Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోయిల్సాగర్, రాజోలిబండి, డిండి హైదరాబాద్తో పాటు, ఇంకా అనేక ప్రాజెక్టుల పరిస్థితి రాష్ట్రంలో ఇలాగే ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నామంటున్న ముఖ్యమంత్రి మాటలు చేతల్లో కనిపించడం లేదు. గడువు కాలం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా.. ఇంకా పనులు నత్తనడకనే సాగుతున్నాయి. ప్రాజెక్టులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించక పోవడం, పర్యవేక్షించకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది.
కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెబుతోంది. కానీ ఇప్పటి వరకూ ప్రాజెక్టుల వారీగా ఏయే ప్రాజెక్టుపై ఎంత ఖర్చు పెట్టారు..? ఎంత నీరందిస్తున్నారు...? వాటి వివరాలు మాత్రం వెల్లడించడం లేదు. ముఖ్యంగా కృష్ణానది జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు పరిశీలిస్తే ఇవన్నీ కొన్నేండ్ల నుంచి అనుకున్న సమయానికి పూర్తి కాకుండా పాలకుల నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమం సాగించి అధికారంలోకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం వీటిపైన వివక్షత చూపడం సమంజసం కాదు. ఈ ప్రాజెక్టులన్నీ కరువు పీడిత జిల్లాలైన మహబూబ్నగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మంజిల్లాలకు సాగు, తాగునీరందించేవి. వీటితో పాటు, హైదరాబాద్ జంట నగరాలకు సైతం తాగునీరందిస్తూ ప్రజల దాహార్తిని తీర్చేవి. తెలంగాణ సమగ్రాభివృద్ధి కావాలంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయబడ్డ ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యతనిచ్చి, అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తి చేయడానికి తగు చర్యలు చేపట్టాలి.
ప్రాజెక్టుల వివరాలు: కృష్ణా నికరజలాలను తెలంగాణ రాష్ట్రం 251.34టీఎంసీలు వినియోగించుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 625.58 టీఎంసీలు వాడుకుటోంది. మిగులు జలాలను ఏ రాష్ట్రం ఎంత వాడుకోవాలన్న విషయంలో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఆ తీర్పు కూడా చాలాకాలంగా పెండింగ్లో ఉంది. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అనుమతు ల్లేకుండా శ్రీశైలం నుంచి నీళ్లు తరలించడానికి పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచడం, ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు తీసుకెళ్లాలని ప్రయత్నం చేయడం సరైన నిర్ణయం కాదు.
పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి అక్రమ నీటి వాడకం
గతంలో శ్రీశైలం నుంచి 11,500 క్యూసెక్కుల నీరు పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా తమిళనాడుకు తాగునీరు, ఆంధ్రా ప్రాంతానికి సాగునీటికి వినియోగించుకున్నారు. రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో 2004 సెప్టెంబర్ 28న జీవో107 తీసుకొచ్చి శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం డెడ్స్టోరేజీ నిల్వ 834 అడుగుల నుంచి 854 అడుగులకు పెంచి 2006 జనవరి 4న జీవో 3ను తీసుకొచ్చి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ను 44వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచి నీరు తరలిస్తున్నారు. అప్పుడు తెలంగాణ ప్రజలు, రాజకీయపక్షాలు ఆందోళన చేసినా.. పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని శాసనసభ ఆమోదం కూడా పొందారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వమూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని జీవో 203 విడుదల చేసి 44వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని మరింత పెంచి తీసుకెళ్లడానికి పూనుకుంటున్నారు. ఈ జీవో అమలైతే తెలంగాణ ప్రాంతంలో నున్న నాలుగైదు జిల్లాలకు తాగు, సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఏర్పడే ప్రమాదముంది. దీంతో పాటు, రాజశేఖర్రెడ్డి ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో 107ను సవరిస్తూ శ్రీశైలం ప్రాజెక్టు డెడ్స్టోరేజీ నిల్వ 854 అడుగుల నుంచి 803 అడుగులకు తగ్గిస్తూ ప్రాజెక్టు లోతట్టు మధ్యలో సంగమేశ్వరం వద్ద నుంచి పోతిరెడ్డిపాడుకు రోజుకు 3టీఎంసీలను ఎత్తిపోయడానికి లిఫ్ట్ పథకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పథకం అమలు జరిగితే శ్రీశైలం డెడ్స్టోరేజీ 772అడుగులకు పడిపోతోంది. దీని వల్ల శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఉన్న నాగార్జునసాగర్ కుడి, ఎడమకాల్వలకు నీటి లభ్యత పూర్తిగా తగ్గుతోంది. దీంతో తెలంగాణ మిగులు జలాల ఆధారంగా ఉన్న ప్రాజెక్టులకు, నిర్మించబోయే ప్రాజెక్టులకు నీటి కొరత తీవ్రంగా ఏర్పడనుంది. అందుకని ఈ జీవోని తక్షణమే విరమించుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సమస్యను పరిష్కరించాలి.
