు ఆ విశ్వాసాన్ని తట్టి లేపుతూ ఉంటారు. మూడు నెలలుగా మూసుకుని ఉన్న మత బోధకుల నోళ్ళు మళ్ళీ తెరుచుకుంటున్నాయి. అర్థం పర్థం లేని విషయాల విషాన్ని జనం మీద చిమ్ముతున్నాయి. ఎలాగంటే.. ఇప్పుడు మనం వాడుతున్న సానిటైజర్ పాపాల్ని కడుక్కోమని అంటుందట? మాస్క్ చెడు మాట్లాడొద్దని చెపుతోందట? దుష్టులకు దూరంగా ఉండమని భౌతిక దూరం చెపుతుందట? అనుకోకుండా కోవిడ్-19 బారిన పడినవారంతా దుష్టులా? దుర్మార్గులా? వాళ్ళేం చెప్పదలు చుకున్నారూ? పాపాలు, పుణ్యాలు, పునర్జన్మలు, మనుస్మృతి ధర్మాలు పాటించే మందబుద్దులకు విషయం అంతకన్నా ఎక్కువగా అర్థం కాదు. వాళ్ళు శుభ్రతని, వ్యాధిని అరికట్టడానికి తీసుకునే చర్యల్ని అర్థం చేసుకోలేరు. ప్రతిదాన్నీ తమ పవిత్ర సంస్కృతి గొప్పది అని చెప్పడానికి తాపత్రయపడతారు. అది పొసుగుతుందా లేదా అన్నది కూడా ఆలోచించుకోరు. చేతులు కలపకండి, దూరంగా ఉండి చేయి ఊపండి. పలకరించుకోండి అని వైజ్ఞానికులు చెప్పిన అంశాన్ని కూడా భారతీయ సంప్రదాయానికి లంకెపెడతారు. ప్రపంచమంతా భారతీయుల నమస్కారం బావుందని అనుసరించడం లేదు. ఇక్కడ జరుగుతున్నది కేవలం వ్యాధి వ్యాపించడాన్ని అడ్డుకోవడం మాత్రమే!
రణరంగంలోని సైనికులంతా యుద్ధం చేయడంలో మునిగి ఉన్నప్పుడు ఎవరైనా చప్పట్లు చరచమనో, దీపాలు వెలిగించమనో, పూలు కురిపించమనో చెపుతారా? ఏం సాధించినందుకు ఆ సంబరాలూ? యుద్ధ వ్యూహం గురించి మాట్లాడవల్సిన సమయంలో భావోద్వేగాలు అవసరమా? ఒకసారి ఆలోచించండి. యుద్ధ నైపుణ్యం లేనివారు మాత్రమే అలాంటి మాటలు మాట్లాడుతారు. మాట్లాడే ఆ మాటలు కూడా ఈ దేశానికి పరిమితమై ఉండవు. దేశ సరిహద్దులు కూడా దాటిపోతాయి. ఉదాహరణకు చూడండి. పరిస్థితులు చక్కబడేదాకా లాక్డౌన్ నిబంధనల్ని సడలించవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక హెచ్చరిక జారీచేసింది. దాన్ని వెంటనే మార్చి, ఆ సంస్థ 'ఎంబ్లమ్'ను అలాగే ఉంచి 'కరోనా సోకిన వారంతా మాంసాహారులే'నని - దేశభక్తులు కొందరు ప్రచారం ప్రారంభించారు. కరోనా వైరస్ వూహాన్ నగరం, చైనా నుంచి వచ్చింది గనుక, 'చైనా వాళ్ళు మాంసాహారం మానెయ్యాలి' అని ఓ అయ్యవారు సెలవిచ్చారు. ఆయనను మించిన మరో ఆచంటి మల్లన్న మరో గొప్ప విషయం ప్రకటించారు. 'చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కరోనా విగ్రహం తయారు చేయించి, అనునిత్యం పూజలు చేస్తూ క్షమించమని వేడుకుంటూ ఉండా'లట! - ఇది అయ్యే పనేనా? ఇకపోతే, హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుల వారు ఒక సంచలన విషయం ప్రకటించారు. 'మాంసాహారులను శిక్షించడానికే ఇది భగవంతుడెత్తిన కొత్త అవతారమని' అన్నారు. వాళ్ళంతా దైవాంశ సంభూతులు గనక - నిజమే చెపుతున్నారని మనమంతా మెదళ్ళు ఉపయోగించక, ఊరికే గొర్రెల్లా చెవులూపుతూ ఉండాలన్న మాట?
