Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక విపత్తును కూడా రాజకీయ ప్రయోజనానికి వాడుకోవడం గురించి నోమిక్లిన్ షాక్ డాక్ట్రిన్ అన్న పుస్తకం 2008లోనే రాశారు. డిజాస్టర్ క్యాపిటలిజం అన్న పదం అందులో ఆమె ఉపయోగించారు. మోడీత్వ విన్యాసాలు బీజేపీ బడాయిలు అక్షరా లా అందుకు పర్యాయ పదాల్లా ఉన్నాయి. కరోనా సమరంలో ఘోరంగా విఫలమై అమెరికాకు మహావిషాదం తెచ్చిపెట్టిన అధ్యక్షుడు ట్రంప్కు వంతపాడటం ఇందులో కొసమెరుపు.
భారతదేశం మరీ ముఖ్యంగా పేద భారతం ఎదుర్కొం టున్న కరోనా కష్టాలకూ ప్రధాని నరేంద్ర మోడీ ఆత్మనిర్భరత ప్రవచనాల ప్యాకేజికి ఏమైనా సంబంధం ఉందా? పోనీ ఆ ప్రవచనాలకు తర్వాత ఆర్థిక మంత్రి ప్యాకేజీల పేరిట వరుసబెట్టి చేసిన సుదీర్ఘ ప్రకటనలకూ పొంతన ఏమైనా ఉందా? ప్రభుత్వ ఖజానాలోంచి పైసా తీయకుండా తక్షణ ప్రత్యక్ష సహాయం ప్రసక్తిలేకుండా ప్యాకేజీ ప్రచారాలకు అర్థమేమైనా ఉందా? రోజుల తరబడి వినిపించిన విధాన ప్రకటనల తర్వాత దేశంలో ఏ తరగతికైనా ఎంత సహాయం ఎప్పుడు ఏ విధంగా అందుతుందో అంతుపట్టిందా? ఈ ప్రశ్నలన్నిటికీ సగటు భారతీయుడిని ఎవరిని అడిగినా తల అడ్డంగా వూపేస్తారు.
ప్రచారక్ ప్రధాని ప్రకటించిన ప్యాకేజీ వాస్తవానికి టాకేజీ మాత్రమేనని అందరికీ అర్థమై పోయింది. ప్రతిదానికి ఒక టాగ్లైన్, ఒక కాయినింగ్ ప్రచార ప్రక్రియకు ప్రాణం. స్వచ్ఛభారత్, శ్రేష్టభారత్, మేకిన్ ఇండియా, వంటి పదబంధాలతో కొత్త సీసాలో పాతసారా కుమ్మరించడం ఆయనకు బాగా అలవాటై పోయింది. సమయం సందర్భం చూడని సూక్తులు సంఘపరివార్ ప్రతినిధిగా దానికి నాలుగు శ్లోకాలు ఇది మోడీ వరవడి. వేల సంవత్సరాల భారతదేశ ఘన వారసత్వం హిందూత్వ వాదుల స్వంతమైనట్టు చెప్పుకోవడం అందులోనూ తన ఆరేండ్ల పాలనతో జోడించి ఆత్మస్తుతి చేసుకోవడం దీనికి అదనం. ఈ పరవశంలో సమయం సందర్భం కూడా చూడని ప్రచార ప్రవృత్తి ప్రధానిమోడీ ప్రత్యేకత. ప్రస్తుత ప్రహసనం దానికి ప్రస్టుటమైన ఉదాహరణ.
కరోనా ముట్టడిలో క్వాంటమ్ జంపు కబుర్లా?
