Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశం ఆత్మ నిర్భరత సాధించాలంటే పాలనాపర నిర్ణయాలు ప్రధానం. ఆత్మ నిర్భరత సాధించాలని మాట్లాడు తున్నామూ అంటే మనం ఎవరి పైననో, దేనిపైననో ఆధారపడి ఉన్నాం కాబట్టి అట్టి సంకెళ్లను తెంచుకొని స్వీయ శక్తిని సాధించు కోవాలన్నమాట? మనుషులంతా ఆత్మ నిర్భరత సాధించినప్పుడే సమాజం అభేద్యమైనదిగా తయారవుతుంది. ఇది సాధించాలంటే ముందుగా పాలకులకు స్వీయ విధాన నిగ్రహం కావాలి. దేశం ఏ ఏ అంశాల్లో నైతే ఇతరులపై ఆధారపడి ఉన్నదో, ఏ ఏ అంశాల్లో తనకు తాను వెనుకబడి ఉందో వాటిని అధిగమించడమే గా ఆత్మనిర్భరత అంటే! ఉత్పాదక రంగాన్ని ఉదాహరణగా తీసుకుంటే - ఎవరైనా వచ్చి ఈ దేశంలో ఉత్పత్తి చేయడమా లేక ఈ దేశస్తులు ఈ దేశంలో ఉత్పత్తి చేయడమా ఆత్మ నిర్భరత అంటే? ఎవరిపైనా ఆధారపడకుండా మనకు మనమే నిర్మించు కోవటమన్నమాటేగా. డిఫెన్స్ రంగంలో 74శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు లకు అవకాశం ఇచ్చాం. భూమి మనది, సహజ వనరులు మనవి, శ్రామికులు మనవారు, బయటి పెట్టుబడికి పూచీకత్తు ఇచ్చే బ్యాంకులు మనవి, కానీ పెత్తనం మాత్రం విదేశీ కంపనీలది! అన్ని వనరులను వినియోగించుకుని మనల్ని కూలీలుగా మార్చిన విదేశీయుల ఆధ్వర్యంలో భారత్ ఆత్మ నిర్భరత సాధించాలని కోరటమా? అంతరిక్ష పరిశోధనలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా మనం గుర్తించి విస్తరించిన అంతరిక్ష కక్షలో మనం ఎగరడానికి అట్టి పెట్టుబడిదారులు అనుమతి ఇస్తారు, అదే మన ఆత్మ నిర్భరత అన్నమాట! దేశంలో కమ్యూనికేషన్ పునాదులను నిర్మించిన మహా సంస్థ బీఎస్ఎన్ఎల్ను వెంటాడి వేటాడి ఆధిపత్యం సాధించిన తర్వాత ఓ పది శాతం చొప్పున విదేశీయులకు అమ్ముకోవడమా ఈ దేశ ఆత్మనిర్భరత? ఇలా చెప్పుకుంటూ పోతే మనదేశ ఆత్మ నిర్భరతని తాకట్టు పెట్టిన అంశాలు చాలా ఉన్నవి.
ఐదేండ్లకోసారి అధికారం కోసం వేలానికి వచ్చే వారి అస్తిత్వ ఎత్తుగడలకు బలి కావడమే విధిగా మారిన అణగారిన వర్గాలు ఆత్మ నిర్బరత సాధించేది ఎప్పుడు? రాజ్యాంగ మనే కర్ర విడిచి చేసిన సాము వల్ల వచ్చిన ఫలితాలే కదా ఇవి? చేయూత పేరుతో చిల్లుల గొడుగులను చీకట్లో కప్పుతున్న పాలకులే ఆత్మ నిర్భరత కోసం నినాదాలివ్వటం హాస్యాస్పదం.
