Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ, ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయలేదు. భారతదేశ ఆర్థిక స్వావలంబన ప్రయోజనాలకు, ఈ దేశ ప్రజల అభివద్ధి, జీవనోపాధి, సంక్షేమానికి వ్యతిరేకమైన ప్రక్షేప మార్గం ఈ ప్యాకేజీ. ప్రజావ్యతిరేకమైన ఈ మార్గం ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వం తన ప్రక్షేపమార్గాన్ని మార్చుకొని, కోట్ల సంఖ్యలో ఉన్న భారతదేశ ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఒత్తిడి పెంచే ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి.
ప్రధానమంత్రి మోడీ భారీగా ప్రకటించిన 20లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని కేంద్ర ఆర్థికమంత్రి ఐదు దఫాలుగా వివరించింది. మోడీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వాలు నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణలను దూకుడుగా వేగవంతం చేయడంతో పాటు తమ హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకొని వెళ్ళేందుకు కరోనా మహమ్మారిని, దేశ వ్యాప్త లాక్డౌన్ను ఉపయోగించు కుంటున్నాయని ఈ ప్యాకేజీ పునః స్థిరపరిచింది. కరోనాపై పోరాటం పేరుతో ఆరెస్సెస్, బీజేపీలు మైనారిటీ మతస్థులను, ముఖ్యంగా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని మత ధృవీకరణలను పదునెక్కించేందుకు లాక్డౌన్ కాలాన్ని ఉపయోగించుకున్నాయి.
సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలను తెలిపే వారిని, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారిని, ప్రజాతంత్ర హక్కులు, పౌర స్వేచ్ఛ, మైనారిటీ, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడుతున్న వారిని బీజేపీ ప్రభుత్వం దేశద్రోహ చట్టాల (ఖAూA, చీ×A) కింద నిర్బంధించి జైళ్ళలో పెడుతోంది. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న మీడియా వ్యక్తులనూ వేధిస్తూ, నేరాలను మోపుతున్నారు. అదేవిధంగా లాక్డౌన్ కాలంలో కార్మికచట్టాలను ఏకపక్షంగా మార్చివేశారు. కొన్ని బీజేపీ ప్రభుత్వాలు కార్మిక చట్టాల అమలును మూడేండ్లు నిలిపివేశాయి.
భారత రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య నియమాలను, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను పూర్తిగా కాలరాస్తూ అధికార కేంద్రీకరణను బలపర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ కాలాన్ని ఉపయోగించుకుంటుంది. నిరంకుశ రాజ్యం ఏర్పాటు లక్ష్యంగా, మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అన్నీ ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటోంది. ప్రభుత్వం, ప్రజలు, దేశం అందరూ ఏకోన్ముఖంగా ఈ మహమ్మారిని అదుపు చేసి మానవుల ప్రాణాలను కాపాడే లక్ష్యాన్ని బీజేపీ, ఆరెస్సెస్ కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తోంది.
స్వావలంబన కాదు, కానీ ఉపయుక్తం
మోడీ భారతదేశంలో స్వావలంబనను వద్ధి చేసే పేరుతో భారీ ఆర్థిక ప్యాకేజీని ముందుకు తెచ్చాడు. కానీ భారతదేశ స్వావలంబనను బలోపేతం చేయడంలో సుదూరంగా ఉన్న మోడీ 20లక్షలకోట్ల ఆర్థిక ప్యాకేజీ భారతదేశాన్ని మరింత లోబడి ఉండేట్టు చేస్తుంది. ఈ ప్రతిపాదనలు ప్రత్యక్షంగా దేశీయ, విదేశీ కార్పొరేట్లు గరిష్ట లాభాలు గడించేందుకు ప్రోత్సహిస్తున్నాయి. ఈ క్రమంలో వారు కూడా గత ఆరేండ్లుగా మోడీ ప్రభుత్వ హయాంలో మనం గమనిస్తున్న ఆశ్రిత పెట్టుబడి దారీ వ్యవస్థ నేరపూరిత స్థాయిని పెంచేందుకు మార్గాలు సష్టిస్తున్నారు.
ఆరోగ్య సౌకర్యాలు
కరోనా వైరస్ అదుపు కావాలంటే ముందుగా మన ఆరోగ్య సంరక్షణా వ్యవస్థ బలపడాలి. దేశవ్యాప్త లాక్డౌన్ కేవలం మహమ్మారిని అదుపు చేసి, ప్రాణాలను రక్షించేందుకు అవసరమైన సన్నద్ధతకు సమయాన్నిస్తుంది. డాక్టర్లు, నర్సులు ఇతర వైద్య సిబ్బందికి వ్యక్తిగత సంరక్షణా పరికరాలు సమకూర్చాల్సి ఉంది. కానీ 50రోజులు గడచిన తరువాత నేటికీ ఆ పని జరగలేదు.
ఆస్పత్రి సౌకర్యాలు
వైరస్ పాజిటివ్ వచ్చిన వారికి వైద్యం చేయాలంటే ఆస్పత్రి ప్రదేశం సౌకర్యంగా ఉండాలి. కానీ నేడు మన దేశంలో వెయ్యి మందికి కేవలం 0.8 మంది డాక్టర్లు, 0.7 ఆస్పత్రి పడకలు మాత్రమేఉన్నాయి. వైద్య సదుపాయాలు పెంచడానికి లాక్డౌన్ కాలాన్ని ఉపయోగించు కోవాల్సిన ప్రభుత్వం ఆపని చేయలేదు.
వైద్య పరీక్షలు
పెద్దఎత్తున పరీక్షలు జరిపి పాజిటివ్ కేసులను నిర్ధారించేందుకు ప్రభుత్వం లాక్డౌన్ కాలాన్ని ఉపయోగించు కోలేదు. ఈనాడు ప్రపంచంలో అతి తక్కువ పరీక్షలు నిర్వహించిన దేశంగా భారతదేశం ఉంది. 10 లక్షల జనాభాకు మనం సుమారు 1700పరీక్షలు మాత్రమే జరుపుతున్నాం. అనేక దేశాలు 10లక్షల జనాభాకు పదుల వేలల్లో పరీక్షలు జరుపుతున్నాయి. పరీక్షలు జరపడం అంటే, మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో పాజిటివ్ వచ్చిన వారిని ప్రత్యేకంగా క్వారంటైన్లో ఉంచి, వైద్యం చేయడం. కానీ అది కూడా ఇంత వరకు జరుగలేదు. లాక్డౌన్ ప్రారంభంలో మన దేశంలో 91జిల్లాల్లో 191 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నేడు 550జిల్లాల్లో ఒక లక్షకుపైగా నమోదు అయ్యాయి. మే 8 నుంచి సగటున రోజుకు 3600పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయినా ఈ మహమ్మారిని అదుపు చేయడానికి, మన సామర్థ్యాన్ని పెంచేందుకు లాక్డౌన్ కాలాన్ని ప్రభుత్వం వ్యర్థం చేసింది.
సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ పట్ల నిర్లక్ష్యం
వాస్తవం ఇలా ఉంటే, ఈ ఆర్థిక ప్యాకేజీ 'ఆరోగ్యకరమైన భారత దేశానికి' కీలకమైన సార్వత్రిక ఆరోగ్య సంరక్షణా వ్యవస్థకు కొద్ది మొత్తాన్ని మాత్రమే సమకూర్చింది. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సదుపాయాల కల్పనలో మన దేశ జీడీపీలో 1శాతం కన్నా తక్కువ ఖర్చు చేస్తుంది. ఇది ప్రస్తుత ప్యాకేజీ ద్వారా మన జీడీపీలో కనీసం 3శాతానికి పెంచాలి. కానీ మోడీ ప్రభుత్వానికి భారతదేశ పేద ప్రజలకు సహాయాన్నందించడం కన్నా తమ ఎజెండాను ముందుకు తీసుకొని వెళ్ళే ఆలోచనే ఎక్కువగా ఉంది.
ప్రజల స్థితిగతులు
మన దేశ విభజన నాటి నుంచి, పెద్ద సంఖ్యలో ప్రజలు తమ స్వగ్రామాలకు వేల కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళడం ఎన్నడూ చూడలేదు. లక్షల మంది 50రోజులుగా ఆకలితోనే నడుస్తూ, నీరసంగా ఉండి ప్రమాదాలకు గురై క్షతగాత్రులై, ప్రాణాలు పోగొట్టుకున్నారు. మోడీ ప్రభుత్వం సోదర వలస కార్మికులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని సమకూర్చడానికి తిరస్కరించింది. ఈ ఆర్థిక ప్యాకేజీ, నేడు భారతదేశ రహదారులపై గతంలో ఎన్నడూలేని మానవ విషాదం గురించి, ప్రజల్లో పెరుగుతున్న ఆకలి తీర్చే విషయం గురించి ఏ మాత్రం ఆలోచించలేదు.