ఇప్పుడు సందర్భం కరోనా నివారణ, దాన్ని అరికట్టే పేరిట విధించిన లాక్డౌన్లతో ఏకపక్ష చర్యలతో ఊహించని సమస్యల పాలైన కోట్లాది భారతీయులకు ఊతం ఇవ్వడం. ఉపశమనం కల్పించడం. ఈ సమయంలో ఆత్మ నిర్భరత పేరిట అనర్గళ ప్రబోధం చేస్తే ఉపయోగమేమిటి? ఇంతకూ నిర్భరత అంటే ఆధారపడటం. ఆత్మ అంటే తనపై తానే. స్వాతంత్రం వచ్చిన నాటినుంచి మనం చెప్పుకుంటున్న స్వావలంబన స్వయం పోషకత్వ సాధన తప్ప ఇది మరొకటి కాదు. కాని అదే చెబితే మోడీజీ గొప్ప ఏముంటుంది? కాబట్టే ఆత్మ నిర్భరత అన్న కొత్త పద సృష్టి. పట్టాలపై మృత్యువుపాలైన, రోడ్లమీద నడవలేక అసువులు బాసిన, ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయిన, ఊరూరా ఆకలితో ఆలమటిస్తున్న కోట్ల మంది వలస జీవులు, జీతాలు రాని పనులు లేని కార్మికులు తిండి దొరకని అబాగ్యులు, వీరిలో ఎవరికీ ఆర్థిక సహాయం గానీ, ఆహార దినుసులు గానీ అందించని అధినేత ఆత్మ నిర్భరత చెప్పడం యాదృచ్ఛికం కాదు. మేము ఎలాగూ పట్టించుకోం గనక మీరు మీ తంటాలు పడండని ప్రధాని భారతీయులకు చెబుతున్నారన్నమాట! సంక్షోబాన్ని అవకాశంగా తీసుకోవడం కరోనా తాకిడి వంటి వాటికి ఎలా వర్తిస్తుంది? కరోనా తాకిడితో తల్లడిల్లిన దేశం కాలూచేయీ కూడదీసుకుని మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించవలసిన సమయంలో క్వాంటమ్ జంప్ల గురించిన కబుర్లు చెప్పడం మరెంత అసందర్భం?
పైసాఇవ్వని పాలు పోయని ప్యాకేజీ
ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రోజువారి ప్రకటనలు నిరర్థక తతంగాలుగా మారడం యాదృచ్ఛికమేమీ కాదు. ఖజానా నుంచి నయాపైసా తీయకుండా, తక్షణ ప్రత్యక్ష సహాయం ప్రసక్తి లేకుండా ఇంత ఆర్భాటంగా ప్యాకేజీ పరంపర ప్రకటించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావచ్చు. చిన్న మధ్య తరహా పరిశ్రమలతో మొదలుపెట్టి వివిధ రంగాల వారిగా ఆమె చేసిన ప్రకటనలన్నీ గతంలో ఉన్నవీ భవిష్యత్తులో రానున్నవీ తప్ప తక్షణమైనవి కాదు. నగదుతో గడువుతో ముడివడినవీ కాదు. ఎంఎస్ఎంఈ నిర్వచనం మార్చడం లాంటివైతే శాసన ప్రక్రియ పూర్తి చేశాకే అమలులోకి వస్తాయి. టీడీఎస్ పాతికశాతం తగ్గింపు వంటివి తాత్కాలిక వాయిదాలు మాత్రమే. అత్యధిక భాగం ప్రతిపాదనలు ఎప్పుడు ఇచ్చేది చెప్పని అప్పులు. ఉదాహరణకు మూడు లక్షల కోట్ల అప్పులు అంటూ ఆర్థికమంత్రి చెబితే అందులో కేంద్రం వాటా పదివేల కోట్లనీ అది కూడా వెంటనే అమలుకు వచ్చేది కాదనీ నిపుణులు లెక్క కట్టారు. ఆ అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు భయపడుతుంటే మళ్లీ ఆ మంత్రిగారే ఊదరగొడుతున్నారు. జీతాలు రాని కార్మికులు ఉద్యోగులకు వాటిని ఫలానా తేదీలో అందిస్తామన్న హామీ ఏదీ లేదు. పీఎఫ్లో కార్మికులు కట్టిన వాటా కూడా ఎగవేయడం పరిపాటిగా మారిన దేశంలో యజమానుల వాటాను తగ్గించి అది కూడా చెల్లిస్తామని చెప్పడం ఎలాంటి రాయితీ ఎవరికి రాయితీ? చట్టాలలో మార్పులు కూడా క్వాంటమ్ జంప్లో భాగంగా చెప్పిన ప్రధాని మాటలు కార్మిక చట్టాలపై వేటుగా మారడం దేనికి నిదర్శనం? (తర్వాత దశలో సుప్రీం కోర్టు జీతాలు ఇవ్వలేకపోతే మేమెలా ఆదేశించగలమని చేతులెత్తేయడం ద్వారా న్యాయవ్యవస్థ కూడా ఎటున్నదీ చెప్పేసింది) వ్యవసాయ కార్మికులు అన్న మాటకూడా ఆర్థిక మంత్రి నోటరాకపోవడం, బడ్జెట్లో చెప్పిన పథకాలను కేటాయింపులనే అటూ ఇటూ తిప్పి చెప్పడం ఏ విధమైన క్వాంటమ్ జంప్? విదేశీ పెట్టుబడులకు మార్కెట్లకు తలుపులు బార్లా తెరిచి గనుల నుంచి గగనాల వరకూ అప్పగించిన కేంద్రం కరోనాలోనే జ్ఞానోదయమైనట్టు లోకల్ బ్రాండ్లను పెంచుకోవాలని స్వదేశీ స్మరణ ప్రారంభిస్తే విలువేమిటి? ఆ వెంటనే హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వంటివారంతా తమ తమ శాఖలలో దేశీయ బ్రాండ్లనే వాడాలని ఆఘమేఘాల మీద ఆదేశాలు ఇవ్వడం హాస్యాస్పదం. వారీ హడావుడి చేస్తున్నప్పుడే హెచ్ఎఎల్ను దెబ్బతీసి మరీ కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధవిమానాల రాక ఇందుకు నిదర్శనం. చైనా మార్కెట్టు అక్కడ పెట్టుబడులు తరలిపోతాయి గనక వాటిని భారత్కు ఆకర్షించాలనే మహత్తర వ్యూహం ఏదో ఇందులో ఉందని భ్రమ పెట్టే ప్రచారం కూడా ఇందులో భాగమే. ఇదే సమయంలో దేశంలోనే పెద్దదైన కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ జియోలోకి మూడు వారాలలో అరవై వేల కోట్ల పెట్టుబడులు రావడం, చిల్లర కొట్టును కూడా ఫేస్బుక్ వాట్సప్ ఆగ్రిగేటర్లతో అనుసంధానం చేసి పట్టుబిగించే అవకాశం అనుమతించడం తలకిందులుగా లేదూ?
అనుమానాస్పద పోకడలు
ప్రధాని ప్రసంగంలోనూ నిర్మలా సీతారామన్ ప్రకటనలలోనూ ప్రజారోగ్య రంగానికి సంబంధించిన ప్రస్తావనలే లేకపోవడం మరీ విపరీతం. సమస్యే ఆరోగ్య సవాలైనప్పుడు దాన్ని విస్మరించడం ఎలా జరిగింది? లాక్డౌన్ తర్వాత దేశంలో వైరస్ పాజిటివ్ కేసులూ మరణాలు కూడా పెరిగినా మనమేదో కరోనాను జయించేసి తదనంతర కర్తవ్యాలు నిర్దేశించుకుంటున్నట్టు బిల్డప్ ఇవ్వడం ఆత్మ వంచనే. టెస్టుల సంఖ్య చాలా పరిమితంగావున్నా ఇప్పటికే మనం పాజిటివ్లలో చైనాను దాటేశాం. మరణాల సంఖ్యలోనూ ప్రపంచ జాబితాలో చేరాం. అన్నిటికంటే ఆందోళన కరమేమంటే ఈ వైరస్ వ్యాప్తి, టెస్టులు, సోకిన వారికి అందుతున్న చికిత్స, మరణాలు, స్త్రీ పురుష వయో నిష్పత్తి వంటి వివరాలు విడుదల చేయడంలోనూ ఆంక్షలు విధించడం. మొదటి నుంచి వీటిని పర్యవేక్షిస్తున్న ఐసీఎంఆర్ను తప్పించడం. వారిపై ఒత్తిడితెచ్చి గుజరాత్ సంస్థకు కిట్లు పీపీఈల ఆర్డర్లు ఇప్పించడం వంటివి జరిగిపోయాయి. ఈ అంశాలపై సైన్స్ ఉద్యమ నాయకులతో చర్చించిన ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక మే 8న ప్రచురించిన కథనాన్ని నెట్నుంచి తొలగింప చేశారు. గుజరాత్ ఢిల్లీలలో మీడియా ప్రతినిధులపై కేసులు విధించడం నోటీసులివ్వడం కూడా ఇందులో భాగమే. చివరకు ఆరోగ్య సవాలు ముగిసి ఆర్థిక రంగమే ముఖ్యమైనట్టు ఇప్పుడు ఆరోగ్య శాఖ బ్రీఫింగ్స్ కూడా ఆపేశారు. ఇదంతా వ్యూహాత్మకంగా జరుగుతున్న వ్యవహారమే. తమ సన్నద్ధత లోపం తెలియకుండా ఆరోగ్య సదుపాయాలు లేవు కాబట్టి లాక్డౌన్ యాభై రోజులు నడిపించారు. లాక్డౌన్ విధింపులాగే సడలింపు కూడా ప్రణాళికా బద్దంగా లేకపోవడం వల్ల ఇప్పుడు కేసులు పెరుగుతున్నా పరిష్కారం లేదు. కేరళ అత్యంత జయప్రదంగా వైరస్ను అరికట్టింది. గుజరాత్ మహారాష్ట్రాలు దారుణంగా విఫలమైనాయి. కానీ ఈ వివరాలు పంచుకోవడం కేంద్రానికి ఇష్టంలేదు.
