Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ మహమ్మారి మన సామూహిక జీవనంలోని అత్యంత తీవ్రమైన సమస్యలనూ, దాని ప్రధాన వైరుధ్యాలనూ బట్టబయలు చేసింది. ఎంత పెద్ద మొత్తంలో డబ్బుపెట్టినా కొనలేని ఎన్నోవస్తువులు ప్రపంచంలో ఉన్నాయనీ, ''మార్కెట్ అదృశ్య హస్తం'' మీద ఆధారపడి పరిష్కరించలేని అత్యంత కష్టతరమైన సమస్యలెన్నో ఉన్నాయనీ, జనానికి 'హఠాత్తుగా' తెలిసివస్తున్నది. అంతే కాదు, ఆ సమస్యలను మనం ఒంటరిగా పరిష్కరించలేమని కూడా తెలిసివస్తున్నది.
మన ప్రపంచమంతా ఒకటేననీ, దాన్ని రక్షించడానికి అందరమూ కలిసి పని చేయవలసిందేననీ తెలిసి వస్తున్నది. క్వారంటైన్లూ, కలవకుండా ఉండటాలూ ఎంత ముఖ్యమైనప్పటికీ, ఈ మహావిపత్తును ఓడించాలంటే మనందరమూ కలిసి, ప్రపంచమంతా ఒకటిగా, ఉమ్మడిగా పని చేయవలసిందేననీ తెలిసివస్తున్నది.
యువజనుల సంస్కృతిలో పరస్పర సహాయం నిత్యకృత్యమైపోయింది. ఒకప్పుడు వామపక్ష శిబిరాల్లో మాత్రమే ఉండిన పరస్పర సహాయం ఇవాళ విస్తృత ప్రజాసమూహాల్లో కనబడుతున్నది. ప్రజల జీవితాల్లో నిన్నటివరకూ ప్రధాన స్వభావంగా ఉండిన వ్యక్తివాదం ఇవాళ ఇంకెంతమాత్రమూ గతంలో కనబడినంత పవిత్రంగా కనబడడం లేదు.
మహా మాల్లన్నీ ఖాళీ అయిపోయాయి. సరుకులు కొంటూ కాలం గడపడం అనేది లేకుండా వాస్తవంగా జీవితాలు గడపవచ్చునని మనం హఠాత్తుగా గుర్తించడం మొదలుపెట్టాం. మార్కెట్లోకి వచ్చిన కొత్త కారు కొనడం కోసమే జీవించడమనేది ఏమంత గొప్ప విషయం కాదనీ, బహుశా తెలివితక్కువ తనమనీ తెలిసివస్తున్నది. మొట్టమొదటిసారిగా కోట్లాది మంది మనుషులు డబ్బుకూ, ఘనత వహించిన బ్రాండ్లకూ, అత్యాధునిక జీవనశైలికీ భిన్నమైన సంగతుల గురించి తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించారు. తమ జీవితాలను పోటీలేని ప్రపంచంలో, సంఘీభావం విలసిల్లే ప్రపంచంలో సాగించగల అవకాశాల గురించి ఆలోచించడం ప్రారంభించారు.
ఇవాళ ప్రపంచమంతటా ఒక దృశ్యం స్పష్టంగా బైటపడుతున్నది. అదేమంటే ఎక్కడైతే ప్రభుత్వరంగం బలహీనంగా ఉన్నదో, ఎక్కడైతే రాజ్యం సామాజిక ప్రయోజనాల కోసం కాకుండా ఒక అత్యల్ప సంఖ్యాక వ్యాపార, అధికార ప్రయోజనాల కోసం పనిచేస్తున్నదో, అక్కడ అతిఎక్కువ మంది జీవితాలను వైరస్ బలిగొంటున్నది. ఇప్పుడు కూడా, పెట్టుబడి యజమానులు 'ప్రపంచ జనాభాలో సగానికి ఈ అంటువ్యాధి అంటినా సరే' అని సిద్ధంగా ఉన్నారు గాని, తమ విదేశీ ఆర్థిక స్థావరాల మీద నిషేధం విధించడానికి గానీ, తమ సొంత ఖర్చులలో ఒక పెద్ద భాగాన్ని ప్రజా అవసరాలు తీర్చడానికి మళ్లించడానికి గానీ సిద్ధంగా లేరు. కాని వీళ్లు తమ సంపదలో కొంచెమైనా పంచుకునేలా ఒత్తిడి తేవడం అవసరమని అశేష ప్రజానీకం అర్థం చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో రాజ్యపు నిష్క్రియనూ, తాత్సారాన్నీ మనం ఎప్పటికీ క్షమించలేం.
