Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మానవ సమూహాల మధ్య ఆధిపత్య భావజాలం సృష్టిస్తున్న అరాచకం ఈనాటిది కాదు. ఆదిపత్య మానవ సమూహాలు బలహీనులపైన కొనసాగిస్తున్న అకృత్యాలు ఈ భూమ్మీద నేటికీ మనం చూస్తూనే ఉన్నాం. మనదేశంలో వైదిక ధర్మం సృష్టించిన నిచ్చన మెట్లలాంటి కులవ్యవస్థ, అభాగ్యులపైన, నిస్సహాయుల పైన, అణగారిన వర్గాలపైన ఒక్కమాటలో చెప్పాలంటే సనాతన వైధిక వాదులు 'పంచములుగా' ముద్రవేసిన దళిత జాతులపై కుల దురహంకారుల అమానవీయ అకృత్యాలను కొనసాగిస్తూనే ఉన్నది. వైధిక సనాతన వాదులు శాస్త్రం పేరుతో, కులం పేరుతో సృష్టించిన దాష్టీకాలను ప్రశ్నిస్తూ గళమెత్తిన ధిక్కార స్వరమే డక్కన్ తొలితరం దళితోద్యమ నాయకుడు భాగ్యరెడ్డి వర్మ.
1888 మే 22న హైదరాబాద్లో మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు భాగయ్య జన్మించాడు. అంటరాని కులంలో పుట్టినందుకు చిన్నతనంలోనే సమాజపు వివక్షను చూశాడు. 1900 నాటికే భారతదేశంలో అనేక సంఘ సంస్కరణ ఉద్యమాలు నడుస్తున్నాయి. పంజాబ్లో మంగురాం, కేరళలో ఐయ్యంకాళి, తమిళనాడులో అయోధ్యదాస్, బెంగాల్లో గురుచరణదాస్ ఠాకూర్ లాంటి సంఘ సంస్కర్తల ప్రభావం భాగ్యరెడ్డి జీవితాన్ని మలచింది. సామాజిక న్యాయం కోసం నినదించిన మహాత్మ జ్యోతిరావ్ ఫూలే వారసత్వాన్ని అందుకున్న భాగ్యరెడ్డి అంబేద్కర్ కన్న ముందే దళితుల కోసం గొంతెత్తారు.
దళిత బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చైతన్యం నింపడానికి 1906లో 'జెగన్ మిత్రమండలి' స్థాపించి హరిదాసులు, మాలజంగాల చేత హరికథ చెప్పించేవారు. ఈ కార్యక్రమం ప్రారంభం, ముగింపు సమయాల్లో భాగ్యరెడ్డి దళితులనుద్దేశించి ప్రసంగించేవారు. పేదరికం, అవిద్య తరతరాలుగా దళితులను అజ్ఞానపు అంధకారంలో ఉంచాయి. అందుకే వారిలో అజ్ఞానపు అంధకారాన్ని పారదోలేందుకు దళితుల కోసం హైదరాబాదులోని 'ఇసామియా బజార్'లో పాఠశాలను స్థాపించారు. చాలా స్వల్ప వ్యవధిలోనే దాతల సహకారంతో 2600 మంది పిల్లలతో 26 పాఠశాలలకు విస్తరించారు.
1917లో విజయవాడలో జరిగిన 'ప్రథమాంద్ర అది హిందూ' మహాసభకు అధ్యక్షత వహించారు. అదే సంవత్సరంలో కలకత్తాలో జరిగిన 'అఖిత బారత హిందూ సంస్కరణ సభ'లో భాగ్యరెడ్డి చేసిన ప్రసంగం గాంధీని ఆకట్టుకుంది. ఆ తర్వాత హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇసామియా బజార్లో భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన తెలుగు మీడియం పాఠశాలను సందర్శించిన గాంధీ, తెలుగుతో పాటు హిందీని కూడా పాఠ్యాంశంగా పెట్టాలని సూచించారు.
దళిత ఉపకులాల సమన్వయం కోసం 1919లో 'ఆది హిందూ సమ్మేళనాన్ని' ప్రారంభించి, దళితుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి ''మొహల్లా'' పంచాయతీ లను నెల కొల్పారు. తన సేవలకుగాను 1921లో ఏలూరులో జరిగిన ఆది ఆంధ్ర సదస్సులో ''సంఘమాన్య'' బిరుదునిచ్చి గౌరవించడాన్ని బట్టి చూస్తే భాగ్యరెడ్డి వర్మ సామాజిక సేవ ఏ స్థాయిలో గుర్తింపు పొందిందో మనమర్థం చేసుకోవచ్చు. దళిత చేతివృత్తి కళాకారుల నైపుణ్యాన్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికి 1925లో చేతివృత్తుల వస్తు ప్రదర్శన నిర్వహించారు.
కోట్లాది మంది దళితుల సమస్యలు బ్రిటిష్ ప్రభుత్వం దృష్టికి తీసుకు పోవడానికి లండన్లో జరిగే రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి అంబేద్కర్ని ప్రతినిధిగా పంపాలని ప్రతిపాదించి ఆ తీర్మానాన్ని ఆమోదింప జేశారు. దళితుల విద్యావ్యాప్తికి, జోగిని వ్యవస్థ నిర్మూలనకి వ్యసనాలు లేని సమాజం కోసం భాగ్యరెడ్డి చేసిన కృషి వారిలో మార్పును తీసుకురాగలిగింది. 1927 నుంచి 1931 వరకు జాతీయ దళిత మహాసభలకు అధ్యక్షత వహించి వేరు వేరు సందర్భాల్లో గాంధీ లాంటి నాయకులతో జాతీయ సదస్సుల వేదికలు పంచుకున్నారు భాగ్యరెడ్డి.
- కల్లోజి సుశీల్కుమార్
సెల్: 9297307307