రాష్ట్రాలకు రిక్తహస్తం.. మోడీనే సమస్తం
మొత్తం మోడీ ఘనతగా చూపించే ప్రచారం ప్రసంగాలు తప్ప రాష్ట్రాల పాత్రను కనిపించకుండా చేయడం, వాటికి భాగస్వామ్యం సహాయం అందించకపోవడం ఇందులో మరీ దారుణమైన అంశం. అన్నీ ఢిల్లీ నుంచివచ్చినట్టు ఉండాలి. పీఎం కేర్స్ ఫండ్పై ఎవరి అదుపు లేదు. అంటే రాజ్యాంగ నిబంధనలతో నిమిత్తం లేకుండా మోడీజీ మొత్తం చక్రం తిప్పుతారన్న మాట. అది బీజేపీ రాజకీయ ప్రయోజనాల బాటలో ఉంటుందని అందరికీ తెలుసు. ఆత్మ నిర్భర భారత్ మంత్రాన్ని త్వరలో వచ్చే శాసనసభ ఎన్నికలలో ప్రయోగించడం ఖాయం. దీనికి తోడుగా అంతర్జాతీయంగా ఆయన హీరోగా ఉన్నాడనే మోత మోగిస్తున్నారు. ఇది మనం గర్వించాల్సిన సమయమని మోడీ స్వయంగా ప్రసంగంలో చెప్పుకున్నారు. తాజా వివరాల ప్రకారం రెండు మాసాల లాక్డౌన్ కష్టాల తర్వాత కూడా భారతదేశం కరోనా కాటుకు గురైన మొదటి పది దేశాల్లో ఒకటిగా ఉంది. ఇది చాలక కోట్ల మంది వలస కార్మికుల ఆకలి కేకలు ఆవేదనాత్మక గాథల మధ్య అగమ్యంగా మారిన అఖిల భారతం దేనికి గర్వించాలో ఆయనకే తెలియాలి. అయితే ఆ విధమైన చిత్రణ దేశ ప్రజల మెదళ్లకెక్కించడానికి పెద్ద ప్రయత్నమే జరుగుతున్నది. మీడియాలో పెద్ద భాగం అందుకు తోడ్పడుతున్నది కూడా. అందుకే ఏ నాడూ మీడియా గోష్టి జరపని మోడీ అనుకూలమైన మీడియాధిపతులతో వీడియోభేటీలు జరిపారు. ఒక విపత్తును కూడా రాజకీయ ప్రయోజనానికి వాడుకోవడం గురించి నోమిక్లిన్ షాక్ డాక్ట్రిన్ అన్న పుస్తకం 2008లోనే రాశారు. డిజాస్టర్ క్యాపిటలిజం అన్న పదం అందులో ఆమె ఉపయోగించారు. మోడీత్వ విన్యాసాలు బీజేపీ బడాయిలు అక్షరాలా అందుకు పర్యాయ పదాల్లా ఉన్నాయి. కరోనా సమరంలో ఘోరంగా విఫలమై అమెరికాకు మహావిషాదం తెచ్చిపెట్టిన అధ్యక్షుడు ట్రంప్కు వంతపాడటం ఇందులో కొసమెరుపు.
తెలకపల్లి రవి