Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెడమీద కత్తి పెట్టి ఇస్తావా చస్తావా అన్నట్టుంది ముఖ్యమంత్రి తీరు. తనకు తోచింది తక్షణమే అమలు జరగాలనే తీరు నిజాంను మరిపిస్తున్నది. పంట మార్పిడి అమలు విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపు ధోరణి చూస్తుంటే ఒకప్పుడు తెలంగాణలో వేళ్లూనుకోని పోయిన ప్యూడల్ నీలి నీడలు మళ్లీ మొలకెత్తుతున్నాయా అనిపిస్తున్నది. మేంచెప్పిన పంటే వేయాలి.. లేకుంటే రైతులకు రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలను నిలిపేస్తామని హెచ్చరిం చడం దేనికి సంకేతం? ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అమలు చేసేందుకు నిర్దిష్టమైన కాలపరిమితితో కూడిన ప్రణాళిక లేకుండా బలవంతంగా డెడ్లైన్లు విధించడం ద్వారా అసాధ్యం. 70ఏండ్ల నుంచి ఎలాంటి శాస్త్రీయ వ్యవసాయ ఉత్పత్తి విధానం లేకుండా సాగుతున్న ఈ రంగంలో మార్పులు రాత్రికి రాత్రే రావాలను కోవడం అత్యాశే అవుతుంది. 2016లో రైతుల ఆత్మహత్యల నివారణ కోసమని రాష్ట్ర ప్రభుత్వ అదేశం మేరకు పత్తి నుంచి రైతులను కంది, పెసర పంటలవైపు మళ్ళించేందుకు వ్యవసాయాధికారులు ప్రచారం నిర్వహించి వారిని పంట మార్పిడికి ప్రోత్సహించారు. కంది, పెసర పంటలను క్వింటాలుకు రూ.10,000కు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. తీరా దిగుబడి వచ్చిన తర్వాత సర్కార్ చేతులెత్తేసింది. గత్యంతరంలేక రూ.4,000 నుంచి రూ.5,000కే పంటలు అమ్ముకోవాల్సి వచ్చింది. దాంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారు. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో ఎలాంటి ప్రణాళిక, కాలపరిమితి, శాస్త్రీయమైన విధానం లేకుండా అమలు చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఆర్థికంగా ఇప్పు డున్న గడ్డు పరిస్థితుల నుంచి బయట పడేందుకు రైతు బంధు, రైతు భీమాను ఎగ్గొట్టేందుకుకే సర్కార్ నాటకమాడుతున్నదని భావిస్తున్నారు.
- ఊరగొండ మల్లేశం