Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా వైరస్ విజంభణతో మన దేశం వణికిపోతోంది. కంటికి కనిపించని శత్రువుతో ప్రజలంతా యుద్ధం చేయాల్సి వస్తోంది. వైరస్ను నిరోధించడానికి కేంద్ర, రాష్ట్ర పాలకులు ప్రజలంతా 'లాక్డౌన్', 'కర్ఫ్యూ'లను పాటించాలని ఆదేశించారు. దానితోపాటు ప్రజలు సానిటైజర్స్తో తరుచుగా చేతులు కడుగుకోవాలని, వీధుల్లోకి వచ్చినప్పుడు 'సోషల్ డిస్టెన్స్' పాటించాలని నిర్దేశించారు. కరోనా నివారణకు పాటించాల్సిన జాగ్రత్తలను, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వగైరాలతో విస్తత ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రకటనలు వచ్చిన మొదట్లో ప్రజలంతా ప్రాణభయంతో ఉండడంతో వాటిలో వాడిన పదజాలాన్ని పట్టించుకోలేదు. కరోనా స్వరూప స్వభావాలు అర్థమయ్యి అలవాటు పడడం మొదలెట్టాక ఆలోచించడం మొదలెట్టారు. వీధుల్లోకి వచ్చినప్పుడు మనిషికి మనిషికి మధ్య పాటించాల్సిన దూరాన్ని 'భౌతిక దూరం (ఫిజికల్ డిస్టాన్స్)' అనాలి కానీ, 'సామాజిక దూరం(సోషల్ డిస్టెన్స్)' అని ఎందుకు అంటున్నారు!? అనే ప్రశ్న తలెత్తింది. మన దేశంలోని నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ప్రజలను ఎప్పటినుంచో విడదీసి కులాల మధ్య సామాజిక దూరాన్ని పాటింపజేస్తోంది. అందులోను దళితుల పట్ల అమానుషమైన అంటరానితనాన్ని, వివక్షను ప్రదర్శిస్తోంది. అందువల్ల ఈ సోషల్ డిస్టెన్స్ అనే పదం వెనక కులవివక్షతా ధోరణి ఉందనే విమర్శ ముందుకు వచ్చింది. అయితే అప్పటికే ఈ సోషల్ డిస్టెన్స్ అనే పదం మీడియా ద్వారా విస్తతంగా ప్రజల వాడుకలోకి వచ్చేసింది. దానికి తోడు ఓ సినీగేయ రచయిత, కవి పండితులవారు 'మేమెప్పటినుండో సామాజిక దూరం పాటిస్తున్నాం. మా ఆచారమే సరైనదని' అర్థం వచ్చేరీతిలో ప్రకటన చేయడంతో సోషల్ మీడియాలో దుమారంలేచి, కొన్నాళ్ళు చిటపటలాడింది. ఈ పదం వాడకం వెనక కులవివక్ష ఉందేమో అనే అనుమానానికి ఆధారం దొరికినట్టయింది. ఈ పదజాలంలో వున్న వివక్షా స్వరాన్ని గ్రహించి కొందరు సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దాని విస్తతి ఎంతగా ఉందొ కొన్ని ఉదాహరణలు చూద్దాం.
ఒక క్లినిక్లో వైద్యానికి వెళితే అక్కడ గోడమీద 'మైంటైన్ సోషల్ డిస్టెన్స్' అనే పోస్టర్ దర్శన మిచ్చింది. ఆ క్లినిక్ యజమానికి కులవివక్షా ధోరణి ఉండక పోవచ్చు. విచక్షణా రహితంగా చేసిన ప్రచారం ఫలితం అది. అదేవిధంగా టీవీ యాంకర్లు 'మార్కెట్లో ప్రజలు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని' స్టూడియోకు కంప్లైంట్ చేయడం వింటూనే వున్నాం. ఇంతెందుకు ఈ మధ్యనే మూతపడిన కోర్టులలో కార్యకలాపాలను పూర్వంలాగానే కొనసాగించాలని బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుల వారు సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టిస్కు ఒక వినతి పత్రం సమర్పించినట్టుగా వాట్సాప్లో వచ్చింది. దానిలోనూ సోషల్ డిస్టెన్స్ పదం దర్శనమిచ్చింది. అడ్వకేట్లు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ కోర్టులో పనిచేసుకోవాలని ఆ వినతిలో కోరారు. ఈ విధంగా సామాన్యులతో మొదలెడితే, జాతీయ స్థాయి మేధావులు కూడా వివక్షా పూరిత పద ప్రయోగం చేయడం విచారకరం. ఈ తప్పును అందరు సరిదిద్దుకోవాలి.
భాషలో వాడే పదాల పట్ల జాగ్రత్తగా ఉండక పోతే వచ్చే ప్రమాదాల గురించి మరో ఉదాహరణ చూద్దాం. ఇప్పట్లో కరోనా పోయే వ్యవహారం కాదనీ, కాబట్టి కరోనాతో 'సహజీవనం' చేయక తప్పదనీ ఏలిన వారు సెలవిచ్చి లాక్డౌన్ గేట్లన్నీ ఎత్తేసారు. వివాహబంధం లేకుండా, నచ్చిన వాళ్ళతో కలిసి బతకడం, ఇష్టం లేనప్పుడు విడిపోయే అవకాశం కల్పించే ప్రక్రియను 'సహజీవనం' అంటారు. మన ప్రాణాలు తీసే శత్రువుతో సహజీవనం చేయాలని పాలకులంటా రేమిటి!? ఏమయినా అర్థముందా! మన ఇష్టం వున్నా లేకపోయినా వివాహ బంధం ద్వారా కలిసి, ఎవరో ఒకరు పోయేదాకా విముక్తి లభించని ప్రక్రియను 'సంసారం' అంటారు. మానవాళిని వరించి వచ్చిన కరోనాతో సంసారం చేయాల్సిందే అని చెప్పడం సరైనది గదా!!
ఎ.సత్యభాస్కర్
సెల్: 9848391638