Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొత్తం జీడీపీ (2019లో రూ.210లక్షల కోట్ల)లో 70శాతం (147లక్షల కోట్లు)వాటాను లాభాల రూపంలో జనాభాలో ఒక్కశాతం మాత్రమే ఉన్న ధనికులు దక్కించుకుంటున్నారు. మొత్తం దేశానికే కష్టమొచ్చినప్పుడు కొంత భారం మోయాల్సిన భాద్యత ఈ ధనిక కార్పొరేట్లకు ఉండదా? కాబట్టి వారిపై సంపద పన్ను విధించటం లాంటి చర్యలు తీసుకుంటే అవసరమైన వనరులు సమకూర్చుకోవటం కష్టమేమీ కాదు. కాబట్టి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మంచి పథకాన్ని పై మార్పులతో అమలు జరిపాలి. కరోనా రూపంలో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సంక్షోభాలను అధిగమించటానికి ఇదే మంచి మార్గం.
'మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు' ఇదివరకే మాంద్యం అంచుల్లోకి చేరిన భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి విరుచుకుపడింది. ఫలితంగా కోటానుకోట్ల ప్రజలు ఉపాధి కోల్పోయారు. ఉత్పత్తి స్తంభించింది. నిరుద్యోగం మున్నెన్నడూ లేనంత స్థాయికి దాదాపు 29శాతానికి చేరింది. ఆకలి కేకలు దేశంలో అన్నిమూలలా అలుముకుంటున్నాయి. ఈ స్థితిలో ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించటానికి, కోట్లాది ప్రజలను ఆదుకోవటానికి ప్రభుత్వం ఉదారంగా ఆర్థిక ఉద్దీపనలు ప్రకటించాలని ప్రజలు ఆశించారు. కానీ కేంద్రం ప్రకటించిన 'ప్యాకేజీ'లు అందుకు భిన్నంగా ఉండటం విచారకరం.
ఆలస్యంగానైనా ప్రధాని నరేంద్ర మోడీ 20లక్షల కోట్ల భారీ 'ప్యాకేజీ ప్రకటన' కలిగించిన సంతోషం, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ దశలవారీగా వెల్లడించిన 'వివరాల'తో దాదాపు ఆవిరైపోయింది. గతంలో రిజర్వ్ బ్యాంకు ప్రకటించిన 5లక్షల 24వేల కోట్లు, ప్రభుత్వం ప్రకటించిన లక్షా 70వేల కోట్లు కూడా ఈ భారీ ప్యాకేజీలో కలిపేసారు. రిజర్వ్బ్యాంక్ గతంలో ప్రకటించిన రాయితీలన్నీ బడా కార్పొరేట్ సంపన్నులకే తప్ప సామాన్యులకు ఒరగబెట్టిందేమీ లేదు. ఇప్పుడు ఆర్థిక మంత్రి కొత్తగా ప్రకటించిన 'ప్యాకేజీ'ల్లో విధానాలు తప్ప రాయితీలు తక్కువ. ఆర్థిక డిమాండ్ పెంచటానికి రెండు విధాలుగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మొదటిది రిజర్వ్బ్యాంకు ద్వారా విధాన పరంగా తీసుకునే చర్యలు. అంటే మానిటరీ పాలసీ ద్వారా ఎక్కువ డబ్బును మార్కెట్లోకి చెలామణీలోకి తేవటం (వడ్డీరేట్లు తగ్గించటం, బ్యాంకులు మరిన్ని అప్పులిచ్చే విధంగా ఎక్కువ నిధులు అందుబాటులో ఉంచటం, చెల్లించే గడువులను పెంచి డిఫాల్ట్ కాకుండా కాపాడటం వగైరా చర్యలు). రెండోది ప్రభుత్వమే నేరుగా ఖర్చు పెట్టటం. అంటే బడ్జెట్ కేటాయింపులతో (ఫిస్కల్ పాలసీ) వివిధ పథకాల ద్వారా ప్రజలకు ఆదాయం కల్పించటం.
