Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూక్య హన్మంత్ ఆటోరిక్ష నడుచుడు బందయి రెండు నెల్లు అయ్యింది. కరోనా దెబ్బకి ఆటోలు, టాక్సీలు, క్యాబులు ఏవికూడా రోడ్ ఎక్కుడే లేదు. హన్మంత్ వట్టిగనే వుంటుండు. హన్మంత్ భార్య నేజి కూడా వట్టిగనే ఉంటుంది. గత అయిదారు ఏండ్ల నుంచి తెల్లారంగనే రొట్టెలు చేసుకొని, ఇంత అన్నం వండుకొని ఇద్దరు ఇంట్ల కెయి బయిలెల్లెటోళ్ళు. నేజిని లేబర్ అడ్డా కాడ దించి హన్మంత్ ఆటోని రోడ్ మీదికి తీసుక పోయేటోడు. రోజుకి హన్మంత్కి రూ.800, నేజికి రూ.400 వచ్చేవి. ఖర్చులు పోనూ కనీసం రూ.800 మిగిలేవి. గా పైసలతోనే పిల్లలిద్దరిని సాదుకొంటున్నరు. ఊర్లో తండాలోనే ఉండే ముసలోళ్ళకి యిచ్చే రెండు వేల పించనుకి తోడుగా హన్మంత్ నెలకి ఓ వెయ్యి రూపాయలు పంపిస్తుండు. అక్కడ తండాలో ముసలోళ్ళు కూడా ఉన్న దానితోని మంచిగనే బతుకుతుండ్రు.
ఆటో రోడెక్కి మల్లి మూడు రోజులు అయ్యింది. హన్మంత్తో పాటు రహీం, రంగన్న అందరు ఎవ్వరి ఆటోల్ని వారే తీసుకొచ్చి లైన్లో పెట్టుకొన్నారు. ఇటు ఎండలు అటు కరోనా భయం ఎవ్వరు బైటికి రావడం లేదు. ఆటోని అడిగేవాడు లేదు. గిరాకే లేదు. మూడు రోజులకి కల్సి ముందు ఒక్క రోజు వచ్చి నన్ని పైసలు రావటం లేదు. అందరి బాధ ఒకటే ''రేపటి నుంచి తినుడెట్ల? బతుకుడు ఎట్ల? పోరగాండ్లని సాదుడు ఎట్లా? ఏం చేయాలి ఎలా బతకాలి? గింత కూడా సముజైత లేదు. ఆటో అమ్మేసి మల్లి తండాకు పోయి, ఉన్న ఎకరం భూమిలో ఎదన్న పంట ఎసుకుందా మన్న దున్నుడేట్లా? యింకనైతే మా ఊరికి కాళేశ్వరం నీళ్ళు రాలె. అత్తయి అంటున్నరు. గా ఎవుసం పనులు మరిచిపోయి ముప్పయి ఏండ్లు అయ్యింది'' అన్నాడు హన్మంత్. మరి నువ్వు ఏమి చేత్తామనుకుంటున్నావు రహీం? ''ఇంకా ఏమి చేస్తా మా బాపు జిందా ఉన్నన్ని రోజులు కటికే దుకుణం పెట్టి మటన్ అమ్మిండు . నేను ఫిర్ బి గట్లనే చేద్దామనుకుంటే ఒక్కొక్క పొట్టేలు ధర అయిదారు వేలు అయ్యింది. పైస పుట్టని కాలంలో కిలో ఏడు వందలు పెట్టి ఎవ్వరు కొని తింటారో అర్థమైత లేదు'' అన్నాడు రహీం . ఇంతలో కరీం బాయి, ఏసుపావులు ఇద్దరు అక్కడికే చేరి వాళ్ళ ఆటోలని లైన్లో పెట్టారు. గప్పుడే ఆటో కోసం ఒక్క గిరాకి వచ్చింది. లైన్లో నీదే ఉంది కదా హన్మంత్ పోయి రాపో అన్నాడు రహీం. యిడ్లో వడనో ఏదన్నా నాస్త చేస్తామన్నా ఒక్క బండి కూడా రోడ్ మీదకి రాకపాయే అన్నాడు రంగన్న. గీ కరోనా రోగం ఊల్లకి ఊల్లు పట్నాలకి పట్నాలు ముంచే తట్టే ఉన్నది. ఎనుకటికి గిట్లనే పిలక రోగం (ప్లేగు వ్యాది) వచ్చి లక్షల మందిని చంపిందట లష్కర్ సగం ఖాళీ అయ్యిందట. మా తాత ఎన్నోసార్లు చెప్పంగ ఇన్న ఆన్నాడు రంగ. భారత సర్కార్ విదేశాలలో చిక్కుక పోయిన వేలాది మందిని లక్షలు ఖర్చు పెట్టి వందేభారత్ స్కీం పెట్టి మన దేశానికి తీసుకొస్తున్నది. ఇక్కడ పుట్టిపెరిగి కాయకష్టం చేసుకుని బతికే చిన్న వ్యాపారస్తులకు, దినసరి కూలీలకు ఏమి చేస్త లేదు. ఆటో డ్రైవర్, టాక్సీ, క్యాబ్ డ్రైవర్ల కోసం ఏమి చేసే తట్టు లేదు సర్కార్. ఇంకా కొన్ని రోజులు పొతే కరోనా కంటే ఆకలి పిశాచి ఎక్కువ మందిని కబళించేలాగా ఉంది అన్నాడు కరీం. ఇలా మాట్లాడుకొంటూ బాధలన్ని చెప్పుకొంటూ ఉండంగానే ఒంటిగంట అయ్యింది. సగం రోజు గడిచినప్పటికీ ఒక్క గిరాకి రాలేదు. అటు కరోనా భయం ఇటు ఎండ దెబ్బ భయానికి మనిషి రోడ్డు మీదికే రావడం లేదు. రోడ్డు బావురుమంది. తారు రోడ్డు తుక్క తుక్క ఉడుకు తుంది. గాలికే ఊపిరి ఆడటం లేదు. రోడ్లన్ని నిర్మానుష్యం. చచ్చినా దిక్కు లేదు అనుకొంటూ బిక్క మొఖాలేసుకొని చేతిలో చిల్లి గవ్వ లేకుండానే ఎవరింటికి వాళ్లు ఎల్లిపోయారు. జి. మల్లారెడ్డి
సెల్:9440041351