ఆత్మ నిర్భరత అంటే.. కషి బ్యాంక్, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్, సత్యం కంప్యూటర్స్ లాంటివి మునిగి పోయినప్పుడు పెట్టుబడులు పెట్టి కాపాడటానికి ముందు వరుసలో నిలబడిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండటం, ఎస్ బ్యాంకు లాంటివి కుప్ప కూలినప్పుడు ఆదుకోవడం కోసం ఎస్బీఐ లాంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండటం. ''అందరికీ ఖాతాలు తెరవండి'' అని ఆజ్ఞాపిస్తే పైసా లాభం లేకున్నా, పైసా డిపాజిట్ లేకుండా ఖాతాలు తెరవగల ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటేనే ఆత్మ నిర్భర భారత్ అవుతుంది. వలస కూలీలను మోసుకు పోవడానికి ఒక్క ప్రయివేట్ లారీ వాడు రాలేదు, కానీ విదేశాల్లో చిక్కుకుపోయిన వాళ్ళని ఎత్తుకు రావడానికి ఎయిర్ ఇండియా విమానాలు ఉండటమే ఆత్మ నిర్భర భారత్. 70ఏండ్ల స్వతంత్ర భారత్? ఆత్మను నిబ్బరంగా, నిర్భయంగా నిలిపిన సంస్థలు అనేకమున్నవి. వాటి స్థాపనా ప్రక్రియ చూస్తే... స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా 1954, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1955, ఎల్ఐసీ ఆఫ్ ఇండియా 1956, ఇండియన్ ఇన్టిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1956, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 1956, డీఆర్డీఓ 1958, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 1964, బీహెచ్ఈయల్ 1965, ఇస్రో 1969, ఆర్లు కంపెనీలు 1970వ దశకంలో, సీసీఎల్ 1975, ఎన్టీపీసీ 1975, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 1984, సాఫ్ట్వేర్ పార్క్ 1990. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఆర్థిక వ్యవస్థకి రక్తాన్ని సరఫరా చేసే సిరలు ధమనులుగా పని చేసి దేశం యొక్క గుండెను నిబ్బరంగా ఉంచుతున్నాయి. ఏ ఒక్క సంస్థ కూడా ఎవ్వరికీ అన్యాయం చేసిన దాఖలాలు లేవు. ప్రయివేటు రంగం ఎదగడానికి కూడా పాడి ఆవులా తమ వంతు సహకారాన్ని అందిస్తూనే ఉన్నవి. ఇలాంటి వాటిల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆహ్వానం, ఆయా రంగాల్లో విదేశీ పెట్టుబడులు పరోక్షంగా ఉన్న స్వదేశీ సంస్థల ప్రవేశాలకు అనుమతి ఏ విధంగా దేశాన్ని ఆత్మ నిర్భరతగా ఉంచగలదు?
ఈ దేశం ఇప్పుడున్న గౌరవప్రదమైన స్థానం పొందడానికి ఆనాటి పాలకుల దూరదష్టి ఎంత ఉందో ఇలా చూడండి - 1947లో మొదలై 1957లో పూర్తి గావించబడిన మహానదిపై నిర్మించబడిన హిరాకుడ్ డ్యాం నేటికీ చెక్కు చెదరకుండా వ్యవసాయ అభివద్ధిలో పాలు పంచుకుంటోంది. దీని నిర్మాణ వ్యయం కేవలం 101కోటి. 1948లో మొదలై 1963లో పూర్తి గాభావించబడిన భాక్రానంగల్ డామ్ అదే రీతిన వ్యవసాయ అభివద్ధికి ఉపకరిస్తుంది. దీని నిర్మాణ వ్యయం రెండు వందల నలభై ఐదు కోట్లు. 1955లో మొదలై 1967లో పూర్తి గాబడిన నాగార్జునసాగర్ డ్యాం బహుళార్థసాధక ప్రాజెక్టు, అనగా వ్యవసాయానికీ, విద్యుదుత్పత్తి రెంటికీ ఉపకరిస్తుంది. దీని నిర్మాణ వ్యయం 1147కోట్లు. ఇలాంటి దూరదష్టి కలిగి ఉండటమే ఆనాటి ఆత్మనిర్భరత. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్ద గానే ఉన్నది సుమా! నయా ఉదారవాద విధానాలు అవలంబించ బడిన ఈ ముప్పై ఏండ్లలో ఇలాంటి ఏ ఒక్క ప్రాజెక్టు నైనా నిర్మించామా? ఈ దేశానికి ఎన్నిక కాబడిన 14మంది ప్రధాన మంత్రుల్లో ముగ్గురు ప్రధానులు ప్రభుత్వ రంగాలను అమ్మకున్నారన్న కళంకాన్ని మోస్తున్నారు. పీవీ నరసింహారావు ఆజ్యం పోసిన ఈ ప్రయివేటు రోగానికి ఒక కాంగ్రెసు ఇద్దరు బీజేపీ ప్రధానులు గురయ్యారు!
