Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిటిష్ సామాజ్య్రవాదన్ని తిరుగు బాటుతో కూల్చ ప్రయత్నించి ఉరికొయ్యను ముద్దాడిన కర్తార్సింగ్ లూదియానా జిల్లాలో సరభా గ్రామంలో 1896 మే24న సాహిబ్ కౌర్, మంగల్సింగ్ దంపతులకు జన్మించాడు. పసివయస్సులోనే తండ్రిని కోల్పోయాడు. పాఠశాల విద్యను లూధియానాలోనే పూర్తి చేసుకున్న కర్తార్ మెట్రిక్ అనంతర విద్యను ప్రస్తుత ఒరిస్సాలోని కఠక్లోని రవేన్షా కాలేజిలో తన తాత సమక్షంలో బాబాయి వద్ద ఉండి చదువుకున్నాడు. అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనే కోరికతో కుటుంబం నుంచి అంగీకారం లభించడంతో 1912 జనవరి1న అమెరికా గడ్డపై అడుగుపెట్టాడు. సాన్ప్రాన్సిస్కో ఓడరేవులో అడుగుపెట్టిన మరుక్షణమే ఇమ్మిగ్రేషన్ అధికారుల రూపంలో వివక్ష చవిచూసిన కర్తార్ అమెరికా స్వాతంత్య్రదినాన్ని అక్కడి సాధారణ పౌరులు సంబరంగా జరుపుకోవటం చూసాక ఆ స్వాతంత్య్రం సువాసనల అనుభూతి అతనిలో దేశ స్వాతంత్య్ర కోరికలను తట్టిలేపింది.
అమెరికా పశ్చిమతీరం వెంబడి భారతీయ వలస కార్మికుల వెతలు గదర్పార్టీ రూపంలో సంఘటితమయ్యాక దాంతో కర్తార్ జీవితం పెనవేసుకుపోయింది. తనకు ఇష్టమైన బర్కిలీ యూనివర్సిటీ కెమిస్ట్రీ చదువులు రెండవ ప్రాధాన్యతగా మారిపోయి, గదర్ పార్టీ పత్రిక మొదటి ప్రాధ్యన్యం అయ్యింది. గదర్ పత్రిక పంజాబీ ఎడిషన్తో పాటు పత్రికలను వివిధ ప్రాంతాలకు, దేశాలకు పంపించే పని కర్తార్ బాధ్యతగా ఉండేది. గదర్ ఉర్ధూ ఎడిషన్కు కూడా తోడ్పడుతూ ఉండేవాడు. విరామమెరుగని తన పనిని చూసి తోటి కార్యకర్తలు కర్తార్సింగ్ను ''హ్యూమన్ డైనమో''అని పిలచేవారు మెచ్చుకోలుతో... తనకు ఇంటి నుంచి ఖర్చులకు పంపే మొత్తాన్ని కూడా పత్రిక కోసమే ఖర్చు చేసేవాడు. గదర్పార్టీ కార్యాలయం 'యుగంతర్ ఆశ్రమ'మే ఆవాసం అయ్యింది. తన జీవితమే ''గదర్''గా మారిపోయింది. సాయుధ తిరుగుబాటుతో ఇండియాలో బ్రిటిష్ రాజ్యాన్ని కూల్చి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాడు చెయ్యటమే కాక ఏంతో ఉన్నతమైన ఆశయాలను గదర్ పార్టీ ప్రకటించింది. ''కామగటమారు'' ఘటన, మొదటి ప్రపంచ యుద్దంలో ఇంగ్లాండ్ తనమునకలై ఉండటం గదర్ పార్టీ తిరుగుబాటును వేగిరపర్చింది. వివిధ ఓడల్లో ఇండియాకు చేరిన గదర్ విప్లవకారులకు తీవ్ర నిర్బంధం ఎదురుకావటమే కాక వారు ఊహించినదానికీ ఇండియాలో పరిస్థితులకూ మధ్య వ్యత్యాసం ప్రణాళికలను మార్చుకునేట్లు చేసింది. తీవ్ర నిర్బంధంతో గదర్ విప్లవకారులు చెల్లాచెదురయ్యారు. పార్టీ ఆశలు సన్నగిల్లిన నేపథ్యంలో 18ఏండ్ల వయస్సులో నిరాశని దరిచేరనీయక పార్టీ భాధ్యతలన్ని తన భుజాలపైకి ఎత్తుకున్నాడు కర్తార్సింగ్.
