Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశాలన్నీ ఇప్పుడు కరోనాతో బాధపడుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి... మన గల్లీల్లోని డాక్టర్ల వరకూ అందరూ చెప్పే మాట ఒక్కటే... 'కరోనాకు మందు లేదు, ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం కనబడటం లేదు, అందువల్ల చేతులను తరచూ శుభ్రం చేసుకోండి, మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి...' అనేది వారి సూచన. దీంతోపాటు అతి ముఖ్యమైంది రోగ నిరోధక శక్తిని పెంచుకోవటం. ఇందుకోసం పండ్లు, ఫలాలు, పాలు, పెరుగు, గుడ్లు, చికెన్, మటన్ లాంటివి ఎక్కువగా తినాలంటూ పోషకాహార నిపుణులు సలహాలిస్తున్నారు. ఈ మాట సంపన్నులు, ధనికులు, మధ్య తరగతివారికి వినటానికి బాగానే ఉన్నా.. సాధారణ పేదలు, రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలు, కార్మికులకు మాత్రం ఇవన్నీ అందని ద్రాక్షలే. తినటానికి తిండే లేనప్పుడు.. వీటన్నింటినీ ఎలా కొనుగోలు చేయగలమంటూ బీదలు నిట్టూర్పులు విడుస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు, వైద్య నిపుణుల చేసిన ఓ సూచన వారికి ఎడారిలో ఒయాసిస్సులా కనిపించింది. మన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండాకాలంలో విరివిరిగా పండే పంట బత్తాయి. ఈ పండ్లలో సీ-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అంగళ్లలో చవకగా దొరికే దీన్నుంచి రసం తీసుకుని తాగితే రుచికి.. రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకేం.. హైదరాబాద్ నుంచి పల్లెటూళ్ల దాకా ఎక్కడ చూసినా బత్తాయి గాడి మాటలే. తోపుడు బండ్ల కాణ్నుంచి షాపింగ్మాల్స్ దాకా ఇప్పుడు వాడి హవా కొనసాగుతున్నది. ఫల రాజు మామిడితోపాటు ద్రాక్ష, పుచ్చ, అరటి.. ఇలా అనేక పండ్ల కంటే ఎత్తైన సింహాసనం మీద కూర్చున్న బత్తాయి... 'నేనున్నాననీ, మీకేం కాదనీ...' అంటూ జనాలకు భరోసానిస్తున్నది. అందుకే మామూలు రోజుల్లో... 'ఒహౌ బత్తాయా..? అంటూ చిన్నచూపు చూసే జనాలు, కరోనా కష్టకాలంలో ఇప్పుడు... 'అమ్మ నా బత్తాయో...' అంటూ దాన్ని కౌగిలించు కుంటున్నారు. -బి.వి.యన్.పద్మరాజు