ప్రభుత్వం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీల్లో అత్యధికంగా దాదాపు 19లక్షల కోట్లమేరకు మొదటి (మానిటరీ పాలసీ) కోవలోకే వస్తాయితప్ప ప్రత్యక్షంగా డిమాండ్ను పెంచే చర్యలు కావు. వివరాల్లోకి వెళితే రిజర్వ్బ్యాంక్ మొదట ప్రకటించిన 5లక్షల కోట్ల రాయితీలన్నీ కార్పొరేట్ శక్తులకే ఇచ్చారు. ఇక ఇప్పుడు ప్రకటించిన వాటిలో చిన్న పరిశ్రమలకు 3లక్షల 70వేల కోట్లు, ఎంఎఫ్ఐలకు 75వేల కోట్లు, డిస్కంలకు 90వేల కోట్లు, కిసాన్కార్డు ద్వారా రైతులకు 2లక్షల కోట్లు, నాబార్డ్ ద్వారా మరో 30 కోట్లు ఇవన్నీ కూడా రుణాలే. వీధివ్యాపారులకు 5వేల కోట్లు, గృహకోనుగోళ్లకు 70వేల కోట్లు కూడా రుణాలే. ఈ రుణాలన్నీ ఎప్పటికి అమలులోకి వస్తాయి? అసలు వస్తాయా? గత ఖరీఫ్లో తెలంగాణ రైతులకు 27కోట్ల రుణాల లక్ష్యానికిగాను 18కోట్లే ఇచ్చారు. ఈ సీజన్లో 33కోట్లని చెప్పినా ఇప్పటికింకా 20శాతం కూడా ఇవ్వలేదు. ఇక తేనెటీగలు, కూరగాయలు, ఔషదపంటలు, పాడి పరిశ్రమ, మత్యసంపద పేర్లతో చెప్పిన వేల కోట్ల ప్రకటనలేవీకూడా ప్రజలకందుబాటులోకి వెంటనే వచ్చేవి కావు. అవన్నీ ఆయా రంగాలలో సంస్థాగతమైన అభివృద్దికి ఖర్చు పెడతామని చెపుతున్న హామీలు మాత్రమే. ఇలాంటివన్నీ అమలు జరిగితే ఆయా తరగతుల ప్రజలకు ఎంతో కొంత మేలు జరగదని కాదు. కానీ కరోనా నేపథ్యంలో ప్రజలెదుర్కొంటున్న తక్షణ సమస్యలకు ఇవి పరిష్కారాలు చూపలేవు. అలాగే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా రక్షించే చర్యలుగా కూడా ఇవి ఉపయోగపడవు. ప్రభుత్వం ప్రకటించిన కొన్ని రాయితీలు ఎలా ఉన్నాయంటే ప్రజల డబ్బు ప్రజలకే ఇచ్చి అది కూడా తమ ప్యాకేజీగా గొప్పలు చెప్పుకున్నారు. ఉదాహరణకు ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపుల్లో ఇచ్చిన రాయితీల సంగతి చూద్దాం. కార్మికుల మూల వేతనంలో 12శాతం కార్మికులు, మరో 12శాతం యజమాని పీఎఫ్ పండ్కు చెల్లించాలి. అది భవిష్యత్తులో కార్మికులకు చెందుతుంది. దానిని 2శాతం తగ్గించారు. అంటే కార్మికుల జీతంలో 12కు బదులు 10శాతం మాత్రమే పీఎఫ్ కింద కట్ అవుతుంది. ఆ మేరకు ఎక్కువ జీతం చేతికొస్తుంది. అంటే దాచుకునే సొమ్ములో కొంత మొత్తాన్ని తగ్గించి భవిష్యత్తులో కాకుండా ఇప్పుడే ఖర్చుపెట్టుకోవడానికి అందుబాటులోకి తెస్తారన్నమాట. ఆ విధంగా తక్షణం ఖర్చులకు పనికొచ్చేట్టుగా కొంత సొమ్ము సమకూడే మాట నిజమేగానీ, అది కార్మికుల సొంత సొమ్మేగానీ ప్రభుత్వం ఇచ్చేది కాదుగదా? ఇలాంటి గారడీలన్నీ పక్కనబెట్టినా మొత్తం ప్యాకేజీలో ప్రత్యక్షంగా పేదలకు, బలహీనులకు ఉపయోగపడే ప్రతిపాదనలు సుమారు 50 నుంచి 70వేల కోట్ల రూపాయిలకు మించి ఉండవు.
