Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్యాశుల్కంలో గిరీశం 'పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్' అనే హాస్యోక్తి గుర్తింది కదా! ఇప్పుడు అదే తరహాలో కండ్లజోడు లేనివాడు మనిషే కాదనే వింత రోజులు రానున్నాయట! కండ్ల డాక్టర్లు ఈ విషయాన్ని ఢంకా భజాయించి చెప్తున్నారు. కరోనా లాక్డౌన్ పుణ్యాన ఆ రోజులు మరింత త్వరగానే వచ్చేస్తున్నాయని సంబరపడుతున్నారు. ముందుచూపున్న డాక్టర్లు, కళ్లజోళ్ల షాపుల వాళ్లతో ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే...లాక్డౌన్తో విద్యార్థులు, టీచర్లు ఆన్లైన్ క్లాసులతో బిజీగా ఉన్నారు. సెల్ఫోన్లలో గంటల తరబడి క్లాసులు చూస్తూన్నందున, మెజారిటీ విద్యార్థులకు కంటిచూపు మందగిస్తున్నదని వైద్యులు చెప్తున్నారు. కండ్ల మంటలు, నిద్రలేమి, కండ్లవెంట నీరు కారడం, పుసులు కట్టడం, తలనొప్పి, మైగ్రేన్ వంటి అనేక లక్షణాలు సెల్ఫోన్లను విరివిగా వాడటం వల్ల వస్తున్నాయని అంటున్నారు. కేవలం విద్యార్థులే కాదు... లాక్డౌన్లో పనీపాటా లేకుండా వీడియో కాల్స్ చేసి ముచ్చట్లు పెట్టుకుంటున్న వారిలో కూడా ఈ తరహా లక్షణాలు పెరిగినట్టు గుర్తించారు. గతంలో 40 ఏండ్లు వస్తే కానీ, కండ్లజోడు వచ్చేది కాదు. ఈ మధ్య యూకేజీ, ఫస్ట్క్లాస్ పిల్లలకు కూడా కళ్లజోళ్లు వస్తున్న విషయం తెలిసిందే. లాక్డౌన్తో తమకు గిరాకీ పెరుగుతుందని కండ్ల డాక్టర్లు ఇప్పుడే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి మీ సంగతేంటో.... తస్మాత్ జాగ్రత్త!!
-ఎస్ఎస్ఆర్ శాస్త్రి