Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈతరం యువతీ యువకులు కొత్త కొత్త ప్రశ్నల్ని సంధిస్తున్నారు. ''దేవుళ్ళంతా అగ్రకులంలోనే ఎందుకు పుట్టారు? దళిత కులాల్లో ఎందుకు పుట్టలేదు?'' అని. ఈ విషయాన్ని విశ్లేషించుకుంటూ పోతే గతంలో జరిగిన కుట్రలు - కుతంత్రాలు అన్నీ బయటపడతాయి. అలాగే వారు మరో ప్రశ్న కూడా సంధిస్తున్నారు. ''ఆదాయం అధికంగా ఉండే గుళ్ళచుట్టే స్వాములు, మఠాధిపతులు, రాజకీయ ప్రముఖులు ఎందుకు తిరుగుతారు? చిన్న చిన్న గుళ్ళకు ఎందుకు వెళ్ళరు? దేవుడంటే అంతటా ఒకటే కదా?'' అని!
''జాతి భావ వ్యక్తీకరణపై ఎలాంటి ఆంక్షలు విధించినా సమాజం మొత్తంగా స్వేచ్ఛ కోల్పోయినట్టే!'' - బెంజుమిన్ ఫ్రాంక్లిన్, అమెరికా పూర్వ అధ్యక్షుడు.
భారత రచనా కాలం నాటికే టెక్నాలజీ అందుబాటులో ఉందనీ, వేదాలతో కాలుష్యం తగ్గించొచ్చని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీ.ఎం. దినేష్శర్మ చెప్పారు. ఈయన భారతం రాయబడ్డ కాలానికి చెందినవాడు కాదు, వేదాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వేదపండితుడూ కాదు. అట్లని పర్యావరణంపై అవగాహన గల వాడూ కాదు. కేవలం రాజకీయంగా ఎదిగి ఉపముఖ్యమంత్రి అయిన వ్యక్తి. అధికారంలోకి రాగానే 'ఏదైనా మాట్లాడొచ్చు' - అని అనుకుంటే పొరపాటు. ఈయన ప్రకటనని ఒక వేద పండితుడే స్వయంగా ఖండించాడు. ఆయన పేరు ఉపేంద్ర కుమార్. బనారస్ హిందూ యూనివర్సిటీలో డిపార్టుమెంట్ ఆఫ్ వేదాస్కు హెడ్ (అధిపతి), 'వేదాలు కాలుష్యాన్ని ఏ విధంగానూ తగ్గించలేవ'ని - సవివరంగా ప్రకటించాడు. పాపం, యూపీ మంత్రి తేలుకుట్టిన దొంగలాగ మరి మాట్లాడలేదు.
బానిసత్వానికి చిహ్నంగా అన్ని దేశాల్లో సంకెళ్ళు కాళ్ళకీ, చేతులకీ వేశారు. కానీ, మన భారతదేశంలో సంకెళ్ళు మెదళ్ళకే వేశారు. అందుకే అంధ విశ్వాసాలకు మనమిప్పుడు నిర్వచనాలు మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. దిష్టితీయడం, చేతబడి చేయడం, ప్రయాణానికి ముందు తుమ్మడం లేదా పిల్లి ఎదురుపడకూడదనడం మాత్రమే మూఢనమ్మకాలు కాదు. వ్యక్తుల మీద, సంస్థల మీద, ఎన్నుకోబడ్డ ప్రభుత్వాల మీద కూడా అహేతుకంగా నమ్మకం పెంచుకోవడం కూడా మూఢనమ్మకమే! జనాన్ని మోసం చేసే పనులు ఎవరు చేసినా, పసిగట్టి బయటపెట్టడం మూఢనమ్మకాల నిర్మూలనే అవుతుంది. ప్రజల హక్కుల్ని కాలరాసే ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టడం కూడా మూఢనమ్మకాల నిర్మూలనే - వైజ్ఞానిక స్పృహ లేని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ సంప్రదాయాల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం కూడా మూఢనమ్మకాల నిర్మూలనే - మొత్తానికి మొత్తంగా సంక్లిష్టమైపోతున్న అత్యాధునిక జీవితాన్ని అర్థం చేసుకుని, దాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకోవడంలో వచ్చే అడ్డంకుల్ని నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసేస్తూ - సరికొత్త అవగాహనతో నిరంతరం నూతన ప్రపంచానికి దారులు వేస్తూ ఉండటమే నేడు వైజ్ఞానిక దృక్పథం గల వారి ప్రథమ కర్తవ్యం!
