Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ పేరు వింటేనే మనందరికీ నోరూరుతుంది. వేడి వేడి అన్నం, దానికి పసుపు దట్టించి పక్కనబెట్టడం.. ఒక కడాయిలో నూనె పోసి, అందులో పచ్చి మిర్చి, పోపు గింజలు, వెల్లుల్లి వేసి దోరగా వేయించటం, ఈ మిశ్రమంలో ఇందాకటి అన్నం కలిపి పొయ్యి మీద పెట్టుకోవటం. కొద్దిగా చల్లారాక తింటే నా సామీరంగా.. ఆ టేస్టే వేరు. ఇది మనింట్లో తయారు చేసుకునే పులిహౌర. ఇగ హైదరాబాద్ ప్రగతి భవన్లో వారానికో, పది రోజులకోసారి కలిపే పులిహౌర గురించి వింటే.. టేస్ట్ కాదు.. మనం 'రోస్ట్'' అవటం ఖాయం. విషయానికొస్తే.. క్యాబినెట్ మీటింగులో లేక ముఖ్యమైన అంశాల మీద మాట్లాడాల్సి వచ్చినప్పుడో మన సీఎం కేసీఆర్ సాబ్... ప్రెస్ కాన్ఫరెన్సులు పెడుతుండటం పరిపాటి. దీంట్లో వింతేముందని అనుకుంటున్నారా..? ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు విలేకరుల సమావేశం ఉంటుందని మాత్రమే చెప్తారు తప్పితే.. అది ఏ టైంలో ఉంటుందో అసలు చెప్పరు. జర్నలిస్టులు ఎన్ని గంటలకు రావాలో కూడా చెప్పనే చెప్పరు. దీంతో మన పాత్రికేయ రత్నాలు.. ఓ నాలుగైదు గంటల ముందుగానే ప్రగతి భవన్ వద్దకు చేరుకుంటారు. అక్కడుండే ఫుట్పాత్లపై పడిగాపులు కాస్తుంటారు. ప్రెస్మీట్ ప్రారంభానికి ఓ పావుగంట ముందు 'మీరు లోనికి రండి...' అంటూ వారి ఫోన్లకు ఓ మెసేజ్ వస్తుంది. దీంతో నీరసంతో కూడిన ముఖాలను వేలాడేసుకు జర్నలిస్టులు.. లోనికి అడుగుపెడతారు. పోనీ లోపలికి పోయాకైనా పది నిమిషాలు, పావుగంటకైనా ప్రెస్మీట్ స్టార్టవుద్దా అంటే.. అలాంటి గ్యారెంటీ ఏమీ ఉండదు. అది ప్రారంభం కావటానికి పావుగంట పట్టొచ్చు.. అరగంట పట్టొచ్చు.. గంట కూడా పట్టొచ్చు.. ఈ లోపు కుర్చీల్లో కూర్చుని కూర్చుని విలేకరులకు సోసొచ్చి పడిపోవటం ఖాయం. సారు ప్రెస్మీట్ మొదలెట్టిన తర్వాత నేరుగా విషయంలోకి పోవటమనేది అరుదు. 1969లో జరిగిన తెలంగాణ తొలిదశ ఉద్యమం నుంచి మొదలుపెట్టి.. 2020 దాకా జరిగిన పరిణామాలను వివరించిన తర్వాతేగానీ అది ముందుకుపోరు. అది ఏ విషయమైనా మధ్య మధ్యలో.. 'ప్రపంచం అబ్బురపడే రీతిలో, నేను చెబితే మీరు ఆశ్చర్యపోతరు, దిసీజ్ హిస్టరీ, అసలు తెలంగాణను చూసే యావత్ ప్రపంచం నేర్చుకుంటున్నది...' అనే మాటలు అదే పనిగా వినపడుతుంటాయి. ఈ లోపు మధ్యాహ్నం తిన్న అన్నం ఎప్పుడో అరిగిపోయి.. కండ్లు బైర్లు కమ్మి తిక్క చూపులు చూస్తూ ఏం రాస్తున్నామో..? ఏం వింటున్నామనే విషయాలు అర్థంగాని పాత్రికేయ శిరోమణులు నిమిషానికోమారు సన్నాసులు, లఫంగులు, పనికి మాలినోళ్లు అనే మాటల పులిహౌరను తింటూ, సారీ వింటూ.. బయటకెళ్లలేక.. లోన కూర్చోలేక బిత్తిరి బిత్తిరిగా తమలోతాము గొణుక్కుంటూ గత్తరగత్తరైపోతరు. అన్నట్టు ముఖ్యమంత్రి ప్రెస్మీట్ అయిపోయే సరికి.. రాత్రి 11 దాటడం షరా మామూలు. ఆ టైంలో అంతకు ముందు విన్న 'పులిహౌర..'ను మొత్తం మననం చేసుకుని.. పేపర్లో రాసి తెల్లారి యావత్ తెలంగాణ పాఠక లోకానికి అందజేసే బృహత్తర బాధ్యతను భుజాన వేసుకుంటున్నారు కలం కార్మికులు.
-బి.వి.యన్.పద్మరాజు