Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1970లో ''ఐక్యత-పోరాటం'' నినాదంతో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) ఆవిర్భవించింది. 2020 మే 30తో సీఐటీయూ 50 వసంతాల ప్రస్థానం పూర్తి చేసుకోబోతుంది. ఈ కాలంలో కార్మికవర్గం జరిపిన పోరాటాలు, త్యాగాలను స్మరించుకుంటూ 2019 మే 30 నుంచి 2020 మే 30 వరకు ఒక సంవత్సర కాలం పాటు స్వర్ణోత్సవాలను జరపాలని, ఆ ఉత్సవాల ముగింపును సీఐటీయూ పుట్టిన నేల కలకత్తా గడ్డపై జరపాలని అఖిల భారత కమిటీ ముందు నిర్ణయించింది. కానీ దేశంలో ప్రభలిన కరోనా వల్ల ఆ ఉత్సవాలు వికేంద్రీకరించబడి క్షేత్రస్థాయిలో జరుగుతున్నాయి.
వర్గ పోరాటాలు లేకుండా సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకురావడం సాధ్యంకాదని, కార్మికవర్గాన్ని వర్గ సామరస్య విధానంలో నడిపించే అన్నిరకాల ప్రయత్నాలను తిరస్కరిస్తూ సీఐటీయూ ఆవిర్భవించింది. ఉత్పత్తి సాధనాలు, పంపిణీ, మార్పిడులను సమాజపరం చేయడం ద్వారా, అలాగే సోషలిస్టు రాజ్యం ఏర్పరచడం ద్వారానే కార్మిక దోపిడీని అంతమొందించవచ్చని సీఐటీయూ బలంగా విశ్వసించింది.
సీఐటీయూ ఆవిర్భవించిన తొలినాళ్ళలోనే పాలకవర్గాలు, ఇతర కార్మిక సంఘాలు సీఐటీయూని ఒంటరి చేసే ప్రయత్నాలు చేశాయి. ఐక్యతా నినాదాన్ని అవహేళన చేశాయి. సీఐటీయూ మాత్రం తన కార్యాచరణ ద్వారానే సమాధానం ఇచ్చింది. ఇందిరాగాంధీ చేపట్టిన వేతన స్తంభన, కంపల్సరీ డిపాజిట్ స్కీమ్లకు వ్యతిరేకంగా పోరాడటానికి యునైటెడ్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లను ఏర్పాటుచేసింది. ఎమర్జెన్సీ సమయంలో ఆనాటి ప్రభుత్వం సీఐటీయూ సంస్థను అణచివేయ జూసింది. నాయకత్వం తీవ్ర నిర్భంధాలకు గురైంది. అయినా పౌర హక్కులు, అప్రజాస్వామ్య అణచివేతలను నిరసిస్తూ కార్మికవర్గ ఐక్యతను చాటిచెబుతూ ప్రజా పోరాటాల పతాకగా సీఐటీయూ నిలిచింది. 1974లో రైల్వే వర్కర్స్ అఖిలభారత సమ్మెలో కీలకపాత్ర పోషించింది. తీవ్రమైన అణచివేతలు, కక్ష సాధింపుల మధ్య 20రోజులు సమ్మెను నడిపించింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే కార్మికు లను ఐక్య పోరాటాల్లోకి తీసుకురావడం కోసం నేషనల్ కో-ఆర్డినేషన్ కమిటీ ఫర్ రైల్వే మెన్ స్ట్రగుల్స్ (ఎన్సీసీఆర్ఎస్)ను ఏర్పాటు చేసింది. ఐఎన్టీయూసీ తప్ప మిగతా ప్రధాన కార్మిక సంఘాలన్నింటినీ ఐక్యం చేసింది. 1978లో జనతా ప్రభుత్వం ఇండిస్టియల్ రిలేషన్స్ బిల్ తీసుకొచ్చి భూతలింగం కమిషన్ వేసిన సందర్భంగా దానికి వ్యతిరేకంగా సీఐటీయూ చేపట్టిన ఐక్య పోరాటాల ఫలితంగా నాటి ప్రభుత్వం ఆ బిల్లును పక్కన పెట్టాల్సి వచ్చింది.
1980 దశకంలో ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేసే పాలకుల కుట్రలకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్ తదితర కార్మిక సంఘాలతో కలిసి సీపీఎస్టీయూని ఏర్పాటు చేసింది.
రైతులు, వ్యవసాయ కూలీల సమస్యల్ని ముందుకు తెచ్చి 1982 జనవరి 19న మొదటిసారిగా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్న ఈ సమ్మెలో 10మంది వ్యవసాయ కార్మికులు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు. 1981లో కాంగ్రెస్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా నేషనల్ క్యాంపెయిన్ కమిటీ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఎన్సీసీ)ను ఏర్పరచి పోరాటాలను చేపట్టడంలో సీఐటీయూ ముఖ్యపాత్ర వహించింది.