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం గురించి చెప్పుకున్నాం గనక, అక్కడి విషయమే మరొకటి చూద్దాం. ఆ విశ్వవిద్యాలయంలోని ఉర్దూ విభాగంలో ఆర్.కె.శర్మ ఉర్దూ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మంచి పండితుడని పేరుంది. ఆయన బాల్యంలో పశ్చిమ బెంగాల్లోని మదరసలో విద్యనభ్యసించాడు. ఉర్దూలో ఉన్నత విద్యనార్జించి ఉర్దూ ప్రొఫెసర్ అయ్యాడు. ఇతని విషయంలో ఎప్పుడూ అల్లర్లు జరగలేదు. ఆ మధ్య సంస్కృతం శాఖలో అన్ని అర్హతలు సాధించి, ఒక ముస్లిం అభ్యర్థి నియమితుడయ్యాడు. అంతే, అతనికి వ్యతిరేకంగా అల్లర్లు ప్రారంభమయ్యాయి. హిందువు కానివాడు సంస్కృతంలో హిందూ ధర్మాన్ని, భాషను, సంస్కృతిని ఎలా బోధిస్తాడు? అనే ప్రశ్నలు లేవనెత్తారు. చివరకు ఆ ముస్లిం అభ్యర్థి సంస్కృతశాఖలో ప్రొఫెసర్ ఉద్యోం వదిలేసి వెళ్ళేవరకు వదలలేదు. ఇందులో వివక్ష స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా? భాషలకు, మతాలకూ అసలు సంబంధమే లేదు. అలా ఉందనుకుంటే యూజీసీ రూల్స్లో ఉండాలి. అందుకే చెప్పేది. కొత్త కొత్తగా దూసుకొస్తున్న అంధవిశ్వాసాల్ని అర్థం చేసుకుంటూ ఉండాలని!
భగవద్గీత వినడం లేదా చదవడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధి అయిన మధుమేహాన్ని తగ్గించుకోవచ్చని ఉస్మానియా ఆస్పత్రి ఎండో క్రైనాలజీ హెడ్ డాక్టర్ రాకేష్ సహారు ప్రకటించాడు. ఆయన ప్రచురించిన వ్యాసం ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజమ్లో ప్రచురింపబడింది. భగవద్గీత ఒక మతానికి సంబంధించిన గ్రంథం కాదనీ, అది సర్వమానవాళికి ఉపయుక్తమైందని అది సుమారు ఏడు వందల అంశాల్ని వివరించే గ్రంథమని ఆయన ప్రకటించాడు. అయితే, ''మధుమేహం వ్యాధి కాదు - ఒక డిస్ ఆర్డర్'' అని ఆయన చెప్పలేకపోయాడు. ఇండియాలో కాక అది బయటిదేశాల్లో ప్రచురింపబడితేదాని విలువ ఎంతో తెలిసేది? దేశంలో మతతత్వాన్ని ప్రోత్సహించే పాలకులు, అధికారులు, వర్గాలూ కింది స్థాయి నుంచి పైదాకా ఉన్నందువల్ల అది ఈ దేశంలో అచ్చయ్యింది. అచ్చయినంత మాత్రాన అది ప్రామాణికం అయిపోదు. వైజ్ఞానిక స్పృహతో హేతుబద్ధంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే పై అధికారులు, వ్యవస్థలు ఉండి ఉంటే వెంటనే రాకేష్ డిగ్రీల్ని రద్దుచేసేవారు. మానవీయ కోణంలో ఆయనకు మెంటల్ ఆస్పత్రిలో చికిత్స చేయించి, మళ్ళీ మనిషిని చేసేవారు. మతపిచ్చి తలకెక్కిన వారి చేష్టలు విచిత్రంగా ఉంటాయి. కొందరు 35-40 వేలు పెట్టి ఏండ్రాయిడ్ ఫోను కొంటారు. పూలూ, నీళ్ళూ దానిమీద పోసి, బ్రాహ్మడితో పూజ చేయించుకుంటారు. అంటే ఏమిటీ? ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని గంగలో కలిపేయడమన్నమాట! నిత్యజీవితంలో పనికొచ్చే పరికరాన్ని తుంగలో తొక్కేయడమన్న మాట!! వారు ఎంతటి మూర్ఖుశిఖామణులో వారిని వారు బేరీజు వేసుకోగలరా?