లూధియానా పాఠశాల విద్యార్ధులను ఆర్గనైజ్ చేసి వారి ఆధారంగా గదర్ సాహిత్యాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్ళి చైతన్యం కల్పించే పనికి పూనుకున్నాడు. విష్టుగణేష్ పింగలే కూడా తోడయ్యాడు. బెంగాల్ విప్లవ సంస్థలతో సంబంధాలు నెరిపి రష్బిహారీ బోస్, సచ్చింద్ర సన్యాల్ల నమ్మకాన్ని పొందటమే కాక వీరు జరపబోయే తిరుగుబాటుకు రష్బిహారీ బోస్ లాహౌర్ వచ్చి నిమగమయ్యాడు. మొదట అమృత్సర్ని తర్వాత కాలంలో లాహౌర్ని కేంద్రంగా చేసుకుని పార్టీని విస్తరింపజేశాడు. కర్తార్సింగ్ ధైర్యసహాసాలు మిగతా వారిని విస్మయానికి గురిచేసేవి. నేరుగా పోలీసు అధికారులు, మిలిటరీ అధికారుల వద్దకు వెళ్ళి ''మీరెందుకు ఈ భానిసత్వాన్ని వదులుకోకూడదు? ఎంతకాలం ఈ భానిసత్వం'' అనేవాడు. అలాంటి ధైర్యసాహాసాలతోనే లాహౌర్, ఫిరోజ్పూర్. మీరట్, అంబాలా వంటి కంటోన్మెంట్లను తన విధేయతలోకి తెచ్చుకోగలిగాడు. ప్రభుత్వ ఆయుధాగారా లను, ట్రెజరీలను కొల్లగొట్టేందుకు ప్రణాళికలు కూడా రచించాడు. 1915 ఫిబ్రవరి 21నాడు అన్ని కంటోన్మెంట్లలో ఏకకాలంలో తిరుగుబాటుకు ప్రణాళికలు వేశాడు. ఒక్కొక్కరు ఒక్కో కంటోన్మెంట్ బాధ్యతలు కూడా తీసుకున్నారు. కానీ అప్పటికే బ్రిటిష్ ప్రభుత్వం గదర్ పార్టీలో గుడాచారిని ప్రవేశపెట్టడంతో వారి ప్రణాళికలు విఫలమయ్యాయి. 1857 తరహా తిరుగుబాటు ప్రణాళిక విఫలం చేయగలిగింది కానీ ప్రభుత్వం కంపించి పోయింది. లాహౌర్తో పాటు ఇతర కంటోన్మెంట్లోని సైనికులతో ఉదయమే పరేడ్ నిర్వహించి, ఆయుధాలను లాగేసుకుని నాయకులుగా ఉన్న వారిని తీవ్రంగా శిక్షించింది. అనేక మందిని సైన్యం నుంచి డిస్మిస్ చేసింది. విప్లవకారులను పట్టకోవటానికి ప్రభుత్వం ఒడపోసింది. అయినా జాగ్రత్తలు తీసుకుని లాహౌర్ మీదుగా, పెషావర్ మీదుగా ప్రయానించి ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని మిచిని గ్రామంలో షెల్టర్ తీసుకున్నాడు. ఇక్కడ ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఇద్దరు తోటి విప్లవకారులతో పట్టుబడ్డాడు. కర్తార్తో పాటు మరో 6మందికి బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. దేశ ద్రోహం, ప్రభుత్వంపై తిరుగుబాటు లాంటి 12 కేసులు విచారించబడ్డాయి. కర్తార్ సింగ్ పిన్న వయస్సు దృష్టిలో పెట్టుకుని ఉరి శిక్ష తగ్గించాలని గవర్నర్ న్యాయసలహాలోని భారతీయ ఉన్నత న్యాయాధికారులు కూడా గవర్నర్ని కోరారు. కానీ గవర్నర్ ఉన్నత న్యాయస్థానాలకు అప్పీల్ చేయకుండా ఉత్తర్వులు ఇచ్చాడు. కోర్టు కర్తార్సింగ్ని అత్యంత ప్రమాదకారిగా ప్రకటించింది. గదర్పార్టీ అధ్యక్షుడు సోహాన్సింగ్ గురించి రెండు పేజీలు మాతమ్రే పేర్కొనగా కర్తార్ గురించి మాత్రం 7పేజీలు వ్యాక్యానించింది. విచారణ సమయంలో న్యాయమూర్తి ''ఏం చేశావో, దానికి ఫలితం ఎలా ఉంటుందో తెలుసా'' అని అడగగా... ''మా ప్రతయ్నం విఫలమైంది కాబట్టి నువ్వక్కడ కూర్చోని మాట్లాడుతున్నావు. మీరు చేయగలిగింది చంపటమే కదా'' అని అపహస్యం చేశాడు కర్తార్. ఉరి తియ్యటానికి కొద్ది రోజుల ముందు జైళ్ళో తన గదిలో ''ఒక విప్లవకారుడి త్యాగం ఎన్నాటికీ వృధా కాదు'' అన్న కర్తార్ మాటలకు గదర్ అధ్యక్షుడైన సోహాన్సింగ్ భాక్నా... ''ఎందుకు కాదు కర్తార్?' అని అడగగా.. నేడు కాక పోతే రేపు, రేపు కాక పోతే మరోనాడు విప్లవం వర్ధిల్లితీరుతుంది'' అంటూ కర్తార్ సమాధానం ఇచ్చాడు. అలా లాహౌర్ జైళ్ళో 1915 నవంబర్ 16న ఉరి తీసి చంపబడ్డాడు. అందుకే మరో భారత విప్లవ యువకిశోరం భగత్సింగ్ కర్తార్సింగ్ని తన గురువుగా ప్రకటించుకున్నాడు. అన్ని కాలాల్లో తనతో పాటు కర్తార్సింగ్ ఫొటోని ఉంచుకునేవాడు. కర్తార్సింగ్ జీవితానికి, భగత్సింగ్ జీవితానికి అనేక సారుప్యతలు చూస్తాం. ఆయనకిదే నివాళి.
కాడిగల్ల భాస్కర్
సెల్: 9491118822