ఆవు పేడ - మూత్రాలపై అచంచల విశ్వాసమున్న ఓ భక్తుడు ఇలా అన్నాడు.. ''దైవారాధన చేసేవారికి, గోరక్షణను బాధ్యతగా నిర్వహించేవారికి కరోనా వ్యాధి సోకదు' అని. విశ్వాసంలో ఉన్నవారికి అది నిజమేనని తోస్తుంది. కానీ, పొరపాటున ఒకవేళ సోకినా.. అలాంటి వారికి ఏమీ కాదు. ఎందుకంటే వారు గోమూత్ర సేవనం ద్వారా సర్వరోగాల్ని నయం చేసుకోగలరు. ఆ పని చేయలేని మనలాంటి సామాన్యులు కరోనా వాక్సిన్ ఎప్పుడొస్తుందని వెర్రిమొహాలేసుకుని ఎదురు చూస్తుంటాం! గోమూత్రం - పేడల గురించి మనమేదో తేలికగా మాట్లాడుతున్నామని కాదు. నిజంగానే మన కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆవు విసర్జకాల్లో ఔషధ లక్షణాలు ఉన్నాయనీ, వాటి మీద పరిశోధనలు చేయదల్చిన వారికి ఆ సంస్థ నిధులు సమకూరుస్తుందని - దాని సారాంశం! అయితే, ఆ ప్రకటన, భారతీయ వైజ్ఞానిక రంగానికి తలవంపులుగా ఉందని దేశంలోని 110మంది ప్రముఖ శాస్త్రవేత్తలు తమ నిరసనని తెలియజేశారు. నిధుల్ని దుర్వినియోగం చేయరాదని, అవసరమైన, అర్థవంతమైన పరిశోధనలకు మాత్రమే నిధులివ్వాలని డిమాండ్ చేశారు. ఒక తెలుగు ప్రవచన కారుడు కోవిడ్-19కు మందులు పురాణాల్లో ఉన్నాయనీ, అయితే అవి బీజాక్షరాల్లో ఉన్నాయి గనక వాటిని తాను బహిరంగంగా పలకలేనని అన్నాడు.''అయ్యా స్వామీ నువ్వు బహిరంగంగా ఏమీ పలకొద్దు. మందులు నీకు తెలుసుగనక, నీ ప్రాణానికేమీ ప్రమాదం లేదు. కావాలనే నీకు కరోనా సోకించి ఐసోలేషన్లో ఉంచుతాం. నువ్వు నీకు తెలిసిన ఆ పురాణాల్లోని మందులతో చికిత్స చేసుకుని, తగ్గించుకుని బయటికి రా చూద్దాం.. ఈ ప్రయో గానికి సిద్ధపడతావా?'' అని ఎవరైనా అడగాలి.