నిరుద్యోగం
లాక్డౌన్ కాలంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా 14కోట్లకు పెరిగిందని 'సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ' అంచనా వేసింది. పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10మంది కార్మికుల్లో 8మంది తమ ఉపాధిని కోల్పోయారని 'అజీమ్ ప్రేమ్ జీ విశ్వవిద్యాలయం' అంచనా వేసింది. కోట్ల సంఖ్యలో దినసరి వేతన కూలీలు, చిన్న వ్యాపారస్తులు, వీధుల్లో తిరిగి అమ్ముకునే వారితో పాటు అనేక మంది నైపుణ్య కార్మికులు, మీడియా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోతే, కొందరు వేతనాల్లో కోత విధింపునకు తలొగ్గారు.
సీపీఎం డిమాండ్లు
ఈ సందర్భంగా ప్రజలు బతకడానికి అవసరమైన డబ్బును పన్ను చెల్లింపు పరిధిలోకిరాని ప్రతి కుటుంబానికి నెలకు రూ.7500 ప్రత్యక్ష నగదు బదిలీ మూడు నెలల పాటు చేయాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేస్తోంది. ఆకలి, పౌష్టికాహారలోపం నివారణకు, అవసరమైన వారందరికీ కేంద్ర గోదాముల్లో నిల్వఉన్న 77మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల నుంచి ప్రతి వ్యక్తికి నెలకు 10కేజీల చొప్పున ఆరు నెలలు ఉచితంగా ఇవ్వాలి. వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యాలు కల్పించాలి.
ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ
ఆర్థిక ఉద్దీపన అంటే, ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన బడ్జెట్ ఖర్చులతో పాటు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. మొత్తం ప్యాకేజీలో ఇంతకు ముందే ప్రకటించబడిన పథకాలున్నాయి. దీనిలో బ్యాంక్లు, ఆర్థిక వ్యవస్థల ద్వారా రుణ సౌకర్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు కానీ, ప్రభుత్వం ప్రత్యక్షంగా ఖర్చు చేసే ఏ చర్యలు చేపట్టలేదు.
ఈ సంవత్సరం పార్లమెంటు ఆమోదించిన ఖర్చు బడ్జెట్ 30,42,230 కోట్లు. ఉద్దీపన అంటే ఈ మొత్తంతో పాటు అని అర్థం.ఈ బడ్జెట్ ఖర్చులు వాస్తవంగా చేపట్టింది లేనిది ఎవరికీ తెలియదు. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రభుత్వం తన ఆదాయాలు, ఖర్చులు తెలిపే బడ్జెట్ పట్టికతో వస్తే ''ఉద్దీపన'' అని పిలువబడే చర్య సాధ్యమా లేదా అనేది అంచనా వేయొచ్చు.
వేగవంతమవుతున్న ప్రయివేటీకరణ, సరళీకరణ
ప్రతి రంగం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం ఆహ్వానం పలుకుతున్నది. ప్రభుత్వ రోజువారీ ఖర్చుల కోసం దేశ ఆస్తులను అమ్మకానికి పెట్టిన విధంగా ప్రయివేటీకరణ ఉంది. ఇది ఆర్థిక అభివద్ధిని ఇవ్వదు. ఇది కేవలం నిర్దాక్షిణ్యంగా లాభాలు పెంచుకునే మార్గం. ఆ విధమైన లూటీ పట్ల కార్మిక వర్గానికి, ప్రజల్లో వ్యతిరేకత పెరగడం లేదని చెప్పడానికి, 8 గంటల పని దినాన్ని ముఖ్యంగా కార్మికవర్గం పోరాడి సాధించుకున్న హక్కులతో పాటు అన్ని కార్మిక చట్టాల అమలును అధికారికంగా నిలిపివేసారు.
వ్యవసాయం
వ్యవసాయ దురవస్థల పరిష్కారాల గూర్చి మాట్లాడకుండా, ప్రభుత్వం మళ్ళీ రైతులకు రుణ సౌకర్యాలను అందుబాటులో ఉంచుతోంది. ఇప్పటికే రైతులు రుణభారంతో ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో వారు మళ్ళీ కొత్త రుణాల కోసం ముందుకు రావడం లేదు. అదే విధంగా చేతికొచ్చిన రబీ పంటకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గురించి, జూన్ నుంచి ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్కు అవసరమైన పెట్టుబడులు, విత్తనాల కొరతను తీర్చేందుకు తీసుకొనే చర్యలేవీ ఈ ప్యాకేజీ ప్రస్తావించలేదు
రాష్ట్రాలపై దాడులు
కరోనాపై పోరాటంలో ముందు భాగంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన కేటాయింపులు చేయకుండా, వాటికి న్యాయబద్ధంగా చెల్లించవలసిన జీఎస్టీ బకాయిలను గూర్చి ఏ హామీని ఈ ప్యాకేజీ ఇవ్వలేదు. అత్యంత దారుణమైన విషయం ఏమంటే, చట్ట బద్ధంగా రాష్ట్రాలకు 'విపత్తుల సహాయ నిధి' కింద ఇవ్వాల్సిన మొత్తాన్ని కూడా ఉద్దీపన ప్యాకేజీగా చూపించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ మహమ్మారిపై పోరాడటానికి ప్రధానమంత్రి పేరుతో ప్రయివేటు ట్రస్ట్ ద్వారా సమీకరించిన వేల కోట్ల రూపాయలను రాష్ట్రాలకు బదిలీ చెయ్యాలి.
