Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాక్డౌన్ పుణ్యమానీ సాఫ్ట్వేర్ కంపెనీలు, కాల్ సెంటర్లలో పని చేసే పలువురు నిత్యావసర సరకుల రంగంలోకి మారిపోయారు. గత రెండు నెలలుగా పని చేస్తున్న కార్యాలయాలు మూతపడటంతో కొద్ది రోజుల పాటు ఇంటి వద్ద వేచి చూసిన వారు ప్రత్యామ్నాయ పనులను వెతుక్కున్నారు. ముఖ్యంగా కూరగాయలు, పండ్ల విక్రయాలు చేస్తూ తాత్కాలికంగా ఉపాధి వెతుక్కున్నారు. ఇంటి వద్ద ఉండలేక, బయటికి వస్తే పోలీసులకు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాక అదే నిత్యావసర వస్తువులను అమ్మితే బయట తిరిగేందుకు అవకాశం రావడంతో పాటు ఏమి లేని చోట ఎంతో కొంత సంపాదించుకోవచ్చనే ఆలోచనతో ఈ దిశగా వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో ప్రతి కాలనీ, బస్తీల్లో ఇలాంటి వారి సంఖ్య పెరిగిపోయింది. దూర ప్రాంతాల మార్కెట్ల నుంచి కూరగాయలు, పండ్లను వ్యాన్లు, కార్లలో వెళ్లి తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నారు. ఇంతకాలం వీధి వ్యాపారాలంటే కేవలం చదువుకోని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారు మాత్రమే చేసేవనే దగ్గర నుంచి ప్రస్తుతం నగరంలో అన్ని రకాల ఉద్యోగాలు చేసే వారు ఈ రంగంలో కనిపించడం కొత్త దశ్యం. -కొత్తూరు ప్రియకుమార్