మే 5కు కరోనా నియంత్రణలోకి వస్తుందని శారదాపీఠాధిపతి అన్నారు. వేరు వేరు తేదీలతో మరికొందరు మత బోధకులు కూడా ఆ మాటే చెప్పారు. వాస్తవానికి అలా జరగలేదు. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి కూడా! భారత యుద్ధం 18 రోజులు జరిగితే, కరోనా యుద్ధం 21 రోజులలో ముగుస్తుందని, లాక్డౌన్ ప్రకటించినప్పుడు ఈ దేశ ప్రధాని అన్నారు. ఏదీ జరగలేదే.. మరి వీరంతా వారి ప్రకటనల్ని మర్యాదగా వెనక్కి తీసుకోవాలి కదా? రామబాణం - లక్ష్మణరేఖ అంటూ చెప్పుకొచ్చిన ప్రధాని, దూరదర్శన్లో రామాయణం టెలివిజన్ సీరియల్ని మళ్ళీ వేయిస్తున్నారు. జనాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి దేవుడు, మతం, పురాణాలు, వేదాలు, మనుస్మృతి తప్ప ఆర్థికస్థితి, అభివృద్ధి, ఆహారం, ఉద్యోగం, పరిశ్రమలు వగైరాల గురించి పొరపాటున కూడా మాట్లాడరు కదా? నిర్దాక్షిణ్యంగా వలస కార్మికుల్ని రోడ్డున పడేసి నందుకు ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ జాతికి క్షమాపణలు చెప్పుకోవాల్సిన సందర్భం.
కరోనా వ్యాపించి ప్రపంచం అల్లకల్లోలమై పోతున్న తరుణంలో.. కొందరు తప్పుడు అబద్దపు వీడియోలు తయారుచేసి వేల వేల సంఖ్యలో జనంలోకి పంపిస్తున్నారు. జనం వాటిని బాగా చూస్తున్నారని తెలియగానే మొదట ఏ ఎకౌంట్ నుంచి దుష్ప్రచారం మొదలు పెట్టారో ఆ ఎకౌంట్ తొలగిస్తున్నారు (డిలిట్) మళ్ళీ కొత్త కొత్త ఎకౌంట్లతో మరికొన్ని కొత్త కొత్త అబద్దాలు జనంలోకి పంపుతున్నారు. ఒక జాతీయ న్యూస్ చానెల్కు అనుబంధంగా పనిచేస్తున్న డిజిటల్ నిపుణులు చెప్పిందేమంటే.. కరోనా వైరస్ని ఒక బూచిగా చూపి, దాన్ని వ్యాపింపజేస్తున్నది ముస్లింలే అని ప్రచారం జరుగుతోంది. వేరు వేరు సందర్భాలలో తీసిన పాత వీడియోలను మార్చి - మార్ఫింగ్ చేసి, ఇప్పుడు వారికి అనువైన విధంగా వాడుకుంటున్నాని వారు తెలియజేశారు. ''అల్లాను వేడుకునే వారికి కరోనా సోకదనీ.. భౌతిక దూరం పాటించాల్సిన అవసరం లేదని'' చెపుతున్నట్టు డైలాగులు చెప్పిస్తూ వీడియోలు విడుదలయ్యాయి. ఇవి కావాలనే ముస్లింలను విలన్లుగా చిత్రిస్తూ విడుదలవుతున్నాయని కొందరంటున్నారు. ''మా పరువు మేమే తీసుకుంటామా?'' అని కొందరు ముస్లిం ప్రముఖలు వాపోతున్నారు. ఇస్లామాబాద్లో అక్కడి ప్రధాని సమక్షంలోనే ఒక మత పెద్ద మౌలానా తరఖ్ కరొనా వ్యాప్తికి కారణమేమిటో ప్రకటించాడు. అమ్మాయిలు తక్కువ దుస్తులు ధరించడం వల్లనే కరోనా వస్తుందంటున్నాడు. ఇక్కడ మన తెలుగు పూజారి ఒకాయన ఆడవాళ్ళు ఇంట్లో నైటీలు వేసుకుని తిరుగుతున్నందు వల్లనే కరోనా విజృంభింస్తోందని అన్నాడు. బాలాజీ దయవల్ల భారత్కు కరోనా రాదు - అని చిలుకూరి గుళ్ళో గంటకొట్టి ప్రకటించాడు అక్కడి అర్చకుడు. మరి ఏమైంది? కరోనా దయవల్లే ప్రార్థనా స్థలాలన్నీ మూతపడ్డాయి కదా?
డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.