కరోనా కల్లోలం నేపథ్యంలో 3,4లక్షల కోట్లతోనే అన్నార్తులందరినీ ఆదుకోవటంతో పాటు, ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదే ప్రతిపాదనలను
దేశంలోని నోబెల్ గ్రహీతలతో పాటు ప్రముఖులు, ప్రతిపక్షాలు పదే పదే చేస్తూ వచ్చారు. వాటిలో ముఖ్యమైనదేమంటే లాక్డౌన్ వల్ల 'పని'కి దూరమైన 'ఆసి'్తలేని కుటుంబాలన్నింటికీ నెలకు 7వేల చొప్పున నగదు, ప్రతి మనిషికి 10కిలోల ఆహార ధాన్యాలు కనీసం 3మాసాల పాటు ఉచితంగా ఇవ్వటం. ఈ చర్య కేవలం పేదల పట్ల మానవతా కోణంలో మాత్రమేగాక, ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికవసరమైన 'డిమాండ్' సృష్టికి కూడా పనికొస్తుంది. కేంద్ర గోడౌన్లలో 7కోట్లకు పైగా టన్నుల ఆహారధాన్యాలు ముక్కిపోతున్నాయి. ఈ చర్యలు తీసుకోవటానికి వీటిలో సగం చాలు. అయినా ఈ ప్రతిపాదనలను కేంద్రం పట్టించు కోలేదు. ఇప్పటికైనా ఈ చర్యలు తీసుకుంటే తక్షణం 3మాసాలపాటు ప్రజలను బతికించిన వారవు తారు. ఆ తరువాత కాలంలో ఆర్థిక వ్యవస్థను ప్రజలను ఆదుకోవటానికి గ్రామాలపైన, చిన్న, మద్యతరహా పరిశ్రమలపైన కేంద్రీకరించటం అవసరం.
మన పారిశ్రామికీకరణ, పట్టణ జనాభా ఎంతగా పెరిగినా భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క ఆత్మ యిప్పటికీ గ్రామమే. కరోనా సృష్టించిన విలయంలో కోట్లాది వలస కార్మికులు తిరిగి తమ గ్రామాలకు చేరుకోవడానికి పడుతున్న ఆరాటం ఇందుకు తిరుగులేని తార్కాణం. ఈ క్రమంలో గ్రామం చేరటానికి వారు అనుభవిస్తున్న కష్ట నష్టాలు, ఎదుర్కొంటున్న ఆకలి, అవమానాలు, అణచివేతలు అన్నీ ఇన్నీ కావు. అయినా లెక్కజేయకుండా వారి 'మహాప్రస్థానం' కొనసాగుతూనే ఉండటానికి కారణం ఏమిటి? ముఖ్యమైన కారణమేమంటే వారి మూలం గ్రామంలో ఉంది. తప్పని పరిస్థితిలో ఆర్థిక భాదలు వారిని గ్రామానికి దూరం చేసినా ఆత్మీయతలైనా, ఆత్మగౌరవాలయినా వారికి అక్కడే లభిస్తాయి. వలస కార్మికులేగాక, పట్టణ పేదలు, అసంఘటిత రంగ కార్మికుల మూలాలన్నీ గ్రామాల్లోనే ఉన్నాయి. ఇక జనాభా విషయానికొస్తే ఇప్పటికీ దేశజనాభాలో మూడింట రెండొంతులు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. అందువల్ల మన ఆర్థికవ్యవస్జకూ, ఆత్మగౌరవానికీ మూలమైన ఆ గ్రామాన్ని రక్షించుకోవాలి. దానికాధారమైన వ్యవసాయాన్ని రక్షించుకోవాలి. తిండి అందించే గ్రామంతో పాటు, ఇతర కనీస సరుకులను అందించే చిన్న, మద్యతరహా పరిశ్రమలను కాపాడుకోవటం మన ప్రాధాన్యాలుగా ఉండాలి. ఇందుకోసం ఇతర చర్యలతో పాటు యుపీఏ-1 కాలంలో వామపక్షాల వత్తిడితో అమలులోకొచ్చిన ''మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పథకం'' ప్రస్తుత పరిస్థితుల్లో బాగా ఉపయోగ పడుతుంది. ఈ పథకాన్ని మెరుగుపర్చి అమలుజేస్తే అద్భుత ఫలితాలను మనం సాధించవచ్చు.