జిఓ 2430ని వెంటనే అమలు చేయాలని, పొద్దస్తమానం టీవీల్లో అబద్ధాలు చెప్పే వాస్తు, జ్యోతిష్య, స్వస్తత, ప్రవచన, స్వామీ, గురు, బాబాగాళ్ళపై తక్షణం చర్యలు తీసుకోవాలని హేతువాద సంఘాలు ప్రభుత్వాన్ని నిరంతరం కోరుతూనే ఉన్నాయి. కానీ, ఈ దేశంలో కంచేచేను మేస్తుంది కదా? ప్రభుత్వంలో ఉన్న ప్రముఖులే ఎకె47వలె అబద్ధాల తూటాలు అడ్డగోలుగా పేలుస్తూ ఉంటే, అమాయక జనం ఏం చెయ్యాలీ? జనంలో ఆలోచించే శక్తి లేదని కాదు, అది బయటికి రావాలి. అది బయటపడేట్లు వైజ్ఞానిక సంస్థలు కృషి చేయాలి. ఖగోళ, భౌతిక శాస్త్రవేత్త గెలీలియో ఓ మాట చెప్పాడు. ''మనం ఎవరికీ ఏమీ నేర్పలేం. కానీ, వారిలో దాగిఉన్న సామర్థ్యం బయటపడేందుకు సహాయపడగలం'' అని. ఇప్పుడు ప్రగతిశీల భావాలు గలవారంతా చేయాల్సింది కూడా అదే! ఆగిపోయిన గడియారం కూడా రోజుకి రెండుసార్లు సరైన సమయం చూపించినట్టు కొందరు ప్రవచనకారులు అభ్యుదయం ముసుగులో మాట్లాడుతుంటారు. తామూ కమ్యూనిస్టులమే నంటారు. తమకూ సైన్సు తెలుసునన్నట్టు ఒకటి అరా ఉదాహరణలిస్తారు. అసలైతే వారు మూఢభక్తిని, మత ప్రచారాన్ని కొనసాగిస్తుంటారు.