బహుశా ఇక్కడ ప్రధాన విషయం, ఈ సందర్భంలో వైరస్కు వ్యతిరేక పోరాటంలోని అన్ని విజయాలూ, అన్ని నూతన ఆవిష్కరణలూ, వ్యాక్సిన్ సృష్టించడానికీ ఉన్న అన్ని రకాల మార్గాలూ, తదనంతర చర్యలూ, వ్యాక్సిన్, దాన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానమూ అన్నీ కూడ మానవాళి అంతటికీ చెందినవిగా గుర్తించాలి. ఎటువంటి ధర లేకుండా, ఎటువంటి పరిమితులు లేకుండా మానవాళి అంతటితో పంచుకోవాలి. ఈ వ్యాక్సిన్ను ఎవరు ఎక్కడ సృష్టించినప్పటికీ దాని మీద ప్రయివేటు మేధో హక్కుల ఆంక్షలు ఉండగూడదు.
తళుకు బెళుకుల తారలకూ ఫుట్బాల్ క్రీడాకారులకూ మీరు నెలకు లక్షల యూరోలు ముట్టజెపుతారు. జీవ శాస్త్రవేత్తలకు నెలకు రెండు వేల యూరోలివ్వడానికి గింజుకుంటారు. ఇప్పుడేమో మీకో వ్యాక్సిన్ కావాలని మా దగ్గరికి వచ్చారా? వెళ్లండి ఆ తారల దగ్గరికే. వాళ్లు మీకోసం ఒక వ్యాక్సిన్ తయారు చేస్తారేమో చూడండి' అని ఒక శాస్త్రవేత్త అన్నాడట. తారలు, మార్కెట్ డిరైవేటివ్లు, బ్రాండ్లు, సరికొత్త వేలంవెర్రి మోజులు, అతి ప్రదర్శనలు వంటి ఎన్నో ప్రేరణా వస్తువుల తయారీ ద్వారా తన మనుగడ కొనసాగించుకుంటున్న ఇటీవలి పెట్టుబడిదారీ విధానపు ప్రపంచం, వైరస్ వంటి సమస్యను అడ్డుకోవడానికి గానీ, పరిష్కరించడానికి గానీ తనకు శక్తి సామర్థ్యాలు లేవని రుజువు చేసుకున్నది. ఈ ప్రపంచాన్ని మార్చకతప్పదు. ఈ మహమ్మారి దాడి చేసిన సందర్భంలో గత ఇరవై ఏండ్లలో రెండో పెద్ద ప్రపంచస్థాయి ఆర్థిక సంక్షోభం ప్రారంభం కాబోతుంది. అది కూడా ఈ ఫలితాన్నే పరోక్షంగా సూచించింది. ఇప్పుడు మహమ్మారి దాన్నే ప్రత్యక్షంగా సూచిస్తున్నది.
ముగింపుగా చెప్పాలంటే, సంఘీభావం కోసం, న్యాయం కోసం, అంతర్జాతీయత కోసం వెలువడుతున్న ఆకాంక్షలన్నీ ఒక కొత్త సమాజ ఆవిర్భావపు తొలిసూచనలు. ఈ కొత్త సమాజం ఆవిర్భావం కోసం రెండు శతాబ్దాలుగా పెనుగులాడుతున్నది. అనేక హింసలు భరించింది. అనేక వైరుధ్యాల గుండా పయనించింది. ఎంతో నెత్తురూ చెమటా కార్చింది. జన్మనెత్తడానికి రెండు శతాబ్దాలుగా ప్రయత్నిస్తున్నది.
నూటయాభై ఏండ్ల కింద మార్క్స్, ఎంగెల్స్లు దాన్ని 'స్వేచ్ఛా ప్రపంచం' అని పిలిచారు. దాన్ని కమ్యూనిజం అంటారు. దాని అసలు పేరు అదే. దాని సారాంశంలో ఉన్నవి మూడు అంశాలు.. సంఘీభావం, న్యాయం, అంతర్జాతీయత. వాటితో పాటు మరొకఅంశం ఉంది. అది స్వేచ్ఛ. చారిత్రక అభివృద్ధి నియమాలను తెలుసుకునే స్వేచ్ఛ. ఆ సూత్రాలకు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చడానికి స్వేచ్ఛ.
ప్రపంచాన్ని మార్చడానికిదే సమయం. రేపు అని కూచుంటే చాలా ఆలస్యమైపోవచ్చు. ఇవాళే మనం కచ్చితంగా స్థిరంగా వామపక్షం వైపు కదలకపోతే, మన మీద రేపు దిగబోయేది ఫాసిజం అనే మహా గత్తర. అది కరోనా వైరస్ మహమ్మారి కన్న మరింత భయంకరమైనది. మళ్లీ ఒకసారి ప్రపంచాన్ని కమ్యూనిజం అనే భూతం ఆవహిస్తున్నది!
అనువాదం :ఎన్.వేణుగోపాల్
అలెక్సాంద్ర్
బుజ్గాలిన్