ఉభయ రాష్ట్రాల్లో కొత్తగా కృష్ణానదిపై ప్రాజెక్టుల నిర్మాణం జరగాలంటే కృష్ణారివర్బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పని సరిగా ఉండాలి. అంతేకాకుండా కృష్ణాజలాల వాడకం విషయంలో బ్రిజేష్కుమార్ తీర్పు వెల్లడించాల్సి ఉంది. అవేమీ లేకుండా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 203ను తీసుకొచ్చి నీటిని తరలించడానికి పూనుకోవడం దుర్మార్గమైన చర్య.
ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎమ్మార్పీ)
ఈ ప్రాజెక్టుకు 36టీఎంసీల నీటిని కేటాయించారు. లిఫ్టులతో పాటు, వరదకాల్వ, ఉదయసముద్రం కలుపుకొని మొత్తం ఆయకట్టు 4 లక్షలా 11 వేల 572 ఎకరాలకు నీరందించాలి. లిఫ్టుల ద్వారా నీరందించడానికి ముందుగా రూ.8900 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం లిఫ్టులు, వరదకాల్వ ద్వారా సుమారు 2.50లక్షల ఎకరాలకు సాగునీరందించడంతో పాటు, హైదరాబాద్ జంట నగరాలకు మంచినీరందిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో శ్రీశైలం నుంచి 46 కిలోమీటర్ల టన్నెల్ తవ్వి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకురావడానికి రూ.2 వేల కోట్లు మంజూరు చేశారు. ఇంకా 10-11కిలోమీటర్లు టన్నెల్ తీయాల్సి ఉంది. రిజర్వాయర్లు, కాల్వలకు భూసేకరణ జరగాలి. ఇప్పటి వరకూ 1200-1300 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇంకా సుమారు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తే తప్ప టన్నెల్, ఇతర పనులు పూర్తయి శ్రీశైలం నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకోవడానికి అవకాశముంటోంది. అలాగే ఉదయసముద్రం ప్రాజెక్టుకు రూ.700 కోట్లు కేటాయించారు. 70-80శాతం పనులు పూర్తయ్యాయి. మరో రూ.300-400కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవుతాయి. కానీ ఈ ప్రాజెక్టుకి గత సంవత్సరం బడ్జెట్లో రూ.3 కోట్లు, ఈ సంవత్సరం బడ్జెట్లో రూ.3 కోట్లు మొక్కుబడిగా కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఇదే ప్రాజెక్టు విషయంలో గతంలో అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ వేసుకొని ఇక్కడనే కూర్చొని ఒకట్రెండు సంవత్సరాల్లోనే ప్రాజెక్టును పూర్తి చేయిస్తామని చెప్పారు. కానీ ఏండ్లు గడుస్తున్నా.. పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే ఉన్నాయి.
డిండి నాగలాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్టు
2015 జూన్ 12న ముఖ్యమంత్రి కేసీఆర్ డిండి నాగలాపూర్ ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.6,193 కోట్లు. ప్రధాన కాల్వ 92 కిలోమీటర్ల పొడవు. ఇప్పటి వరకూ ఖర్చు పెట్టింది రూ.1073 కోట్లు. నల్లగొండ జిల్లాలో 3 లక్షలా 9వేల 950ఎకరాలు, మహబూబ్నగర్ జిల్లాలో 31,550 ఎకరాలు సాగవుతాయి. దీనికి గాను ఐదు రిజర్వాయర్లు నిర్మాణం చేయాలి. కాల్వలు, రిజర్వాయర్లకు నేటి వరకూ ఇంకా భూసేకరణ సరిగ్గా జరగలేదు. 2020లోనే ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటి వరకూ కేవలం 15-20శాతం పనులు మాత్రమే పూర్తి కావడం గమనార్హం. ఈ సంవత్సరం బడ్జెట్లో కేవలం రూ.50 కోట్లు కేటాయించారు. ఈ ప్రకారంగా పనులు జరిగితే ఇంకా పది సంవత్సరాలైనా పూర్తయ్యేలా లేదు.