గుజరాత్ సురేంద్రనగర్ జిల్లాలోని ఒక పాఠశాలలో రెండు కుండలు విడివిడిగా ఉంటాయి. ఒక కుండ అగ్రవర్ణాల వారికి మరొకటి ఇతరులకు. ఇది ఎప్పటి సంగతోకాదు. ఇటీవల జరిగిందే. కన్నయ్యలాల్ బైరయ్య అనే ఉపాధ్యాయుడు పొరపాటున ఒకరోజు అగ్రవర్ణాలకు కేటాయించబడ్డ కుండలోంచి మంచినీళ్ళు తాగాడు. ఆ విషయం స్కూలు హెడ్మాస్టర్కు తెలిసింది. ఆయన కన్నయ్యలాల్కు నోటీసిచ్చాడు. మంచి ఉపాధ్యాయుడిగా, మంచి క్రమశిక్షణ గలవాడిగా పేరున్న కన్నయ్య చాలా నొచ్చుకున్నాడు. ఇంకా ఈ రోజుల్లో కూడా ఈ వివక్ష ఏమిటని ప్రశ్నించుకున్నాడు. నేరుగా దగ్గరలోని చోటిలా పోలీస్ స్టేషన్కు వెళ్ళి, తనకిచ్చిన నోటీస్ చూపించి, తనను వేధిస్తున్నారంటూ పిర్యాదుచేశాడు. తను చేసినదాని వల్ల ఏదో కొంత మార్పు రాకపోదా? అని ఆశపడ్డాడు. నిమ్నకులం వాడినని తనపై వివక్ష చూపినందుకు ఏదోరకంగా స్కూలు హెడ్మాస్టర్కు హెచ్చరిక వస్తుందని ఆశపడ్డాడు. కానీ, కన్నయ్యలాల్ బైరయ్య ఆశ అడియాసే అయ్యింది. హెడ్మాస్టర్కు ఏమీకాలేదు. అక్కడి రెండు కుండల విధానానికి దెబ్బతగలలేదు. కన్నయ్యలాల్ టీచర్కే ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతికొచ్చింది. ఈ దేశంలో ఇలాంటివి ఇలాగే కొనసాగుతూనే ఉండాలా? ఇలాంటి హెడ్మాస్టర్లు, పోలీసు ఇన్స్పెక్టర్ లాంటి వాళ్ళను ఎంతోమందిని చూసే కాబోలు వారెన్ బఫెట్ ఓ మాట చెప్పాడు. ''నిజాయితీ అనేది చాలా విలువైన బహుమానం. అది తక్కువ స్థాయి మనుషుల నుంచి వస్తుందని ఏమాత్రమూ ఆశపడొద్దు'' అని!
ఐదో శతాబ్దంలో ఫాహియాన్ భారతదేశం పర్యటించిననాటికే ఇక్కడ అస్పృశ్యతలో మార్పులేదు. అణగారిన వర్గాలు ఊరివెలుపల నివాసముండాల్సి వచ్చేది. ఒక వేళ ఊళ్ళో నడవాల్సి వస్తే ఎడమవైపు నక్కినక్కి నడిచేవారని ఆ యాత్రికుడు రాశాడు. అప్పటికి మొగలులూ రాలేదు. బ్రిటిష్ వారూ రాలేదు! అయినా, నిమ్నకులాల పరిస్థితి అతి ఘోరంగా ఉండేది. ఇలాంటి చారిత్రక సత్యాల్ని దాచిపెడుతూ, వాస్తవాల్ని వక్రీకరిస్తూ అరెస్సెస్, బీజేపీ బృందాలు మాట్లాడుతూ ఉంటారు. విషయాన్ని వక్రీకరించి చెప్పాలనుకున్నా ఒక్కోసారి నిజం దాగదు. ఉదాహరణకు ఆరెస్సెస్ ప్రధాన సహ కార్యదర్శి ఒకరు ''అస్పృశ్యత దేశంలోనిది కాదని, అది బయటి నుంచి వచ్చింద''నీ భుజాలు తడుముకున్నాడు. తాము బయటి నుంచి వలసవచ్చిన వారి వారసులమేనన్నది మాత్రం చెప్పుకోలేదు. అసలైతే అస్పృశ్యత ఇక్కడి మూలవాసుల్లో ఉండేదికాదు. బయటి నుంచి వచ్చిన ఆర్య బ్రాహ్మణులు, ఆర్య వైశ్యులే దాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు. వారే ఇక్కడ మనుధర్మ శాస్త్రాన్ని ప్రతిష్టాపించారు. చాతుర్వర్ణ వ్యవస్థను బలోపేతం చేశారు. కావాలంటే, హ్యూమన్ త్సాంగ్ పర్యటన నాటికే సాకేత్ - అయోధ్యలోని బౌద్ధ మందిరాలను అవశేషాలు కూడా లేకుండా ధ్వంసం చేసింది ఎవరో, ఆక్రమించుకున్నది ఎవరో చరిత్రలో అంతా సజీవంగానే నిక్షిస్తమై ఉంది. చరిత్రను విజ్ఞాన శాస్త్రాన్ని సరైన పంథాలో జనానికి అర్థం చేయించడం కూడా అంధవిశ్వాసాల నిర్మూలనే. ఎందుకంటే వాటిని సరిగ్గా అర్థం చేసుకోకుండా, అర్థం చేసుకున్నా, ఒక్కోసారి ఆత్మద్రోహం చేసుకుంటూ జనానికి తప్పుడు సమాచారం ఇస్తున్న వారిని ఏమందాం? మూఢనమ్మకాల్ని వ్యాప్తి చేస్తున్నవారిగానే పరిగణించాలి కదా?