1991లో కాంగ్రెస్ తెచ్చిన నూతన ఆర్థిక విధానాలను సీఐటీయూ మినహా ఇతర వామపక్ష ట్రేడ్ యూనియన్లతో పాటు బూర్జువా ట్రేడ్ యూనియన్లు స్వాగతించాయి. ఒక్క సీఐటీయూ మాత్రమే దూరదృష్టితో నికరంగా వ్యతిరేకించింది. ఈ విధానాలు భారత కార్మికవర్గానికి దేశానికి ఎలా నష్టమో ముందే గ్రహించి పోరాటాలు చేసిన ఘనత సీఐటీయూకే దక్కింది. 2009లో ఐఎన్టీయూసీ, బీఎంఎస్తో సహా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు ఐక్యవేదిక ద్వారా మూడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలను నిర్వహించాయి. ఇప్పటివరకు 19సాధారణ సమ్మెలు సీఐటీయూ చొరవతో జరగడం అపూర్వం.
కోవిడ్-19 దేశవ్యాప్త లాక్డౌన్తో దేశంలో నూతన పరిస్థితి ఏర్పడింది. కార్మికవర్గం ముందు అనేక సవాళ్ళున్నాయి. లాక్డౌన్ సాకుతో బీజేపీ ప్రభుత్వం యొక్క విషపూరిత నిర్ణయాలు, దాని విధానాలు స్పష్టంగా బయటపడుతున్నాయి. కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, నూతన ఆర్థిక విధానాల ఎజెండాను వేగంగా ముందుకు తీసుకుపోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీజేడీ, శివసేన ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కార్మిక చట్టాల రద్దుకై వరుసగా తీసుకొస్తున్న ఆర్డినెన్స్లు, నోటిఫికేషన్లు ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశాలతోనే వస్తున్నాయనడంలో సందేహాం లేదు. గత మూడు దశాబ్ధాలుగా కార్మికులు, పీడిత ప్రజల నుంచి తీవ్రమైన ప్రతిఘటన వస్తున్నప్పటికీ నయా ఉదారవాద విధానాలను బరితెగించి అమలు చేయడం దుర్మార్గం.
ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో ప్రకటించిన రూ.20లక్షలకోట్ల ఆర్థిక ప్యాకేజీ కార్పొరేట్లు, భూస్వాములకు కట్టబెట్టడం దుర్మార్గం. లాక్డౌన్ను అడ్డంపెట్టుకొని సర్వాధికారాలు ఉపయోగించుకొని, కార్మికవర్గంపై దాడిని కేంద్రీకరించింది. ఇది ఈ సంక్లిష్ట స్థితిలో కార్మికవర్గ ఐక్యతకు భగం కలిగిస్తొంది.
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజల్లో శాస్త్రీయ భావాలు పెంచాల్సింది పోయి ఆర్ఎస్ఎస్, సంఫ్ు పరివార్ శక్తులు జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నాయి. భావోద్వేగాలను రెచ్చగొడు తున్నాయి. కుల, మత, ప్రాంత, లింగ తదితర అంశాలతో ఉద్రిక్తతలను సృష్టిస్తున్నాయి. కార్మిక వర్గ ఐక్యతపై పడుతున్న దుష్ప్రభావాలను తక్కువ అంచనా వేయరాదు. ఈ వినాశనకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ కార్మిక వర్గాన్ని, పీడిత ప్రజానీకాన్ని ఐక్యం చేయడం తక్షణ కీలక కర్తవ్యం.
కార్మికవర్గ ఐక్యతే ధ్యేయంగా 50ఏండ్లుగా సీఐటీయూ అలుపెరగని పోరాటాలు చేస్తున్నది. ఎన్ని ఒడిదుడుకులెదురైనా కార్మికుల పక్షాన, కార్మిక హక్కుల కోసం ఎజెండాతో ముందుకు సాగుతున్నది. దోపిడినీ తీవ్రం చేస్తున్న ఫైనాన్స్ క్యాపిటల్ దాడి నేపద్యంలో నిరంతరం కార్మిక లోకాన్ని జాగృతపర్చుతున్నది. పాలకవర్గాలు ఎన్ని నిర్భంధాలు, ఆంక్షలు విధించినా వెనక్కి తగ్గకుండా ''ప్రపంచ కార్మికులారా! ఏకం కండి.. పోరాడితే పోయేదేమి లేదు. బానిస సంకెళ్ళు తప్ప'' అనే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నది. ఐక్య ఉద్యమాలతో కార్మిక లోకాన్ని ఐక్యం చేస్తున్నది. సమరశీల పోరాటాలను నడుపు తున్నది. భారత కార్మికోద్యమ చరిత్రలో సీఐటీయూ నిర్వహించిన పాత్ర ఘనమైనది. సీఐటీయూ 50 వసంతాల ప్రస్థానం ఒక ఉజ్వల ఘట్టం. సీఐటీయూ స్వర్ణోత్సవాల స్ఫూర్తితో భవిష్యత్ ఐక్య ప్రతిఘటన పోరాటాలకు సంసిద్ధులమవుదాం.
పాలడుగు భాస్కర్
సెల్ :9490098033