ఈ పథకంలో తీసుకురావాల్సిన ముఖ్యమైన మార్పు ఏమిటంటే గ్రామాల్లో వ్యవసాయాన్ని రక్షించటానికి, పట్టణంలో పేదలను చిన్న పరిశ్రమలను రక్షించటానికి ఈ పథకాన్ని వర్తింపజేయాలి. గ్రామంలో ఉండే పేద, మద్యతరగతి రైతులందరి (ఉదా: 5ఎకరాల మాగాణి లేదా 10ఎకరాల మెట్టకు మించనివారు) యొక్క కమతాల్లో పనిజేసే కూలీల వేతనాలన్నిటినీ ఈ పథకం ద్వారానే చెల్లించాలి. అంతేగాక ఆ రైతుల కుటుంబ సభ్యులు తమ స్వంత భూమిలో చేసే శ్రమలకు కూడా ఈ పథకం ద్వారా వేతనాలు ఇవ్వాలి. ఇలా చేయటం ద్వారా దాదాపు 60శాతంకు పైగా రైతాంగానికి, మొత్తం గ్రామీణ పేదలందరికీ మేలు జరిగి ఆర్థిక ఊతం లభిస్తుంది. వ్యవసాయం ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడుతుంది. గ్రామీణ జనాభా అంతటికీ ఆహార భద్రత ఏర్పడుతుంది. అలాగే ఈ పథకాన్ని 'పట్టణ ఉపాథి హామీ పథకం'గా కూడా విస్తరించాలి. చిన్న పరిశ్రమలకు వర్తింపజేయాలి. చిన్న పరిశ్రమల్లో ముఖ్యంగా అత్యవసర వస్తువులు, సేవలు ఉత్పత్తిజేసే పరిశ్రమల్లో పనిజేసే కార్మికుల వేతనాలన్నింటిని ఈ పథకం ద్వారా చెల్లిస్తే సంక్షోభం ఎదుర్కొంటున్న చిన్న పరిశ్రమలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ చర్య ఒకవైపు పరిశ్రమలకు కార్మికుల కొరత లేకుండా చేయటమేగాక మరోవైపు వారి వేతనభారం యజమానులకు లేకుండా చేయటం వల్ల చిన్న పరిశ్రమలు ప్రస్తుత మాంద్యం నుంచి వేగంగా బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ చర్యల ద్వారా వ్యవసాయం, పరిశ్రమలకు జరిగే మేలుతోబాటు మొత్తం పట్టణ, గ్రామీణ పేదలు, పారిశ్రామిక, వ్యవసాయ కార్మికులు, అలాగే ఇటీవల గ్రామాలకు చేరిన వలస కార్మికులతో సహా అందరికీ పని దొరికి జీవితాలకు కనీస రక్షణ లభిస్తుంది.
మోడీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీల్లోని రుణ సదుపాయాలు అమలు జరిగితే 'సరుకుల సప్లయి'కి కొంత సహాయం లభిస్తుందేమోగానీ, నేడు మన ఆర్ధిక వ్యవస్థ ఎదుర్కొంటున్న 'డిమాండ్ కొరత'కు పరిష్కారం లభించబోదు. ఇలాంటి సమయంలో మార్కెట్లో డిమాండ్ సృష్టించటానికి ఎంతో ఉపయోగపడే ఉపాథి పధకాన్ని వ్యవసాయానికి, పరిశ్రమలకు వర్తింపజేయటం ఎంతకీలకమో మనం గుర్తించాలి. నిజానికి ఇలా చేయటం ఒకవైపు చిన్న యజమానులకు సబ్సిడీలరూపంలో, మరోవైపు కార్మికులకు వేతనాల రూపంలో 'సప్లయి - డిమాండ్' రెండింటిని ఉరుకులు పెట్టించటానికి ఉభయతారకంగా పనిజేస్తుందనటంలో ఎలాంటి సందేహం అఖ్కర్లేదు. ఉపాధి హామీపథకం అత్యధిక రాష్ట్రాలలో అమలు కావటం లేదు. తక్షణమే అన్ని రాష్ట్రాలలో ఈ పథకాన్ని పునరుద్దరించటం, పేరుకు పోయిన వేతన బకాయిలను వెంటనే విడుదల చేయటం కూడా జరగాలి.
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాథి హామీ పథకాన్ని పట్టణాలకూ విస్తరించి పైన చెప్పిన విధంగా సమగ్రంగా అమలు జరపటానికి ప్రభుత్వానికి 3,4లక్షల కోట్ల కంటే ఎక్కువేమీ ఖర్చు కాదు. మన ప్రభుత్వం గతంలో కార్పొరేట్ వర్గాలకు తగ్గించిన పన్నులు, ఇచ్చిన రాయితీలతో పోలిస్తే ఇది చాలా తక్కువ మొత్తమే. ఈ నిధులు సమకూరటానికి మార్గాలున్నాయి. మొత్తం జీడీపీ (2019లో రూ.210లక్షల కోట్ల)లో 70శాతం (147లక్షల కోట్లు)వాటాను లాభాల రూపంలో జనాభాలో ఒక్కశాతం మాత్రమే ఉన్న ధనికులు దక్కించుకుంటున్నారు. మొత్తం దేశానికే కష్టమొచ్చినప్పుడు కొంత భారం మోయాల్సిన భాద్యత ఈ ధనిక కార్పొరేట్లకు ఉండదా? కాబట్టి వారిపై సంపద పన్ను విధించటం లాంటి చర్యలు తీసుకుంటే అవసరమైన వనరులు సమకూర్చు కోవటం కష్టమేమీ కాదు. కాబట్టి మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మంచి పథకాన్ని పై మార్పులతో అమలు జరిపాలి. కరోనా రూపంలో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సంక్షోభాలను అధిగమించటానికి ఇదే మంచి మార్గం.
తమ్మినేని వీరభద్రం