సీపీఎం ఆర్థిక సూచనలు
ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించాల్సిన ఆర్థిక విషయాల కోసం సీపీఐ(ఎం) కొన్ని సూచనలను ప్రజల ముందుంచింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష పార్టీల నాయకులకు దీనిని పంపిస్తూ, తక్షణమే ప్రభుత్వం చేపట్టాల్సిన ఒక ఆర్థిక ప్రణాళికను కూడా ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఆర్థిక సంక్షోభం, దాని వల్ల ఏర్పడిన ప్రజల బాధలను తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యల ద్వారా వెంటనే పరిష్కరించాలి.
''ఆర్థిక వ్యవస్థ, ప్రజాసంక్షేమాల యోగ్యతకు సంబంధించిన తమ ప్రతిపాదనలను వెంటనే పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా సీపీఐ(ఎం) పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.''
''తమ ప్రతిపాదనల అమలు కోసం బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా ఉద్యమాలు అన్నీ ఏకం కావాలని సీపీఐ(ఎం) పార్టీ కోరింది.''
భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రాథమిక సమస్య దేశీయ డిమాండ్ తగ్గుదల. అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కరోనా వ్యాప్తికి ముందే దేశంలో మాంద్యం ఏర్పడటం వల్ల ప్రజల కొనుగోలు శక్తి బాగా తగ్గింది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ లేక పరిశ్రమలు మూతపడి, అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. కాబట్టి తక్షణ, మధ్యకాలిక, దీర్ఘకాలిక చర్యల్లో, ఆర్థిక ప్రణాళిక ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణలో కీలకమైన అంశం గూర్చి ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వ పెట్టుబడులు
ఇది రుణ సదుపాయాల ద్వారా కాకుండా ప్రభుత్వం ప్రత్యక్షంగా చేసే ఖర్చు ద్వారా సాధ్య పడుతుంది. అత్యంత అవసరమైన మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ప్రభుత్వ పెట్టుబడులను పెద్దఎత్తున ఖర్చు చేయాలి. అలాంటి ప్రభుత్వ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల నిర్మాణాలకు కోట్ల సంఖ్యలో అవసరమయ్యే ఉద్యోగాల కల్పనకు దారి తీస్తాయి. కార్మికులు తమ వేతనాలను ఖర్చు చేయడం మొదలు పెడితే, దేశీయ డిమాండ్ పెరగడం మొదలవడం వల్ల మూతపడిన పరిశ్రమలు, యంఎస్యంఈలు తెరుచుకునే క్రమం మొదలౌతుంది. ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ లేనప్పుడు, ఆర్థిక ప్యాకేజీ ద్వారా సమకూర్చబడిన పెట్టుబడులతో ఉత్పత్తి చేయబడిన వస్తువులు దేశంలో అమ్ముడుపోనప్పుడు, లాభాలు వచ్చే అవకాశాలు ఉండవు.
కాబట్టి మోడీ 20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ, ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయలేదు. భారతదేశ ఆర్థిక స్వావలంబన ప్రయోజనాలకు, ఈ దేశ ప్రజల అభివద్ధి, జీవనోపాధి, సంక్షేమానికి వ్యతిరేకమైన ప్రక్షేప మార్గం ఈ ప్యాకేజీ. ప్రజావ్యతిరేకమైన ఈ మార్గం ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వం తన ప్రక్షేపమార్గాన్ని మార్చుకొని, కోట్ల సంఖ్యలో ఉన్న భారతదేశ ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఒత్తిడి పెంచే ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలి.
'పీపుల్స్ డెమోక్రసీ' నుంచి
సీతారాం ఏచూరి
అనువాదం :నీహాగౌతమ్, సెల్: 9848412451