ఆత్మ నిర్భరత కావాల్సింది
ఈ దేశం ఆత్మనిర్భరత సాధించవలసిన కీలక అంశాలు కేవలం పరిపాలనా వైఫల్యం వల్లనే వెనుకబడి ఉన్నవి. మొత్తం జనాభాలో దాదాపు 40శాతం మంది నిరక్షరాస్యులు. ఆ 60శాతంలో 90శాతం మంది యొక్క చదువుకు వారి ఉపాధికి సంబంధమే లేదు. 25కోట్లమంది వలసకూలీల్లో అత్యధికులు యువకులు అందులో అత్యధికులు నిరక్షరాస్యులు. ఈ లోపాన్ని అధిగమిం చేందుకు ఆలోచన చేయడమే ఆత్మ నిర్భరత అవుతుంది. బాగా నిర్లక్ష్యానికి గురైన మరో రంగం వైద్యరంగం. సగటున ఎనిమిది వేల మందికి ఒక డాక్టరు ఉన్నట్టుగా అంచనా. ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నా అరకొర వసతుల వల్ల ప్రజలకు వాటిపై నమ్మకం లేదు. కరోనా వస్తే మూడున్నర కోట్ల తెలంగాణ మొత్తానికి గాంధీ ఆస్పత్రి ఒక్కటే దిక్కు. రక్షణ రంగానికి 13శాతం బడ్జెట్లో కేటాయిస్తున్న కేంద్రం విద్య, వైద్యానికి ఒకశాతానికి మించి కేటాయించడం లేదు. అయితే, విద్య వైద్యం రాష్ట్ర జాబితాలో ఉన్నంత మాత్రాన వాటిని విస్మరిస్తే నిర్భర భారత్ నిర్మించడం అసాధ్యం. భారత్ని పట్టిపీడిస్తున్న మరో అంశం బాలింత మరణాలు, పౌష్టికాహారలోపం. ఏటా ఐదు లక్షలకుపైగా మరణాలు ఈ కారణం వల్ల సంభవిస్తున్నాయి. స్త్రీ, శిశు సంక్షేమశాఖ వారి అడ్వటైజ్మెంట్లలో కనిపించినంత నాణ్యత జాతి ఎదుగుదలలో ఎందుకు ఉండడం లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. హంగర్ ఇండెక్స్ సర్వే చేయగా 120దేశాల్లో భారత్ 108వ స్థానంలో ఉన్నది. ఏడు కోట్ల టన్నుల ఆహార నిల్వలు ఉన్నాయి అంటున్నప్పుడు మరి హంగర్ ఇండెక్స్ ఎందుకింత దీనంగా ఉన్నది? మానవాభివద్ధి సూచీలో 148దేశాలకు గాను 132వ స్థానంలో భారత్ ఉన్నది. స్వచ్ఛత (శానిటేషన్)లోనూ వెనుకబడే ఉన్నాం. ఇవన్నీ చిన్న చిన్నగా అనిపించవచ్చు, కానీ నాణ్యమైన మానవ వనరులను తయారు చేసే అతి ప్రధానమైనవి ఇవే. నిజమైన అభివద్ధిని ఇవి ప్రతిబింబిస్తాయి. హాప్పినెస్ ఇండెక్స్లోనూ దేశం చాలా వెనకబడి ఉన్నది. పై చదువులకు అమెరికా వెళ్ళిన యువతను ''మీరు హాప్పీగా ఉన్నారా'' అని ఆరా తీస్తే ''లేదు, మా చదువుకైన ఖర్చును ఎప్పుడెప్పుడు తీర్చాలా, దాని కోసం ఏ మార్గంలో ఉపాధి వెదుక్కోవాలా అన్న టెన్షన్ వెంటాడుతుంది'' అని సమాదానమిచ్చారట. చదువుకుంటున్న పిల్లలే ఇంత అసంతోషం గా ఉంటే వారిపైనే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులూ, అలాంటి ఆశల అవకాశాలే లేని అప్పుల రైతన్నలూ ఇంకెంతలా ఉన్నారో ఆత్మ నిర్భరతను ప్రభోదిస్తున్న వారు దష్టి పెట్టాలి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రయివేటు బడా కార్పొరేట్లను ఈ రంగాలలో పెట్టుబడి పెట్టవలసిందిగా కోరితే వారు తప్పకుండా ఆత్మ నిర్భర భారత్ కోసం పని చేసిన వారవుతారు. కానీ వారెవ్వరూ ముందుకు రారు. ఎందుకంటే ఇక్కడ లాభాలు ఉండవు. మౌలికాంశాలకు పరోక్షంగా దోహద పడే అశ్వాల్లాంటి విద్యా, వైద్య, ఆర్థిక, రక్షణ, పారిశ్రామిక వంటి కీలక రంగాల కళ్ళాలు ప్రభుత్వం చేతిలో ఉంటే దేశం ఆత్మ నిర్భరత సాధించటం సులభం.
జి. తిరుపతయ్య
సెల్: 9951300016