నెట్టెంపహాడ్ ప్రాజెక్టు
జిల్లాలో ఈ ప్రాజెక్టుకు 22టీఎంసీలు కేటాయించారు. ప్రాజెక్టు వ్యయం రూ.2,331కోట్లు. ఈ ప్రాజెక్టు కింద మహబూబ్నగర్ జిల్లాలో 2లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టుకు రూ.2178 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుతం లక్షా 40వేల ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరందుతోంది. ఇంకా 60వేల ఎకరాలకు నీరందక బీడులుగా ఉన్నాయి. పంటకాల్వలు, ఫీడర్చానల్స్, ఇతర పనులు పూర్తి కాలేదు. 2015 వరకే ప్రాజెక్టుపూర్తి కావాల్సి ఉండగా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పనుల పూర్తికి రూ.300 కోట్లు అవసరముందని చెబుతున్నారు. ప్రతి ఏటా బడ్జెట్ కేటాయింపులు మాత్రం నామమాత్రంగా ఉన్నాయి. గడువుకాలం ముగిసి ఐదేళ్లయినా ఇంకా పనులు పూర్తి కాకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
బీమా ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టుకు మహబూబ్నగర్ జిల్లాలో 2004 నవంబర్ 26న అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి శంకుస్థాపన చేశారు. రెండు దశల లిఫ్టు పనులకుగాను రూ.2509కోట్లు కేటాయించారు. ఇప్పటి వరకూ రూ.2500కోట్లు ఖర్చు పెట్టారు. మొదటి దశ లిఫ్టుకు లక్షా 10వేల ఎకరాల్లో ఆయకట్టు, రెండో దశలో 92వేల ఎకరాలకు నీరందాలి. నేటివరకూ కేవలం లక్షఎకరాలకు మాత్రమే నీరందుతోంది. పంటకాల్వలు, లైనింగ్, ఫీడర్ చానళ్ల్ల నిర్మాణం జరగలేదు. చెరువులు మాత్రం నింపి వదిలేస్తున్నారు. పనులు పూర్తికాకపోవడంతో నీరంతా వృథాగా పోతోంది. పెండింగ్ పనుల పూర్తికి రూ.500కోట్లు కేటాయిస్తే పూర్తి ఆయకట్టుకు నీరందే అవకాశముంటుంది. ఏండ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టును పట్టించుకునే నాథుడే లేడు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం
ఈ ఎత్తిపోతలను 2004లో మహబూబ్నగర్ జిల్లాలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి ప్రారంభించారు. ఈ ఎత్తిపోతలకు 40టీఎంసీలు కేటాయించారు. 4.24లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రూ.4896కోట్ల వ్యయంతో మొదలుపెట్టారు. ఇప్పటి వరకూ రూ.4136కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుతం 3లక్షల ఎకరాలకు నీరందుతోంది. మిగతా లక్ష ఎకరాలకు నీరందాల్సి ఉంది. కాల్వలు, లైనింగ్, రిజర్వాయర్ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇంకా రూ.400-500కోట్లు కేటాయిస్తే మిగతా పనులు పూర్తయ్యే అవకాశముంది.
శ్రీరాంసాగర్ రెండో దశ ప్రాజెక్టు
గోదావరి జలాల నుంచి గ్రావిటీ ద్వారా 284కిలోమీటర్ల నుంచి 346కిలోమీటర్ల మూసీ వరకూ కాకతీయకాల్వ ద్వారా నీళ్ళు రావాలి. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1331 కోట్లు. ఈ ప్రాజెక్టు కింద ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,13,578, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,57,508ఎకరాలు.. మొత్తం 4.40లక్షల ఎకరాలకు నీరందాలి. కాగా ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ ఏఐబీసీ నుంచి రూ.250 కోట్లకు పైగా మంజూరు చేశారు. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టుకు రూ.1200కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా పంటకాల్వలు, ఫీడర్చానళ్లు సరిగ్గా లేవు. ఈ ప్రాజెక్టుకు మధ్యలో రెండు రిజర్వాయర్ల నిర్మాణం చేయాల్సి ఉండగా దాని ఊసే లేదు. పై నుంచి నీరు రెగ్యులర్గా వస్తుందనే గ్యారెంటీ కూడా లేదు. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం రూ.95కోట్లు మాత్రమే కేటాయించింది. దశాబ్దాలు గడుస్తున్నా.. పనులు నత్తనడకన సాగుతుండటంతో వేలాది ఎకరాల భూములు సాగుకు నోచుకోవడం లేదు. కోయిల్సాగర్, రాజోలిబండి, డిండి హైదరాబాద్తో పాటు, ఇంకా అనేక ప్రాజెక్టుల పరిస్థితి రాష్ట్రంలో ఇలాగే ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నామంటున్న ముఖ్యమంత్రి మాటలు చేతల్లో కనిపించడం లేదు. గడువు కాలం పూర్తయి ఏండ్లు గడుస్తున్నా.. ఇంకా పనులు నత్తనడకనే సాగుతున్నాయి. ప్రాజెక్టులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించక పోవడం, పర్యవేక్షించకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యతనిచ్చి మరికొన్నింటిపై చిన్నచూపు చూడటం వెనక ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి. ఇకనైనా ఈ ధోరణి మార్చుకుని తెలంగాణ సమగ్రాభివృద్ధికి అన్ని ప్రాంతాల్లోని పెండింగ్ ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యతనిచ్చి యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉంది.
జూలకంటి రంగారెడ్డి