ఈతరం యువతీ యువకులు కొత్త కొత్త ప్రశ్నల్ని సంధిస్తున్నారు. ''దేవుళ్ళంతా అగ్రకులంలోనే ఎందుకు పుట్టారు? దళిత కులాల్లో ఎందుకు పుట్టలేదు?'' అని. ఈ విషయాన్ని విశ్లేషించుకుంటూ పోతే గతంలో జరిగిన కుట్రలు - కుతంత్రాలు అన్నీ బయటపడతాయి. అలాగే వారు మరో ప్రశ్న కూడా సంధిస్తున్నారు. ''ఆదాయం అధికంగా ఉండే గుళ్ళచుట్టే స్వాములు, మఠాధిపతులు, రాజకీయ ప్రముఖులు ఎందుకు తిరుగుతారు? చిన్న చిన్న గుళ్ళకు ఎందుకు వెళ్ళరు? దేవుడంటే అంతటా ఒకటే కదా?'' అని! మరో విషయమేమంటే, వీళ్ళెవరూ మతగ్రంథాల్ని క్షుణ్ణంగా చదవరు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు పొలోమని పోతుంటారు. మారిన పరిణామాల్లో హేతువాదులు, నాస్తికులు పురాణాలు, మత గ్రంథాలు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. సహేతుకంగా విశ్లేషిస్తున్నారు. విమర్శిస్తున్నారు. వాటిలో పనికిరాని అంశాల్ని ఎత్తి చూపుతున్నారు. అందువల్ల మనం అర్థం చేసుకోవల్సింది ఏమంటే.. మత గ్రంథాలు అర్థం చేసుకున్నవారే నాస్తికులవుతున్నారు. చదివి కూడా అర్థం చేసుకోలేనివారు ఆస్థికులుగానే కొనసాగుతున్నారు. రాళ్ళల్లో, రప్పల్లో జంతువుల్లో భగవంతుణ్ణి చూసే ఈ ఆస్థికులు, మనుషుల్లో మాత్రం కులాన్నే చూస్తూ ఉండటం బాధకలిగించే విషయం! ఈ విషయం ఎంత వరకు పోయిందంటే తమిళనాడులోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కులాలను బట్టి బ్యాండ్లు పంచుతున్నారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, కాశాయం, నీలి వంటి వివిధ రంగుల రిస్ట్ బ్యాండ్లను వేరు వేరు కులాల విద్యార్థులు ధరించాల్సి ఉంటుంది. అగ్రవర్ణ, శూద్ర, నిమ్న కులాలవారిని సులభంగా గుర్తుపట్టడానికి ఇదొక చక్కని ఉపాయం! మనువాదులతో భలే వినోదం. వారు ఎప్పుడూ వారి అజ్ఞానాన్ని, వితండవాదాన్ని, మూర్ఖత్వాన్ని.. ఇదిగో ఇలా ఎక్కడా దాచుకోరు..
డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.